Tuesday, April 23, 2024

జనసేన యూ టర్న్ ?

  • తిరుపతిలో ఒంటరిగా పోటీచేయాలంటున్న కార్యకర్తలు
  • పవన్ కల్యాణ్ పై అభిమానుల ఒత్తిడి
  • ఏపీలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ
  • కార్యకర్తల సూచనలను గౌరవిస్తానంటున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీ నాయకుల వ్యవహారశైలిపై ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన పవన్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో సత్సంబంధాలే ఉన్నాయన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల సంబంధాలు అనుకున్నంతగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ ని విమర్శించే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీతో పొత్తు కొనసాగింపుపై ఆలోచించాలని పార్టీ సానుభూతిపరులు ఒత్తిడి తేవడంతో పవన్ పునరాలోచనలో పడినట్లు పడేస్తోంది.

పెరుగుతున్న ఆదరణ:

2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అనూహ్య రీతిలో పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి విశాఖ పట్నం జిల్లాలలో ఆ పార్టీ మంచి ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ఈ జిల్లాలలో టీడీపీ, బీజేపీల కంటే జనసేనకు వచ్చిన ఓట్ల శాతం పెరగడంద్వారా, గ్రామాల్లో మంచి ఆదరణ లభించినట్లు ఎన్నికల వ్యూహకర్తలు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని బీజేపీతో  పొత్తుపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ నుంచి ఉపసంహరించుకునేలా కేంద్ర స్థాయి నేతలు రాయబారం నడిపారు. ఆ సమయంలో తెలంగాణ రాష్ట  బీజేపీ నేతలు పవన్ తో సమావేశం కాకపోగా పవన్ ను  ప్రచారానికి కూడా ఆహ్వానించలేదు. ఫలితాల అనంతరం జనసేన మద్దతులేకపోయినా బీజేపీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరించిందని తెలంగాణ బీజేపీ నేతలు ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనల నేపథ్యంలో పొత్తుతో కంటే ఒంటరి పోరే మంచిదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.

Also Read: పవన్ కల్యాణ్ పయనం ఎటు?

పంచాయతీ ఎన్నికల్లో 17% ఓట్లను జనసేన పొందడం సాధారణ విషయం కాదు. పలు జిల్లాలలో వైసీపీ, టీడీపీ ల ఓట్లను భారీగా చీల్చినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2014 నుండి పార్టీని అంటిపెట్టుకున్న క్యాడర్ రాటు దేలటమే కాకుండా పార్టీ విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సుమారు 1500 పంచాయతీలలో రెండో స్థానంలో జనసేన నిలిచినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనసేనకు కాపు సంఘం నేతలు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు పార్టీలో నెలకొన్న నైరాశ్యంతో తమ క్యాడర్ ను జనసేన వైపు మళ్లిస్తున్నారు.  

పవన్ భవిష్యత్ వ్యూహమేంటి?

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నుంచి జనసేనకు ఊహించినంత మద్దతు లభించడంలేదు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఏపీలో జనసేనకు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల బలం గాని ఓటు బ్యాంకు గాని బీజేపీకి లేదు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ కూడా బీజేపీ కంటే జనసేనను విమర్శించేందుకే సమయాన్ని వెచ్చిస్తున్నారు. కార్యకర్తల సూచనలను గౌరవిస్తానని ఎప్పుడూ చెప్పే పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ముందుకు సాగాలి. తిరుపతి లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారని బీజేపీ పెద్దలు ప్రకటించడం జనసేన క్యాడర్ కు శరాఘాతం కానుంది. జనసేన తమ అభ్యర్థి పోటీలో ఉంటే ప్రచారం చేయడానికి క్షేత్రస్థాయిలో విస్తృతంగా  ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. జనసేన నుంచి పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ కార్యకర్తలు పవన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. దీంతో బీజేపీకి ఎంత బలముందో ఈ ఎన్నికల్లో తెలిసొస్తుందని వారు అంచనావేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో జనసేనకు వస్తున్న ఆదరణను చూసి టీడీపీ కూడా ఆ పార్టీతో సఖ్యతగా ఉండేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఫలితాలతో సంబంధం లేకుండా జనసేన ఒంటరిగా పోరాడాలని ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఇది దోహదపడుతుందని జనసేన అమలాపురం కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read: ఆంధ్రుల ఆంతర్యం ఏమిటి?

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles