Friday, April 19, 2024

నడుస్తున్న కథ

‘‘ఏమండీ, రాత్రి మామయ్యగారు ఫోన్ చేశారు మీరెప్పుడొస్తారని. మీరేమో నా సెల్ నంబరు ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబరివ్వవచ్చు కదా!’’

ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్లో తల దూర్చిన భర్తతో ‘‘ఏంటండీ, ఏం మాట్లాడరు… ఏమాలోచించారు వాళ్ళ విషయం? ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్చేస్తూనే ఉంటారు. వూరికే నాన్చక ఏదో ఒకటి తేల్చండి’’ అంది.

ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేరయి ఉంది తను. పేపర్ను నుంచి తల పైకెత్తి ‘‘ఇందులో తేల్చేదేముందోయ్. అమ్మా నాన్నా ‘ఇక ఆ పల్లెటూళ్ళొఒంటరిగా ఉండలేం, ఇక్కడకు వచ్చేస్తా’మంటున్నారు.  అంతేకదా! పెద్ద వయసయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటీ’’ అన్నాడు.

అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు ‘‘ఏంటీ, తాతయ్య, నానమ్మ ఇక్కడకే వచ్చేస్తున్నారా, భలేభలే! తాతయ్య కథలు చాలా బాగా చెపుతాడు. నానమ్మయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది.ఇంక రోజూ మేం తాతయ్యా నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ’’ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనికి. ‘‘చాల్లే నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం’’ అని భర్త వైపు తిరిగి, ‘‘ఏంటండీ రానిచ్చేది… ఇక్కడ మనమెలా ఉంటున్నాం… మీ అమ్మా నాన్నా ఎలా ఉంటారు? ఆ పల్లెటూరి మాటలూ, చేతలూ ఎలా ఉంటాయో మీకు తెలుసుగా! మనింటికి పెద్దపెద్ద వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు. పోయినసారి మనింట్లో ఫంక్షన్ కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజరుగారి భార్య ఏమందో తెలుసా… ‘ఈవిడ మీ అత్తగారా! నేను మీ వంటమనిషనుకున్నాను’ అంది. నాకు తల కొట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళొనే ఉండమనండి. కావాల్సినంతమంది పనివాళ్ళని పెడదాం. లేదూ ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్ హోంలోనైనా చేర్పించండి. డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా. అంతేకానీ, ఇక్కడకు మాత్రం  తీసుకొస్తానని అనకండి’’ అంది.

ఆమె మాటలు పూర్తి అయ్యీ కాకముందే ‘‘ఇక ఆపుతావా నీ గోల. ఏంటీ, మాట్లాడితే మా అమ్మానాన్నలను పల్లెటూరివాళ్ళంటావు. అలాగైతే నేనూ పల్లెటూరివాణ్ణేగా,  నువ్వు మాత్రం పల్లెటూరిదానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వూ మీ అన్నా అక్కడ చదువు వెలగబెట్టారు. మీ అమ్మానాన్నా పల్లెటూరివాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళుమాత్రం ఎలా ఉన్నారు? మీ అన్నయ్యకు ఉద్యోగమొచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్ళటంతో కొంచెం సిటీలైఫ్ వాళ్ళకి అలవాటైంది.  నేనే ఇన్ని రోజులూ అశ్రద్ధ చేశాను. మావాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది. మా అమ్మేదో మొహమాటానికి ‘ఇప్పుడే మీ దగ్గరకెందుకులేరా! రేపు చేసుకోగలిగే ఓపిక లేనిరోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలిగా’ అన్నదని, ‘ఔను అత్తయ్యగారూ, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు- తొందరేముందీ!  పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు, ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్ళలో ఉండలేరు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా! మన సొంతిల్లయితే ఏ సమస్యా ఉండదు’ అంటూ వాళ్ళని రానీకుండా అడ్డుపుల్ల వేశావు. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా!, అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు. నువ్వేదో వాళ్ళకి బండచాకిరి చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు.  పైగా ఓల్డేజ్‌హోమ్‌లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా? నేను వాళ్ళ కన్నకొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా. రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందువుగానీలే ఓల్డేజ్‌హోమ్‌లో’’ అంటూ లేచి వెళ్ళి షర్ట్‌ వేసుకుని బయటికెళ్ళిపోయాడు కోపంగా.

భర్త తన మాట కాదనటంతో ఏం చేయాలో అర్థంకాలేదామెకి. ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయటంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు. అత్తగారూ, మామగారూ మంచివాళ్ళే కానీ, కలిసుంటే తప్పక తేడాలొస్తాయనీ తగవులౌతాయనీ భయం. తన క్లోజ్‌ఫ్రెండ్  సుభద్ర అలా జరిగే గొడవలు తీవ్రమై  ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ  భయమింకా బలపడింది. చివరికి పల్లెటూరివాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళను రాకుండా చేద్దామన్నా కుదరలేదు. పైగా భర్తకి కూడా అమ్మానాన్నలంటే ఒకింత ప్రేమ ఎక్కువే. కొడుకు ఇల్లు కట్టేటప్పుడూ ఇతరత్రా అవసరాలపుడూ అతను అడగకుండానే డబ్బులూ, బంగారం అంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడూ వచ్చి నాల్రోజులుండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. తెల్లారిపొద్దున లేచి తయారవుతున్న భర్తను ‘ఎక్కడికి’ అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ‘ఆయనే చెపుతార్లే’ అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది.

కాఫీ అందుకుని ‘‘రజనీ, నేను వీరాపురం వెళ్తున్నాను. పొలం కౌలు, ఇంటి గురించీ మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మానాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను’’ అంటూ, ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరకెళ్ళిపోయాడు.

ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది. కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది. వెంటనే సెల్‌ తీసుకుని అన్నకు ఫోన్‌ చేసింది. ఆమె అన్న వినోద్‌ నాలుగైదు సిటీలలో జాబ్‌ చేసి, చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు. వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజినీర్‌గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్‌ చేశాడు  కానీ వెళ్ళటానికి  కుదరలేదు.  అమ్మానాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్‌లో వెళ్ళాలని అనుకుంటోంది. ఫోన్‌ రింగ్‌ మొత్తం అయిపోయింది- వినోద్‌ ఫోన్‌ తీయలేదు. అమ్మావాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్‌ లేదు. అన్నయ్య ఫోన్‌లోనుండే మాట్లాడతారు. ‘ఒక ఫోన్‌ తీసుకోవచ్చు కదమ్మా’అంటే, ‘అదంతా మాకు తెలియదమ్మా. ఇక్కడ అంతా హిందీ కదా… అన్నయ్య ఉన్నాడుగా’ అంటుంది. ఇంతలో ఫోన్‌ మోగింది. చూస్తే అన్నయ్యే! ఫోనెత్తగానే ‘‘రజనీ, నేను వేరేచోట మీటింగ్‌లో ఉన్నారా. సాయంత్రం నేనే ఫోన్‌ చేస్తాను. ఉంటాను’’ అంటూ హడావుడిగా పెట్టేశాడు. ‘అయ్యో, అన్నయ్యతో మాట్లాడటానికి కూడా కుదరలేదే’ అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూలుకి తయారుచేయటానికి లేచింది. సాయంత్రమయింది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక, వాళ్ళకి స్నాక్స్‌ పెట్టి, పాలు ఇచ్చి, టీవీ దగ్గర కూర్చుంది. రాత్రి ఎనిమిది గంటలైంది. మాధవవాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగు తీసుకుని ‘‘బాగున్నారా అత్తయ్యగారూ, ఆరోగ్యం బాగుందా మామయ్యగారూ’’ అంది రజని- తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా.

పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘తాతయ్యా, నానమ్మా’’ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు.

అమ్మా నాన్నా వచ్చినపుడు భార్య ‘ఏ మూడ్‌లో, ఎలా ఉంటుందో’ అని భయపడుతున్న మాధవ  తేలికగా  వూపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు.

అత్తమామలకు వాళ్ళ రూమ్‌ చూపించి బాత్‌రూమ్‌లో గీజర్‌ ఆన్‌ చేసింది. ‘అత్తయ్యగారూ, మీరూ, మామయ్యగారూ స్నానం చేసి రండి. ఈలోపు నేను భోజనాలు రెడీ చెస్తాను’ అంది.

అలాగేనమ్మా. మేము వస్తాములే, నువ్వెళ్ళి పనిచూసుకో’’ అంది మాధవ తల్లి సీతమ్మ.

అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి, పడుకునేసరికి పదకొండయింది.

తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్‌బెల్‌ అదే పనిగా మోగుతోంది.

‘ఈ టైములో ఎవరై ఉంటారబ్బా’ అనుకుంటూ నిద్రకళ్ళతో వచ్చి తలుపు తీసింది.

ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది.

ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా ‘‘బాగున్నారా మామయ్యగారూ, అత్తయ్యగారూ’’ అంటూ వారిని పలకరించి,‘‘ముందు లోపలికి రండి, చలిగా ఉంది’’ అని, ‘‘ఏంటలాగే నిలబడిపోయావు రజనీ, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకీ నాన్నగారికీ కాఫీ కలిపి తీసుకురా’’ అన్నాడు.

‘‘రా అమ్మా, రండి నాన్నా’’ అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కనపెట్టి, తలుపులు మూసి కిచెన్‌లోకి వెళ్ళింది.

పెందలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్‌బెల్‌ మోతకి లేచి హాల్లోకి వచ్చారు.

అందరి పలకరింపులయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది.

‘వీళ్ళేంటి ఇంత సడెన్ గా వచ్చారు. మా అమ్మా నాన్నా విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి

రజనీనే ఫోన్‌చేసి పిలిపించి ఉంటుందా?’-  అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ.

కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది.

మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారతనికి.

ఇదివరకున్న సంతోషం, కళా, కాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించటంలేదు. అతనికన్నా ముందుగానే, తల్లిదండ్రులను చూసిన మరునిమిషంలోనే వాళ్ళ ముఖాల్లోని తేడాని గమనించేసింది రజని.

ఎంతైనా కూతురు గదా!

‘‘వదినగారూ, అంత దూరంనుండి మీరిద్దరే వచ్చారా!’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.

‘‘లేదొదినగారూ, మాతో వినోద్ వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట. వెళ్తున్నానన్నాడు. ‘మేమూ వస్తాంరా, అమ్మాయి దగ్గరికి’ అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి, వాడు ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళాడు’’ అంది.

‘‘అన్నయ్య వచ్చాడా… అయితే ఇక్కడకి రాడటనా?’’ కోపంగా అంది రజని.

‘‘లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆరోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురమూ’’ అంది రజని తల్లి సావిత్రమ్మ.

‘‘అదేంటమ్మా, అంత దూరం నుండి వచ్చి ఒక్క పదిరోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరెప్పుడో వస్తారు. అదేం కుదరదు, అన్నయ్య రానీ నేనడుగుతాను’’ అంది.

‘‘వద్దమ్మా, అడగొద్దు. అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళమూ మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా… అందుకని వెళతాంలే’’ అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రజనికి.

మాధవ, పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది.

అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి, కాసేపు మాట్లాడి వచ్చేసింది.

ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడూ తరవాత కూడా వాళ్ళ నలుగురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకూ కుదరలేదు.

రాత్రి భోజనాలయిన తరవాత మాధవ, పిల్లలు అత్తమామల గదిలోకెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకెళ్ళింది. తల్లి ఒక్కతే ఉంది.

‘‘నాన్న ఏరమ్మా?’’ అంది.

‘‘మీ అత్తయ్యగారి గదిలోకెళ్ళారమ్మా. అబ్బాయీ పిల్లలూ కూడా అక్కడే ఉన్నారుగా- మాట్లాడుతున్నారు.’’

సరే, నాన్న లేకపోయినా ఫరవాలేదులే అనుకుని ‘‘అమ్మా, నువ్వూ నాన్నా అలా ఉన్నారేంటి?

ఉదయం నుండీ ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడటానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా, చెప్పవా’’ అంది.

కూతురలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనికి. తన కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయి. కొంతసేపటికి ‘‘ఏం చెప్పను తల్లీ, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక. ఇప్పుడు, ఇన్నాళ్ళకి మీ వదినకి మేమూ మా మాటలూ చేతలూ నచ్చటం లేదు. ఇంటికి పెద్దపెద్ద ఆఫీసర్లూ కలెక్టర్లూ వస్తారట. పార్టీలు జరుగుతాయట. వాళ్ళల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో, ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది.  ఆరునెలలక్రితం మమ్మల్ని ఓల్డేజ్‌హోమ్‌లో చేర్పించారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతుంటే, ఇప్పుడు వాడు పనిమీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటపుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోమ్‌లో వదిలేసి, వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటన ఇలా రాశాడు. చూడమ్మా రజనీ, ఎంతో ఆశతో బిడ్డల్ని కనీ, మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచీ పెద్దచేసి, చదివించి, వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు. పెళ్ళిచేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ, కొడుకు దగ్గరే కన్ను మూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులయినా. కానీ, కొడుక్కి పెళ్ళిచేసి, కొడుకుని కోడలి చేతికప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి, తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధా వేదనా ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది. వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు.  ‘మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు’ అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులయినా ఎలా తట్టుకోగలరు’’ అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. ‘‘మీ అన్నలాగా డబ్బున్నవాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసి పోతున్నారు. డబ్బులేని వాళ్ళు ముసలివాళ్ళని వాళ్ళ ఖర్మానికి రోడ్లమీద వదిలేసి పోతున్నారు. పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పనిచేసుకుని బతుకీడుస్తున్నారు.  పని చేయగలిగే శక్తి లేనివాళ్ళు పనిచేయలేక,  తిండిలేక, అడుక్కోవటానికి ముఖం చెల్లక, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.  ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లీ! కొంతమంది, కొంతమందేంటి… చాలామంది కోడళ్ళు ‘అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటివారే కదా’ అని అనుకోకపోవటమే.  అందుకే, ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది.  అక్కడ మేం బతికున్నాం అంటే, ఉన్నాం అంతే!, మా మనసులెంత కుమిలిపోతున్నాయో నీ అన్నావదినలకు అక్కరలేదు. మాకు ఈ శిక్ష ఎందుకుపడిందో తెలీదు కానీ, మేమనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా’’ అంటూ, మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకుని భోరుమంది ఆ తల్లి.

తల్లి మాటలకు రజనికి చెంపమీద ఛెళ్ళున చరిచినట్లనిపించింది అంత బాధలోనూ

‘‘వూరుకోమ్మా,  వూరుకో… అన్నయ్యిలా చేయడమేమిటి? వాడొచ్చాక నేను మాట్లాడతాను’’ అంది ఏడుస్తూ.

తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది. దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, ‘‘మీ అత్తయ్యగారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది.  వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమోగానీ, నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు’’ అంది.

తల్లి మాటలకు గిల్టీగా ఫీలయింది రజని.

ఇంకానయం, తను అన్నతోగానీ, తల్లితోగానీ మాట్లాడకపోవటమే మంచిదయిందనుకుంది.

అంతలో మాధవ పిలవటంతో, ‘‘సరే, పడుకోండమ్మా, పొద్దుపోయింది’’ అంటూ వెళ్ళిపోయింది.

మూడోరోజు ఉదయం వినోద్‌ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది.

అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకూ అలాగే జరిగిపోయింది.

సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక, వినోద్ తల్లితో ‘‘అమ్మా, ఇక బయలుదేరుదాం. ఎనిమిది గంటలకు ట్రైన్‌ ఉంది’’ అన్నాడు.

అందరూ ఉన్నా అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది.

అంతలో మాధవ గొంతు సవరించుకుని ‘‘చూడు వినోద్, ఇకనుండి అత్తయ్యగారూ మామయ్యగారూ మా ఇంట్లో, మా దగ్గరే ఉంటారు’’ అన్నాడు.

అతని మాటకు వినోద్‌, రజనీ, అత్తమామలూ విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి వూహించని పరిణామం.

‘‘అదికాదు బావా!’’ అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్‌.

‘‘ఇంకేం చెప్పకు, నీవక్కడకు తీసుకెళ్ళినా, హోమ్‌లోనే కదా వాళ్ళుండేది. ఇక్కడుంటే కూతురి దగ్గరున్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి. ఇంటికి పెద్దదిక్కు ఎంత అవసరమో నీకు తెలీదు వినోద్‌. అమ్మానాన్నలంటే మనమెప్పటికీ  తీర్చుకోలేని  తీరని  రుణం. పెద్దవారితో కలిసి ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి. ఇప్పుడు నువ్వు మీ అమ్మానాన్నలని చేసినట్లే, రేపు నీ కొడుకులు నిన్ను చేయరా! దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థంకాదులే. నేనేమీ కోపంగా చెప్పటం లేదు వినోద్‌. వాళ్ళిక్కడుంటే  వాళ్ళకీ మనశ్శాంతిగా  ఉంటుంది.  మాకూ ఇంకో అమ్మానాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇక నువ్వేం ఆలోచించక బయల్దేరు’’ అన్నాడు.

వినోద్‌ తల దించుకుని వెళ్ళిపోయాడు.

మాధవ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనికి.

అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.

గదిలోకి వెళ్ళటంతోనే మాధవ పాదాలను పట్టుకునేంత పని చేసింది రజని.

వెంటనే ‘‘ఏయ్‌ ఏంటిదీ, లే, లే…’’ అంటున్నమాధవతో-

‘‘ఇన్నాళ్ళూ మీతో కలిసి కాపురంచేసి కూడా మీ మనసు అర్థంచేసుకోలేకపోయానండీ. అత్తయ్యా వాళ్ళవిషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మానాన్నలకు ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను’’ అంది ఏడుస్తూ.

‘‘పిచ్చి రజనీ, నాకు మా అమ్మానాన్నా, మీ అమ్మానాన్నా వేరుకాదు. ఆరోజు మీ అమ్మ నీతో చెప్పినపుడే మీ నాన్నగారు మాకు చెప్పారు.

అప్పుడే అమ్మానాన్నా నేనూ ఇలా నిర్ణయించుకున్నాం. నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో  చిరాకులో మాట్లాడతావుగానీ నీ మనసెలాంటిదో నాకు తెలీదా’’ అన్నాడు.

అతనికి తనపైగల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీలైంది.

హాల్లోకొచ్చిన రజనికి అత్తమామలు భువినుండి దివికి దిగివచ్చిన దేవతల్లాగా కనిపించారు. వెళ్ళి వాళ్ళ పాదాలకి దణ్ణం పెట్టుకుంది. తరవాత తల్లికీ తండ్రికీ కూడా.

‘‘ఇదేంటమ్మా, ఇప్పుడెందుకూ…’’ అని అడిగిన వాళ్ళకు, ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ‘ఈటీవీ శుభమస్తు’లో చెప్పారండీ’’ అంది.

‘మా కోడలెంత బంగారం’ అని అత్తమామలూ, ‘కూతురెంత పద్ధతికలదో’ అని తల్లిదండ్రులూ మురిసిపోతుంటే, గదిలోనుండి అది చూసిన మాధవ- రజని తెలివికి నవ్వుకున్నాడు..

(ఇప్పుడు మనం ఏదయితే చేస్తామో అదే చివరకి మనకీ జరుగుతది?.. ముసలితనమంటే  మనోబలం సన్నగిల్లడం కాదు …   శారీరక  శక్తి తో  పాటు  మనోబలం  సన్నగిల్లడం ….  క్షీణించడం ,   తప్పు చేశారని  ప్రతి  ఒక్కరినీ ద్వేషిస్తూపోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు.)

Also read: ఆనందం … ?

(ఈ కథ రాసిన రోజు: 27-07-2018)

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles