Friday, April 19, 2024

భీమా-కోరెగాం కేసులో నిందితులను విడుదల చేయండి

  • ప్రధానికీ, ప్రధాన న్యాయమూర్తికీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రికీ అంతర్జాతీయ మేధావుల లేఖ
  • నోమ్ చామ్ స్కీ, తదితర 56 మంది నోబెల్ బహుమతి విజేతలూ, యూరోపియన్ పార్లమెంటు సభ్యులూ, జర్నలిస్టులూ విజ్ఞప్తి

దిల్లీ: భీమా-కోరేగాం కేసులో బందీలుగా ఉన్న 16 మంది రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నోబెల్ బహుమతి గ్రహీతలూ, యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులూ, విద్యావేత్తలూ, రచయితలూ, మేధావులూ ప్రధాని నరేంద్రమోదీకీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణకూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ బాల్ ఠాక్రేకూ, ఇతర బాధ్యులకూ లేఖ రాశారు.

ఆందోళక కలిగిస్తున్న అనారోగ్యకరమైన పరిస్థితులలో భారత దేశంలోని మానవహక్కుల యోధులను జైలులో కొనసాగించడం, వారికి సరైన వైద్యసదుపాయం కూడా లేకుండా చేయడం, కరోనా వ్యాధి సోకే అవకాశాలు బాగా ఉన్న వాతావరణంలో రాజకీయ ఖైదీలను ఉంచడం పట్ల అంతర్జాతీయ ప్రముఖులు ఖేదం వెలిబుచ్చారు. భారత దేశంలోని ఏడుగురు ప్రముఖులను ఉద్దేశించి రాసిన ఈ ఉత్తరం ప్రతిని యూరోపియన్ యూనియన్ మానవహక్కుల కమిషనర్ కు కూడా పంపించారు.

ప్రముఖ విద్యావేత్త, భాషావేత్త నోమ్ చోమ్ స్కీ, ఎకపక్ష నిర్బంధాలపైన పని చేసే ఐక్యరాజ్య సమితి బృందం మాజీ అధ్యక్షుడు జోసే ఆంటోనియో గువేరా-బెర్ముడెజ్, నోబెల్ బహుమతి గ్రహీతలు ఓల్గా టొకెరాజుక్, వోలే సోయింకా, కొలంబియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రొఫెసర్ పార్థా చటర్జీ, బ్రౌన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అసుతోష్ వార్ష్ నీ, మానవహక్కుల నాయకుడు షహీదుల్ ఆలం,గార్డియన్ మాజీ ప్రధాన సంపాదకులు యూకె అలన్ రస్ బ్రిడ్జర్, జర్నలిస్ట్ నవోమీ క్లీన్ ఈ లేఖపైన సంతకాలు చేసినవారిలో ఉన్నారు.

తగినంత నీరు లేక, వైద్య పరికరాలు లేక జైళ్ళలో పరిమితికి మించి ఖైదీలు ఉన్న కారణంగా  అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయనీ, కోవిద్ సోకిన ఖైదీల విషయం మరింత ఆందోళనకరంగా ఉన్నదనీ లేఖలో తెలియజేశారు.

పదహారు మంది మానవహక్కుల కార్యకర్తలనూ వెంటనే విడుదల చేసి వారి ప్రాణాలు కాపాడాలని రాజకీయ నాయకులకూ, న్యాయస్థానాలకూ రాసిన లేఖపైన సంతకాలు చేసిన ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఇండియా జైళ్ళలో వేలమంది మగ్గుతున్నారనీ, వారిలో భీమా-కోరేగాం (బీకే)-16 గ్రూపుకు చెందిన రాజకీయ ఖైదీలు ఉన్నారనీ, వారిలో నలుగురు విద్యావేత్తలూ, ముగ్గురు న్యాయవాదులూ, ఇద్దరు స్వతంత్ర జర్నలిస్టులూ, ఒక యూనియన్ నాయకుడూ, ఒక సామాజిక కార్యకర్త, ఒక కవి (వరవరరావు), ముగ్గురు కళాకారులూ, ఒక క్రైస్తవమతాచార్యుడూ ఉన్నారనీ, వీరిలో అత్యధికులు వయోవృద్ధులనీ, అందరూ మానవహక్కులకోసం అంకితభావంతో పోరాడేవారేననీ లెఖలో పేర్కొన్నారు. కార్మికులూ, దళితులూ, మైనారిటీలూ, ఆదివాసీల హక్కుల కోసం శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసే క్రమంలో  రాసేవారనీ, మాట్లాడేవారనీ తెలిపారు. ఈ 16 మందిలో కనీసం ఆరుగురికి కోవిడ్ వ్యాధి సోకిందరీ, ఇతరలు అంటువ్యాధి సోకి వివిధ స్థాయిలలో ఉన్నారనీ వారిని మల్టీస్పెషాలిటీ వసతి కలిగిన ఆస్పత్రులకు తరలించాలనీ, వెంటనే వారిని విడుదల చేయాలనీ మేధావులు కోరారు. రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేసి వారి కుటుంబాలకు అప్పగించాలనీ, క్రిక్కిరిసిన జైళ్ళలో వారిని కొనసాగించడం క్షేమదాయకం కాదనీ మేధావులు వ్యాఖ్యానించారు. మొత్తం 57 మంది అంతర్జాతీయ ప్రముఖులు ఈ లేఖపైన సంతకాలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles