Wednesday, April 24, 2024

ట్రాఫిక్ రూల్స్ పోలీసులు కూడా పాటించాలి

  • ఘనంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
  • ట్రాఫిక్ సేఫ్టీపై పోలీసు సిబ్బందికి అవగాహన

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “32 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు” లో భాగంగా ఏసీపీ ట్రాఫిక్ బాలరాజ్, సీఐ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ గురించి పోలీస్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహనా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ సామన్య ప్రజానీకంతో పాటు పోలీసులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రజలు మాత్రమే నిబంధనలు పాటించాలి. ప్రభుత్వ అధికారులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించొచ్చు అని భావించవద్దని అన్నారు. జిల్లాలోని ప్రజలకు పోలీసు అధికారులు సిబ్బంది వెళ్లి రోడ్డు ప్రమాదాలు, మోటార్ వాహనాల చట్టాల గురించి అవగాహన కల్పించడం కోసం సదస్సులు నిర్వహిస్తామన్నారు.

ఇది చదవండి: కొత్త ట్రాఫిక్ రూల్స్ వస్తున్నాయ్ …జాగ్రత్త!

వాహనదారులు ఏ చిన్న ట్రాఫిక్‌ నిబంధన పాటించకపోయినా ట్రాఫిక్‌ పోలీసులు వెంటబడించి మరీ వాహనాలను అడ్డుకుంటారు. వందల్లో, వేలల్లో జరిమానా విధిస్తుంటారు. పోలీసులకు హెల్మెట్‌, లైసెన్స్‌ లేకపోయినా, అసలు బండి కాగితాల్లేకున్నా యథేచ్ఛగా, దర్జాగా వెళ్తుంటారు. వారికి చలానాలు, జరిమానాలతో పనిలేదు. పోలీసుల తీరుపై వాహనదారులు మండిపడుతుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతుంటారు. నిబంధనలు ప్రజలకేనా, పోలీసులకు వర్తించవా అంటూ తమ అసహనాన్ని, ఆవేదనను వెళ్లగక్కుతుంటారు. ఇలాంటి పరిస్థితులకు చెక్‌ పెట్టాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ వి. సత్యనారాయణ ఐపీఎస్ సిబ్బందికి ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  అనంతరం  ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు.

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పోలీస్ సిబ్బందికి అందరికి వాహనాలు ఉన్న లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండేలా తప్పకుండా చూడడం జరుగుతుంది అని సీపీ తెలిపారు. నెల రోజులలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని సిబ్బంది వాహనాలకి సంబంధించిన అన్ని పత్రాలతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలను ఇబ్బందికి గురిచేయడం, జరిమానాలు విధించడం మా ఉద్దేశ్యం కాదు. ఇంటి నుండి బయలుదేరిన వాహనదారులు క్షేమంగా గమ్యం చేరేలా చూడడం, అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించేలాగా చూడటం మాత్రమే పోలీసుల విధి అన్నారు.

ఇది చదవండి: వాహనదారులారా బహుపరాక్ !

ఈ కార్యక్రమంలో డీసీపీ మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ రామగుండం బాలరాజ్, సీఐ ట్రాఫిక్ మంచిర్యాల ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ లు వినోద్, సురేందర్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles