Tuesday, April 23, 2024

కృష్ణ, గోదావరి నదులపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గజిట్ రద్దు చేయాలి

 కోదండరాం,  రామచంద్రమూర్తి, శ్యాంప్రసాద్ రెడ్డి, రాఘవాచారి డిమాండ్

 షాద్ నగర్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ప్రతిపక్ష, విపక్షాల నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కృష్ణ, గోదావరి నదులకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గజిట్ ను వెంటనే  ఉప సంహరించుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి,  షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు వీర్లపల్లి శంకర్, తదితరులు డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని నక్షత్ర బ్లాంకెట్ హాల్లో తెలంగాణ డేవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ నదీ జలాల సంరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష, విపక్షాల పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా  నదీ జలాలపై తీసుకువచ్చిన గెజిట్ ను వెంటనే, ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో బాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను వెంటనే నిర్మించాలని ఇక్కడి రైతాంగానికి మహబూబ్ నగర్ రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, దక్షిణ తెలంగాణ రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. నది జలాలపై అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని దీన్ని కేంద్ర ప్రభుత్వం గమనించాలని ఈ గజిట్ చెల్లదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏనిమిది సంవత్సరాలు అవుతున్నా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పై   ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ పోన్ ద్వారా తన సందేశాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో వినిపించారు. దక్షిణ ప్రాంతలైనా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ నల్గొండ జిల్లాలో రైతాంగం మొత్తం సాగు త్రాగు నీటి సమస్యతో అల్లాడుతుంటే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి త్రాగునీరు, సాగునీరు అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. ఏడాది కిందట కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక  జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ, ఇక్కడి ప్రాంత  ప్రజా ప్రతినిధులు పాలమూరు, రంగారెడ్డి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ విషయంలో ఎందుకు  ప్రశ్నించడం లేదని అన్నారు. దీనివల్ల దక్షిణ ప్రాంత రైతాంగానికి త్రాగు, సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ గోనారెడ్డి, అంజనా రెడ్డి తదితరులు ఏర్పాట్లు చేశారు. టీడీఎఫ్ వ్యవస్థాపకుడు గాదె గోపాల్ రెడ్డి కాలిఫోర్నియా నుంచి ఫోన్ ద్వారా తన సందేశం వినిపించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి, అధ్యక్షులు దామోదర్ రెడ్డి, లక్ష్మి నారాయణ , చైర్మన్ వెంకటేశం చంద్రమౌళి, రమణ నాయక్, ఇంద్రసేనారెడ్డి, తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలియజేశారు  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి,  సిపిఎం పార్టీ నాయకులు రాజు, వైఎస్ఆర్ టిపి  నాయకులు ఇబ్రహీం, బుస జంగయ్య, బీఎస్పీ పార్టీ షాద్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డి శ్రీనివాస్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు టీజీ శ్రీనివాస్, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీంద్రనాథ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు నాగభూషన్, అర్జునప్ప,  నర్సింలు, పౌర స్పందన వేదిక నాయకులు జనార్ధన్, తుప్పుడు నర్సయ్య, టిఎల్ఎఫ్ కరుణాకర్, జైపాల్ రెడ్డి, సీఐటీయూ నాయకులు ఈశ్వర్ నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, ఏఐఏస్ఎఫ్ నాయకులు పవన్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles