Friday, March 29, 2024

న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్

  • హత్యకు ఉపయోగించిన నలుపు రంగు బ్రీజా కార్ స్వాధీనం
  • పాశవికంగా దాడి చేసిన ఇద్దరు నిందితులు కుంట శ్రీను, చిరంజీవి అరెస్ట్

రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్ డివిజన్‌లోని కల్వచర్ల v/ o రామగిరి మండలం ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంక్ దగ్గర 17.02.2021 న ఒక దారుణ హత్య జరిగింది.   మృతుడు గట్టు వామన్ రావు ఆయన భార్య పి.వి.  నాగమణి హైదరాబాద్ నుండి  మంథనిలోని గౌరవ న్యాయస్థానంలో ఒక పనికై హాజరయ్యారు. వారి డ్రైవర్‌ సతీష్ తో పాటు వారి క్రెటా కారు నెంబర్ టిఎస్ -10-ఇజె -2828 లో వచ్చారు. తిరిగి హైదరాబాద్ కి వెళ్తున్న క్రమంలో  సుమారు 2:30 గంటలకు రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని  మంథని కి 16 కిలోమీటర్లు దూరం లో ఉన్న కల్వచర్ల  వద్ద న్యాయవాదులు  గట్టు వామనరావు గట్టు నాగమణి లు ప్రయాణిస్తున్న కారు ఆపి గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేయడం చేశారని గట్టు వామన్ రావు డ్రైవర్ సతీష్ ఈ సంఘటన గురించి వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావుకు సమాచారం అందించాడు.

తరువాత 2:43 గంటలకు, ఎస్ఐ రామగిరి పిఎస్ ఈ సంఘటన గురించి గుర్తు తెలియని వ్యక్తి నుండి టెలిఫోన్ ద్వారా సమాచారం అందగా  సమయం  2:50 గంటలకు, రామగిరి ఎస్ ఐ  సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడి రక్తపు మడుగులో రోడ్డు మీద పడి ఉన్న గట్టు వామన్ రావు, కారులో తీవ్రంగా గాయపడి ఉన్న నాగమణిని 108 అంబులెన్స్‌ లో పెద్దపల్లి హాస్పిటల్ కి తరలించారు.  గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించే ముందే నేర దృశ్యాన్ని కాపాడటానికి ఎస్ ఐ ఇద్దరు పోలీసు సిబ్బందిని బందోబస్త్ గా నియమించారు. వారిని అంబులెన్స్‌లో తరలించేటప్పుడు రామగిరి ఎస్‌ఐ 108 అంబులెన్స్‌ ను పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ వరకు ఎస్కార్ట్ గా ఉండి గాయపడిన ఇద్దరికీ ప్రాథమిక చికిత్స కొరకు అటెండర్ ని ఏర్పాటు చేయడం జరిగింది..

Also Read: లాయర్ దంపతుల హత్యలో పుట్టమధు మేనల్లుడి ప్రమేయం

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి  డ్యూటీ డాక్టర్ గాయపడిన వ్యక్తులను పరీక్షించి, వారి పల్స్ రేటు తగ్గుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  గాయపడిన వ్యక్తులకు మందులు ఇవ్వడానికి డ్యూటీ డాక్టర్ ప్రయత్నించినప్పుడు, వారు చికిత్సకు స్పందించలేదు. కొద్ది సేపటికే వారు మరణించినట్లు డ్యూటీ వైద్యులు నిర్దారించారు.  

సిపి రామగుండం, ఆదేశాల  మేరకు 3:40 గంటలకు, (6) బృందాల ను  జి. మహేందర్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్, సిసిఎస్ రామగుండం, ఎ. వెంకటేశ్వర్, ఇన్స్ స్పెక్టర్ సిసిఎస్, రామగుండం, ఎం. రాజ్ కుమార్, ఇన్స్ స్పెక్టర్, టాస్క్ ఫోర్స్,  రామగుండం, జి. నరేష్ కుమార్, ఇన్స్ స్పెక్టర్, ఐటి కోర్ టీం, రామగుండం, టి. కరుంకర్ రావు, సిఐపి, రామగుండం మరియు ఎ. ఇంద్రసేన రెడ్డి, సిఐపి, సుల్తానాబాద్ నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేశారు. డ్రైవర్ సతీష్ ఇచ్చిన సమాచారం ప్రకారం 4:00 గంటలకు, కిషన్ రావు మరియు అతని కుటుంబ సభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, అచేతనంగా పడిఉన్న మృతదేహాలను పరిశీలించారు. కిషన్ రావు కుమార్తె ఈ సంఘటన గురించి తన తండ్రి చెప్పిన ఆదేశాల మేరకు ఫిర్యాదు చేశారు.

గుంజపడుగు  గ్రామంలోని రామాలయం కమిటీకి సంబంధించి వెల్ది వసంత రావు S / o అనంతయ్య, గట్టు విజయ్ కుమార్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి తన  కుమారుడు వామన్ రావు తన తండ్రి సంతకాన్ని, అతని చిన్న తమ్ముడు  ఇంద్ర శేఖర్ రావు సంతకాన్ని తీసుకొన్నారు. తరువాత ఫిర్యాది ఆటోలో తన గ్రామానికి చేరుకున్న తరువాత, తన కుమారుడి డ్రైవర్ నుండి మధ్యాహ్నం 2:40 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది, అతను తన పేరు సతీష్ అని చెప్పి మరియు కల్వచర్ల గ్రామాన్ని దాటిన తరువాత,  పెట్రోల్ పంప్ కల్వర్ట్ దగ్గర ప్రధాన రహదారి రోడ్ వరకు  గట్టు వామన్ రావు, నాగమణిలను వేట కొడవలి తో దాడి చేసినట్లు తెలిపాడు. గ్రామంలో శ్రీ రామస్వామి మరియు గోపాలస్వామి దేవస్థానాల కోసం  కుంట శ్రీనివాస్, మండల పార్టి అధ్యక్షుడు, అక్కపక కుమార్ మరియు వెల్ది వసంత రావు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశారు, ఆలయ కార్యదర్శి ఇంద్ర శేఖర్ రావును పిలిచి సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అనుమతి లేకుండా వారు   గ్రామంలో దండోర  వేయించారు. గుంజపడుగు గ్రామానికి చెందిన సర్పంచ్, వామన్ రావు, అతని భార్య నాగమణి నుండి కుంట శ్రీను నిర్మిస్తున్న పెద్దమ్మ ఆలయాన్ని అక్రమంగా నిర్మించడం గురించి మరియు కుంట శ్రీను అక్రమ గృహ నిర్మాణం గురించి సలహా ఇచ్చినందుకు  దాన్ని మనసులో పెట్టుకొని కుంట శ్రీనివాస్, వెల్డి వసంత రావు,  మరియు అక్కపక కుమార్ లు తన కుమారుణ్ణి కోడల్ని చంపారని, వామన్ రావు మరియు అతని భార్య నాగమణిని చంపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తండ్రి కిషన్ రావు  పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: ఆందోళన కలిగిస్తున్న నేరం నేపథ్యం

ఘటన జరిగిన రోజు సాయంత్రం 5:00 గంటలకు, గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు ఎస్ ఐ రామగిరి  ఎ. మహేందర్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ .  21/2021 U / s 302, 341,120-B  r / w 34 IPC, FIR జారీ చేసి, సంబంధిత వారందరికీ కాపీలు పంపడం జరిగింది.

సిపి గారి ఆదేశాల మేరకు   నిందితులను గాలించేందుకు ఆరు బృందాలు  పలు ప్రాంతాల్లో  గాలింపు చర్యలు చేస్తుండగా  నిందితులు తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడి చంద్రపూర్  ప్రాంతంలో ఉన్నారని పక్కా సమాచారం అందడంతో అక్కడికి టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపారు. నిందితుల గురించి తనిఖీలు నిర్వహిస్తుండగా గురువారం (ఫిబ్రవరి 18) ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో కుంట శ్రీనివాస్ మరో వ్యక్తి తో కలిసి  బ్రీజా కారులో వెళుతుండగా  టాస్క ఫోర్స్ పోలీసులు గమనించి చాకచక్యంగా వారిని పట్టుకొన్నారు.  దర్యాప్తు అధికారి గోదావరిఖని  ఎసిపి ముందు హాజరు పరచగా వారిని పంచుల సమక్షంలో విచారణ చేయగా వారి పేర్లు 1. కుంట  శ్రీనివాస్ S/O కిష్టయ్య ,44YRS తెనుగు  ,గుంజపడుగు  , 2.శివందుల  చిరంజీవి S/O  రాజం ,35YRS ,మున్నురుకాపు  విలోచవరం ,మంథని అని తెలిపారు. అదేవిదంగా మూడవ నిందితుడైన అక్కపాక కుమార్ s/O  మాంకయ్య , మాదిగ ,    వయస్సు 44  గుంజపడుగు ను  మంథని ఏరియా లో అదుపులోకి తీసుకుని ఏసీపి గోదావరిఖని ముందు హాజరు పరిచినారు.

గట్టు వామన్ రావు మరియు అతని భార్య పివి నాగమణి పై దాడి క్రమం        

నిన్న అనగా తేదీ 17-02-2021 రోజున వామనరావు  మంథని  కోర్టు వద్దకు వచ్చాడు అని తెలుసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లేటప్పుడు చంపాలని పథకం వేసుకుని కుంట శ్రీనుకి  తోడుగా ఇంకొక వ్యక్తి చిరంజీవి ని తీసుకొని శ్రీను తన  కారుని కుమార్ కి బ్యాంకు వద్ద ఇచ్చి వామన్ రావు యొక్క కదలికలు కుంట  శ్రీను తెలియజేయాలని చెప్పగా అక్కపాక కుమార్,కుంట శ్రీనివాస్ కారు తీసుకోవడం జరిగింది. కుంట శీను  కి బిట్టు శీను తన కారును మరియు రెండు కొబ్బరి బొండం కొట్టే కత్తులను కుంట శ్రీనుకి  తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. బిట్టు శీను నుండి కుంట  శీను కారు తీసుకోగా ఆ కారును చిరంజీవి డ్రైవింగ్ చేస్తుండగా కుంట శ్రీను పక్కన కూర్చుని మంథని చౌరస్తా కి  రావడం జరిగింది. అదే సమయంలో వామన్ రావు తన భార్య పివి నాగమణితో కలిసి కారులో నెంబర్  (నెంబర్ టిఎస్ -10-ఇజె -2828)లో బయలుదేరి పెద్దపెల్లి వైపు వెళ్లే సమాచారం ముందుగానే తెలుసుకుని వారి కంటే ముందే కుంట శీను చిరంజీవి రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారులో రోడ్డు మరమ్మతులు జరుగుతున్న ఈ ప్రాంతంలో కారు కచ్చితంగా నెమ్మదిగా వెళ్తుందని ఆ ప్రాంతంలో ముందుగానే

వారి రాక కోసం కారుని రోడ్డు పక్కన ఆపి వామన్ రావు కారు వారు ముందుకు రాగానే దానికి టక్కర ఇచ్చి కారు ఆపి కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు ముందుకి వెళ్లి అద్దం పై కొట్టగా డ్రైవర్ భయపడి కారు ఆపి పారిపోయాడు. వామన్ రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారుని నడపడానికి  ప్రయత్నం చేయగా కుంట శీను వామన్ రావు ని కారులో నుంచి బయటకు గుంజి కత్తితో అతనిపై దాడి చేసినాడు. అదే సమయంలో చిరంజీవి రెండో పక్క నుండి వచ్చి వామన్ రావు భార్య నాగమణి పై కత్తితో దాడి చేయగా ఆమె గాయాలతో కారు సీట్లోనే పడిపోయింది.  తర్వాత చిరంజీవి కూడా వామనరావు వద్దకు వచ్చి తాను కూడా కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేసే క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వీడియో తీశారు. వామన్ రావు ని నీపై దాడి చేసిన వారు ఎవరు అని అడగగా అతని పేరు కుంట  శ్రీనివాస్ గుంజపడుగు మరియు ఇంకొక వ్యక్తి అని రక్తపుమడుగులో ఉన్న వామనరావు తెలిపారు.

దాడి జరిగిన తర్వాత వెంటనే కుంట శ్రీను, చిరంజీవి వారు వచ్చిన నల్ల రంగు  బ్రీజా కార్ లోనే  ఇంక్లైన్ కాలనీ నుండి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లి బ్యారేజీ వద్ద ఇద్దరు  వామన్ రావు పై దాడి చేసిన సమయంలో ఉన్న బట్టలు మార్చుకుని ఒక బ్యాగ్ లో పెట్టి మరియు దాడికి ఉపయోగించిన కత్తులను రెండింటిని సుందిళ్ల బ్యారేజీ నీటిలో పడవేసి అక్కడనుండి మహారాష్ట్రకి పారిపోయారు. మహారాష్ట్ర ప్రాంతంలో తెలంగాణ పోలీసులు టీం కదలికలు ఉన్నాయి అని అనుమానం వచ్చి మహారాష్ట్ర నుండి ముంబయి వెళ్తుండగా వాంకిడి చంద్రపూర్ మధ్యలో పోలీసులు పట్టుకోవడం జరిగింది.

న్యాయవాది వామన్‌రావు మరియు కుంటా శ్రీనుల మధ్య శత్రుత్వాన్ని రేకెత్తించడానికి మరియు హత్యా ఆలోచన ప్రేరణ కి గల కారణాలు:

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకు ప్రధాన ముద్దాయి కుంట  శీను ఒకే గ్రామానికి అనగా గుంజపడుగు చెందిన వారైనా ఐదు సంవత్సరాలుగా కోల్డ్ వార్ నడుస్తోంది. న్యాయవాది ప్రతి విషయం  పోలీస్స్టేషన్లో, కోర్టులో ఇవ్వడంతో తన ఎదుగుదలకు వామనరావు అడ్డు  వస్తున్నాడు అని  అతనిని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు కుంట శ్రీను.

అయితే ఇటీవల గుంజపడుగు లో ఉన్న రామ స్వామి గోపాల స్వామి దేవాలయం మేనేజ్ మెంట్ కమిటీ వివాదం, ఇంటి నిర్మాణం, కుల దేవత అయిన పెద్దమ్మ ఆలయం నిర్మాణానికి వామనరావు ఆటంకాలు సృష్టిస్తున్నారని కుంట శ్రీను పగ, పాత కక్ష లతో ఎలాగైనా వామనరావు ను అంతమొందించాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బిట్టు శీను సహకారం కూడా తోడై ఈ హత్య చేయడానికి ఆవేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేశాడు.

Also Read: సూమోటోగా లాయర్ల హత్య కేసు, నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

 కుంట శ్రీను నేరచరిత్ర:

అనతి  కాలం లోనే మండల స్థాయి నాయకుడుగా ఎదిగిన ప్రధాన ముద్దాయి కి గతంలో నేర చరిత్ర ఉంది. 1997 సంవత్సరంలో  సికాస లో చాలా ప్రభావశీలమైన సభ్యుడిగా ఉన్నాడు. బస్సు తగలబెట్టిన కేసులో రిమాండ్ కు వెళ్ళాడు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి రాజకీయాల్లోకి వచ్చాడు. 498a, ఒక extraction కేసులో నిందితుడు.

ప్రధాన నిందితులు

A1. కుంట  శ్రీనివాస్ S/O కిష్టయ్య ,44YRS తెనుగు,గుంజపడుగు 

A2.శివందుల  చిరంజీవి S/O  రాజం ,35yrs ,మున్నురుకాపు  విలోచవరం, మంథని

A౩. అక్కపాక కుమార్ s/O  మాంకయ్య , మాదిగ ,    వయస్సు 44  గుంజపడుగు లను అరెస్ట్ చేయనైనది , వీరిని రిమాండ్ నిమిత్తం కోర్ట్ ముందు హాజరుపరుస్తాం.

దర్యాప్తు ఇంకా పూర్తి కావాల్సిఉంది. నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు, డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్ష్యాలు మరియు ఇతర సాక్ష్యాల  ద్వారా దర్యాప్తును ముమ్మరం చేస్తామని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్నా, ఎంతటివారినైనా వదలి పెట్టేది లేదని పోలీసులు తెలిపారు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles