Thursday, March 28, 2024

రామాయణ భాగవత భారతాల కొన్ని కథలే ఎన్టీఆర్ దృశ్య కావ్యాలు

(మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్, సంపాదకుడు, డాక్టర్ తూమాటి సంజీవరావు,  ప్రచురించిన “ఎన్టీఆర్ శతజయంతి సంచిక” రచించినదీ వ్యాసం)

మాడభూషి శ్రీధర్

మన భారతదేశంలో కావ్యాలకు, కథలకు, కథనాలకు, కవితలకు, చరిత్రలకు మన ఆది రచనలు శ్రీరామాయణం, శ్రీమద్ భాగవతం, మహాభారతం ఆలంబనం అయినాయి. ఆధారాలుగా నిలబడతాయి.  కొద్ది శతాబ్దాల కిందట నాటకాలు, ఆ తరువాత ప్రస్తుతం సినిమాల్లో కూడా ఈ రామాయణ భారతాలు కూడా ఆధారమయినాయి.  ఈ దేశానికి పునాదులు ఈ పురాణాలు. అనేక కథలు శ్రీరామాయణం అల్లుకున్నవి.

తెలుగు సినిమాల్లో అనేకానేక శ్రీరామాయణ ఆధారిత చలనచిత్రాలు వచ్చాయి. ఇవి: అహల్య 1934 డిసెంబరు 31న విడుదలైన సినిమా. అందులో పారుపల్లి సుబ్బారావు, శ్రీరంజని సీనియర్ నటించారు. ఇంద్రజిత్ (1990) పాదుకా పట్టాభిషేకం (1932, 1945, 1966లలొ ఆ పేరుతో అనేసార్లు సినిమాలు వచ్చాయి. మైరావణ పేరుతో రెండు (1940, 1964 వచ్చాయి) రామాయణం (లేదా బాల రామాయణం 1996 లో అందరూ పిల్లలతో నిర్మించిన తెలుగు సినిమా వచ్చింది.లంకాదహనం సినిమా (1936 కాళ్ళకూరి సదాశివరావు) నిర్మించారు.

1934లోలవకుశ, ఈస్టిండియా ఫిలిం కంపెనీ పతాకంపై మోతీలాల్ ఛబ్రియా నిర్మాతగా పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందించినది. ఆ తరువాత 1963 లో మళ్లీ లవకుశ వచ్చింది, ఎన్టీఆర్ గొప్ప చిత్రంగా నిలిచిపోయంది. నిజానికి 1958లో మొదలైనా 1963 దాకా నిర్మాణం జరిగింది, ‘వాలి సుగ్రీవ’ సినిమాలో శ్రీమతిఎస్.వరలక్ష్మి కథానాయిక, వాల్మీకి (1945) చిత్రం ఉంది. ఎన్టీఆర్ తో వాల్మీకి 1963 లో మరోసినిమా నిర్మించారు.అర్జా జనార్ధనరావు, కాంతారావులతో వీరాంజనేయ 1968లో సినిమా విజయం సాధించింది, శ్రీరామరాజ్యం 2011లో, శ్రీరామాంజనేయ యుద్ధం (అమర్‌నాథ్ – శ్రీరంజని 1958), శ్రీరామాంజనేయ యుద్ధం ( ఎన్టీఆర్ సరోజాదేవి తో బాపు చిత్రం 1975)సంపూర్ణ రామాయణం (1936),ఎన్.టి.రామారావు, పద్మిని తో మరొక సంపూర్ణ రామాయణం 1959 వచ్చింది.మరో చిత్రం శోభన్ బాబు, చంద్రకళ తో బాపు నిర్మించారు. (1971)సతీ సులోచన (1961), ప్రేమ్‌ నజీర్ – శ్రీరాముడుగా, కుచలకుమారి – సీత గా, సీత అనే సినిమా వచ్చింది. (1961)బాపు దర్శకత్వంలో వెలువడిన ఉత్తమ కళా చిత్రాలలోది సీతాకల్యాణం (1976)సీతాకళ్యాణం (1934) వచ్చింది.సీతారామ కళ్యాణం లో సూపర్ చిత్రం ఎన్టీఆర్ తో వచ్చింది (1961).  రామాయణం తరువాత మొత్తం మహాభారతం ఆధారంగా అనేకానేక కథలు చిత్రాలు వచ్చాయి. వాటిలో కూడా ఎన్టీఆర్ అద్భుతమైన చిత్రాలు ఎన్నో వచ్చాయి.  ఎన్టీ ఆర్ చుట్టుతూ తిరిగే సినిమాలు ఎన్నో ఉండేవి. రామారావు సినిమాలు చూడడం ద్వారా అందరికీ రామాయణం అర్ధమైంది. భారతం తెలిసింది. నాకైతే తెలుగు, కవిత, రామాయణ భారతాలు నాకు అర్థం కావడం ఈ సినిమాల వల్లనే అంటాను. స్తోత్రాలు వచ్చాయి. తెలుగు భాషలో గొప్పతనం తెలిసింది. పత్రికలలో రాయడం వల్ల నాకు తెలుగు సినిమాల ద్వారా, ముఖ్యంగా ఎన్టీఆర్ భాష పలకడం వల్ల ద్వారా నాకు మంచిదైన బ్రతుకు కూడా వచ్చిందనిపిస్తుంది.

అటువంటి సినిమాల సంస్కారం, సంసారం, జీవితం, డైలాగ్ ల ద్వారా, సముద్రాల, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరథి, సినారె ద్వారా వారి నాగేశ్వర్ రావ్ ఎన్టీఆర్ ద్వారా చాలా నేర్చుకున్నాం. తెలుగు కవిత్వం తెలిసింది. తెలుగు ఉద్యమాలు అర్థమైనాయి. గేయాల ద్వారా దేశం అర్థమైంది. రామారావు సాంఘిక చిత్రాలు పౌరాణిక చిత్రాలు స్ఫూర్తి ఇచ్చాయి. ఒక జీవితపు కాలమంతగా రామారావు, నాగేశ్వరరావులు మా సంస్కృతిలో చేర్చుకున్నారు. సినిమా జీవితంలా ఒక భాగమైంది. ఎన్టీఆర్ సినిమా భాగమైంది. కనుక, ఈ కథలు సినిమాలు అర్థం చేసుకోవాలి.

కృష్ణుడంటే రామారావే

మొదటిసారి తొలిసారి రామారావు కృష్ణుడి వేషంలో ‘ఇద్దరుపెళ్ళాలు’ (1954) చిత్రంలో కనిపించారు. ఘంటసాల నిర్మించిన ‘సొంతవూరు’ లో కృష్ణుడుగా కనిపించినా రామారావు ప్రేక్షకులకు రుచించలేదు. కాని ఆ తరువాత  ‘చరణదాసి’ చిత్రంలో రాముడి అందరినీ ఆదరించారు. ‘లవకుశ’ చిత్రంలో రామారావు శ్రీరాముడిగా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మాయాబజార్’ లో రామారావుకు అందం కృష్ణుడి పాత్ర ఐదు లక్షల క్యాలండర్లకు ఫ్రేము కట్టించి పూజలు చేశారు.  మరో సందర్భాలలో తరువాత అటు రాముడుగా, ఇటు రావణాబ్రహ్మగా కూడా అద్భుతంగా ప్రదర్శించారు. సీతారామకల్యాణం సినిమాకు రామారావే దర్శకత్వం వహించినా తనపేరు వేసుకోలేదంటారు కొందరు సినిమా రచయితలు.

శ్రీ వేంకటేశ్వరుడు

పి.పుల్లయ్య సొంత చిత్రం ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో వేంకటేశ్వరునిగా అచ్చుగా శ్రీవేంకటేశ్వరులైపోయాడు. 1963లో 14 సినిమాలలోను, 1964లో 16 సినిమాల్లో ఎన్టీఆర్ నటించారు. ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో కర్ణుడుగా, సుయోధనుడుగా, కృష్ణుడుగా త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకుల మన్నన పొందారు. ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. ‘శ్రీమద్ విరాటపర్వం’ చిత్రంలో 5 పాత్రలు పోషించారు. ‘బ్రహ్మంగారి చరిత్ర’ విజయం మరొక చరిత్ర. ‘దాన వీర శూర కర్ణ’ (4 గంటల 8 నిమిషాలు) 43 రోజుల్లో తీసిన ఈ సినిమా కలెక్షన్లలో వీర శూర సినిమా అని చెప్పుకున్నారు.

ఇద్దరు అద్భుతాలు ఎన్టీఆర్, సముద్రాల

ఒక సినిమా రచయిత, కవి, గేయా పాటల మాటల మాంత్రికులు ఎందరో కృషి చేస్తేనే ఒక హీరో, సూపర్ హిట్, మరో శిఖర స్థాయి హీరోలు ఎదగడం వల్లనే ఎన్ టి ఆర్ వంటిలు పుడుతారు. తెరముందు హీరోలు ఉంటారు. తెరవెనుక రచయితలు మరెందరో ఇటుకలవంటి వారు ఉంటేనే నిర్మాతకులు ఉంటారు. సముద్రాల తెరవెనుక దిగ్గజారులు ఉంటారు.

సముద్రాల రచనా రాఘవాచార్యుడైతే, రామారావు నటన మహావిశ్వమిత్రుడైనవాడు. అతనిలో ఒక నటుడు, దర్శకుడు, మంచివాడు, నాయకుడు, సమర్థుడైన పాలకుడు కనిపిస్తాడు.  అద్భుతమైన అనేక అరుదైన కోణాలు, పాత్రలు ఆయన సమిష్ట వ్యక్తిత్వంలో ఒక వ్యక్తిగా కనిపిస్తాడు. రచయిత లేకుండా నటన ఉండలేడు. కాని కేవలం నటన మాత్రమే మిగలదు. సముద్రాల అగాధమైన లోతులను తన పాటలలొని కవిత్వంలొ రచించిన రాబోయే యుగాలు గుర్తుంచుకుంటారు. ఎన్ టి ఆర్ గొప్ప కళాకారుడుచ సముద్రాల వంటి రచయితకు తోడైతే చరిత్ర సృష్టిస్తుందని ఈ ఇద్దరు నిరూపించారు.

రామారావువలెనే సముద్రాల రాఘవాచార్య కూడా సహస్ర అవధానాలు ఎన్నో చేయగల శక్తివంతుడు.   జూలై 19, 1902 – మార్చి 16, 1968 తో ముగిసినా, ఆయనది అజరామజ చరిత్ర. సముద్రాల వేంకట రాఘవాచార్య గుంటూరు జిల్లా లో అందరూ భట్టిప్రోలు అంటారు. పెదపులివర్రు వారు. పండితవంశం.

సీినియర్ సముద్రాల

తొమ్మిదవ తరగతిలోనే  కవిత్వం చెప్పడం. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివుకున్నాడు.  ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని కారాగారశిక్షను అనుభవించాడు. 1918 నుండి అవధానాలు చేసాడు.  జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కొడుక్కు తెలుగు నేర్పడానికి గుంటూరుకు చేరి కొసరాజు రాఘవయ్య చౌదరి, గూడవల్లి రామబ్రహ్మంలతో కలిసి మద్రాసు చరిత్రపై పరిశోధన చేస్తూ, సమదర్శిని పత్రికలో పనిచేశాడు. విజయవాడలో ప్రారంభించిన ప్రజామిత్ర పత్రికను మద్రాసుకు తరలించి దానికి సంపాదకుడిగా గూడవల్లి రామబ్రహ్మంని నియమించారు. అక్కడే ప్రజామిత్ర ప్రచురించే బి.ఎన్.కె ప్రెస్ యజమానులైన బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి సోదరులతో ఇతనికి పరిచయం ఏర్పడింది. అక్కడే సినిమాల్లో చేరారు. వాహిన సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయిత అయ్యాడు. రామారావు చాలా రావడానికి ముందే సముద్రాల అంటే 1937 న మాటలు పాటలు సినిమా రచయించిన వాడు. 1949న మనదేశం సినిమా విశ్వస్వరూపం సముద్రాల ఉన్నత స్థానంలో ఉన్నారు. అక్కడ రామారావు ఓనమాలు మొదలు పెట్టాడు.  ఆ తరువాత 1953 దేవదాసు, 1954 విప్రనారాయణ, 1956 అనార్కలి వంటి చిత్రాలలో నాగేశ్వరరావు ముందుకు ఉన్నారు. 1955 జయసింహ 1956 జయం మనదేతో ఎన్టీఆర్ మరొక కొత్త యుగం మొదలైంది. సారంగధర, వినాయక చవితి 1957, భూకైలాస్ 1958 దీపావళి 1960, సీతారామ కళ్యాణం 1966 అనే సినిమాల గురించి రామారావు, సముద్రాల దిగ్విజ పథంలో ఉన్నారు. అయితే కేవలం రామారావుకే కాదు, సముద్రాల నాగేశ్వర్ రావు కూడా దిగ్విజయాలు సాగిస్తున్నారు. నర్తనశాల, లవకుశ 1963లో, అదే ఏడాదిలో వాల్మీకి సోమవరవ్రత మహత్యం, 1964లొ అమరశిల్పి జక్కన, బభ్రువాహన 1964, పాండన వనవాసం 1965వంటి అద్భుత చిత్రాలను రచించింది సముద్రాల. వీరితొ కలిసి రామారావ్, నాగేశ్వర్ రావ్ లతొ చరిత్రలు సృష్టించారు. శ్రీకృష్ణ పాండవీయం (1966) శ్రీకృష్ణ తులాభారం (1966) చాలా వరకు మాటలు, కొన్ని పాటలను రచించారు. మరొక అద్భుతం భక్త ప్రహ్లాద (1967) గొప్పగా నడవకపోయినా రహస్యం (1967), సూపర్ శ్రీకృష్ణావతారం (1967) వీరాంజనేయ (1968) సముద్రాలు వీరవిహారం చేశారు.  చివరి కాలంలో శ్రీరామకథ (1968) ను, తారాశశాంకం (1969) లో మరికొన్ని మాటలు, కొన్ని పాటలు వచ్చినవి ఇవి. 1968 మార్చి 16నాడు సముద్రాల మరణించారు.  మొత్తం 74  సినిమాలతో ప్రాణం పోసిన వాడు సముద్రాల. నాగేశ్వర్ రావ్ గొప్పవాడే అయినా, ఎన్టీ రామారావు సాటిలేని వాడేలేడు. సముద్రాల, ఎన్టీఆర్ ఇతరుల కలిసి చేసిన వారిలో అసాధ్యులో ఒకరో కాదొ అని చెప్పడం సాధ్యం కాదు. వారి అద్భుత చిత్రాల గురించి ఎంత రాసినా సరిపోదు.

భూకైలాస్

సముద్రాల వారు మాటలు పాటలు విశ్వరూపం ఎత్తుతారు భూకైలాస్ సినిమాలో.

ఎన్టీ ఆర్ ‘‘తగునా వరమీయా యీ నీతి దూరునకు పరమా పాపునకు’’ అనే పాట అద్భుతంగా నటిస్తారు. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో, పాటలోఘంటసాల అటు ఎన్ టి ఆర్ కూ, మరొకవైపు నాగేశ్వరరావుకు కూడా సినిమాలో ఇద్దరికీ సరిగ్గా పాడడం చాలా విశేషం. ‘‘జయజయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా’’ మరొక అద్భుతం. 

‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ సముద్రాల రచనా సామర్థ్యానికి గొప్ప తార్కాణం.ఈ పాటలో రాముని అవతార వైశిష్ట్యాన్ని చూపించారు. ‘దేవదేవ ధవళాచల మందిర’, ‘జయజయమహాదేవా’, ‘తగునా వరమీయా ఈ నీతి దూరునకు..’ వంటి పాటలు ఘంటసాల వెంకటేశ్వరరావు గళంలో జీవం పోసుకున్నాయి. ‘

ఎన్టీఆర్, సముద్రాల – శ్రీకృష్ణ పాండవీయం

రాఘవ పాండవీయం పింగళి సూరన రచించిన తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యం. పింగళి సూరన, రామాయణం, మహాభారతంలోని ముఖ్య ఘట్టాలను ఏరుకుని ఆరు వందల పద్యాలతో ఈ కావ్యం రాశాడు. అయోధ్య వారణపురి, దశరథుడు పాండురాజు, నీలుడు ధృష్టద్యుమ్నుడు, సుగ్రీవుడు కర్ణుడు, ఆంజనేయుడు భీముడు అనే కావ్యంలో కథానాయకులు ఉంటారు. రాఘవపాండనీయం అనే పేరుతో శ్రీకృష్ణపాండవీయం అనే సినిమాను రూపొందించారు ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య.

శ్రీకృష్ణ పాండవీయం అనే సినిమాను రచించిది అన్నప్పడికీ నిజానికి దర్శకత్వం చేసింది సముద్రాల గారే నని అంటారు. దుర్యోధనుడిగా శ్రీకృష్ణుడిగా రెండు పాత్రలను మెప్పించడమే కాకుండా దర్శకత్వాన్ని కూడా నిర్వహించారు ఎన్టీఆర్. ఆ పాత్రలలో ఇమిడి పోయారు. సముద్రాల గారు భారత కథలో భాగవత కథ రుక్మిణీ కల్యాణాన్ని జోడించి సహజంగా ఇమిడి పోయిందా కథ.  ఈ సినిమాలో మయసభ సెట్టింగ్ విజయ వాహిని స్టూడియోలో చాలా గొప్పగా చెప్పుకునే వారట. బి.నాగిరెడ్డి గారు ఆ సెట్ ను చూద్దామనంటే ఫ్లోర్ లోకి ప్రవేశానికి పోతే విషయం తెలిసిన ఎన్.టి.ఆర్, తివిక్రమరావు సోదరులు నాగిరెడ్డి గారిని సగౌరవంగా తీసుకువెళ్లి చూపించారు. మర్యాదలు తెలిసిన వారు రామారావ్ గారు.  ఆ సినిమాలో స్వాగతం, సుస్వాగతం అని మయసభ చిత్రం అపూర్వం గా ఉంటుంది. దాని గురించి వివరించడం కష్టం. యుట్యూబ్ చూడడం ఒక్కటే మార్గం. (https://www.youtube.com/watch?v=gjRkxVZKaAE) నందమూరి సార్వభౌమా ! మీ హావ భావ ప్రకటనా చాతుర్యం అహో అనితర సాధ్యం ! ఈ దృశ్య మాలికలో మీ నటన అప్రతిహతం !..మరచిపోలేని మధురానుభూతిని కలిగించిన మధురాతి మధురమైన రసవత్తర గీతం అని ట్యూబ్ లొ అంటారు.

సుయోధనుడు తలపై కిరీటం, వెనుకవేలాడే చేలాంచలం, పాండవులను తలచుకుంటూ ‘దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై, నవఖండ భూమండల పరివ్యాప్తమైన ఈ కురుమహాసామ్రాజ్యమును శాసించు రారాజును’ అనడం, మరోసారి మయసభలో భంగపడి ద్రౌపదిని తలచుకుంటూ ‘పాంచాలి పంచభర్తృక, నీవా నన్ను పరిహసించునది? సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును నేడొక అబల బంధకీ అపహసించుటయా’ అంటూ దుర్యోధనుని తలచుట్టూ వందలకొద్ది గిర్రున తిరగడం, శకుని మాటలు ఆలకించి కొంత యోచన, కొంత ఆనందం రారాజు ముఖంలో ప్రతిఫలించటం ఆశ్చర్యం. లాక్షాగృహం, హిడింబి నృత్య సన్నివేశం సెట్, రుక్మిణి మందిరం, బకాసురుని వద్ద ఎముకల గుట్టలు, జరాసంధుని భవనం ముందువైపు, హిడింబాసురుడు చెట్లనుండి పడిన కాయలన్నీ తినటం, భీముని దెబ్బకు అవి నోటినుంచి కింద పడడం మరో ఆశ్చర్యం.

ఆ సినిమాలో 26 పాటలు, కథలు ఉండేవి.  భాగవతం పాటలు కుదిరిపొయేవి, ఏమిటయా నీ లీల కృష్ణా ఎందులకీ గోల అని పి బి శ్రీనివాస్ కోసం అందమైన పాటలు ఇప్పడికీ మరిచిపోలేము. ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని జేరీ: నాలోన ఊహించిన కలలీనాడు ఫలియించె అని సముద్రాల పాట తీయగా ఉంటుంది. భాగవతంలోనివి. రుక్మిణిపై ‘కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్’, అని ఘంటసాల పాడిన పాట, పి సుశీల పాడిన పద్యాలు ఇవి: ఘనుడా భూసురుడు, నమ్మితి నామనంబున’, ‘ప్రాణేశా నీ మంజు భాషలు’, ‘లగ్నంబెల్లి వివాహంబు’, అగ్నిద్యోతనుడిపై ‘ఆయెల నాగ నీకు తగున్’  అని పిబి శ్రీనివాస్, నారదునిపై ‘నల్లనివాడు పద్మ నయనంబులవాడు’, శ్రీకృష్ణునిపై పద్యం ‘వచ్చెద విదర్భ భూమికి’  ఘంటసాల పాటలు, పద్యాలు, అద్భుతంగా ఉంటాయి.

శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో సముద్రాల రచన గురించి ఎంత చెప్పినా సరిపోదు.

సముద్రాల – నర్తనశాల

మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నర్తనశాల 1963లో  నిర్మితమైంది. పౌరాణిక చిత్రాలలో తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభ ఋజువు చేసి, ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. 1964లో ఇండొనీషియా రాజధాని, జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు గా ఎస్. వి. రంగారావు సాధించారు.

విశ్వనాథ స్ఫూర్తి అంటారు

ఎన్టీఆర్ విశ్వనాథ సత్యనారాయణ కు ఇష్టపడిన నటసమ్రాట్. వంటవాడైన భీముడు కీచకవధ చేసిన భారత కథని మార్చి, విశ్వనాథ సత్యనారాయణ నర్తనశాల పేరుతో కథ రచించారు. నర్తనశాల సినిమాకు విశ్వనాథ స్ఫూర్తి అంటారు. సముద్రాల పాట అద్భుతం. ఇందులో పల్లవి..జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. రెండు చరణాలు ఈ విధంగాఉంటాయి. 1. అమ్మవు నీవే అఖిల జగాలకు, అమ్మల గన్నా అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మ, శరణము కోరితినమ్మా భవాని అనీ, రెండో చరణంలో నీదరినున్న తొలగు భయాలు, నీ దయలున్న కలుగు జయాలు, నిరతము మాకు నీడగ నిలచీజయమునీయవే అమ్మ భవాని అన్న పాట ఇంటింటా వినపడుతూనే ఉంటుంది. సముద్రాల రచించిన రసవంతమైన భక్తిగీతం. పి.సుశీల గానం చేయగా సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్ని అందించారు. ద్రౌపది (సావిత్రి) ఆలపించే పాట ఇది.

జయగణనాయక విఘ్న వినాయక పాట ఘంటసాల పాడితే, సలలిత రాగసుధారససారం అనే అద్భుత గీతం మంగళంపల్లి బాలమురళీకృష్ణ చాలా విలువలున్న పాట. సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి అనే గానం కూడా సముద్రాల రాసిన వినసొంపే పాట.

బృహన్నలగా ఎన్టీ రామారావు చరిత్ర నిర్మించారు. బృహన్నలగా ఆడంగి వేషం వేయడానికి ఎన్.టి.ఆర్. మొదట నిరాకరిచారు కాని లక్ష్మీరాజ్యం అతనికి నచ్చజెప్పించారట.  ఉత్తర గా మంచి నర్తకి అయిన విజయలక్ష్మితో సమానంగా తాను నాట్యం చేయలేనని. నెలరోజులు ఎన్.టి.ఆర్. తెల్లవారుజామున వెళ్ళి వెంపటి పెదసత్యం వద్ద నృత్యం నేర్చుకుని  తరువాతే అంగీకరించాడు.బృహన్నల పాత్ర మేకప్ విషయమై మేకప్ మన్ హరిబాబు, కళాదర్శకుడు టి.వి.ఎన్.శర్మ ఎంతో శ్రమించారు. ఎబ్బెట్టుగా కాకుండా ఠీవిగా కనిపించేలా చేయడానికి ఎన్నో స్కెచ్‌లు వేశారు.

లవకుశ – నీల మేఘశ్యాముడు

తెలుగు గ్రామాల్లోని రామాలయాల్లో ఈ సినిమా పాటలు మారుమోగి తెలుగునాట లవకుశ పాటలు వినిపించని గ్రామమే లేదన్నంత స్థాయి ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాయి. లవకుశలోని ఆ నీలమేఘశ్యాముడు,అందాల రాముడే కనిపిస్తాడు..తొలిసారి ఓ పౌరాణిక చిత్రం గేవా కలర్ లో..నేరేడు వర్ణంతో ఓ ఆజాను బాహుడు,రఘువంశకులదీపకుడుశ్రీరామచంద్రుడ్ని…. వెండితెరపై చూడటం నిజంగా….ఓ గొప్ప అనుభవం..ఎన్టీఆర్ అలాగేశ్రీరామచంద్రుడిలా మన కళ్ళల్లో నిండి పోతారు..ఈ సినిమాలో రెండు సందర్భాల్లో ఎన్టీఆర్నటన ‘ నభూతో నభవిష్యతి ‘ అనవచ్చు.ఒకటి..సీతాదేవిని అడవికి పంపేముందు, రామచంద్రుడు పడిన క్షోభ.రెండు అశ్వమేధయాగం కోసం తయారుచేసిన స్వర్ణ సీత ప్రతిమకు సీతాదేవి నుదుట కుంకుమ పెట్టి వెళ్ళిక తరువాత ఎన్టీఆర్ హావభావాలు‌ వర్ణించడానికి మాటలు చాలవు.తెలుగువారికే కాదు, యావద్భారతంలోనూ శ్రీరాముడు అంటే ఎన్టీఆర్ నే ఊహించుకునేవారు ఎందరో ఉన్నారు.ఎన్టీఆర్ శ్రీరామునిగానటించిన పౌరాణిక చిత్రాలను తమిళ,హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లోకిఅనువదించడంతో అక్కడి వారుసైతం నీలమేఘశ్యాముడంటే నందమూరి తారకరామారావే కళ్ళల్లోమెదలుతారు. శ్రీరాముడంటే యన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం గుండె ల్లో నిలిచిపోయారు.1963లో 26 కేంద్రాల్లో ఈ సినిమా విడుదలైంది. సినిమా అపూర్వమైన విజయాన్ని సాధించింది. విడుదలైన అన్నికేంద్రాల్లో 150 రోజులు ఆడింది.500 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. పావలా, రూపాయి టిక్కెట్లు ఉన్న రోజుల్లో ఈ సినిమా కోటి రూపాయలువసూళ్ళు పొందింది. 60లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో1.98 కోట్ల టిక్కెట్లు అమ్మి చరిత్ర సృష్టించింది. సినిమా తమిళ వెర్షన్40 వారాలు ఆడగా, హిందీ వెర్షన్సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. రిపీట్ రన్స్ లోనూ ఈసినిమా విశేషాదరణ పొందింది. కేవలం విజయవంతమైన చిత్రంగానే కాదు.క్లాసిక్ గానిలిచిపోయింది.హారతులు అని పట్టారు గొప్ప పాత్రికేయ రచయిత ఎ.రజాహుస్సేన్ అన్నారు.

రామకథను వివరయ్యా, లేరు కుశలవుల సాటి…, వినుడు వినుడు రామాయణ గాథ, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, సందేహించకు మమ్మా అనే రచనలు సముద్రాల ఎంత లోతైన వాడో, గొప్ప విలువలున్న రామాయణ సారమనే అర్థం చేయడం సాధ్యం కాదు. అయితే సదాశివబ్రహ్మం రాసినవి కూడా చాలా ఎంతో అద్భుతమైనవే. మొత్తం ఈ సినిమాలో 38 పాటలు పద్యాలన్నాయట. రామారావ్, సముద్రాల, ఘంటసాల కలిసి లవకుశ చారిత్రాత్మకంగా చిరంజీవిగా ఉంటాయి. 

సముద్రాల విగ్రహం

సముద్రాల విగ్రహం

సముద్రాల సృష్టించిన కథలు సినిమాలుగా అఖండ విజయాలు పొందాయి. ఆయన పాటల వల్ల మాటల వల్ల సినిమాలు చిరంజీవులైనాయి.  శ్రీరామాయణం ఆధారంగా సముద్రాల అనేక కథలు పాటలు రచించారు. ఈ నాటికీ అవి నిలబడి ఉంటాయి.

లవకుశ సినిమాలో శ్రీరాముడికి కుమారులకు మధ్య జరిగిన యుద్ధం సందర్భంలో ఆంజనేయుడితో వాల్మీకి శిష్యులతో ఆశ్రమంలో పాడుకున్నపాట గొప్పది:  ‘‘శ్రీ రామ పరంధామా, జయ రామ పరంధామా

శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా రఘు రామ రామ, రణరంగ భీమ జగదేక సార్వభౌమా’’     శ్రీ రామ పరంధామా జయ రామ పరంధామా పూజాన్వయాభిసోమా సుగుణాభి రామ శుభ నామాపూజాన్వయాభిసోమా సుగుణాభి రామ శుభ నామా కారుణ్యధామ దశకంఠవిరామ రాఘవ రాజా లలామ’’ఈ పాటను ఎక్కడలో ఏ మాట దగ్గర ఆపడం సాధ్యమో తెలియదు, ఈ పాట ఎన్టీఆర్ ను కూడా ఈ చిత్రాన్ని అజరామరంగా మార్చింది.

జగదభి రాముడే

జగదభి రాముడే అనీ వాల్మీకి ఆశ్రమంలో నాగయ్య ముందు లవకుశులతో నడిపించిన చిత్రాన్ని ఎవరు మరిచిపొతారు?

జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం జగదభిరాముడు శ్రీరాముడే

రఘుకులసోముడు ఆ రాముడే జగదభిరాముడు శ్రీరాముడే

రఘుకులసోముడు ఆ రాముడే జగదభిరాముడు శ్రీరాముడే

జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో

వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే

అంటూ వింటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది.

కరమున ధనువు శరములు దాలిచి కరమున ధనువు ఆ… ఆ…

కరమున ధనువు శరములు దాలిచి ఇరువది చేతుల దొరనే కూలిచి

సురలను గాచిన వీరాధివీరుడు జగదభిరాముడు శ్రీరాముడే

ఇక ప్రేమావతారుడి గురించి రాసిన చరణం చాలా బాగుంటుంది.

ఆలుమగల అనురాగాలకు ఆలుమగల అనురాగాలకు

పోలిక సీతారాములే యనగ పోలిక సీతారాములే యనగ

వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు

సీత పేరుతో పాడించిన ఈ చరణం వినాల్సిందే.

జగదభిరాముడు శ్రీరాముడే ఆ… ఆ… ఆ…

నిరతము ధర్మము నెరపి నిలిపి

ఆ… ఆ… ఆ…   ఆ… ఆ… ఆ…

నిరతము ధర్మము నెరపి నిలిపి నరులకు సురలకు తరతరాలకు

వరవడియైన వరయగ పురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే

చాలా మంది గొప్పతనం వివరించిన తరువాత అందరినీ కలుపుకొని పాడిన చరణం మరొకటి

ఇనకులమణి సరితూగే తనయుడుఅన్నయూ ప్రభువు లేనేలేడని

ఇనకులమణి సరితూగే తనయుడుఅన్నయూ ప్రభువు లేనేలేడని

జనులు భజించే పురుషోత్తముడుజగదభిరాముడు శ్రీరాముడే

రఘుకులసోముడు ఆ రాముడేజగదభిరాముడు శ్రీరాముడే

జయజయరాం జయరఘురాంజయజయరాం జయరఘురాం

జయజయరాం జయరఘురాంజయజయరాం జయరఘురాం

నా చిన్ననాటి ఈ పాట ఎప్పుడూ వినబడుతూనే ఉంటుంది.

లవకుశలోని దృశ్యం

అంత్యప్రాసాన్ని

మరో పాట: ‘‘వినుడు వినుడు రామాయణ గాధా వినుడీ మనసారా’’ లో రామాయణ కథను పాటలో చెప్పడం చాలా కష్టం. సముద్రాల

‘‘అలుక తెలిసి ఏతెంచిన భూపతినడిగెను వరములు ఆ తన్వి,

జరుపవలయు పట్టాభిషేకమూ భరతుడికీ పృధివీ

మెలగవలయు పదునాలుగేడులూ రాముడు కారడవీ

చెలియ మాటకూ ఔను కాదనీ పలుకడు భూజానీ, కూలే భువిపైని…’’

అంటూ ఈ గీతంలో అంత్యప్రాసాన్ని ఎంత అందంగా వివరించారో గమనించాలి.

‘‘కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి

మోసమెరిగి సౌమిత్రి కటారీ దూసెను రోసిల్లీ

దోసమనీ వెనుదీసె తమ్మునీ రాముడు దయశాలీ

వనవాస దీక్షకూ సెలవు కోరె పినతల్లీ పదాల వ్రాలి

ఆ….. ఆ… ఆ… ఆ…

వెడలినాడు రాఘవుడూ అడవికేగగాపడతి సీత సౌమిత్రీ తోడు నీడగా

వెడలినాడు రాఘవుడూ అడవికేగగాపడతి సీత సౌమిత్రీ తోడు నీడగా

గోడుగోడున అయోధ్య ఘొల్లుమన్నదీవీడకుమా మనలేనని వేడుకున్నదీ

అడుగులబడి రాఘవా….అడుగలబడి రాఘవా ఆగమన్నదీ..

ఆగమన్నదీ .. ఆగమన్నదీ

అడలి అడలి కన్నీరై అరయుచున్నదీ’’

అని ఆ సముద్రాల రచన సాగుతూ ఉంటుంది.

ఇటువంటి పాటలు, నటులు, కళాకారులు, రచయితులు దొరుకుతారా?

కష్టపడిన వాడు ఇష్టపడి ఎదిగిన వాడురామారావ్

పుట్టిన నాటి కాలాన పెద్ద డబ్బున్నవాడు కాదు రామారావు. చదువుకున్నా కాలేజిలోనే ఆస్తి హరించుకుపోయిందట. జీవనం కోసం ఆయన పనులు రకరకాల పనులుచేసుకోవలసి వచ్చింది. కొన్నాళ్లు పాల వ్యాపారం, కిరాణా దుకాణం, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. కాని ఆయన గొప్ప క్రమబద్దపుజీవితం ఎన్ని డబ్బు ఇబ్బందులున్నా అప్పులుచేసేవాడు.  డిగ్రీ చదివిన తరువాత 1947 తరువాత మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసిన 1100 మంది నుంచిలో ఏడుగురిలో ఒకడు. మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం దొరకింది. జీవితం చాలు చాలు అనుకుంటే ఎన్టీ ఆర్ ఉండేవాడు కాదు. సినిమాలలో పట్టుదల ఉన్నా వాడికి జీతపు రాళ్లకోసం పనిచేసే రోజుల్లో మూడు వారాలకంటకన్నా ఉంటాడా? క్రమశిక్షణలో ఆయన చాలా కచ్చితంగా ఉండేవాడు.

ఎన్టీఆర్ ఫొటోను నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడై పోయాడు. పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించిందట. అప్పుడే సముద్రాలతో  మనదేశం అనే సినిమాలో అవకాశం రావడం ఒక కొత్త దారి దొరికింది. 1949లో వచ్చింది,  ఒక 1950లో పల్లెటూరి పిల్ల చిత్రం వచ్చింది. తరువాత ఎల్వీ ప్రసాదు గారి షావుకారు అప్పుడు నందమూరి తారక రామారావు సూపర్ స్టార్ జీవితం ప్రారంభమైంది. మద్రాసు లో థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకుఉండే వాడంటే ఎవరైనా అనుకుంటారా?

తన గంభీరమైన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు.

విజయావారివే ఎన్ టి ఆర్ సినిమాలన్నీ. మాయబజార్ ఒక అద్భుతం. వారి నందమూరి తారక రామారావు రూపంలో కృష్ణుని చిత్రాలను 40వేల క్యాలెండర్లు ముద్రించి అమ్మారట. ఇళ్లలో, షాపుల్లో ఆ క్యాలెండర్లకు ఫ్రేము కట్టించి పెట్టుకున్నారటే ఆశ్చర్యం. కంప్యూటర్ రంగంలో లాప్ టాప్ వలెకనబడే ప్రియదర్శిని అనే సందర్భాన్ని 1957లోనే మాయాబజార్ సినిమా సృష్టించారు. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు కొత్త పదాలు సృష్టించారు. అవే: తస్మదీయులు, దుష్టచతుష్టయం, జియ్యా, రత్న గింబళీ, గిల్పం, శాకంబరి దేవి ప్రసాదం, వంటివి.  మరొకొన్ని అద్భుతమైనవి… రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి మాటలు ఆణిముత్యాలు ఎప్పటికీ స్మృతిలో ఉండిపోతాయి. ఓ సందర్భంలో మాయాబజార్ సినిమాలొ ఎవరు హీరో అని అడిగితే అక్కినేని నాగేశ్వరరావు ఈ విధంగా అన్నారు “డ్యూయెట్ పాడినవాడు హీరో అయితే నేను హీరోను. ఫైట్లు చేసినవాడయితే ఎస్.వీ.రంగారావు. మగవాడు కాని హీరో సావిత్రి….” నిజమే.  కాని ఎన్ టీ ఆర్ ను మరిచిపోగలరా?

          సిఎన్‌ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా మాయాబజార్ ఎంపికైంది. అప్పట్లో పెట్టుబడి ₹33 లక్షలు (సుమారు) వసూళ్లు₹80 లక్షలు (సుమారు).  నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ, సుందరి నీవంటి, ఆహ నా పెళ్ళీ అంటా, వివాహభోజనంబు వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ తరువాత ఈ పాటల పల్లవులను సినిమా పేర్లే పోయాయి. లాహిరి లాహిరి లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు- ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, గుమ్మడి వెంకటేశ్వరరావు-ఘంటసాల పాడటం ఒక ప్రత్యేక విశేషం. నిజానికి చూపులు కలసిన శుభవేళా, నీవేనా నను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది పాటలు సంగీతం చేసింది సాలూరు రాజేశ్వరరావులే.  ఏదో ఇబ్బందులవల్ల సాలూరు గారి రాక పోవడం దురదృష్టం.  అయితే సాలూరు లేకుండా సముద్రాల లేకుండా కూడా మాయాబజార్ రావడం విశేషం,

ఎన్ టీ ఆర్ ను జీవితం

ఆ కాలంలో  ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. అప్పుడి కాలంలో పాతాళభైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1956లో మాయాబజార్‌లో 7500 రూపాయల పారితోషికం అపట్లో ఎక్కువ. 1959లో భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది.

శ్రీమద్విరాటపర్వములో అతను ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు గా బిరుదాంకితుడైన అతను 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు. (విడీపీకియా నుంచి కొన్ని విశేషాలు సేకరించినవి).ఎంత పెద్ద సంభాషణలనైనా కంఠతా పట్టి ఎన్టీఆర్ కెమెరా ముందు తడబడికుండా చెప్పేవాడు.

1950 సంవత్సరం ‘మాయారంభ’ సినిమాలో రామారావు నలకూబరుడిగా నటించారు. ఇద్దరు నటులు అక్కినేని, ఎన్టీఆర్ ‘సంసారం’ అఖండ విజయం సాధించింది. 1951 లో రామారావు సినిమాలు ‘పాతాళభైరవి’, వాహినీ వారి ‘మల్లీశ్వరి’ లో విజయంసాధించారు. పాతాళభైరవి 10 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. 200 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. మల్లీశ్వరి గొప్ప కళాఖండంగా ఖ్యాతి సాధించారు.  ‘పెళ్లిచేసిచూడు’ (1952) హాస్య సినిమాలో తెలుగు, తమిళభాషల్లో రజతోత్సవం జరుపుకుంది. బెజవాడ దుర్గాకళా మందిర్ లో 182 రోజులు నడిచి చరిత్ర సృష్టించింది. ‘అమ్మలక్కలు’, భానుమతి రామకృష్ణ మూడు భాషల్లో నిర్మించిన ‘చండీరాణి’(1953) చిత్రాలతోబాటు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలోమూడు తమిళ చిత్రాల్లో రామారావు నటించారు.

రాయలసీమ కరవు నివారణకోసం రామారావు నటీనటులను 24 రోజులపాటు రాష్ట్రం పర్యటించి లక్ష రూపాయల నిధులు వసూలుచేసారు.  1962లో చైనా యుద్ధం తరువాత, మరలా జోలె పట్టి పదిలక్షల విరాళాలు సమీకరించారు.  ఉద్యోగనిర్వహణలో వికలాంగులైన పోలీసు కుటుంబాలకోసం 1965లో నిధులు వసూలు చేసారు. పాకిస్తాన్ దాడి సందర్భంలో కూడా పది లక్షల రూపాయలు విరాళాలు పోగుచేసారు.

ఎన్టీఆర్ శతజయింతి

ఎన్టీఆర్ శతజయింతి సందర్భంగా సాక్షి పత్రికలో 2022లో  అనేక విశేషాలు సుదీర్ఘంగా ఇచ్చారు. అందులో సామాన్యంగా తెలియని అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ: ‘ఏంటి రామారావ్‌’ అన్నారు నాగిరెడ్డి. ‘సార్‌.. క్యాంటిన్‌లో మీరు నాకు ఇవ్వమని అలాట్‌ చేసిన టిఫిన్‌ సరిపోవడం లేదు. పెంచాలి’. నాగిరెడ్డి ఒక్క క్షణం సర్దుకున్నారు. సాధారణంగా ఆ స్టూడియోలో ఆర్టిస్టులకు ఇంత టిఫిన్, టెక్నిషియన్లకు ఇంత టిఫిన్‌ అని నిర్దేశించారు. ఎన్‌.టి. రామారావుకు కూడా అంతే ఇస్తున్నారు. ఒడ్డు పొడవు ఉండి, రోజూ కసరత్తు చేస్తూ, రాళ్లు తిని కూడా అరాయించుకునే ఆరోగ్యంతో ఉన్న రామారావు గురించి చిన్న ఏమరపాటు జరిగిందని ఆయనకు అర్థమైంది. వెంటనే క్యాంటిన్‌కు కొత్త ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజు ఆకలి గురించి కొట్లాడిన ఎన్‌.టి. రామారావు ఆ తర్వాత తెలుగువారి తొలి సినిమా రంగ ముఖ్యమంత్రి అయ్యి ఆకలిగొన్న వారందరికీ కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం చరిత్ర.’’  ఓ సందర్భంలో రావి కొండలరావుతో ఎన్‌.టి.ఆర్‌ ‘బ్రదర్‌… దుర్యోధనుడికి డ్యూయెట్‌ పెడతారా ఎవరైనా’ అని అడిగారు. రామారావును మెప్పిద్దామని ‘ఎవడు పెడతాడు సార్‌ బుద్ధి లేకపోతే గాని’ అన్నాడు. ‘మేం పెడుతున్నాం బ్రదర్‌ దాన వీర శూర కర్ణలో’ అన్నారు ఎన్‌.టి.ఆర్‌ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రావి కొండలరావు ఎన్టీఆర్‌ ఎదుట పడితే ఒట్టు. ఎన్‌.టి.ఆర్‌ దుర్యోధనునికి డ్యూయెట్‌ పెట్టి ‘చిత్రం… భళారే విచిత్రం’ అనిపించారు.

కర్ణుడుగా ఎన్ టీ ఆర్

‘‘ఆగాగు ఏమంటివి ఏమంటివి’’

ఇక ఎన్‌.టి.ఆర్‌కు కర్ణుడి మీద సానుభూతి దృష్టి రావడానికి తమిళ ‘కర్ణన్‌’ కారణం. శివాజీ తమిళంలో చేసిన ‘కర్ణన్‌’ కర్ణుడు ఎంత గొప్పవాడో వర్ణదృష్టితో చెబుతుంది. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్‌కు ఇది నచ్చింది. ఆ సినిమాకు మాటలు రాసింది శక్తి కృష్ణసామి. ఈ రచయితే ‘వీరపాండ్య కట్టబొమ్మన్‌’కు  మాటలు రాసి తమిళంలో ఉధృత డైలాగ్‌ ఒరవడిని సృష్టించాడు. ఆ స్థాయిలో డైలాగ్స్‌ ఉండాలని కొండవీటి వెంకటకవిని ఒప్పించి రాయించారు ఎన్‌.టి.ఆర్‌. అసలు దానవీర శూర కర్ణ ఒక రకంగా శబ్ద చిత్రం. కేవలం మాటలు విన్నా చాలు. ఆ మాటలు ఒక్క ఎన్‌.టి.ఆరే చెప్పగలరు. హితుడా… ఆగాగు ఏమంటివి ఏమంటివి… నటుడికి ధారణశక్తి, ఉచ్ఛారణ శక్తి, వాచక ఔన్నత్యం ఉండాలి. ఏ కాలంలో అయినా నటుడు అనే వాడికి ఎన్‌.టి.ఆర్‌ వదిలి వెళ్లిన సిలబస్, పరీక్ష పేపర్‌ ఈ డైలాగ్‌. తమాషా ఏమిటంటే ‘దొంగ రాముడు’, ‘భలే రాముడు’, ‘అందాల రాముడు’ అక్కినేని చేసినా ‘రాముడు’ టైటిల్‌కు పేటెంట్‌ ఎన్‌.టి.ఆర్‌ పరమే అయ్యింది. అక్కినేని ‘అనార్కలి’ చేస్తే ఎన్‌.టి.ఆర్‌ ‘అక్బర్‌ సలీంఅనార్కలి’ చేశారు. అక్కినేని క్షేత్రయ్య చేస్తే ఎన్‌.టి.ఆర్‌ వేములవాడ భీమకవి చేశారు. అక్కినేని మహాకవి కాళిదాసు. ఎన్‌.టి.ఆర్‌ శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సన్నిహితాలకు సామీప్యాలకు అంతే లేదు. కాని వీరిరువురూ కలిసి నటించిన సినిమాలలో ‘మిస్సమ్మ, మాయాబజార్‌’ చిన్న రసాలు.. పెద్ద రసాలు.

ఎన్‌.టి.ఆర్‌  తన దారిన తాను ప్రయోగాలు చేస్తూనే వెళ్లారు. బాలీవుడ్‌లో స్టార్ల సినిమాలకు తెలుగులో ఎన్‌.టి.ఆరే సూట్‌ అయ్యారు. అమితాబ్‌ ‘జంజీర్‌’– ‘నిప్పులాంటి మనిషి’గా, ‘డాన్‌’ – ‘యుగంధర్‌’గా, రాజేష్‌ ఖన్నా ‘రోటి’– ‘నేరం నాది కాదు ఆకలిది’గా, ధర్మేంద్ర ‘యాదోంకి బారాత్‌’– ‘అన్నదమ్ముల అనుబంధం’గా ఆయన నటించారు.

39 ఏట ‘భీష్మ’లో, 49 ఏట ‘బడి పంతులు’ లో  పూర్తి వృద్ధ పాత్రల్లో చేయడం ఆయనకే చెల్లింది. కృష్ణ, రజనీకాంత్, చిరంజీవిలతో మల్టీస్టారర్స్‌ చేశారు. కాని దాసరి రావడంతో అక్కినేనికి బలం దొరికినట్టు కె. రాఘవేంద్రరావు రావడంతో ఎన్‌.టి.ఆర్‌కు బలం దొరికింది.

కె. రాఘవేంద్రరావు ఎన్‌.టి.ఆర్‌ను ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా డైరెక్ట్‌ చేశారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ తీసిన ‘అడవి రాముడు’ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా ఉండాలో చూపింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘వేటగాడు’, ‘గజదొంగ’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్‌ చౌదరి’ వంటి భారీ హిట్స్‌ ఇవ్వడం ఎన్‌.టి.ఆర్‌ను లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌కు చేర్చింది. అదే సమయంలో దాసరి ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ తీసి ఎన్‌.టి.ఆర్‌ కెరీర్‌ని పతాక స్థితికి తీసుకెళ్లారు. ఇక సినిమాల్లో చేయాల్సింది ఏమీ మిగల్లేదు అని అనిపించే స్థితి. ఎన్‌.టి.ఆర్‌ జనం గురించి ఆలోచించిన సమయం. ఆయన రాజకీయ ప్రవేశంతో తెలుగు తెర పగటి తీక్షణతను, రాత్రి వెన్నెలను ఒక మేరకు కోల్పోయింది. ఇవన్నీ సాక్షి ప్రత్యేక రచనలో కొన్ని విశేషాలు.

రెండు విశిష్ట నాటకాలు ‘కన్యాశుల్కం’, ‘చింతామణి’లో ఆయన ఎన్టీఆర్ నటించాడు. ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో శ్రీ కృష్ణ దేవరాయలుగా అద్భుతంగా నటించాడు. అయితే అపజయాలు కూడా చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ‘చంద్రహారం’, ‘కాడెద్దులు – ఎకరం నేల’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘అమ్మాయి పెళ్లి’, ‘అక్బర్‌ సలీం అనార్కలి’, ‘సతీ సావిత్రి’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రాజపుత్ర రహస్యం’, ‘సామ్రాట్‌ అశోక’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటివి కూడా ఉన్నాయి.

          అప్పడికి రాజకీయాల్లో రాణించిన రామారావ్ ముఖ్యమంత్రి గా కూడా సినిమాలు నటించడం ఒక పెద్ద రాజ్యాంగ వివాదంగా తయారైంది. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ (1991), ‘సామ్రాట్ అశోక’ (1992) ‘మేజర్ చంద్రకాంత్’ (1993) చిత్రంతో సినిమాల చరిత్ర ముగించారు. అంతకుముందు శ్రీనాథుడిగా నటించారు. ముఖ్యమంత్రిగా, తరువాత ఎంఎల్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా సినిమాలో నటించారు.

సూపర్ హీరో

          ఎన్ టి రామారావ్ తెలుగు సినిమాలోనే కాకుండా తెలుగు చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి.  సినిమాలో రాణించిన రామారావ్ ఆ చరిత్రలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరారు. ఎంతమంతమంది హీరోలు ఉన్నా రామారావ్ నిజంగా హీరో ఒక్కడే. అయితే మరో గొప్ప హీరోలతో పొల్చడం అవసరం లేదు. ఇదివరకు నాగేశ్వరరావుగారి వలె లేదా కృష్ణ హీరో ఎందుకు రాజకీయాల్లో లేదు అనే ప్రశ్న కూడా అవసరం లేదు. చిరంజీవి వంటి చాలా గొప్ప సినిమా హీరో గా రాజకీయాల్లో ఉన్నా రామారావ్ వలె గొప్పగా ఎందుకు లేరేంటే కారణం, దానికి ఎన్ టి ఆర్ ధైర్యం అవసరం అని తెలుసుకోవాలి.  చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి మారి దాసరి నారాయణరావు కూడా కేంద్ర మంత్రి అయ్యారు. కొందరు పార్టీ రద్దు చేసుకున్నారు. లేదా వేరే పార్టీలో లీనమైపొయారు. చివరిదాకా పోరాడిన వాడు ఒక్కడే ఎన్ టి ఆర్. కాని రాజకీయాల్లో మురికిలో బురదలో మునిగిపోయి కొందరు రాజకీయ పదవీ రాజకీయాల్లో అధికారాలు సంపాదించుకున్నారు. మరికొందరు మరుగుపడిపోయారు. 

ఎన్ టి ఆర్ కేవలం అధికారం కోసం వలల్లో ఇరికిపోయారు.

ఎన్ టి ఆర్ ఒంటరిగా ఉన్నా పొరాడారు.

ప్రాణం పోవడంవల్ల కాకపోతే  ఆయన పొరాడాన్ని ఆపి ఉండేవారు కాదు.

.. .. ..

ఎంత మంది పుడితే దొరుకుతారో ఇటువంటి మనీషులు ఉంటారు? సినిమాల రచయితలు, దర్శకులు, తోటి నటీనటులు, ఆదరించిన సినిమా ప్రజలు, రామారావ్ జీవితంలో చేసిన సినిమాలు ఆయనను అభిమానులతో విజృంభించిపోయారు. పెంచిపోయారు. ఒక్కొక్క సినిమాతో ఎన్ టి ఆర్ ఎదిగిపొయారు. తెలుగు జీవితంలో, దేశ జీవితంలో నిలిగిపోయారు. తెలుగు విశ్వనట చక్రవర్తి ఎన్ టి రామారావ్. అన్నింటికన్నా ఒక గొప్ప రాజకీయ నాయకుడు రామారావు గారు. 60 సంవత్సరాల దాకా నట చరిత్రలో అనేక కీర్తి శిఖరాలు అందుకున్న ఎన్టీఆర్ రాజకీయనాయకుడై, కొత్త పార్టీని నిలబెట్టి గెలిచిన ధీరుడు. 

ఎన్ టీ ఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటిస్తున్నబాలకృష్ణ, తదితరులు

రాజకీయానికి బలిపోయిన రామారావు

ఒక మంచి మిత్రుడు, ఆత్మబంధువు, వేలాది కోట్ల హృదయాలలో కొలుగైన దేవుడు.

రాజకీయం కోసం, కొందరు పదవుకోసం. ఒక జీవిని మాయం చేసారు.

ఈనాటి ‘బ్రూటస్’ ..

కుట్ర వెన్నుపోటు బాధితుడు ఎన్ టి ఆర్.

పాపం చాలా కష్టపడ్డాడు, చాలా మంది కలిసి చంపేసారు.

అందరూ కలిసి చంపారు, ద్రోహులు, బంధువులు, ఆప్తబంధువులు, రక్త బంధువులు, రక్తం తీసుకున్న కబంధులు, రాజకీయాలకోసం చంపారు.

ఉన్నత అధికారులనుకునే వారు, ఆతరువాత రాజకీయానికి చేరిన వారు, ఎంతో డబ్బున్న సంపన్నులు, కొందరు జర్నలిస్టులు పెన్నుపోటు పొడించినారు. ఎంపీలు, ఎంఎల్యేలు…  మానవత్వం లేదు. ఎన్నడూ చట్టానికి దొరకని దొంగలు.నమస్కరిస్తూ కన్ను పొడిచారు. వెన్ను పొడిచారు. ఇవ్వాళ ఆయన వర్థంతి అంటారు. జయంతి కాదు. చనిపోయిన రోజు కాదు. చంపేసిన రోజు.

వాళ్లంతా బ్రూటస్ లు. రోమ్ చక్రవర్తిని ఒక్కొక్కడిని కింద పడి ఛాతి మీద కత్తి పొడిచి చంపారు. కాని నందమూరి తారక రామారావ్ కు వెనుక, ముందు, పైన, కింద పొడిచి చంపారు. చంపిన తరువాత లక్షలాది విగ్రహాలు నెలకొల్పారు. కోట్లుఎగ్గొట్టి అవార్డులు ఇస్తారు.

ఇందిరాగాంధీ తో ఎదురునిలబడిగెలిచిన వాడు గొప్ప వ్యక్తి రామారావ్. అయితే కుట్రల, దుర్మార్గుల వెన్నుపోటుకు గురిపోయారు. ఆయనకు చరిత్రలొ మిగిలిపోతాడు. ఆయన తరువాత ముఖ్యమంత్రులు అవుతారేమో కావచ్చు కాని…ఎన్టీఆర్ చిరంజీవిగా నిలబడు ఉండితారు.

కనుక

ఆది కావ్యమైన రామాయణం నుంచి ఈనాటిదాకా కథలు, కవితలు, చిత్రాలు సినిమాలు నిలబడినప్పుడు, అందులో ఒకడుగా నందమూరి తారక రామారావు మిగిలి నిలిచి ఉంటాడు. మిగతావారు పోతే పోతారు. ఎన్టీ ఆర్ ఉంటాడు, ఉండిపొతాడు. అందుకని మనదేశపు రామాయణ భాగవత భారతాలేఎన్టీఆర్ చలనచిత్ర దృశ్య కావ్యాలు అవుతాడు. (25.5.2023)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles