Thursday, April 25, 2024

లాయర్ దంపతుల హత్యను సీరియస్ గా తీసుకొన్న పోలీసులు

• ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్నా, ఎవరినైనా, ఎంతటివారినైనా వదలం.
• హత్య కుట్రలో నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీను అరెస్ట్
.

న్యాయవాదులు గట్టు వామన్ రావు పివి నాగమణి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులతో కుట్ర లో పాల్గొని నిందితులకు కారు మరియు రెండు కత్తులను అందజేసిన నాలుగో నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్ రావు పివి నాగమణిలను పాశవికంగా దాడి చేసి హత్య చేసిన ఘటనలో ముగ్గురు 1. కుంట శ్రీనివాస్ 2.శివందుల చిరంజీవి 3. అక్కపాక కుమార్ నిందితులను 18 ఫిబ్రవరి 2021న అరెస్ట్ చేయడం జరిగింది. పై నిందితులు ఇచ్చిన వాంగ్మూలం, సమాచారం ఆధారంగా బిట్టు శ్రీనును గత నాలుగు రోజులుగా విచారించి 22 ఫిబ్రవరి 2021 న అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుల వాంగ్మూలం, నిందితుడు బిట్టు శ్రీను అలియాస్ తులసిగరి శ్రీను ఇచ్చిన వాంగ్మూలంను విశ్లేషించగా ఈ క్రింది విషయాలు తెలిసినవి:

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు:

బిట్టు శ్రీను 2016 సంవత్సరం నుండి మంథని లో నడుస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. మంథని ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహించింది. ఇట్టి ట్రస్టు పై మృతుడు గట్టు వామన్ రావు పలు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో చులకన చేస్తూ పలు వాట్సాప్ గ్రూపు లో సందేశాలు పంపించేవాడు.బిట్టు శ్రీను పై అవమానకరంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడని ప్రచారం చేసేవాడు. ట్రస్టు ఆదాయాలపై హైదరాబాద్, ఇతర చోట్ల గట్టు వామన్ రావు తన అనుచరులతో ఫిర్యాదులు చేయించినాడు.

Also Read: లాయర్ దంపతుల హత్యలో బిట్టుశ్రీను పాత్ర కీలకం: డీఐజీ నాగిరెడ్డి

2015 నుండి 2019 ఏప్రిల్ వరకూ మంథని గ్రామపంచాయతీలో బిట్టు శ్రీను చెత్త రవాణా కొరకు ఒక ట్రాక్టర్ పెట్టగా బిట్టు శ్రీను కు నెలకు 30 వేల రూపాయలు ఆదాయం వచ్చేది. దానిపై 2019 మార్చి లో గ్రామ పంచాయతీలోని అధికారికి బిట్టు శ్రీను ట్రాక్టర్ పై ఫిర్యాదు చేసి దానిని తీసి వేయాలి అని పంచాయతీ అధికారి పై గట్టు వామన్ రావు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానితో ఆ అధికారి ట్రాక్టర్ ని గ్రామపంచాయతీ నుండి తొలగించాడు. దానిపై వచ్చే నెల వారి 30 వేల ఆదాయం బిట్టు శ్రీను కోల్పోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని గట్టు వామనరావు బిట్టు శ్రీను పై సాధించిన విజయంగా మంథని ప్రాంతంలో, సోషల్ మీడియాలో ప్రచారం చేసినాడు.

బిట్టు శ్రీను,కుంట శ్రీను కి గల సంబంధం:

మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీను, బిట్టు శ్రీను కు ఆరు సంవత్సరాల కిందట పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రాణ స్నేహితులు గా మారారు. రెగ్యులర్ గా కలిసి ఉండేవారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మద్యం తాగే సమయంలో పంచుకునేవారు. వీళ్ళతో అప్పుడప్పుడు చిరంజీవికూడా కలిసేవాడు.ఈ క్రమంలో కుంట శ్రీనివాస్ గుంజపడుగు గ్రామస్తుడైన గట్టు వామన్ రావు పీవీ నాగమణి దంపతులు గౌరవ హైకోర్టు న్యాయవాదులుగా చలామణి అవుతూ కొన్ని సంవత్సరాలుగా కుంట శ్రీనివాస్ ను టార్గెట్ చేసుకొని ఒక ఫోన్ కాల్ విషయంలో హైదరాబాదులో కుంట శ్రీనివాస్ పై కేసు పెట్టించారు.

Also Read: ఎంఎల్ఏలతో పోలీసుల కుమ్మక్కు ప్రమాదకరమైన ధోరణి

కుంటశ్రీను దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న వామనరావు:

కుంట శ్రీను వాళ్ళ కులదైవం పెద్దమ్మ తల్లి గుడి కట్టుటకు పూనుకున్నాడు. కుంట శ్రీను ను గుడి నిర్మాణ కమిటీ చైర్మన్ గా పెట్టి గుడి కడుతున్న క్రమంలో దానిని అక్రమ నిర్మాణం అని ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించి వామన్ రావు దంపతులు గుడి నిర్మాణం ఆపించారు.కుంట శీను ఇంటి నిర్మాణం చేస్తుండగా నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోలేదని అక్రమ నిర్మాణం చేస్తున్నాడని నిర్మాణం ఆపుదల చేస్తూ గ్రామపంచాయతీ నుండి నోటీసు ఇచ్చి నోటీసును ఫ్లెక్సీ తయారు చేపించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో గట్టు వామన్ రావు ప్రచారం చేయడం జరిగిందని శీను పోలీసులకు చెప్పాడు.

వసంతరావు పాత్ర:

గుంజపడుగు లో రామ స్వామి గోపాల స్వామి ఆలయానికి సంబంధించిన కమిటీ చాలా సంవత్సరాల నుండి వామన్ రావు తమ్ముడు చైర్మన్ గా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడని, ఈ మధ్యకాలంలో గుంజపడుగు గ్రామస్తులు అందరూ కలిసి పాత కమిటీ రద్దుపరచి కొత్త కమిటీ చైర్మన్ గా వెల్ది వసంతరావుని ఎన్నుకోవడం జరిగిందనీ నిందితులు చెప్పారు. ఈ విషయంలో కూడా గట్టు వామన్ రావు, నాగమణి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేయుటకు ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవ జరిగిందని ఆ విధంగా కుంట శ్రీను గ్రామంలో తన అధిపత్యానికి వామన్ రావు నాగమణి లు అడ్డువస్తున్నారని భావించాడు.

Also Read: ఆదివాసీలను అడ్డుకున్న పోలీసులు…

వామనరావుపై బిట్టుశ్రీను కోపం:

దానికి బిట్టు శ్రీను కూడా కుంట శ్రీను తో తనకి కూడా ఆదాయ మార్గాలు రాకుండా చేసి ప్రజలలో అవమాన పరిచాడనీ, వ్యక్తిగతంగా తీవ్ర నష్టం కలిగించాడనీ గట్టు వామన్ రావు ని చంపే విషయాలలో ఏలాంటి సహాయం కావాలన్నా చేస్తానని కుంట శ్రీను తో చెప్పాడు.సుమారు నాలుగు నెలల క్రితం వామన్ రావు గురించి చర్చించే సమయంలో కుంట శ్రీను రెండు కత్తులు తయారు చేయించి పెట్టు అన్నా అని బిట్టు శ్రీను కి చెప్పగా బిట్టు శ్రీను రెండు ట్రాక్టర్ పట్టీలు తీసుకొని మంథని లో కత్తులు తయారు చేయించి చిరంజీవి ఇంట్లో పెట్టినాడు.

బిట్టు శ్రీనుకు కుంట శ్రీను ఏమి చెప్పాడు?

“బిట్టు శ్రీను అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం వామన్ రావు ని చంపకపోతే మనకు భవిష్యత్తులో ఎప్పుడూ ఇబ్బంది ఉంటుంది,” అంటూ చాలా సందర్భాల్లో గత 10 నెలల నుండి కుంట శ్రీను బిట్టు శ్రీను కు చెప్పాడు. సుమారు నాలుగు నెలల క్రితం వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు రాగా చిరంజీవి వారిని చూసి బిట్టు శ్రీను కు చెప్పగా వెంటనే ఇట్టి విషయం కుంట శ్రీను కి బిట్టు శ్రీను తెలియజేశాడు. కుంట శ్రీను మంథనికి వచ్చేలోపే వామన్ రావు మూడు కార్లలో గుంజపడుగు వచ్చాడు.

గుంజపడుగు బస్ స్టాండ్ లో కుంట శ్రీను:

అప్పుడు కుంట శ్రీను వామన్ రావు గురించి గుంజపడుగు బస్ స్టాప్ లో వెయిట్ చేశాడు. వామన్ రావు వాళ్ళ ఇంటికి వారితో పాటు వచ్చిన ఒక వ్యక్తికి సన్మానం చేస్తుండగా కుంట శ్రీను వామన్ రావు ఇంటికి ఎదురుగా ఉన్న పాత స్కూల్ బిల్డింగ్ నుంచి చూసి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వీలు కాదని చెప్పగా వామన్ రావు ని హత్యా చేసే ప్రణాళికను విరమించుకున్నారు.

వామన్ రావు హత్య పథకంలో ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న క్రమంలో తేదీ 17 ఫిబ్రవరి 2021 రోజు మధ్యాహ్నం సమయంలో మంథని కోర్ట్ కి గట్టు వామన్ రావు దంపతులు వచ్చారు అని తెలిసి కుంట శ్రీను బిట్టు శ్రీనుకి ఫోన్ ద్వారా తెలపగా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకో అని చెప్పగా అప్పుడు కోర్టు దగ్గర లో ఉన్న కుంట లచ్చయ్య కి ఫోన్ చేసి వామన్ రావు ఉన్నది నిజమని నిర్ధారణ చేసుకుని మరల చెప్పడం జరిగింది.

Also Read: యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్

చిరంజీవికి బిట్టుశ్రీను ఫోను:

వెంటనే బిట్టు శ్రీను శివనందుల చిరంజీవి కి ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని అర్జెంట్ గా మంథని బస్ స్టాప్ దగ్గరికి రమ్మని చెప్పినాడు. చిరంజీవి టూ వీలర్ పై కత్తులు తీసుకొని రాగా అంతలో బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇవ్వగా కత్తులు కారులో పెట్టుకుని కుంట శ్రీను వద్దకు వెళ్లి పోయినాడు
కల్వచర్ల సమీపంలో వామన్ రావు, తన భార్య నాగమణి ఇద్దరిని చంపాము అని కుంట శ్రీను బిట్టు శ్రీను కి ఫోన్లో తెలపగా బిట్టుశ్రీను మంచిది, మీరు మహారాష్ట్రకు వెళ్లిపొండని చెప్పి బిట్టు శ్రీను ఇంటి వద్ద ఏం తెలియనట్టు ఉన్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు: 1.చిరంజీవి వాడిన మోటార్ సైకిల్.2. ఒక సెల్ ఫోన్ .

సమాచారం అందించాలని పోలీసుల విజ్ఞప్తి:

ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుగుతూ ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి న అవసరం ఉంది. ఇంకా కొంతమంది సాక్ష్యులను కూడా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది. నిందితులను అందరిని పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వారు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. దీనికిగాను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు, సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణలో సహాయకులుగా తీసుకొని ముందుకు సాగబోతున్నారు.

Also Read: ఆందోళన కలిగిస్తున్న నేరం నేపథ్యం

అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ ప్రధాన విచారణ అధికారిగా సమగ్ర విచారణ చేస్తున్నారు. సాక్ష్యాలు గానీ, హత్యకు సంబంధించిన వీడియోలు సమాచారం, ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం అందిస్తే, ఇచ్చిన ప్రతి అంశాన్ని దర్యాప్తులో నిర్ధారించుకొని పరిశోధనలో ముందుకు పోతామని పోలీసులు ప్రకటించారు. కరీంనగర్ రేంజి ఇన్ చార్జి డీఐజీ ప్రమోద్ కుమార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుందని ఐజిపి నార్త్ జోన్ నాగిరెడ్డి తెలిపారు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles