Saturday, April 20, 2024

నిత్య జీవితంలో వైజ్ఞానిక స్పృహ

ప్రపంచమే ఒక వైజ్ఞానిక కల్పన!

సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విశాల విశ్వంలో ఏదీ లేదు. ఏ విషయం తీసుకున్నా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అది సైన్స్ తో సంబంధం కలుపుకోవాల్సిందే. కొన్ని కోట్లమంది యాత్రికులు బస్సుల్లో, రైళ్ళలో, విమానాలలో పుణ్యక్షేత్రాలకు, ధార్మిక కేంద్రాలకు వెళ్ళి వస్తున్నారంటే, కంప్యూటర్ ద్వారా రిజర్వేషన్లు జరుగుతున్నాయంటే, దేవుడి వ్యవహారాలన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయంటే అందుకు సైన్స్ కారణం.  సైన్స్ కు దేవుడి అవసరం లేకపోయినా, దేవుడి భావన నిలవడానికి మాత్రం సైన్స్ అవసరం ఉన్నదన్నది ప్రత్యక్షంగా కనిపిస్తున్నసత్యం.  మీరు ఏ స్వామీజీనో, సన్యాసినో, మాతాజీనో, ప్రత్యక్షంగానో, పరోక్షంగా టీవీ తెరమీదో చూడండి. జాగ్రత్తగా గమనించండి. విషయం మీకే అర్థమవుతుంది.

Also read: భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు?

వాళ్ళంతా ధవళ వస్త్రాలు ధరించి ఉంటారు. అవి సైన్స్ వల్ల లభించినవే. వారి ముందు ఓ పది మైకులుంటాయి. అవీ సైన్స్ వల్ల లభించినవే. విద్యుత్ దీపాల కాంతి చల్లగా, తెల్లగా వెలుగులు ప్రసరిస్తూ ఉంటుంది. అవీ సైన్సు వల్ల లభించినవే. సైన్స్ సమకూర్చిన  ఇన్ని సౌకర్యాల మధ్య కూర్చొని ఈ ఆధ్యాత్మిక గురువులు చెప్పేదేమిటీ? ‘‘మావనజన్మ వృధా! వెంటనే ఏదో ఒక శక్తిని, దేవుణ్ణి, దేవతను నమ్మండి. మోక్షం సాధించండి’’ – అని కదా? మోక్షమంటే ఏమిటి? ఎవడు చూశాడు దాన్నీ? అనే ప్రశ్నలు ఎవరూ వేయకుండా గంభీరోపన్యాసాలు సాగుతూ ఉంటాయి. మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశాలతో అతణ్ణి బలహీనపరచడం తప్ప, మనిషి మనిషిగా ఎదుగుతూ వచ్చిన విషయం ఒక్కటీ మాట్లాడరు. మనిషి తన మేథోసంపత్తి వల్ల సంపాదించిన విజ్ఞానంతో లబ్ధిపొందుతూ, వాటి గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆత్మ, పునర్జన్మ, దైవం, భక్తి వంటి మాటలతో అందమైన ఉపన్యాసాలు, ప్రవచనాలు చెపుతుంటారు. అందులో పిట్టకథలు మరో ఆకర్షణ.

Also read: పారా సైకాలజీ – సూడో సైన్స్ అని తేల్చిన శాస్త్రజ్ఞులు

మనిషి సాధించిన విజయాలను ప్రచారం చేయాలి

అందువల్ల విద్యావంతులకు, మేధావులకు నేను చెప్పేదేమిటంటే – మనిషి సాధించిన విజయాల గూర్చి జనానికి చెప్పండని! భవిష్యత్తులో ఇంకా సాధించాల్సినవేవొబే రీజు వేసుకోండని! అంతే కాని మీ మానసిక రుగ్మతలు మీ మానసిక బలహీనతలు సమాజం మీద  రుద్దకండని. మనుషుల్ని బలహీనులుగా తయారుచేసే ఈ స్వామీజీ తనకేదైనా అనారోగ్యం కలిగితే వెంటనే ప్రత్యేక నిపుణులయిన డాక్టర్లతో వైద్యం చేయించుకుంటాడు కదా? తప్పదు. బయటికొచ్చి ‘‘ఆ భగవంతుడి కరుణ వల్ల బతికి బలయపడ్డా’’ నంటాడు. జనం దాన్ని నమ్ముతారు. డాక్టర్ల బృందం అతడికి ఎంతో శ్రద్ధగా వైద్యం చేసిందీ, నర్సుల బృందం అతణ్ణి కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుందీ…అందరూ కలిసి ఎంతో కష్టపడి మళ్ళీ మామూలు మనిషిని చేశారన్నది మరుగున పడుతుంది. జరుగుతున్న ఘోరమేమటే ప్రతివాడూ సైన్సును ఉపయోగించుకుంటాడు. కాని దాని గూర్చి ఒక్క మాట కూడా మాట్లాడడు. నమ్మకాలలో, మూఢవిశ్వాసాలలో బతకడం అలవాటు పడినవారికి వాస్తవాలు రుచించవు. రుచికరమైన చిరుతిండికి అలవాటు పడ్డవాడు సాత్వికమైన పౌష్టికాహారం ఇష్టపడడు. అలాంటివాడికి అసలు వాస్తవాల్ని గ్రహిద్దామన్న స్పృహ కూడా ఉండదు.

ఈ రోజు బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్ మాటిక్స్, జెనటిక్ ఇంజనీరింగ్, హ్యూమన్ జీనోమ్, జీన్ థెరపి, క్లోనింగ్, స్టెమ్ సెల్ రీసర్చ్, చంద్రయాన్ ప్రాజెక్ట్స్ , నానో టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఫార్మాసుటికల్ రీసర్చ్, ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక విషయాలపై పరిశోధనలు ఉధృతంగా జరుగుతున్నాయి. మూలకణాల (stem cells)పై జరిగే పరిశోధనలు విజయవంతమవుతే ఒక మనిషికి పెరిగిన తర్వాత రాబోయే వ్యాధులు అతడు పిండిదశలో ఉన్నప్పుడే…తల్లి గర్భంలో ఉన్నప్పుడే – జన్యువుల్లోనే నివారించొచ్చు. విశ్వవిజ్ఞానం ఎంతగా పెరిగిపోయిందంటే విభిన్న రంగాలకు చెందిన శాస్త్రవేత్తలందరూ యనస్ఫూర్తిగా తమ తమ అహాల్ని వదులుకుని కృషి చేస్తే, నూతన సృష్టికి రూపకల్పన చేయగలరు! అంతటి విజ్ఞానం మనకుంది. అంతటి ప్రజ్ఞాపాటవాలూ మనవాళ్ళకున్నాయి. అయితే సమన్వయ లోపమే అవరోధంగా నిలుస్తోంది. ‘‘ఎన్ని పరిశోధనలు జరిగినా కొత్త ప్రాణికి మనిషి జీవం పోయగలడా?’’ అనే సంశయానికి శాస్త్రవేత్తలు తప్పక సమాధానం చెప్పగలుగుతారు.

Also read: మకరజ్యోతి మనిషి మహత్మ్యం

వెలుగులోకి వచ్చిన కొత్త ఆవిష్కరణ

ఇటీవల ఒక కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ‘‘మైకోప్లాస్మా జెనిటాలియం’’ అనే బాక్టీరియాలోని మొత్తం డి.ఎన్.ఏను ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించగలిగారు. లోగడ వైరస్ డి.ఎన్.ఏలను కృత్రిమంగా సృష్టించగలిగినా, బాక్టీరియా డి.ఎన్.ఏకు మాత్రం ఇంతవరకు రూపకల్పన చేయలేకపోయారు. అదిప్పుడు సాధ్యమయింది! వెరస్ ల కన్నా బాక్టీరియాలలో ఎక్కువ డిఎన్ఏ ఉండడమే ఈ ఆలస్యానికి కారణమయింది. ఉదాహరణకు ఇప్పుడు సృష్టించగలిగిన మైకోప్లాస్మా జెనిటాలియం కోసం సుమారు ఆరులక్షల డిఎన్ఎ బేస్ పెయిర్స్ తయారు చేయాల్సి వచ్చింది. అందువల్ల సహజంగా మైకోప్లాస్మా జెనిటాలియంలో ఉండే డిఎన్ఎకు ప్రతి సృష్టి చేయడం జీవశాస్త్రంలో ఒక గొప్ప పరిణామం.

మైక్రోప్లాస్మా జెనిటాలియం అనే ఈ బాక్టీరియా ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఉంటుంది. సెక్స్ పమయంలో ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. అందువల్ల రాగల కాలాలలో మానవుని జన్యువును కూడా శాస్త్రవేత్తలు రూపొందించగలరనే నమ్మకం  కలుగుతోంది. సహజమైన బాక్టీరియాకు సరిసమానమైన బాక్టీరియాను రూపొందించగలిగినప్పుడు, సహజమైన మానవుడికి సరిసమానమైన మానవుణ్ణి శాస్త్రవేత్తలు రూపొందించగలరు. ఇది ఏదో ఆశాభావంతో ఊరికే అంటున్న మాట కాదు. కాబోయే వాస్తవం. ఇటీవల శాస్త్రజ్ఞులు ఒక మైక్రోబ్ (సూక్ష్మక్రిమి) నుండి డిఎన్ఏను మరో మైక్రోబ్ లోకి మార్చారు. అంటే ఒక జీవిగా పట్టబోయే దాన్ని మరో జీవిగా మార్చి పుట్టించినట్టు లెక్క. కృత్రిమంగా తయారు చేసిన క్రోమోజోమ్ ను ఒక బాక్టీరియాలో ప్రవేశపెట్టే ప్రక్రియ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. ఈ ప్రయత్నాలు విజయవంతమవుతే ఒక కణం నుంచి జీవి పూర్తి రూపాన్ని తయారు చేయడానికి వీలవుతుంది. జీవులను, జీవలక్షణాలను మానవుడే సృష్టించినట్లవుతుంది. విశ్వాసపాత్రులైన ఈ భక్తులు అప్పుడు మరి దేవుణ్ణి – సృష్టికర్తను ఎక్కడ దాచుకుంటారో తెలియదు.

Also read: ఫేక్ న్యూస్ గాళ్ళు లార్డ్ మెకాలేను కూడా వదలరా?

శాస్త్రపరిశోధనలు ప్రజల అభిప్రాయాలు మార్చుతాయి

సైన్స్ కు జీవంతో సంబంధం లేదని, జీవాన్ని ఏదో ఒక శక్తి సృష్టించిందని 19వ శతాబ్దం దాకా అందరూ నమ్మారు. 1828 నుండి టెస్ట్ ట్యూబ్ ప్రయోగాలు ప్రారంభమైనప్పటి నుండి ఈ వాదన బలహీనపడుత వచ్చింది. ఇప్పటికి అత్యధిక సంఖ్యాకులు జీవాన్ని దేవుడు (ఒకశక్తి) సృష్టించాడని నమ్మేవారే ఎక్కువ. కాని శాస్త్ర పరిశోధనలు వారి అభిప్రాయాన్ని తప్పక మారుస్తాయి. వాస్తవాల్ని జీర్ణించుకోవడానికి, తమ నమ్మకాల్ని వదులుకవడానికి ప్రజలకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే త్వరిత గతిన సాగుతున్న పరిశోధనల వల్ల శాస్త్రజ్ఞులు మానవుడి జన్యువులను కూడా కృత్రిమంగా తయారు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల మస్కులర్ డిస్ట్రొఫీ, సిస్టిక్ ఫైబో, సిస్ వంటి రోగాలకు చికిత్స సాధ్యమవుతుంది. అంతకన్నా మానవుడి ఆయుష్షు పెంచే ప్రయత్నం సఫలమవుతుంది.

ఈ విధంగా విజ్ఞానశాస్త్రం ఏఏ మూలలకు వ్యాపిస్తోందో, ఆయా మూలల నుండి దేవుడు మాయమవుతున్నాడు. ఒక నాడు స్మాల్ పాక్స్ వస్తే ‘‘అమ్మవారు’’ అని భయపడ్డారు. దాన్ని దైవానికి అంటగట్టారు. ఇప్పుడది వ్యాధి మాత్రమేనని తేలిపోయింది. దాని నివారణ కూడా జరిగింది. నమ్మకాలు, మూఢనమ్మకాలు బాగా ప్రబలుతున్న చోట దైవభావం బలంగా ఉంటుంది. విజ్ఞానశాస్త్రం ఒక జ్యోతిలా వెలుగులు అందిస్తున్నకొద్దీ, నమ్మకాల్లో మార్పు వస్తోంది. మూఢనమ్మకాలు సడలుతున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు కొత్త కొత్త మూఢనమ్మకాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత విద్యావంతులందరిదీ. విశ్వవిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు జనానికి అందించేవారు ఎక్కువ సంఖ్యలో కావాలి. నిరక్షరాస్యుల కన్నా అక్షరాస్యుల్లో కొంతమంది హేతుబద్దంగానే ఆలోచించకపోవడం, అంధవిశ్వాసాలతోతాము కొట్టుకుపోతూ తమ చుట్టూ ఉన్నవారిని సైతం భయపెట్టడం జరుగుతుంది. ఇలాంటి వారివల్ల మన సమాజం వైజ్ఞానిక సమాజంగా రూపాంతరం చెందలేకపోతోంది. ప్రతి ముందడుక్కీ ఎన్నో అవాంతరాలు రావడం వల్ల అనుకున్నది సాధించడానికి ఎంతో సమయం పడుతుంది.

Also read: మాస్ హిస్టీరియాకు గురిచేస్తున్న తెలుగు ఛానళ్ళు!

వైజ్ఞానిక ఆధారాలు లేని నమ్మకాలు నిలబడవు

ఉదాహరణకు ఎలుక, ఏనుగు, మనిషి గూర్చి ఆలోచిద్దాం. ఈ మూడూ క్షీరదాలకు చెందిన ప్రాణులు. అయినప్పటికీ పరిమాణంలో, జీవనంలో – ఆయుష్షులో తేడాలున్నాయి. జీవితకాలం అనేది ఆ ప్రాణి కణాల ఆయుష్షుపై ఆదారపడి ఉంటుందనిశాస్త్రజ్ఞులు చెపుతున్నారు. ప్రకృతి వైద్యం చేసే వైద్యులు కూడా  ఆ మాటే చెపుతున్నారు. కణాల ఆయుష్షునే ఏజింగ్ (AGEING) అంటున్నారు. కణాల ఆయుష్షు మళ్ళీ ఆ ప్రాణి తీసుకకునే ఆక్సీజన్ పై ఆధారపడి ఉంటుంది. శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం మంచిదని చెప్పేది అందుకే! మనం పీల్చే ఆమ్లజని వల్ల కణాలకు శక్తి లభిస్తుంది. ఆ ప్రక్రియ జరగుతున్నప్పుడు కొన్ని ప్రమాదకరమైన ఉపఉత్పన్నాలు కూడా విడుదల అవుతాయి. వాటినే ‘‘ఫ్రీ రాడికల్స్’’ అంటున్నాము. ఈ ఫ్రీరాడికల్స్ కాన్సర్ వంటి వ్యాధుల్ని కలగజేస్తాయి. అలాంటి వ్యాధులు రాకుండా ఫ్రీరాడికల్స్ ని నియంత్రించడానికి ఎంజైమ్స్ అవసరమౌతాయి. ఎంజైమ్ ఏ మోతాదులోకావాలో ఆ మోతాదులో మనం వాటిని అదుపు చేయగలిగితే వ్యాధులపై, ఆయుష్షుపై మనం పట్టు సాధించవచ్చు. ఆ ప్రయత్నాలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఒక కొత్త విషయం బయటపడింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైశ్యజాతిలో కొన్ని ఎంజైమ్ ల లోపం బయటపడింది. అనాదిగా కుటుంబంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ రావడం వల్ల, అది వంశపారంపర్యంగా వచ్చిన లోపమా? లేక మరేదైనా ఇతర కారణాలున్నాయా? తేలాల్సి ఉంది. అంటే ఇంకా ఇతర కులాల్లో, జాతుల్లో కూడా ఏవేవో కొన్ని కొన్ని లోపాలు ఉండవచ్చు కదా? వాటిని కూడా ఇప్పుడు సైన్సు పరిశోదనలు వెలికి తీయాల్సి ఉంది.

ఇక్కడ మనం మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవన గతిని మలుపు తిప్పే ఆవిష్కరణలు చేయడం ఏ కొద్దిమంది శాస్త్రవేత్తలకో సాధ్యమయింది. భవిష్యత్తులో కూడా సాధ్యమవుతుంది. అంతేకాని మిలియన్ ల సంఖ్యలో ఉన్నా సామాన్య జనం నమ్మకాల వల్ల సమాజంలో ఏ ఆవిష్కరణలు జరగలేదు. అవి బలంగా ఉన్నది నిజమే కాని, వాటికి వైజ్ఞానిక శాస్త్ర ఆధారాలు లేవు. అందువల్ల అవి నిలబడవు. అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల సామాన్యుల్లో ఏవో కొన్ని కొన్ని నమ్మకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని మతాధిపతులు ఏవో అందమైన అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తుంటారు. బలహీనతల మీద వ్యాపారం జరిగినట్టు… ఇంకా ఇంకా వారి నమ్మకాలు వర్థిల్లేట్లు చేస్తుంటారు.

Also read: పరలోకంలో జిఎస్ టి అప్లయ్ అవుతుందా?

శాస్త్రవేత్తలనూ, దార్శనికులనూ గౌరవించాలి

తమ వృత్తులతో వ్యాపారం చేసుకునే సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు మొదలైనవారిని పక్కన పెట్టి, నిస్వార్థంగా, సమాజపురోగతికి పాటుపడే శాస్త్రవేత్తల్ని, సామాజిక శాస్త్రవేత్తల్ని, అధ్యాపకుల్ని, దార్శనికుల్ని గౌరవించుకున్న నాడు సమాజం బాగుపడుతుంది. వ్యవసాయదారుడు, కూలి, ఉద్యోగి, కార్మికుడు వంటి వారి శ్రమకు సరైన విలువ లభించినపుడు సమాజం విలువ పెరుగుతుంది. అందుకు వైజ్ఞానిక స్పృహ, వైజ్ఞానిక దృక్పథం చాలా అవసరం. అది పెంచకున్న సమూహాలు, సమాజాలు ఆరోగ్యంగా ముందుకు పోతాయి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోందంటే అర్థం చేసుకోలేనివారు ఒకనాడు తలలు నరికేశారు. క్లాసులో పరిణామ సిద్ధాంతం చెప్పినందుకు 1925లో జాన్ టి.స్కూప్స్ అనే ఉపాధ్యాయుణ్ణి టెన్నిస్సి రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. ఒక ఐరిష్ మతపెద్ద ఈ చరాచర జగత్తంతా క్రీ.పూ. 4004లో అక్టోబర్ 23 ఉదయం 9 గంటలకు ఆ భగవంతుడిచే సృష్టించబడిందని చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి దాకా దానికి రుజువే లేదు. అతను కానీ, అతని అనుచరులుకానీ ఊహాజనితమైన ఆ ప్రకటనని వాస్తవంగా మలచలేకపోయారు. నైలు నదిలోని బురదలోంచి మొసళ్ళు ఉద్భవించాయని ఈజిప్టులోని పురాతన సంచార జాతులు నమ్మేవి. ఆవు పేడలోంచి తేళ్ళు పుడతాయని కూడా నమ్మేవి. ఆ నమ్మకాలన్నీ నిలబడలేదు. నమ్మకాలుగా అవి చాలాకాలం కొనసాగి ఉంటాయి. డార్విన్ పరిణామ సిద్ధాంతం, హట్టన్ భూపొరల సిద్ధాంతం, వైస్ మెన్ జన్యు ప్రయోగాలు, హెకెల్ బయోజనటిక్ లా వంటివి ఎన్నో ప్రతిపాదించబడ్డాయి. ఆయా సిద్ధాంతాలు వాస్తవాలుగా మారి, వెలుగులోకి వస్తున్నకొద్దీ అంతకు ముందున్న నమ్మకాలన్నీ మరుగున పడసాగాయి. కొత్త నిజాలు సమాజానికి కొత్త సమాచారం అందిస్తూ  వచ్చాయి.ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిరంతరం కొనసాగుతుంది కూడా!

నిజానికి మనమిప్పుడు చాలా ముందుకు వచ్చాం.  కొన్ని కొన్ని విషయాల్లో మళ్ళీ చాలా వెనక్కిపోతున్నాం. దానికి అడ్డుకట్టవేసుకుంటూ ఉండాలి. తప్పదు. వైజ్ఞానిక పరిశోధనలకు సంబంధించి ఏవీ అందుబాటులో లేని రోజుల్లో సి.వి. రామన్ ఈ దేశంలో పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి సాధించారు. స్వాతంత్ర్యానంతరం క్రమంగా దేశం అభివృద్ది చెందుతూ వచ్చింది. ప్రపంచ స్థాయి పరిశోధనాశాలలు మన దేశంలో ఏర్పాటయ్యాయి. పరిశోధనలు ఎంతో ఆశాజనకంగా జరుగుతున్నాయి. చంద్రయాన్ విజయవంతమైంది. అది అందించే సమాచారం, భారతీయ సమాజానికే కాక, మొత్తం ప్రపంచానికే ఎంతో ఉపయోగపడుతోంది.  

Also read: విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles