Thursday, April 25, 2024

సింధు, శ్రీకాంత్ వరుస పరాజయాలు

• ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ నుంచి అవుట్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ గ్రూపు రౌండ్ రాబిన్ లీగ్ లో భారత స్టార్లు కిడాంబీ శ్రీకాంత్, పీవీ సింధు వరుసగా రెండో పరాజయం చవిచూశారు. సెమీస్ బెర్త్ ఆశలను దాదాపుగా దూరం చేసుకొన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో మొదటి ఎనిమిది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్లను రెండు గ్రూపులుగా విభజించి రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీస్ నాకౌట్ తరహాలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

దెబ్బ మీద దెబ్బ:

కరోనా వైరస్ దెబ్బతో బ్యాడ్మింటన్ కార్యకలాపాలు స్తంభించిపోడంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆటకు దూరమైనా సింధు, శ్రీకాంత్ తమతమ విభాగాలలో మొదటి ఎనిమిది ర్యాంకుల్లో నిలవడం ద్వారా 2020 ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించారు. ఈ టోర్నీకి సన్నాహకంగా బ్యాంకాక్ లోనే జరిగిన థాయ్ ఓపెన్లో సైతం పాల్గొని ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా తగిన ప్రాక్టీసు సంపాదించగలిగారు. అయితే టూర్ ఫైనల్స్ రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్ పోటీలలో పోరాడి ఓడిన శ్రీకాంత్, సింధు కీలకమైన రెండో రౌండ్ పోటీలలో అదేజోరు కొనసాగించలేకపోయారు.

ఇది చదవండి: తొలిపోటీలో పోరాడి ఓడిన సింధు

సింధుకు రచనోక్ షాక్:

మహిళల సింగిల్స్ రౌండ్ రాబిన్ లీగ్ రెండోరౌండ్ లో థాయ్ లాండ్ కు చెందిన ప్రపంచ 3వ ర్యాంకర్, మాజీ ప్రపంచ చాంపియన్ రచనోక్ ఇంటానాన్ వరుస గేమ్ లలో సింధును ఖంగు తినిపించింది. తొలిరౌండ్లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ తాయ్ జు ఇంగ్ తో మూడుగేమ్ ల పాటు పోరాడి ఓడిన సింధు…రెండోరౌండ్లో మాత్రం మూడో ర్యాంక్ ప్లేయర్ పై పోరాడలేకపోయింది. తొలిగేమ్ ను 18-21తో కోల్పోయిన్ సింధు…రెండోగేమ్ లో ఏమాత్రం పోటీఇవ్వలేకపోయింది. కేవలం 13 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. తగిన మ్యాచ్ ప్రాక్టీసుతో పాటు…మూడుగేమ్ ల పాటు పోరాడే నేర్పు,ఓర్పును సింధు సంపాదించలేకపోయింది. 2018లో ప్రపంచ టూర్ విన్నర్ గా నిలిచిన సింధు ఆ తర్వాత నుంచి పేలవమైన ఆటతీరుతో పడుతూ లేస్తూ వస్తోంది.

ఇది చదవండి: క్రీడాకారులకు పద్మ అవార్డులు

పోరాడి ఓడిన కిడాంబీ:

సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే…రెండోరౌండ్లో తైవాన్ ఆటగాడు వాంగ్ జూ వీని ఓడించి తీరాల్సిన మ్యాచ్ లో శ్రీకాంత్ మూడుగేమ్ ల పాటు పోరాడినా ప్రయోజనం లేకపోయింది. వాంగ్ చివరకు 19-21, 21-9, 21-19తో విజేతగా నిలిచాడు. శ్రీకాంత్ తుదివరకూ పోరాడినా విజయం సాధించలేకపోయాడు. ఇటు శ్రీకాంత్, అటు సింధు మూడురౌండ్లలో రెండు పరాజయాలు పొందడం ద్వారా సెమీఫైనల్స్ నాకౌటే్ రౌండ్ కు దూరమయ్యారు. మొత్తం మీద కొత్తసంవత్సరం భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ లకు అంతగా కలసివచ్చినట్లుగా అనిపించడం లేదు.

ఇది చదవండి: టోక్యో ఒలింపిక్స్ కు కరోనా గ్రహణం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles