Thursday, April 25, 2024

అంధవిశ్వాసాలను త్యజిస్తూ, విజ్ఞానపథంలోకి పయనిస్తూ…

మూఢ నమ్మకాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. అవి ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలకు సంబంధించినవి – కలగాపులగంగా ప్రపంచ పౌరుల్లో ఉంటూనే ఉన్నాయి. ఇప్పటికీ అరణ్యాల్లో, కొండల్లో, కోనల్లో నివసించే ఆదిమ, గిరిజన జాతుల్లో ఇంకా కొన్ని అనాగరిక విశ్వాసాలు వర్థిల్లుతూనే ఉన్నాయి. అత్యాధునికుల్లో కూడా కాలానుగుణంగా కొత్త కొత్త మూఢవిశ్వాసాలు ఏర్పడుతూ, ప్రాచుర్యం పొందుతూ, స్థిరపడుతున్నాయి. ఇందుకు- గతం మీద ఉన్న గౌరవం, పూర్వీకుల పట్ల ఉన్న శ్రద్ధ కొంతవరకు కారణాలు కావచ్చు. తమకన్నా తమ పూర్వీకులు తెలివిగలవారని, అన్నీ ఆలోచించి వారు ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పరిచారని ఒక నమ్మకం! అది మూఢనమ్మకమేమోననే అనుమానం వారికి రాదు. సమకాలీనంలో ఉన్న విజ్ఞులు చెప్పింది వింటారు గానీ, పాటించాల్సి వచ్చేసరికి, పూర్వీకుల భావజాలంలోకి వెళ్ళిపోతారు. తమదే గొప్ప సంస్కృతి అని భుజాలు తడుముకుంటారు. వాటిలోని అహేతుక విషయాల్ని ప్రశ్నించరు. ఉదాహరణకు కొన్ని అంధవిశ్వాసాన్ని పరిశీలిద్దాం!

Also read: దైవశక్తి లేదు, ఉన్నదంతా మానవశక్తే

చరాచర జగత్తున్న నడిపిస్తున్నది ఎవరు?

దేవుడు – సృష్టికర్త – అని, అతడే ఈ చరాచర జగత్తుని సృష్టించాడని మనుషుల జీవితాల్ని అతడే అజమాయిషీ చేస్తున్నాడనీ, మనుషులు నిమిత్తమాత్రులని ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఒక గట్టి నమ్మకం ఉంది. శతాబ్దాలుగా అది చెక్కు చెదరకకుండా ఉంది. అయితే ఆ విశ్వాసాన్ని నిలపడానికి మతబోధకులు తమ తమ మతాల ద్వారా విశ్వప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడన్న వాదన ఎంత బలహీనమైనదంటే – అది ఒక చిన్న ప్రశ్నతో కుప్పగూలిపోతుంది. అన్ని మతాల మతవిశ్వాసకులు తమ దేవుడే ఈ విశ్వాన్నీ, మనిషినీ సృష్టించాడని నమ్ముతున్నారు. సృష్టికర్త ఒక్కడే – అని చెబుతారు కానీ, నమ్మరు – ‘‘తమ మతానికి సంబంధించిన దేవుడే అసలు దేవుడనీ, ఇతర మతాల దేవుళ్ళు దేవుళ్ళే కాదు’’- అనీ అనుకుంటూ ఉంటారు. అంటే ఏమిటీ? ఈ సృష్టికి మూలకారకుడు ఒక్కడే అయితే, అందరూ అతణ్ణే నమ్మాలి. కాని, అలా జరగడం లేదు. అంటే విశ్వాసకుల భ్రమల్లోంచి, ఊహల్లోంచి దేవుళ్ళు వివిధ రకాలుగా పుట్టుకొచ్చారని అర్థమవుతూ ఉంది. పైగా ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల్లో గాని, విశ్వం పుట్టుక, మనిషి పుట్టుక, పరిణామవాద పరిశీలనలల్లో గానీ, ఇతర గ్రహాల అన్వేషణలో గానీ దేవుడు కనబడలేదు. అతని ఉనికి, శక్తి, మహిమ వంటివి ఏవీ ఎక్కడా ఎప్పుడూ బయటపడలేదు. ఇక ముందు బయట పడతాయనడానికి ఆధారాలు కూడా లేవు. ఒక బలహీనమైన కరోనా వైరస్ విశ్వవ్యాప్తమైనట్టు, బలహీనమైన దైవభావన కూడా విశ్వవ్యాప్తమై బలంగా స్థిరపడింది.

Also read: వైద్యం వేరు, మత విశ్వాసాలు వేరు కదా నాయనా?

జాతకాల పట్టింపులు

పిల్లలు ఎలా పుడతారన్న జ్ఞానం అడవిలో ఉండే జంతువులక్కూడా ఉంది. కానీ మనుషులు మాత్రమే తెలుసుకోలేక, పిల్లల కోసం పూజలు చేస్తూ, దీక్షలు పూనుతూ, మొక్కులు మొక్కుతూ గుళ్ళూ గోపురాలు ఇతర మతప్రార్థనాస్థలాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక జాతకాలు చూడడం గురించి పెద్ద తతంగమే జరుగుతుంది. మరీ ముఖ్యంగా పెళ్ళిళ్ళలో వధూవరుల జాతకాలు కలవడమన్న హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. ఇప్పుడు జాతకాల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కానీ లోగడ ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఇచ్చినా ఎందుకు మరి అందరి వైవాహిక జీవితం సజావుగా కొనసాగలేదు? జాతకాలు చూసేవారు తమని తాము మోసం చేసుకుంటే, జాతకాలు చెప్పించుకున్నవారు మోసపోయిన అజ్ఞానులన్నమాట! సుముహూర్తం, దుర్ముహూర్తం అనేవి ఉదరపోషణార్థం కొందరు కల్పించుకున్న ఉపాయాలు. అవే తమ జీవితాలకు అపాయాలవుతాయని జనం గుర్తించుకోలేకపోయారు.  ఇక జ్యోతిష్యం గురించి చాలా చర్చే జరిగింది. అదొక అహేతుకమైన శాస్త్రం – జ్యోతిష్యం ఇప్పుడు వ్యక్తులకు మాత్రమే కాదు, దేశాలకు, రాష్ట్రాలక్కూడా చెబుతున్నారు. అడిగితే జిల్లాలకూ, మండలాలకు కూడా చెపుతారు. ఇటీవల రాజకీయ పార్టీల భవిష్యత్తు, ప్రభుత్వాల భవిష్యత్తు కూడా జ్యోతిష్యులు చెపుతున్నారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అని అన్నది అందుకే కాబోలు! అదేమిటో ఎయిడ్స్, కరోనా లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని ఈ జ్యోతిష్య పండితులు ముందుగా చెప్పలేరు. చైనా సరిహద్దులో ఘర్షణలు జరుగుతాయని చెప్పలేరు. వరదలు, కరువులు ఎప్పుడొస్తాయో చెప్పలేరు. ఊరికే నోటికొచ్చింది వాగి, డబ్బులు గుంజడమే తమ కర్తవ్యం – అని అనుకుంటారు. అదెంతటి అబద్దపు బతుకో వారికి వారు చేరీజు వేసుకోలేరు. కరోనా గురించి గానీ, వైరస్ గురించి గాని రెండు ముక్కలు చెప్పలేని ఓ యోగా మాస్టర్ కరోనా నివారణకు ఆయుర్వేదంలో మందు తయారు చేశానంటాడు. గట్టిగా నిలదీస్తే – అది ఉట్టి జలుబు మందే – అని మాట మారుస్తాడు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గూ?’ అని ఇంకా కొందరు అబద్ధపు బతుకులు బతుకుతుంటారు. దేశంలో చాలామంది మత గురువులు, యోగులు, ముల్లాలు, ఫాదర్లు చేస్తున్న పనులు ఇలాంటివే. మూఢనమ్మకాల్లో మునిగితేలే ప్రభుత్వాలు రాజ్యాలేలుతున్నప్పుడు మరి ఇలాంటి వారిపై అజమాయిషీ చేసేదెవరూ? చెప్పింది చెప్పినట్లు జరగకపోతే జ్యోతిష్యులు-జాతకాల పండితులు శిక్షలకు సిద్ధపడాలి- జనానికి నమ్మకం కలిగించాలి – కలిగిస్తారా?

Also read: రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక రియాల్టీ షో!

దేవుడిలాగే దయ్యం కూడా అబద్ధం

దేవుడెంతటి అబద్ధమో, దయ్యం కూడా అంతే అబద్ధం అయినప్పుడు, కోరికల తీరకుండా అర్థాంతరంగా చనిపోయినవారు  దయ్యాలవుతారన్నది అపోహమాత్రమే. వ్యాపారం చేసుకోవడానికి దేవుడి మహిమలు, దయ్యం బాధలు రాసి కొందరు రచయితలయ్యారు. కొందరు సినీదర్శకులయ్యారు. మానసిక బలహీనులు వాటికి ఆకర్షితులై  చూసి ఆనందించారు. అసలు పునర్జన్మలకే రుజువులు లేనప్పుడు ఇక జన్మల్లో ఉచ్ఛం-నీచం అనే తేడాలు ఎలా ఉంటాయి? ఎందుకుంటాయి? జీవశాస్త్రంలో ప్రాథమిక అంశాల్ని అర్థం చేసుకున్నా ఇలాంటి బూజుపట్టిన ఆలోచనల్ని వదిలించుకోవచ్చు. అరచేతిలోని రేఖలు, నుదుటి మీది గీతలు జీవితాల్ని శాసిస్తాయన్న ఆలోచనలు అజ్ఞానంతో కూడుకున్నవి. పిండదశలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువులు చేతులు ముడుచుకుని ఉంటాయి. కాబట్టి, అలా గీతలు, రేఖలూ ఏర్పడతాయి. అంతేగాని, ఏదో అతీతశక్తి పనిగట్టుకుని కూర్చుని ఒక్కొక్కరికి వాటిని గీయలేదు. ఈ ఆధునిక యుగంలో మనకు మరొక అసంబద్ధమైన వ్యాపారం కనిపిస్తోంది. పేరులోని అక్షరాల్ని మార్చుకోవడం ద్వారా జీవితాలు మారతాయి, దుఃఖాలు దూరమౌతాయి, ఆనందాలు చేరువౌతాయి అనే ఒక పనికి మాలిన దుష్ప్రచారం చేసుకుంటూ, మీడియాను వాడుకుంటూ కొందరు హాయిగా అబద్ధపు బతుకులు బతికేస్తున్నారు. ఆత్మల్ని నమ్మే ఇలాంటి వారికి ఆత్మసాక్షి అనేది ఎందుకు ఉండదో తెలియదు. ఇలాంటి మూర్ఖుల్ని వారి మానాన వారిని వదిలేయకుండా, దిగజారిన బడాబడా టెలివిజన్ ఛానళ్ళు కొన్ని, ప్రత్యక్ష ప్రసారం చేసి చూపెడుతుంటాయి. ఇలా అహేతుకమైన విషయాలు ప్రచారం చేయడమేనా  వాటిపని? పైగా ప్రజల కోసమే పని చేస్తున్నామని డబ్బా కూడా కొట్టుకుంటూ ఉంటాయి. అలాగే రంగురాళ్ళ ఉంగరాలు జీవితాల్లో మంచి మార్పులు తెస్తాయని కొందరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ, బతుకులు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ఏవో విశ్వాసాల ఆధారంగా తాయత్తులు కట్టుకుంటే దుష్టశక్తులు దూరం కావు. అసలు అలాంటి అతీత శక్తులు ఏవీ ఉండవని నిర్ధారించుకున్నాక ఇక ఇలాంటివి ఎలా ఉంటాయి? అజ్ఞానంతో, అమాయకత్వంతో జనం ఇలాంటివి నమ్ముతుంటారు. మనం వాళ్ళని అందులోంచి బయటపడేయాలి. ఒంటిమీది పుట్టుమచ్చలు జీవితంలో జరగబోయే సంఘటనలకు కొలబద్దలు కావు. అలాగే స్త్రీలకు సంబంధించిన మూఢవిశ్వాసాలు జనంలో లెక్కనేనన్ని ఉన్నాయి. అందులో బహిష్టు సమయంలో స్త్రీలు వంటగదిలోకి రాకూడదన్నది ఒకటైతే…చెడు రక్తం బహిష్టు ద్వారా బయటికి వెళుతుంది- అనేది మరొకటి. బాణామతి, లేదా చేతబడితో మనుషుల్ని చంపొచ్చుననేది ఒక మూఢనమ్మకం. అలాగే పాములు, తేళ్ళూ కాటేస్తే విషాన్ని మంత్రాలతో తొలగించవచ్చని అనుకోవడం మరొక మూఢనమ్మకం. దయ్యం పట్టినా, చేతబడి చేసినా భూతవైద్యులు వాటిని నయం చేయగలరని నమ్మడం ఇంకో మూఢనమ్మకం. క్షుద్ర విద్యల ద్వారా అతీతశక్తులు స్వాధీనం అవుతాయనుకోవడం మరింకో మూఢనమ్మకం – ఇలా ఎన్నెన్నో మూఢవిశ్వాసాలు జనంలో ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా తొలగించగలిగితే అంత మంచిది.వాస్తు పాటించి ఇండ్లు కట్టుకోవడం వల్ల ఆర్థిక, ఆరోగ్య ఫలితాలు బావుంటాయని కొందరు ప్రచారం చేస్తుంటారు. గాలి, వెలుతురు, నీరు పుష్కలంగా లభ్యమయ్యేట్లు ఇండ్లు కట్టుకోవడం మంచిది. అంతకు మించిన వాస్తు మరొకటి ఏదీ లేదు.

Also read: నిత్య జీవితంలో వైజ్ఞానిక స్పృహ

దైవభావనకు విలువేమున్నది?

దేవుడే అబద్ధమైపోయినప్పుడు ఆ భావన చుట్టూ రూపుదిద్దుకున్న ఇతర విశ్వాసాలకు  విలువ ఏముంటుంది? అతని ఉనికే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు – ఇతర జీవరాసులకు భిన్నంగా అతను మనిషిని సృష్టించాడనడానికి ఆధారాలెక్కడ? పాపపుణ్యాలు, స్వర్గనరకాలు, పునర్జన్మలకు అర్థం ఉంటుందా, గ్రహాల కదలికలు మానవ జీవితాలన్ని ప్రభావితం చేస్తాయన్నది పచ్చి అబద్ధమైతే, భజనలకు, నైవేద్యాలకు, శాంతిపూజలకు అర్థముంటుందా? దిక్పాలకులనేవారు ఉండనే ఉండరు కదా? యజ్ఞాల ద్వారా వర్షాలు కురిపించవచ్చని, ప్రపంచ శాంతిని నెలకొల్పవచ్చని చెప్పడంలో ఏ మాత్రమూ నిజం లేదు. వేదకాలం నుండి యజ్ఞాలు, యాగాలు జరగుతున్నాయని సనాతన సంప్రదాయవాదులు చెపుతుంటారు. మరి అదే నిజమైతే ఈ దేశంలో చిన్నవి పెద్దవి కలుపుకుని లక్షల సార్లు యుద్ధాలు ఎందుకు జరిగాయి? ఇటు పాకిస్తాన్, అటు చైనాలతో మన దేశం ఈ రోజు కూడా సమస్యల్ని ఎదుర్కుంటూనే ఉంది! గతంలో మన పూర్వీకులు చేసిన శాంతి హోమాల ఫలితంగా దేశంలోను, ప్రపంచంలోనూ శాంతి స్థాపించబడాలి కదా? మరెందుకు స్థాపించబడలేదూ. అంటే వాటికి ఆ శక్తి లేదని అర్థం! నోములు, వ్రతాలు ఆచరిస్తే భారతీయ మహిళల సౌభాగ్యం వర్థిల్లుతుదని చెప్పారు కదా మరి ఏమైందీ? వయసుతో నిమిత్తం లేకుండా మతవిశ్వాసకులే స్త్రీల శరీరాలతో, జీవితాలతో ఆడుకుంటున్నారు కదా? ఏ ఒక్కదానికీ సహేతుకంగా సమాధానం చెప్పలేని స్థితిలో మతాలు, మతవిశ్వాసకులు, మతగురువులూ ఉన్నప్పుడు సామాన్యజనం ఏం చేస్తారూ? మతవిశ్వాసాల్లోంచి బయటపడతారు. రక్షణ కల్పించే రాజ్యాంగం వైపు, మానవీయ విలువల వైపు రావడానికి ప్రయత్నిస్తారు తప్పదు – అలాంటి విషమఘడియల్లో వారిని వైజ్ఞానిక స్పృహ కాపాడుతుంది. వాస్తవాల్ని జీర్ణించుకోగలిగే మనోధైర్యాన్ని అందిస్తుంది. తమ తమ మత విశ్వాసాల్నీ, దైవ భావననీ విడనాడి విశ్వమానవులుగా ఎదగడానికి తోడ్పడుతుంది. జంతు బలుల ద్వారా గ్రామదేవతల్ని శాంతపరచవచ్చుననుకోవడం – వంటి మూఢనమ్మకాలు వేలకువేలు మన ప్రజాజీవనంలో వేల ఏళ్ళ నాటి నుండి వేళ్ళూనుకుని ఉన్నాయి. వాటిని తొలగించుకుంటూ, ఉదాత్తమైన శాస్త్రీయ మానవవాద ప్రపంచానికి మనం రూపకల్పన చేసుకోవాల్సి ఉంది. చాలా కష్టమైన పనే  కాని, జనంలో వివేకం పెరిగితే, అది తప్పక సాధ్యమవుతుంది! ఆ ప్రయత్నంలో మనలో ప్రతి ఒక్కరం నిమగ్నమై ఉండాల్సిందే!

జిందగీ క్యౌ న అబ్ థోడాసా బదల్ జాయె హం?

ఖ్వాబోం కా రస్తా ఛోడ్, హకీకతోంకె ఘర్ జాయె హం?

(జీవితాన్ని మనం కొంచెం ఎందుకు మార్చుకోకూడదూ?

కలలదారీ వదిలేసి వాస్తవాల గూటికి ఎందుకు చేరగూడదు?)

Also read: భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు?

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles