Wednesday, April 24, 2024

భావోద్యమాల లక్ష్యం దూషణ కారాదు!

  అభ్యుదయం ఆచరణాత్మకం కావాలి! 

(ప్రశ్నించడం గుత్తసొత్తు కాదు, సమిష్టి హక్కు)

మొన్ననో హేతువాద సమావేశం జరిగింది. అక్కడికి వచ్చిన ఒక కొత్తాయన మాట్లాడుతూ “హేతువాదులైన మీలోనే ఇన్ని అభిప్రాయ భేదాలు, చీలికలపీలికలు ఉన్నాయి కదా. మరి సమాజంలో ఎందుకు ఉండవు? అలానే మేం నమ్మే మతాల్లో ఎందుకు ఉండవు? ఆ విభిన్నతని అర్ధం చేసుకునేలాగా ఉద్యమాలు ఉండాలే కాని కించపరిచేలా కాదు కదా? అని అడిగాడు. నేనేదో చెప్పే యత్నం చేసాను కానీ అది నాకే తృప్తినివ్వలేదు. అడిగిన వ్యక్తి జిజ్ఞాసని గౌరవించడం కనీస మానవ సంస్కారం. అదింకా ఈ దేశంలోని మేధావులకు రాలేదనడానికి ఆనాటి హేతువాద మానవ వాదుల ప్రవర్తన ఒక తార్కాణం. మరో క్రైస్తవ మిత్రుడు ‘ప్రియ సోదరులారా’ అని సంభోదిస్తూ ఏదో తనకి తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేసిన కొద్ది నిమిషాల్లోనే ఇంతటి హేతువాదుల్లోనూ ఎక్కడలేని అసహనం స్పష్టంగా కనబడింది. అంటే మనం సరైనది అని భావించిన వాదాన్ని వినిపించడంలో ఉన్న శ్రద్ద, ఆసక్తి ఎదుటివారు చెప్పేదాన్ని వినడంలో కనీసం కూడా లేదన్నమాట. మేము సర్వజ్ఞులం అనే వైఖరి మతానికి ఎంతుందో మానవ వాదులమని అనుకునే వారికి కూడా అంతే ఉందనిపించింది. వ్యవస్థీకృత మతాల్నీ, వ్యవస్థ లోని లోపాల్ని ప్రశ్నించాలంటూ చెప్పే పెద్దలు తమదాకా వచ్చేసరికి లోపాల్ని గుర్తించడం మాటటుంచీ, తామంతా ప్రశ్నకు అతీతుల మనే ధోరణిలో కొట్టుమిట్టాడు తున్నారు. సగటు వ్యక్తి ప్రశ్నని, విమర్శని తట్టుకునే స్వభావం కూడా భావోద్యమకారుల్లో కొరవడిందన్నమాట !

Also read: జ్ఞాపకం గతం కాదు, ఆగతం!

సమయం, సందర్భం లేకుండా కనీసం ఇంగితం చూపకుండా మేధస్సు ప్రదర్శించుకోవడమే పనిగా పెట్టుకున్న వ్యక్తుల మైకుపాట్లు మొత్తంగా వచ్చిన ఒకరిద్దరు కొత్త వ్యక్తులకు హేతువాదం అంటే ఇంతే కాబోలుననే అభిప్రాయం కలిగించాయి. ఈ దేశంలో వామపక్షాలు ఆర్ధికత దగ్గరే ఆగిపోతే, హేతువాదం దేవుడి దగ్గర ఆగిపోయింది. సాటివ్యక్తి భావాల్లో మార్పు కోసం పని చేసే ఉద్యమం ఎంత ఓర్పుగా ఉండాలో, ఎంత హుందాగా వ్యవహరిం చాలో, ఎంతటి  నిబద్దతతో మెలగాలో అంబేద్కర్ రాజ్యాంగంలో పొందు పరిచిన వైజ్ఞానిక స్పూర్తిలో కనిపిస్తుంది. ఆ రకమైన వికసిత చర్చకు దోహదం చేస్తూ, మహత్తరమైన దార్శనిక ఆకాంక్షకు మానసిక, ఆచరణాత్మక దిక్సూచిగా మెలగాల్సిన భావోద్యమాలు, మానవజీవన స్రవంతిని సుసంపన్నం చేసే మహోద్య మాలుగా కాక, కేవలం మత గ్రంథాల్లోని తప్పుల్నీ, మంత్రాల్లో బూతుల్ని మాత్రమే గంటల కొద్దీ ఏకరువు పెట్టే అశ్లీల వెకిలి చేష్టలకే పరిమితం కావడం బాధాకరం. నా సంగతి వదిలేయండి, శ్రోతల్లో వయసు మీద పడిన పెద్దలూ, అనుభవ జ్ఞులూ, మధుమేహం ప్రభావం తో టైమ్ కి తినాల్సిన వాళ్ళూ ఉండగా, వారి ముందు అత్యంత హేయంగా, దారుణంగా పైపైకి ఏ మొహం పెట్టుకున్నా లోపల ఛీ అంటారనే సిగ్గు కూడా లేకుండా ఉన్నదంతా వెళ్ళబోసుకుందామనుకునే నేతల మానసిక దరిద్రాన్ని చూసి పాపం వచ్చిన వృద్దులు కూడా విస్తుపోయి, నా దగ్గర గోడు చెప్పుకున్నారు!

Also read: కరపత్రాల ఊసులు – కార్యాచరణ బాసలు

ఇదేదో ఆలోచనోద్యమాల్ని కించ పర్చడానికి చెప్తున్నది కాదు. ఈ దేశంలో చార్వాక లోకాయతాల నుండి బౌద్ధ జైనాది శ్రమణక మతాల వరకూ ఒక ప్రత్యామ్నాయ తాత్విక చింతన కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగిందంటే, ఆనాడు పౌరసమాజంలో వారు కలిగించిన సాంస్కృతిక సౌభ్రాతృత్వం ఎంత విశిష్టమైనదో గ్రహించాల్సి ఉంది. సంఘంలోని భిన్న స్వరాల అభివ్యక్తినీ,  సమాజంలోని ఇతరేతర సమూహాల ఉనికినీ కనీసం గౌరవించకుండా, మతస్తులు అందరి పట్లా చులకన భావం కలిగి, వాళ్ళ నమ్మకాల్ని, విశ్వాసాల్ని అదేపనిగా కించపరుస్తూ, దానినే భావోద్యమం అనుకునే భ్రమ ప్రమాదకరం. ఆలోచన రేకెత్తించేందుకు పనిజేసే ఉద్యమాలకి అసహనం విషం వంటిది. విశ్వంలో, కాలంలో మనిషి సాధించిన శాస్త్రవిజ్ఞాన సాధికారత పట్ల ఒక సుస్థిరమైన దృక్కోణాన్ని వ్యవస్థలో కల్పించడమే మానవీయ వైజ్ఞానిక సైన్సు ఉద్యమాల కనీస కర్తవ్యం. అందుకోసం ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసేలా పనిచేయాలే కాని మనమంటే రోత, అసహ్యం పుట్టి మరింత దూరమయ్యేలా మన పని విధానం ఉండకూడదేమోననే అభిప్రాయమే ఇది. మతగ్రంథాల్లో ఉన్న అసంగతాల్ని, అసంబద్ద విషయాల్ని వివరించడానికి వాడే మన భాష కూడా మళ్ళీ అంతే అస్తవ్యస్తంగా, అపసవ్యంగా ఉంటే ఇక యధాతధ స్థితిని కోరే మతవాదులకీ, మార్పును ఆశించే మానవ వాదులకీ తేడా ఏంటి? భావోద్యమాలది మనుషుల్ని awake (మేల్కొలిపే) చేసే కార్యక్రమమే కావాలి కానీ provoke (రెచ్చగొట్టే) చేసేది కాకూడదు!

Also read: ఏకవ్యక్తి సైన్యం: మేకా సత్యనారాయణశాస్త్రి

మతోన్మాదం, రాజకీయ దిగజారుడుతనం, పురుషాధిక్యత, కులతత్వం పేట్రేగిపోతున్న తరుణంలో పౌర సమాజం విచక్షణకి వివేకవంతమైన ఊతమిచ్చేలా ఉద్యమాలు నిర్మితమవ్వాలే కాని ఆధిపత్యంతో అంట కాగేలా కాదు. స్త్రీలు, పిల్లలు, భిన్న లైంగిక మైనారిటీలు, దళిత బహుజనులు, ఆదివాసీ సమూహాల పట్ల అత్యంత చులకన భావం కలిగి, కనీసం మనం మాట్లాడే పదజాలాన్ని కూడా ప్రజాతంత్ర స్వభావంతో మల్చుకోవడంలో విఫలమైతే, ఇక నాలుగ్గోడల మధ్యా మైకు పట్టుకుని ఎంత పూనకాలు తెచ్చుకున్నప్పటికీ, అంతిమంగా జరగాల్సిన ప్రక్రియ, చేయాల్సిన చేర్పు, రావాల్సిన మార్పూ సమాజంలో అనే జ్ఞానం మనకుండటం అవసరం. రూపం, సారం లేని వాగ్ధాటి, నియమం, నిబద్దత తెలీని రచనా వ్యాసంగాలతో ఎన్ని ఉపన్యాసాలు , పుస్తకా లైనా బయటకి తెచ్చుకుని కార్యక్రమాలు పెట్టుకోవచ్చుగానీ జ్ఞానమనేది ఆచరణ ద్వారానే వ్యవస్థలో ప్రామాణీకరణ చెందు తుందనే విషయం తెలీపోతే ఈ తతంగాలన్నీ నేలవిడిచిన సాముగానే మిగిలి పోతాయనేది ఈనాటి అభ్యుదయ సంఘాలని చూస్తే తెలిసే వాస్తవం !

కొన్ని తరాల్ని గొప్పగా ప్రభావితం చేసిన అభ్యుదయ భావాలు తదనంతరం తర్వాత తరాలకి అందకపోవడానికి వాటిలోని వ్యక్తి వాదమే ప్రధాన కారణం. ఏనాటి కాలంలో‌నైనా ఆలోచనాపరులు పాటించిన విలువల ఆధారంగా చేసుకొని ఆయా కాలమాన పరిస్థితుల రీత్యా యువత ముందు కొస్తారేకాని కర్ణకఠోరమైన వ్యర్ధ ప్రసంగాలవలనో, కాలక్షేపం కోసం అచ్చేసుకునే పుస్తకాల వలనో మాత్రం కాదు. అలాగే మనుషుల్ని మార్చాలంటే ముందు వారిని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి, తోటి మనిషిగా వార్ని ప్రేమించాలి. పరస్పర ఔద్వేగిక అనుబంధం ఏర్పడాలి. ఒక మానవీయ స్పర్శలో మనల్ని మనం మమేకం చేసుకోవాలి. సాటిమనిషి భావాల పట్ల గౌరవ భావన ఏర్పర్చుకోవాలి. అవసరమైతే, మన భావాల్లోని లోపాల్ని ఒప్పుకుని వాట్ని మార్చుకోడానికి సిద్దపడాలి. అదే మనిషి మహోన్నత మానవుడిగా ఎదగడానికి తోడ్పడే చైతన్యం. అటువంటి చైతన్య వంతమైన వ్యక్తే పరిస్థితుల్ని మార్చగ లడని మార్క్స్ బలంగా సూత్రీకరించాడు. మార్క్సిజాన్ని ఒప్పుకున్నా, లేకపోయినా ఆ చైతన్య స్పృహ ఈరోజు మనకి అవసరమని గుర్తించడం భావోద్యమాల ప్రధాన కర్తవ్యం!

Also read: తత్వ విచారణ – తర్క వివేచన

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని అంటారు. మానవ సంబంధాల పై ఏమాత్రం చింత లేకుండా, కనీసం సమకాలీనంగా జరుగుతున్న ప్రత్యామ్నాయ మానవవాద ప్రయత్నాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకుండా,  మనం చదూకున్న కొద్దిపాటి పుస్తకాలు, విన్న అరకొర ప్రసంగాలు, పాల్గొన్న అడపాదడపా సభలతోనే మనం సర్వజ్ఞత పొందామనుకునే భ్రాంతి, నూతిలోని కప్ప జ్ఞానం కంటే ఎక్కువేమీ కాదు. తిట్ల తీవ్రత మన బలహీనతకి ప్రమాణమౌతుందే కానీ బలానికి కాదు. ఈ దేశంలో అసమానతలు, అహంభావాలు, కులగజ్జి, మతోన్మాదం, విధ్వంసక అభివృద్ధి, పురుషా ధిక్యత, ఫ్యూడల్ భూస్వామ్య భావనల్ని వ్యతిరేకించకుండా, నిత్యజీవితంలో సమానత్వాన్ని ప్రవర్తనా రీతిగా పాటించ కుండా భధ్రజీవులుగా సుఖవంతమైన జీవనవి ధానాన్ని అవలంబిస్తూ గుర్తుకొచ్చి నప్పుడు జనాలు మారడం లేదంటూనో, యువత మా వెనక రావడం లేదంటూనో ఒగర్చడం మన అసహనానికి ప్రతీకౌతుందే కాని, ఆరోగ్యకర సంవాదానికి సంకేతం కాదు. అభ్యుదయం అంటే అర్థవంతమైన మార్గమే కాని కప్పదాటుతనం కాదు !

ఏ భావోద్యమమైనా సరే, తప్పుల్ని నేతల్లో పెట్టుకుని ప్రజల్ని తిట్టడం భావ్యం కాదు. ప్రపంచ కార్మికులార ఏకం కండి అంటూ పిలుపిచ్చే ప్రజా సంఘాల్లో, వామపక్ష పార్టీల్లో ఏ రెండు గ్రూపులు ఏకం కావడానికి సిద్ధంగా లేవు. అలాగే, మనుషుల మధ్య ఐక్యత,  సమైక్యత పేరుతో ఉపన్యాసాలు ఇచ్చే అభ్యుదయ సంఘాల్లోనే అంతులేనన్ని చీలికల పీలికలు న్నాయి. ఇవన్నీ వ్యక్తుల అహంభావాల కారణంగా విడిపోయినవేకానీ సిద్ధాంత విభేదాల వల్ల కాదు. కాబట్టి, ముందు మన ఐక్యత కోసం రచనాత్మక దృష్టి పెట్టాల్సింది పోయి సమాజం అంతట్నీ అస్తిత్వం కాపాడు కోవడం కోసం తిడుతూ కూర్చోడం న్యాయం కాదు. ఈరోజు ప్రపంచంలో అనేక కొత్త రూపాల్లో శాఖోపశాఖలుగా విస్తరించిన పెట్టుబడిదారీ విధానాన్ని, దేశంలో వైరస్ లా వ్యాపిస్తున్న మతోన్మాదాన్ని ఎదుర్కోవడమే అభ్యుదయ శక్తుల ఐక్యతా నినాదం కావాలి!

Also read: మానవాళి వికాసమే విజ్ఞాన మార్గం…రేవతి సైన్స్ ఫౌండేషన్‌ పురస్కారం

అంతిమంగా మానవవాద మార్గం అదేదైనా సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేయనంత కాలం  కొద్ది మంది పొంతనలేని మేధావుల సిద్ధాంతంగానే మిగిలి పోతుంది. అభ్యుదయ ప్రజా ఉద్యమ స్రవంతులు ఈ విషయం గ్రహిస్తే ఈ రోజు దేశం ఉన్న పరిస్థితుల్లో ఐక్య కార్యాచరణ ఎంత ముఖ్యమో అర్దమౌతుంది. మనుషుల్ని దూరం చేసుకునే మేధస్సు, అదెంతటి గొప్పదయినా చరిత్రలో ఒంటరిగా మిగిలి పోతుంది. ఈనాటి భావోద్య మాల పరిస్థితి అదే. సమాజం లో నెలకొన్న సాంస్కృతిక శూన్యాన్ని భర్తీ చేసే యోచన లోనే సామా న్యుడు మత క్రతువులు లేదా మద్యం, సినిమా తదితర వినోదాలని ఆశ్రయిస్తాడు. బడుగు జీవుల బతుకులకవి వోదార్పు గొడుగు పడతాయి. అలాంటి బాధిత ప్రజానీకాన్ని లౌకిక సాంస్కృతిక వేదికల వైపు మళ్ళించేలా మన కార్యాచరణ ఉండాలేగానీ, సాధారణ జనాలతో శత్రు పూరిత వైఖరి కలిగేలాకాదు. అభ్యుదయం అంటే వీలైనంత వోర్పుతో అర్ధవం తమైన పనిని మౌనంగా చేసుకుపోడమే కానీ, మనకు తెల్సిందే నిజమని ఎదుటివారి మీద అరిచి దబాయించి ఒప్పించడం కాదు. గొంతు చించుకున్నంతలో ఎదుటి వారికి తల బొప్పి కడుతుం దేమోకానీ వారి తలంపు మారదు. అందుకే, అభ్యుద యం ఆచరణాత్మక వైఖరిని అవలంబించినప్పుడే అర్దవంత మౌతుంది !

(అసలు సంగతంతా వదిలేసి ఎవరికోసం రాసావంటూ గింజుకుంటే నేను కూడా చేసేదేం లేదుగానీ, యువతరానికి మార్గదర్శకంగా ఉండాల్సిన భావోద్యమాలు మరింత బలోపేతం కావాలనే కాంక్షే నా బాధకి కారణం. అందుకే, అన్యధా భావించినా, ఎప్పటిలానే నన్ను తప్పుగా అర్ధం చేసుకుని ద్వేషపూరిత ప్రచారాలు చేసినా ఫర్వలేదు కానీ, మొత్తంగా ఆలోచనోద్యమాల తీరు పై వ్యధ చెంది వేదనతో ఆవేదనకు ఇచ్చిన అక్షర రూపమే, రేపటి తరాల తరపున ఈ మిత్రపూరిత మెమొరెండం లాంటి రైటప్.)

Also read: రావిపూడి వెంకటాద్రి

– గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

1 COMMENT

  1. గౌరవ్ గారు!
    మంచి పరిశీలన మరియు మంచి సూచన కూడా. చిత్తశుద్ధితో మానవ వికాసానికి సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన/గమనించ తగిన విషయం.

    ఓర్పూ నేర్పుతో సంయమనం పాటిస్తూ, దీర్ఘకాలిక ప్రణాళికా లక్ష్యాలతో, ఒక ప్రజాస్వామిక వాతావరణంలో జరగాల్సిన ఉద్యమాలను మనందరం ఆహ్వానించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles