Tuesday, April 23, 2024

వ్యవసాయానికి మరింత ఊతం : కేసీఆర్

  • కేంద్ర  విధానాలు తిరోగమనానికి దారితీస్తున్నాయి
  • వ్యవసాయమే ప్రధానమైన దేశంలో రైతును ప్రోత్సహించాలి
  • ఆరునూరైనా వ్యవసాయరంగం ప్రాధాన్యం తగ్గించేది లేదు

వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారత దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతాంగాన్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమని సీఎం అన్నారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. వానాకాలం మరికొద్ది నెలల్లో రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు సీఎం సూచించారు. పత్తి, మిర్చి, కంది, వాటర్ మిలన్ తదితర ప్రత్యామ్న్యాయ పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం అన్నారు.

ధాన్యం సేకరణపై సమీక్ష

ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధత పై ప్రగతి భవన్ లో ఈ రోజు సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన వరి ధాన్యం సేకరణ పురోగతిపై అధికారులను సీఎం ఆరాతీసారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు మరింత విస్తృతంగా క్రేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు నిరంతరం పంటపొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలన్నారు. ఆ దిశగా అవగాహన పెంపొందించాలని, అందుకు ఏఈ అధికారులకు నిరంతరం శిక్షణా తరగతులను నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డికి సీఎం సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణ పై జాబ్ చార్ట్ తయారు చేయాలన్నారు.

తెలంగాణ వ్యవసాయం పురోగమనం

‘‘తెలంగాణలో వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా ఉంది. సరిపడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉండబోతున్నది. రైతులు యాసంగి పనులను ముగించుకున్నరు. వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. ఈ లోపే అవసరమయ్యే ఎరువులు విత్తనాలు సరిపడా సమకూర్చుకోవాలి. రైతులకు ఎటువంటి లోటు రాకుండా వాటిని అందుబాటులో ఉంచుకోవాలి. కల్తీ విత్తనాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేడు తెలంగాణ వ్యవసాయం గొప్పగా పురోగమిస్తున్నది,’’ అంటూ ముఖ్యమంత్రి ప్రోత్సాహకంగా మాట్లాడారు.

రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయం వాటా పెరుగుతోంది

ఉమ్మడి పాలనలో నాడు నామమాత్రంగా వున్న వ్యవసాయ రంగం, నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్ర జిఎస్డిపీకి 21 శాతం దోహదపడుతున్నది. ఇది మామూలు విషయం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం కీలకంగా మారింది. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రానున్న ఏడాదిలో పూర్తవుతాయి.’’ అని సీఎం అన్నారు.

తెలంగాణకు కరువన్నదే రాదు

 ‘‘భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇక కరువు అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగ వేగాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అందుకుంటూ ముందుకు సాగాల్సి వున్నది. వ్యవసాయ శాఖ నిరంతరం వైబ్రంట్ గా, బిజీ బిజీగా వుండాల్సి వున్నది..’’ అని వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు సీఎం సూచించారు. వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను (డిస్ట్రిక్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్) చేపట్టాలని సీఎం అన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లను, ఆర్డీవోలను కూడా భాగస్వాములను చేయాలన్నారు.

ఎరువుల దుబారా మానాలి

యూరియా, ఎరువుల వాడకాన్ని తగ్గించి, శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తూ, మోతాదుగా వాడేలా రైతులకు అవగాహన పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. విపరీతమైన ఎరువులు, పురుగుమందుల వాడకంతో భూములు పాడవుతాయన్నారు. పంటలమార్పిడి చేయకుండా ఒకే పంటనే ఏండ్ల కొద్దీ వేయడం ద్వారా, నేల సహజ స్వభాఃవం తగ్గి రోజు రోజుకూ భూసారాన్ని కోల్పోతున్నదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పంటల మార్పిడితో భూసారాన్ని పరిరక్షించుకోవడం తక్షణావసరమని సీఎం అన్నారు. ఈ దిశగా తగు ప్రణాళికలను సిద్ధం చేసుకుని రైతులను చైతన్య పరచాలని మంత్రిని, అధికారులను సీఎం ఆదేశించారు.

అన్నం అంతా ఒకేసారి తింటమా?

యూరియాను ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా పద్ధతిగా వినయోగించాలని సీఎం అన్నారు. ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలను రైతులు తీసుకోవాలన్నారు. ‘‘కొంతమంది రైతులు ఎరువులు ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతదని అనుకుంటరు. కానీ కాదు. ఏదైనా మోతాదుగా వాడుకోవాల్సిందే. మనం అన్నం తింటే ఒకేసారి తింటమా? తినం కదా…ఎరువులు కూడా అంతే. పంటలు కూడా మానవ శరీరం లాంటివే. వాటికి ఆహారం ఎంతకావాల్నో అంతే తీసుకుంటాయి. మోతాదుకు మించి తిండి తింటే మనకు రోగాలు వచ్చినట్టు వరిపంటకు కూడా మోతాదు మించి ఎరువులు చల్లితే ఏపుగా ఎదగాల్సిన పంట ఆగమైతది’’ అని సీఎం వివరించారు. ఎకరానికి ఒక యూరియా బస్తాను ఒకసారే వేయవద్దని, వరి పెరుగుతున్నా కొద్దీ సమయానుకూలంగా మూడు నాలుగు సార్లు వినియోగించాలని సీఎం తెలిపారు. డిఎపి తదితర కాంప్లెక్సు ఎరువులను కూడా విపరీతంగా వాడకుండా, తగుపాల్లలో వాడాలని రైతాంగాన్ని కోరారు. మారుతున్న కాలాన్ని బట్టి ఎరువులను ఎట్లా వాడాల్నో వ్యవసాయ అధికారులు రైతువేదికల ద్వారా రైతులను సమావేశ పరిచి అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని సీఎం అన్నారు.

ఎరువుల నిల్వలపై ఆరా

కాగా…రానున్న వానాకాలం సీజన్ లో అందుబాటులో ఉంచాల్సిన డిఎపి, యూరియా తదితర ఎరువుల నిల్వలపై అధికారుల నుంచి సీఎం ఆరా తీసారు. యూరియా, డిఎపి తదితర ఎరువుల నిల్వలు చాలినంతగా వున్నాయని సీఎంకు అధికారులు నివేదిక అందించారు.

యుద్ధం నేపథ్యంలో పొదుపు

డిఎపి తయారీలో వినియోగించే ముడిసరుకులు రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ యుద్ధం జరుగుతున్నదని ఈ పరిస్థితుల్లో డిఎపి లభ్యత అవసరానికి మించి వుండబోదని సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. కాగా ఈ పరిస్థితుల్లో విచ్చలవిడిగా డిఎపి వాడకాన్ని తగ్గించి తగు మోతాదులో పొదుపుగా వాడుకోవాలనే విషయం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. భూసారాన్ని పెంచే దిశగా కార్బన్ కంపోనెంట్ల వాడకాన్ని వినియోగించాలని పచ్చిరొట్ట వాడాకాన్ని పెంచాలన్నారు.

వరి పంటకు ప్రత్యామ్న్యాయం

వరిపంటను విపరీతంగా వేయడం ద్వారా భూసారం తగ్గిపోయే ప్రమాదం వుంటుందనే శాస్రీనుయ అధ్యయనాలను అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కాగా లాభదాయక పంటలను ఎంచుకుని పంటల మార్పిడి దిశగా రైతులను చైతన్య పరచాలని సీఎం అధికారులకు సూచించారు.

తెలంగాణ పత్తికి గిరాకీ

కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లో చైనా తదితర దేశాల పత్తి దిగుబడి తగ్గిపోతున్న నేపథ్యంలో, తెలంగాణ పత్తికి డిమాండు పెరుగుతున్న అంశంపై సీఎం సమీక్షించారు. క్వింటాల్ పత్తికి 10 వేలనుంచి 13 వేలదాకా ధర పలుకుతున్న విషయాన్నిసమావేశం చర్చించింది. రానున్న కాలంలో మరింతగా పత్తికి గిరాకీ పెరగనున్నదనే విషయాన్ని గుర్తించింది. ఈ నేపథ్యంలో పత్తి పంట సాగును మరింతగా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అదే సందర్భంలో మిర్చికి కూడా ఊహించని రీతిలో క్వింటాల్ కు 42 వేలకు పైగా ధర పలకడం గొప్ప విషయమని సీఎం అన్నారు. కంది కూడా మార్కెట్లో డిమాండు వున్న పంటేనని, కందిసాగు విషయంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వహించరాదన్నారు. సన్ ఫ్లవర్ పంట విస్తీర్ణాన్ని పెంచాలన్నారు.

వరి వెదజల్లితే లాభం

వరి సాగులో ఎదజల్లుడు విధానాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా రైతుకు అన్ని విధాలుగా ఖర్చు తగ్గించవచ్చన్నారు. ఎరువుల వాడకం వెదజల్లడం తదితర వ్యవసాయ అంశాలకు సంబంధించి రైతులను చైతన్యపరిచే దిశగా డాక్యుమెంటరీలు తదితర ప్రచార కార్యక్రమాలను విస్త్రుతంగా చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.

కల్తీ పై ఉక్కుపాదం

కల్తీ విత్తన తయారీ దారులను వారి మూలాలను గుర్తించి కట్టడి చేయాలని సీఎం అన్నారు. అందుకోసం పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని వ్యవసాయ శాఖకు సీఎం సూచించారు. ఇప్పటినుంచే ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించాలన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన కార్యాచరణ ఎట్లా కొనసాగుతున్నదనే విషయాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ నుంచి సీఎం ఆరా తీసారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పుంజుకున్నదనీ, గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితర అవసరాలను సమకూర్చుకున్నామని అనిల్ కుమార్ సీఎంకు వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6983 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటికే 536 కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 కేంద్రాల నుంచి సేకరణ మొదలయ్యిందని ఇప్పటికే 1200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని కమిషనర్ సీఎంకు వివరించారు.

దళిత బంధును వేగవంతం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేయబడిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పున ఇప్పటి వరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా సీఎంకు నివేదిక అందిచారు.

దళితబంధు నిధుల విడుదల

‘‘రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే దళితబంధు కోసం నిధులను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గుర్తించిన అర్హులకు నిధులను అందించడంలో జాప్యం జరగరాదు’’ అని సీఎం స్పష్టం చేశారు. దళితబంధు పథకాన్ని మరింత ప్రభావవంతంగా వేగవంతంగా అమలు చేసేందుకు గాను త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ‘‘దళితబంధు పథకం అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలలనుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. ఈ పథకం అమలు ద్వారా మనం అనుకున్నదానికంటే ఎక్కువగా ఫలితాలు అందుతాయి. దళితబంధు కోసం చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను ఆర్జించి పెడుతాయి. సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగానికంటే గొప్పగా స్పిల్ ఎకానమీకి దోహదపడుతుంది. దళితబంధు పెట్టుబడి ద్వారా జరిగే వ్యాపార వాణిజ్యాలు తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జిఎస్డిపీని పెంచడంలో దోహదపడుతుంది..’’ అని సీఎం అన్నారు.

ఇప్పటికే దళితబంధు ద్వారా అందిన ఆర్థిక సాయం ద్వారా వ్యాపార, వృత్తి రంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణం అని సీఎం అన్నారు. ‘‘ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలి. తద్వారా దళిత యువతలో వున్న నిరాశానిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంది. వారు వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది’’ అని సీఎం అన్నారు. దవాఖానాలు ఫెర్టిలైజర్ షాపుల వంటి ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వారికి అవకాశాలు కల్పించాలని సీఎం పునరుధ్ఘాటించారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీ రాహుల్ బొజ్జా, శ్రీమతి స్మితా సభర్వాల్, శ్రీ వి. శేషాద్రి, సీఎం ఓఎస్డీ శ్రీమతి ప్రియాంక వర్గీస్, సివిల్ సప్లైస్ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ అడిషనల్ డైరక్టర్ శ్రీ కె. విజయ కుమార్, జాయింట్ డైరక్టర్ శ్రీ కె. రాములు, అసిస్టెంట్ డైరక్టర్ శ్రీమతి మాధవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles