Thursday, March 28, 2024

ఆరు స్తంభాల ఆత్మ నిర్భర బడ్జెట్

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడిస్తూ ఆర్థికవ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో భారత ఆర్థిక మంత్రి శ్రీమతి  నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సామాన్య భాషలో చెప్పాలంటే బడ్జెట్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అంచనా వేసే ఆదాయ వ్యయాల పట్టిక. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఏ ఆర్థిక మంత్రి కైనా కత్తి మీద సాములాంటిదే.  అందునా ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో అది మరింత క్లిష్టతరం.

కోవిడ్ ప్రారంభమైన నాటినుండి మన ప్రధాని ప్రారంభించిన ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఇంతకు ముందు మూడు విడతలుగా వివిధ ఆర్థిక ప్యాకేజీ లను 10,00,000 కోట్ల రూపాయల స్వావలంబనను అందించారు. దానికి కొనసాగింపే  ఆరు ముఖ్యమైన రంగాలపై ప్రత్యేక దృష్టితో ఆర్థిక మంత్రి  ప్రవేశ పెట్టిన బడ్జెట్.  దీనిని ఆరు స్తంభాల ఆత్మనిర్భర బడ్జెట్ అని అభివర్ణించవచ్చు.

ప్రభుత్వం ముందు ప్రస్తుతం రెండు మార్గాలున్నాయి. ఒకటి, ఈ కఠిన పరిస్థితుల్లో ప్రజల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడం తద్వారా వారికి కొనుగోలు శక్తి కలిగించడం. రెండవది, ప్రభుత్వం ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చి, మౌలిక రంగాలలో పెట్టుబడులు పెట్టి తద్వారా ఉపాధి అవకాశాలు కలిగించి వారి ఆదాయాన్ని పెంచడం. దానితో వారికి కొనుగోలు శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. భారత ప్రభుత్వం రెండవ మార్గాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఎంచుకుంది

మొదటగా కరోనా నేపథ్యం లో ఆరోగ్య రంగానికి గతంలోని లేని విధంగా పెద్ద పీట వేశారు. గత సంవత్సరంతో పోలిస్తే 137% పెరుగుదలతో 2,23,846 కోట్ల రూపాయలను ఆరోగ్య రంగానికి కేటాయించింది ప్రభుత్వం. ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర స్వస్థ భారత్ అనే ఆరోగ్య ప్రోగ్రాం ను 64 వేల 180 కోట్ల తో ప్రారంభిచనున్నారు. 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు ఉతమివ్వనున్నారు. 35000 కోట్లు కరోనా టీకాలకు కేటాయించారు.

రెండవది  మౌలిక రంగానికి భారీగా నిధులను కేటాయించారు. 2021-22 సంవత్సరానికి  5,54, 000 కోట్లు కేటాయించారు. ఏడు చేనేత పార్క్ లు మొదలుపెట్టడానికి ప్రణాళిక రచించారు. 11000 కి. మీ మేరకు రోడ్ల జాతీయ రహదారులు నిర్మిస్తారు. 95000 కోట్లు రహదారుల అభివృద్ధికి పశ్చిమ బెంగాల్ కు కేటాయించారు. రైల్వేల మౌలిక మరియు అభివృద్ధికి 1,07,000 కోట్లు ఖర్చు చేస్తారు.  అలాగే పోర్ట్ ల అభివృద్ధికి ఉతమిచ్చే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కు అనుమతినివ్వడానికి ప్రణాళిక రచించారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49% నుంచి 74% కి పెంచారు. బ్యాంక్ ల నిరార్ధక ఆస్తుల సమస్య ను అధిగమించడానికి 20000 కోట్ల మూలధనం తో ఒక పునర్నిర్మాణ సంస్థ ను తీసుకరాబోతున్నారు. పెట్టిబడిదారుల పరిరక్షణకై పెట్టుబడిదారుల ఛార్టర్ ను తేనున్నారు.

మూడవది,  అందరి అభివృద్ధే ధ్యేయంతో ఆకాంక్ష భారత్ లో భాగంగా వ్యవసాయం కు పెద్ద మొత్తంలో 16,50,000 కోట్ల రుణాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. మత్స్య పరిశ్రమ కు, నిధులు కేటాయించారు. వీటిపై ఋణాలకు మార్జిన్ ను తగ్గించారు.

ఇదీ చదవండి:బడ్జెట్ పద్మనాభాలు పారిశ్రామిక వేత్తలు

నాల్గవది  మానవ వనరుల పునరుజ్జీవనం లో భాగంగా, క్రొత్త విద్యా విధానం నేపథ్యం లో 15 వేల పాఠశాలలను బలోపేతం చేయన్నున్నారు. 100  సైనిక స్కూళ్లను కొత్తగా ప్రారంభిచానున్నారు. ఏకలవ్య నమూనా స్కూళ్లను ప్రవేశపెట్టనున్నారు.

ఐదవ ప్రాధాన్యం నూతన ఆవిష్కరణలు మరియు పరిశోధనలు – దీనిలో భాగంగా 50000 కోట్ల రూపాయలతో జాతీయ పరిశోధనా సంస్థ ప్రారంభిచనున్నారు. ఇది జాతీయ ప్రయోజనాలను, ప్రధాన్యాలను దృష్టిలో ఉంచుకొని పరిశోధనలను ముందుకు తీసుకెళ్తుంది. అలాగే జాతీయ అనువాద భాష సంస్థ కు కూడా ప్రతిపాదన చేశారు.

ఆరవది  ప్రధానమంత్రి ఎప్పుడూ ఉటంకించే మాట “తక్కువ ప్రభుత్వం – ఎక్కువ పరిపాలన”  దీనిలో భాగంగా 56 ఆరోగ్య అనుబంధ సిబ్బందికై ఒక జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నారు. సులభ తర వాణిజ్యానికై ఒప్పంద చిక్కుల పరిష్కారానికి ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయనున్నారు.

ఇక, బడ్జెట్ లో  ముఖ్యమైన అంశం ద్రవ్య లోటు. ఇది 2019-20 కి జాతీయ ఉత్పత్తి లో 9.5% ఉంటుందని అంచనా వేసారు. 2021-22 సంవత్సరానికి ఇది 6.8% వుండవచ్చని అంచనా. క్రమంగా 2025-26 కల్లా ద్రవ్య లోటు 4.5% కు రావాలని ప్రణాళిక రచించారు. చాలా మంది ఆర్థిక వేత్తల అంచనా ద్రవ్య లోటు 7% నుండి 8% వరకు వుండవచ్చని వూహించారు. వారి ఊహలకు మించి 9.5% కు ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ఒక రకంగా ప్రస్తుత పరి స్థితుల్లో డిమాండ్ పెంచి ఆర్థిక స్తితి పుంజుకో నిచ్చేదిగా చెప్పవచ్చు.

ఈ బడ్జెట్ సామాన్యుడి దష్టి కోణంలో చూసినట్లయితే ముఖ్యంగా ఉద్యోగస్థులకు కొత్తగా టాక్స్ లు వేయకపోవడమే ఒకరకంగా సహాయం చేసిననట్టనిపిస్తుంది. ప్రభుత్వ ఆదాయం తగ్గిన ఈ క్లిష్ట సమయంలో టాక్స్ లు పెంచకుండా కొత్త టాక్స్ లు వేయలేదు. 75 సంవత్సరాల వృద్దులు పెన్షన్ పై ఆధారపడినత్తయితే టాక్స్ రిటర్న్స్ సమర్పించాల్సిన అవసరం లేకుండా చేసారు.  జిఎస్టి లాంటి టాక్స్ లు సరళీకృతం చేసారు. ఆదాయ పన్ను రిటర్న్స్ మరింతగా సరళీకృతరం చేసి ఎక్కువ మందిని టాక్స్ వలయం లోకి తేవాలని అంచనా.

ఇక, రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనిని ఎలా అమలు చేస్తారో వేచి చూడాలి. దీవిపై వ్యవసాయ చట్టాల ఆందోళనల నేపథ్యం ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడేచెప్పలేం. ఏ బడ్జెట్ అయినా వివిధ రకాల వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమల ను తృప్తి పరచలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి చాలా చతురత చూపించారని చెప్పక తప్పదు.  మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ ప్రత్యేకమైనయినది. ఇది భారత్ ని ఎంతవరకు “ సిక్స్ ప్యాక్” ఆర్థిక వ్యవస్థ కు బాటలు వేస్తుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి:క్లిష్ట పరిస్థితుల్లో కీలక బడ్జెట్ :ఆర్థిక మంత్రి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles