Friday, April 19, 2024

ఏడు నందులను పొందిన కాశీ విశ్వనాథ్

చిలుకోటి కాశీ విశ్వనాధ్ కథా రచయిత, నటుడు. ఏడు నంది అవార్డులు  సొంతం చేసుకున్న  ప్రతిభా శాలి. వెయిట్ లిఫ్టింగ్ లో దిట్ట. ఒకే ఏడాది 11 చిత్రాలు చేసిన ఘనత ఆయనదే. ఆయన వ్రాసిన “ఓ వర్షం కురుసిన రాత్రి” కథకు స్పందించి, ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి స్వయంగా ఆయన యింటికి వెెళ్ళి అభినందించడం విశేషం. వివిధ రంగాల్లో చూపుతున్న ప్రతిభకు నిదర్శనంగా ఆసియా ఖండం విశిష్ట వ్యక్తిగా ఏషియా బుక్‌లో స్థానం పొందడం గమనార్హం.

చిరంజీవి, శోభన్‌బాబు, రాజేంద్ర ప్రసాద్‌, కృష్ణ, సావిత్రి, అంజలి, షావుకారు జానకి, శ్రీదేవి, జయప్రద లాంటి ఎందరో ప్రముఖ నటులతో కలిసి పని చేశారు. దాదాపు 70 చిత్రాలకు రచయిత. రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయ బాపినీడు, దాసరి నారాయణరావు వంటి ప్రముఖ దర్శకుల వద్ద చిత్రాలకు రచయితగా పని చేసిన ఆయన మంచిపేరు తెచ్చు కున్నారు.

పేరు మార్చిన ఉపాధ్యాయులు

విశ్వనాథ్ విశాఖపట్నంలో కోటి అప్పలస్వామి, బుచ్చమ్మ దంపతులకు 1946లో జన్మించారు. ఆయన పూర్తి పేరు చిలుకోటి కాళీ విశ్వేశ్వరరావు. ఆయన పేరును కాశీ విశ్వనాథ్ గా తన పాఠశాల రోజులలో తెలుగు ఉపాధ్యాయులు మార్చారు. ఆయన విశాఖపట్నం లోని ఎ.వి.ఎన్ కళాశాలలో చదివారు. ఆయన ఆంధ్రా విశ్వ విద్యాలయంలో వెయిట్ లిప్టింగ్ విభాగంలో క్రీడలలో, రంగస్థల ప్రదర్శనలలో కూడా పాల్గొన్నారు. అతను ఒక జాతీయ వెయిట్ లిఫ్టర్ మరియు మూడు సార్లు విశ్వవిద్యాలయ ఛాంపియన్షిప్స్ గెలిచారు. ఆయన రాష్ట్రస్థాయి పోటీలకు కూడా వెళ్ళారు. విద్యాభ్యాసం తరువాత ఆయన 1966 లో  విశాఖపట్నం పోర్టు ట్రస్టులో అకౌంటెంట్ గా ఉద్యోగం చేశారు.

ఆయన 1968 లో తన రచనా ప్రస్థానాన్ని , అలాగే సినిమా ప్రస్థానాన్ని “రామాయణంలో పిడకలవేట” సినిమాతో 1980లో ప్రారంభించారు. సుమారు 131 సినిమాలకు స్క్రిప్ట్, సంభాషణలు  వ్రాసారు. సుమారు 120 కథలు, 28 నవలలు, 43 నాటికలు, అనేక సినిమాలకు కథలు వ్రాసారు. 37 సినిమాలలో నటించారు. ఆ కారణంగా సినీ పరిశ్రమలోని అందరు దర్శకులు, నిర్మాతలు నటీ నటులతో ఆయనకు మంచి పరిచయాలు ఉండేవి. ఆయన 52 సినిమాలలో నటించారు.

సాహిత్య అకాడెమీ అవార్డు

 “కళా సాగర్, మానవత్వానికి మరో కోణం, ట్రెండ్ మారింది” వంటి తన నాటకాలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఆయనకు మొత్తం ఏడు నంది అవార్డులు వచ్చాయి. వాటిలో మూడు నందులు సినిమా కథలకు, మూడు నందులు నాటకాలకు, ఒక నంది దర్శకత్వానికి వచ్చాయి. 1980 లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.  తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, ఎన్టీఆర్‌ స్మారక అవార్డు అందుకున్నారు. చిలుకోటి కాశీ విశ్వనాధ్ 2015 డిసెంబరు 22న గుండెపోటుతో మరణించారు.

ఇదీ చదవండి:కథలకొండ ‘ధనికొండ’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles