Thursday, March 28, 2024

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పది ప్రశ్నలు

  1. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న మీరు కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆ లేఖను అడ్డు పెట్టుకునే ధాన్యం సేకరణ పై మెలిక పెడుతున్న విషయం నిజం కాదా? తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం మీకు ఎవరిచ్చారు?మీరే లేఖ ఇచ్చి ఇప్పుడు మీరే ధర్నాలు … నిరసనలు అని డ్రామాలు ఆడితే రైతులు మీ రెండు పార్టీల మోసాన్ని గ్రహించలేరని అనుకుంటున్నారా?
  • ధాన్యం కొనుగోళ్ల విషయంలో మీ చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 7,500 కోట్ల నష్టం వచ్చిందని, క్రయవిక్రయాలు ప్రభుత్వం బాధ్యత ఎంత మాత్రం కాదని, ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండబోవని 2021 ఫిబ్రవరిలో మీరు ప్రకటన చేసింది వాస్తవం కాదా? ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుండి తప్పుకునే కుతంత్రానికి మీరు ఆ నాడే బీజం వేశారనడానికి ఇది నిదర్శనం కాదా?
  • యాసంగి సీజన్ సన్నాహాలపై ఫిబ్రవరి 25, మార్చి 8న కేంద్ర ఆహార శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ సారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు అని మీ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పిన మాట వాస్తవం కాదా? FCI యాసంగి ప్రణాళికలో తెలంగాణకు చోటు దక్కకపోవడానికి ఇది కారణం కాదా?
  • యాసంగి ధాన్యం సేకరణ సన్నాహకాలు సహజంగా మార్చి మొదటి వారంలోనే ప్రారంభించాలి కదా! నిజంగా ధాన్యం కొనుగోలు పై మీకు చిత్తశుద్ధి ఉంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గోనె సంచులకు టెండర్లు, రైస్ మిల్లర్లకు కోటా కేటాయింపు, ట్రాన్స్ పోర్టేషన్ టెండర్లు తదితర ప్రక్రియను ఇంత వరకు ఎందుకు పూర్తి చేయలేదు?
  •  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బ్లేమ్ గేమ్ తో ఇప్పటికే రైతులు దళారీల చేతుల్లో నష్టపోతున్న విషయం నిజం కాదా? కనీస మద్ధతు ధర రూ.1960 ఉండగా… మీరు చేతులెత్తేయడంతో రైతులు నిస్సహాయ స్థితిలో రైస్ మిల్లర్ల కు రూ.1200 -1400 లకే ధాన్యం తెగనమ్ముకుంటున్న మాట వాస్తవం కాదా? దీని వల్ల తెలంగాణ రైతాంగానికి సుమారు రూ.3000 కోట్ల మేర నష్టం వస్తుందన్న విషయం మీకు తెలియదా?
  • రైస్ మిల్లర్లతో టీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై రైతుల కష్టాన్ని అగ్గువకే దోచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్ల మాఫియాతో మీ కుటుంబ సభ్యులే ఒప్పందాలు చేసుకుని రైతులను నిండా ముంచుతున్నారన్న ఆరోపణలకు మీ సమాధానం ఏమిటి?
  • డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్ సిస్టమ్ లో తెలంగాణ కూడా భాగస్వామిగా ఉంది. అంటే… ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొని ఎఫ్ సీఐకి సరఫరా చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీ బాధ్యతను నెరవేర్చకుండా ఢిల్లీలో అతి కొద్ది గంటల నిరసన దీక్షల పేరుతో, అది పార్లమెంట్ సమావేశాలు ముగిసి ఎక్కడి వారు అక్కడకు వెళ్లిపోయాక డ్రామాలు చేయడం మీకు రాజకీయ ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప… రైతు ధాన్యం కొనుగోలుకు పరిష్కారం ఎలా దొరుకుతుంది?
  • మీ దిక్కుమాలిన ఈగోలతో రైతులనే కాదు… రాష్ట్రంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది వాస్తవం కాదా? సివిల్ సప్లై కార్పొరేషన్ సేకరించిన ధాన్యానికి ఎఫ్ సీఐ 2.5 శాతం కమీషన్ చెల్లిస్తోంది. గత ఏడాది యాసంగి సీజన్ లో సివిల్ సప్లై కార్పొరేషన్ రూ.17,914 కోట్ల విలువైన 92 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా దానికి కమీషన్ గా రూ.447 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు ఖర్చులన్నీ ఈ ఆదాయం నుంచే చెల్లిస్తున్నారు. కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా ఇవ్వడం లేదు. ఇప్పుడు ధాన్యం సేకరణ లేకపోతే కార్పొరేషన్ మనుగడే ప్రశ్నార్థకం కాదా?
  • క్వింటాల్ ధాన్యానికి సాధారణంగా ఎఫ్సీఐకి 67 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 25 శాతం నూకలను ఎప్సీఐ ఆమోదిస్తోంది. అంటే, రైస్ మిల్లర్లు 51 కిలోల హెడ్ రైస్, 16 కిలోల నూకలతో కలిపి 67 కిలోలు సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి డెలివరీ ఇస్తున్నారు. యాసంగిలో బాయిల్డ్ చేయకుండా నేరుగా ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16 కిలోలకు బదులు 34 కిలోల నూక వస్తుంది. అంటే, ఎఫ్సీఐ ఆమోదించిన దానికంటే 18 కిలోలు అదనంగా వస్తుందన్న మాట. బియ్యంతో పోల్చితే నూకలకు సగం ధర మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎఫ్సీఐకి 67 కిలోలకు బదులు 58 కిలోలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మిగతా తొమ్మది కిలోల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. దీని విలువ తిప్పి కొట్టినా రూ.1500 కోట్లకు మించి కాదు. ప్రపంచ మేథావిగా మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు కదా! ఈ మాత్రం లాజిక్ మీకు ఎందుకు అర్థం కావడం లేదు? రైతుల కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేయడం మీకు ఇష్టం లేదా? పైగా వాళ్లను మిల్లర్ల చేతుల్లో పెట్టి రూ.3000 కోట్లు నష్టపోయేలా చేయడం మీ పాలనా దక్షతకు నిదర్శనంగా భావించాలా?
  1. యాసంగి సీజన్ లో కూడా ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం రా రైస్ కిందకే వస్తుంది. మొదట్లో ఉష్ణోగ్రతలు అంతగా పెరగవు కనుక ఇది బాయిల్డ్ రైస్ కాదు. ఇలా ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం సుమారు 10 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఇలా రా రైస్ గా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి మీరు ఏర్పాట్లు చేయలేదంటే… రైతులను నిండా ముంచాలన్న దురుద్ధేశం తప్ప… ఇంకేం అనుకోవాలి?

కూలర్లు, ఏసీల పెట్టుకోని  నిరసనా?

ఢీల్లీలో టిఆర్ఎస్, కేసీఆర్ చేసిన  ధర్నపై రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వార విమర్శలు చేశారు. కల్లాల్లో రైతులు ఎండకు ఎండి,గుండె పగిలి చస్తుంటే, కేసీఆర్ ఢిల్లీలో కూలర్లు, ఏసీల మధ్య నిరసన పేరుతో సేద తీరుతున్నాడని అరోపించారు.

డ్రామాలు కట్టి పెట్టి గ్రామాలకు రావాలి. 48 గంటల్లో ధాన్యం సేకరణ మొదలు పెట్టకుంటే ఢిల్లీ నుంచి శంకరగిరిమాన్యాలకే వెళ్లాల్సి ఉంటుందని ట్విట్ చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles