Thursday, March 28, 2024

కాలుష్యం వల్ల మధుమేహం

  • మధుమేహ నివారణకు ఎన్నో మార్గాలు
  • లావుగా ఉండేవారికి ఈ జబ్బు వస్తుందన్నది అపోహ

మధుమేహం (డయాబెటెస్) ప్రపంచ మానవాళిని నిర్వీర్యం చేస్తున్నవాటిల్లో ప్రధానమైంది. ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ కూడా ప్రధానమైంది. మనది అధిక జనాభా కలిగిన దేశం కూడా. ఈ వ్యాధి ప్రబలడానికి ఎప్పటి నుంచో అనేక కారణాలు చెబుతున్నారు.  వాటితో పాటు తాజా అధ్యయనాల్లో కాలుష్యం కూడా ప్రధాన కారణంగా నిపుణులు గుర్తించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే మధుమేహ నియంత్రణకు మన ముందు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని నిబద్ధతగా అమలు చేస్తే ఇటువంటి రోగాలను ఆమడదూరం పారదోలవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఆ దిశగా ముందుకు సాగడమే మన ముందున్న బృహత్తర బాధ్యత. ఇది సమిష్టి సంకల్పం కావాలి. మధుమేహం రావడంలో జీవనశైలి, జీన్స్ వంటివాటిని ప్రధానంగా చెబుతాఉంటారు. ఊబకాయం, అధికరక్తపోటు కూడా మరిన్ని కారణాలుగా తెలిసిందే. వీటన్నిటిని మించి అనేక ప్రాంతాలలో అనేక విధాలుగా ప్రబలుతున్న కాలుష్యం నిశ్శబ్ద విస్ఫోటనం సృష్టిస్తోంది.

Also read: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు సమంజసమే

పల్లెల్లో సైతం చక్కెర వ్యాధి

ఒకప్పుడు పట్టణవాసులకే పరిమితమైన మధుమేహం ముప్పు ఇప్పుడు పల్లెల్లోనూ ప్రముఖంగా విస్తరిస్తోంది. పల్లెవాసుల జీవనశైలి పట్టణజీవులకు పూర్తి భిన్నం. సరే ఇప్పుడు మారిన వాతావరణం, అందివచ్చిన సదుపాయాలు, ఆధునికత పల్లెసీమలను కూడా పాడుచేస్తున్నాయి. సన్నగా ఉండడానికి, లావుగా ఉండడానికి, కొవ్వుకు, మధుమేహంకు సంబంధంలేదని అధ్యయనాలు, పరిశీలనలు చెబుతున్నాయి. శారీరకంగా ఎక్కువ శ్రమ చేసే రైతులు, కూలీలు, శ్రామికులు కూడా దీనిబారిన పడుతున్నారు. “అమ్మ ప్రేమ తప్ప అంతా కాలుష్యం” అని ఆ మధ్య ఓ సినిమాలో డైలాగు కూడా వచ్చింది. అట్లే సర్వం కాలుష్యమయమై పోయింది. గాలి, నీరు, భూమి అంతటా అదే సమస్య. శ్వాస,నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి చేరుకొనే విషతుల్యాలన్నీ క్లోమగ్రంథి నుంచి నేరుగా ఇన్సులిన్ తయారీని అడ్డుకోవచ్చు. రోగనిరోధక శక్తిని దెబ్బతీయవచ్చు. క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ను తయారుచేసే కణాలను పాడుచేయవచ్చు. రసాయనక చర్యల ప్రభావంతో పిండి పదార్ధాల జీవక్రియ కూడా అస్తవ్యస్తమవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో మిగిలిపోయే లోహరేణువులు, శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకొనే నుసి ఏదో రూపంలో మధుమేహం రావడానికి దోహదం చేస్తాయి. వాయు కాలుష్యం ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. గుండె జబ్బులు ప్రబలుతాయి. మధుమేహం కూడా సోకుతుంది. మధుమేహానికి వాయు కాలుష్యం ప్రధాన కారకంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య ప్రాంతాలలో మాస్కులు ధరిస్తే దీనిని చాలా మేరకు అడ్డుకొనవచ్చు. గణాంకాలను పరిశీలిస్తే మన దేశంలో మధుమేహం కారణంగా మరణించేవారిలో వాయుకాలుష్యం ద్వారా ప్రాణాలు కోల్పోయేవారు సుమారు 10 శాతం మంది ఉంటారని తెలుస్తోంది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటివి, పరిశ్రమల ద్వారా వచ్చే పొగ, వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం, వంట కోసం వేచ్చించే కలప, బొగ్గు, పిడకలు, గోబర్ గ్యాస్ వంటివన్నీ కాలుష్యకారకలే. వీటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి.

Also read: ఏ విలువలకీ ప్రస్థానం?

మనిషి చేతిలోనే అంతా ఉంది

క్రిమి సంహార మందులు, ప్లాస్టిక్, లోహాలు మొదలైనవన్నీ ప్రమాదకరమైనవే. కాలుష్య రహిత ఆహారం తీసుకుంటే అది సంజీవనిలా ఉపయోగపడుతుంది. ఇందులోనూ శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.అది కూడా ప్రాచీనమైన సంప్రదాయ పద్ధతులలో వంటచేస్తే ఎంతో మంచిదని అంటున్నారు. పండించే పంట, క్షేత్రం అతి కీలకం. వీటన్నిటిని పాటించగలిగితే మధుమేహాన్ని ఆశించినమేరకు జయించవచ్చని భావించవచ్చు. అంతా మనిషి చేతిలోనే ఉంది.

Also read: దిల్లీకి జబ్బు చేసింది!

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles