Saturday, April 20, 2024

చీమకు, బ్రహ్మకు కూడా అహంకారం ఉండదా?

మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై 22

అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.

తెలుగు భావార్థ గీతిక

విపులాచ పృథ్విపై భూములేలెడు రాజుల మెల్ల కదలి

గుంపులు గుంపులుగా గూడి నీ పాదపీఠము కింద

అహంభావము వీడి నీవె శరణనుచు జేరినాము

చిరుమువ్వ అరవాయి, అరవిరియు కమలమ్మువోలె

ఒక కంటరవి, మరొక కంట శశి ఏకకాలాన వచ్చినట్టు

వాత్సల్యమెరుపైన కన్నుఅరవిచ్చి చూడవయ్య

 ఆచూపుసోకిన జాలు మాశాపాలు పాపాలు కాలి పోవు

మాయలెరుగని మాకు నీ చూపులే నోముఫలములయ్య

ఆచార్యుల అనుగ్రహం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. గోవులకు ఆచార్యులకు ఉదార స్వభావం ఉంది. పిండకుండానే కుండలు నింపే పాలు ఇస్తాయి గోవులు. అడిగిన వెంటనే అపారమైన జ్ఞానాన్ని కురిపించే వారు గురువులు.

Also read: ‘‘సర్వే వేదాః కృష్ణా’’ వేదాలు చెప్పేది కృష్ణుడే

నేపథ్యం:

శ్రీ రామానుజాచార్య వంటి ఆచార్యులైతే ఎవరూ అడగకపోయినా ఒకేసారి అందరికీ విముక్తి కలగాలని మంత్రార్థాలను మందిర గోపురాలు ఎక్కి వివరించగల అపారమైన దయగలిగిన వారు. ఆత్తపడైత్తాన్ అంటే లెక్క లేనన్ని ఆవులు కలిగి, 74 సింహాసనాధిపతులు, 700 జీయరులు మూడు కోట్ల భాగవతోత్తములతో నిండిన శిష్యసంపత్తిగలవారు రామానుజులు. అటువంటి ఆచార్యులకు మగనే కుమారుడా అనగా యతిరాజ సంపత్కుమారా లేవ వలసినదని, మా ఆచార్య పుత్రుడవైనందుకు మమ్మల్ని రక్షించాలి కదా అని నిన్నటి గోదాగీతం ప్రస్తావిస్తున్నది.

రవి అస్తమించదనుకున్న బ్రిటిషు సామ్రాజ్యం, ప్రపంచాన్ని జయించాలనే హిట్లర్ దురాశ, సోషలిస్టు సామ్రాజ్యం, మనదేశంలో ఓడిపోదనుకున్న నియంతరాజ్యాలు కనుమరుగైపోయాయి. పోతాయి.  రాముడు బుద్ధుడే రాజ్యాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నవారు. రామునికి రాజ్యంపైన అభిమానం లేదు. బలవంతంగా రాజులను దించాల్సిందే. రాజులు ఉండరు. అవుతారు, రాజ్యాలు ఉండవు. కలుగుతాయి.

Also read: ముక్కోటి దేవుళ్లు ముప్పు వచ్చెనంచు విన్నవించకమున్నె

ఈ పాశురం మనకు పోతనను గుర్తు చేస్తుంది. తన భాగవత కావ్యాన్ని రాజుగారికి అంకితం ఇవ్వాలని ప్రతిపాదిస్తే, నిరాకరిస్తూ ‘‘ కారే రాజులు, రాజ్యముల్ కలుగవే వారేరీ సిరిన్ మూటం గట్టుకపోవజాలిరే …’’ అని బలి పాత్ర ద్వారా  నిరసిస్తాడు భక్తకవి పోతన. భాగవతం తనకు అంకితం ఇవ్వనందుకు అప్పటి చిన్న రాజొకడు పోతన్న మీద రాజద్రోహం నేరం మోపి స్థిరచరాస్తులన్నీ స్వాధీనం చేసుకుంటాడు. ఆ రాజు పేరు ఎవరికీ తెలియదు. పోతన్న భాగవతం ఈనాటికీ వెలుగుతూనే ఉంది.

దాశరథి రంగాచార్యులు ‘‘పిడికిలి బిగించి వస్తాడు. చేతులు చాచుకుపోతాడు’’ అంటూ అన్నీ అశాశ్వతం అనే శాశ్వత నియమాన్ని అందంగా చెప్పారు. భూమి చిన్న మట్టి ముద్ద. ఈ మహాసృష్టిలో అది అణువంత: ఈ అణువులో మరింత చిన్న చుక్కంత రాజ్యం కోసం యుధ్దాలు చేస్తున్నారు. గెలుస్తున్నారు అనుభవిస్తున్నారు, అని రాజ్యం వదిలి సుకవి అయిన భర్తృహరి. సుకవితా యద్యస్తిరాజ్యేనకిం? అక్షరాన్ని మించిన అర్థం (సంపద) ఏముంది అంటున్నాడు.  జ్ఞానికి భూమండలం అణువుగా కనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానం భూమండలం కన్న గొప్పది. అజ్ఞానికి తనకున్న అణువంత భూమి అధికారమే మొత్తం భూమండలం అనిపిస్తుంది. అజ్ఞానం అంధకూపం వంటిది. ‘‘కానలేకున్న సింధువు బిందువయ్యే, కాన గల్గిన నా బిందువె సింధువయ్యె’’. 

Also read: సీతారాములు కాదని శూర్పణ రావణులను కోరుతారా

అజ్ఞానులైన అహంకార రాజులు అధికారం కోసం మారణ హోమం చేస్తున్నారు. ప్రజనుచీల్చి హింస విధ్వంసం సృష్టిస్తున్నారు. వారూ కనుమరుగౌతారు, వారి అభిమానాలు భంగమవుతాయి అని గోదమ్మ సుకవి భర్తృహరి మాటను తమిళ పాశురంలో వివరిస్తున్నారు. ఆండాళ్ అమృత భాండాన్ని తిరుప్పావై రూపంలో అందించావు. ప్రతి పాశురం అమృత చషకం, మనముందే ఉంది, కాని మన జ్ఞానం పరిమితం దోసిలి చిన్నది, ఎంత తీసుకోగలం అని దాశరథి ప్రశ్నించారు. అహంకార మమకారాలు తొలగిపోవాలి. తొలగించడానికి స్వామి అనుగ్రహం కావాలి. రాజ్యం స్వచ్ఛందంగా వదులుకున్న వారు రాముడు బుద్ధుడు భరతుడు. రాజ్యాన్ని ఆశ్రయించబోనని పోతన, అన్నమయ్య అహంకారాలను వదిలించుకుని నారాయణుడిని ఆశ్రయించి ఆత్మజ్ఞానం సాధించి చరిత్రలోమిగిలిపోయిన అక్షర సంపన్నులు, మహానుభావులు.

శత్రురాశులు తమ బలాన్ని అభిమానాన్ని కోల్పోయి నీ శరణుజొచ్చినారు, మేము కూడా దేహాత్మాభిమానాలను వదులుకుని భగవంతుని శరణాగతి చేస్తున్నారని ఈ 22వ పాశురంలో ఆండాళ్ వివరిస్తున్నారు.

అర్థం:

అమ్ = అందమైన, కణ్ = విశాలము, మా = పెద్దదీ అయిన ఞాలత్తర్ శర్ =ఈ భూమిని పాలించిన, అర్ శర్ = రాజులంతా, అభిమాన భంగమాయ్ =తమఅహంకారం విడిచి, వందు =వచ్చి, నిన్= నీ, పళ్లిక్కట్టిల్ కీజే = మంచం కింద, శఙ్గం =సంఘములుగా, ఇరుప్పార్ పోల్ = దాసులైఉన్నట్టే, వన్దు = వచ్చి తలైప్పెయ్ దోమ్ =మేము కూడా వచ్చి చేరిపోతిమి, కింగిణి =సిరిమువ్వ గజ్జెల వలె, వాయ్ చ్చెయ్ ద = నోరు తెరిచినట్టు, తామరైప్పూప్పోలే = తామర పూవుల వలె, శెమ్ కణ్ = వాత్సల్యచు చేత ఎర్రనైన నేత్రములను, శిణిచ్చిఱిదే = నెమ్మదినెమ్మదిగా కొద్దికొద్దిగా, ఎమ్మేల్ = మాపైన, విజియావో = ప్రసరింపచేయవా, తింగళుం= చంద్రుడూ, అదిత్తియమం= సూర్యుడూ, ఎజన్దార్ పోల్ = ఒకేసారి ఉదయించినట్టు చల్లని కాంతులీనుతూ, ఇరణ్డుం కొండు = రెంటిలోనూ, ఎంగళ్ మేల్ = మాపైన, నొక్కుదియేల్= చూపినట్టయితే, ఎంగళ్ మేల్ = మాపైనున్న, శాపమ్ = పాపములన్నీ నశిస్తాయి, ఏల్ ఓర్ ఎం పావాయ్ = ఇదే మా గొప్ప నోము.

అంతరార్థం

సుందరమైన విశాలమైన ఈ భూమినేలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనే అహంకారం వదులుకుని, తమను జయించిన సార్వభౌముని సింహాసనం కిందకు గుంపులుగుంపులుగా చేరినట్లు, మేము కూడా మా అభిమానాన్నిభంగం చేసుకుని వచ్చిఉన్నాం. చిరుగజ్జె ముఖం వలె, విడియున్న తామరపూవు వలె, వాత్సల్యంతో ఎరుపెక్కిన నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై చూపులను ప్రసరింపజేయి. సూర్య చంద్రులు ఇరువురు ఒకే సారి ఆకాశంలో ఉదయించినట్టున్న నీ రెండు నేత్రాలతో మమ్ము కటాక్షిస్తే మేము అనుభవించక తప్పని శాపములను, కర్మములు కూడూ మమ్మల్ని వీడిపోతాయి అందుకే మా ఈ వ్రతము అని గోపికలు అంటున్నారు.

Also read: ‘‘వాత్సల్యాది గుణోజ్జ్వలాం వందే జగన్మాతరం’’అలవేలుమంగ
విశేషార్థం
చీమకు బ్రహ్మకు కూడా అహంకారం సమంగానే ఉంటుందట. చీమకున్నంతలో చీమ అంతా తనదే ననుకుంటుంది. ‘నేను’ అనుభవిస్తున్నాననీ ‘నేనే’ చేస్తున్నానని అహంభావిస్తుంది. అయితే బ్రహ్మకే లభించని మోక్షం చీమకు ఏ విధంగా లభిస్తుంది? బ్రహ్మ ముందుగా తనకు విశాలమైన సంపద తన వల్లనే ఉందనుకుంటాడు. ఆ సంపదనంతా పరమాత్మకు సమర్పించి మోక్షము పొందాలని కోరుకుంటే, తన అత్యధిక సంపద అంతా సమర్పించడానికి చాలా సమయం పడుతుంది. ఆయన కోరిక ననుసరించి ఫలితంకూడా ఆ విధంగానే ఉంటుంది. ఏమీ లేని సామాన్యుడు ‘‘నాకేమీ లేదు అంతా భగవానుడే’’ అనుకుని నిశ్చింతగా ఉంటాడు. ఇతను ఇచ్చేది ఏమీ లేదు, ఆచరించేదీ ఏమీ లేదు. అంతా ఆయనే అనుకుని అన్నీ ఆయనకే వదిలిన వాడు గనుక భగవంతుడే ఆతని బాధ్యత వహిస్తాడు. అదే శరణాగతి. కనుక వాడు నిశ్చింతగా మోక్షం పొందుతాడు. చీమకే సులువు, సామాన్యుడికే మోక్షం సులువు.

నమ్మాళ్వార్ కథ

కొంతకాలం రాజ్యమేలిన ఒక రాజు రాజ్యంపోయిన తరువాత శరీరపోషణం కూడా కష్టమయ్యేదశకు చేరుకున్నాడు. ఇదివరకు రాజునన్న అహంకారం ఇంకా ఉండడం వల్ల పగటికూడా బిచ్చమెత్తడానికి కష్టమనిపించి, రాత్రి ఎవరూ చూడకుండా చీకటిలో బిచ్చమెత్తుకుందామని కుండపట్టుకుని వెళుతున్నాడు. దారిలో ఒక నల్లని కుక్క ఒకటి పిల్లలను కని ఉంది. తన పిల్లలకు హాని కలుగుతుందేమోనని చాలా కోపంతో ఉంది. దాని రంగు నలుపు చీకటిలో కలిసిపోయి అది కనిపించడం లేదు. దానిపైన రాజు కాలు పడింది. కుక్క వెంటనే గట్టిగా కరిచింది. అరుస్తూ రాజు కుండ జార్చుకున్నాడు. చప్పుడుతో కుండ బద్దలైంది. ఆ సందడికి చుట్టుపక్కల వాళ్లు దీపం వెలిగించి ఏమైందో చూసారు. రాజు సంగతి తెలిసి పోయింది. తన అభిమానం మరింతగా దెబ్బతిన్నది. ఇన్ని కష్టాలిచ్చే రాజ్యాన్ని ఆశ్రయించి చెడిపోకుండా శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించండి అని నమ్మాళ్వారులు హితోపదేశం చేశారు. రాజరికంతో పాటు అభిమానం వస్తుంది. కాని రాజ్యం పోయినపుడు అభిమానం పోదు. ఒకవేళ అభిమానం పోయినా నిరాశ నిస్పృహ తెచ్చుకుని ఏ అడవుల్లోనో దాక్కునే బదులు ఆత్మను ఉజ్జీవింపచేయడానికి సాధనమైన పరమాత్మసన్నిధానానికి చేరుకోవాలలని నమ్మాళ్వార్ ప్రబోధించారు. రాజ్యం నామ మహావ్యాధి: అచికత్సో వినాశనః  అంటే రాజ్యం అనేది స్వరూపాన్ని నాశనం చేసే, చికిత్స లేని మహా వ్యాథి. రాజ్యం ఉంటే అహంకారం, పోతే కలిగే దైన్యము విచిత్రంగా ఉంటాయి. కనుక దానిని నమ్ముకుని బాధపడకుండా శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించాలని నమ్మాళ్వార్ ఉపదేశం ఈ పాశురంలో తళుక్కున మెరుస్తుంది.


స్త్రీలు తమంత తాము పురుషులవద్దకు వెళ్లడం స్త్రీత్వానికి తగదనే అభిమానాన్ని గోపికలు వదులుకుని శ్రీకృష్ణ పరమాత్మవద్దకు రావడం ఎంతో భాగ్యం ఉంటే గాని సంభవించదు.


భరతుడు ఎన్నడూ రాజునన్న అహంకారాన్ని దగ్గరకు రానీయలేదు. రాజ్యంపైన ఆయనకు ఆశలేదు. అభిమానమూ లేదు. ఒక సారి ఏకాంతముగా ఉన్నప్పుడు తల్లి కైక తనను రాజన్ అని సంబోధిస్తే భరతుడుభరించలేక మూర్ఛపోయినాడట. రామునికి దూరంగా ఉండడంవల్ల గుహుడు భరద్వాజుడు కూడా భరతుడు నిజంగానే రాముని రప్పించడానికే అడవులకు వెళ్తున్నాడా అని శంకించారట. తనదోషం లేదని, రాముని రఫ్పించడానికే వెళ్తున్నానని ఆయన పదేపదే అందరికీ చెప్పుకోవలసి వచ్చేది. దానికి కారణం ఆయన రాముని సన్నిధానంలో లేకపోవడమే. లక్ష్మణుడికి ఆ బాధ లేదు. రాముని సన్నిధానాన్ని వదలలేదు కనుక ఎవ్వరి అనుమానాలకు జవాబు చెప్పుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

Also read: పరమాత్మను ఇచ్చేది యశోద మంత్రము

చక్రవర్తి కుమారుడు చిన్నవయసులోతప్పి పోయి వేటగాని చేతిలో చిక్కి, అతని పెంపకంలో అతని బుద్దులే అలవరుచుకుంటాడు. వేటగాడవుతాడు. అదృష్ఠంకొద్దీ తన తండ్రి రాజని తెలుస్తుంది. మరల తండ్రిని చేరుకోవడం వంటిదే జీవులు పరమాత్మను చేరడం. దాన్నే రాజులు భగ్నాభిమానులై చక్రవర్తిని చేరడం, గోపికలు శ్రీకృష్ణపరమాత్మను చేరడం.
శ్రీమద్రామాయణంలో సీత వానరులకు రామునితో సమాగమం ఏ విధంగా సంభవిందని ఆశ్చర్యంతో హనుమను అడిగినారట. అదొక పెద్ద వింత. హనుమ వివరిస్తాడు. అదేవిధంగా జీవాత్మ పరమాత్మల సమాగమం కూడా ఒక వింతేనట. అదేరీతిలో గోపికలకు శ్రీకృష్ణునికి సమాగమం కలగడం కూడా ఎంతో వింత, అదృష్టం కూడా.సూర్యకిరణాల వల్ల పూర్తిగా ఇంకా వికసించక వికసిస్తూ ఉన్న తామరపూవు వలె స్వామి దృష్టి ఉండాలట. తామరపూవు కింకిణి వలె నుండాలట. కింకిణి అంటే చిరుగజ్జె. లోపలచిన్న రాయి ఉంటుంది. అది కనబడకుండా, బయట పడిపోకుండా కొంచెం తెరిచినట్టు ఉంటుంది. తామర పూవులో తుమ్మెద కనపడుతూ, పూర్తిగా విడిపోకుండా కాస్త తెరిచి ఉన్నట్టు కింకిణి వలె ఉందట. అటువంటి తామర పూవు వంటి నేత్రాలతో తనను చూడాలని కోరుకుంటున్నారు. కనులలో నల్లని గ్రుడ్డు కనబడుతూ ఎఱ్ఱని కాంతులు వెదజిమ్ముతూ సగం వికసించిన నేత్ర సౌందర్యాన్ని చూడాలని గోపికలు తహతహ లాడుతున్నారు.


అపరాధాలుచేసిన చేతనులను చూడగానే పరమాత్మవీరిని చూడరాదని కోపించి కళ్లు పూర్తిగా తెరవడట. నీళాదేవి పరమాత్మపై చేయి వేసి కరుణచూపాలని ఉద్భోదిస్తే నేత్రాలు కాస్త వికసిస్తాయట. జీవుల తప్పుడు కర్మల వల్ల స్వామి నేత్రాలు ముకుళిస్తాయి. కర్మానుగుణంగా చేతనులకు ఫలం ఇవ్వాలని పరమాత్మ భావన. ఈ కర్మ పారతంత్ర్యమువలన పరమాత్మ కన్నులు ముకుళింపజేస్తే, నమ్మిన వారిని ఆదుకోవలసి ఉంటుంది కదా అనే అమ్మవారి కరుణ వల్ల ఆశ్రిత పారతంత్ర్యము వికసింప చేస్తుంది. తామరపూవులు వికసించడానికి సూర్యరశ్మి ఎంత అవసరమో పరమాత్మనేత్రాలు వికసించడానికి జీవుల ఆర్తి ప్రధానం. తెరచీ తెరవి కన్నులతో చూడమని ప్రార్థిస్తున్నారు.


నీవొకేసారి కన్నులు తెరిస్తే అంత కాంతి భరించగలమా ప్రభూ కనుక మెల్లమెల్లగా కన్నులు తెరచి చూడు. నీరులేక వాడిన చేనికి క్రమక్రమముగా నీరు పెట్టినట్టు, నీ కటాక్షాన్ని నెమ్మదిగా ప్రవహింపజేయి. క్రమక్రమముగా భగవదనుగ్రహాన్ని ప్రసరింపజేయాలని కోరుకున్నారు.


ఇంత విశాలమైన పృథ్విలో ఓ చిన్న రాజ్యానికి రాజైతే మొత్తం ధరిత్రినే ఏలుతున్నంత గర్వం నెత్తికెక్కుతుంది. పదవి పెరిగినాకొద్దీ అహంకారం అంతకంతకూపెరుగుతూ ఉంటుంది. ఆ పొగరు నశించడం కష్టం. వారిలో కొందరు రాజులు అశాశ్వతమైన ఈ పదవుల హీనత్వాన్ని అర్థం చేసుకుని అహంకారాన్ని వదిలించుకుని నీ రక్షణ కోరి వస్తారు. ఒక్కో రాజు మరింకే రాజుతోనో పరాజితులౌతూ ఉంటాడు. రాజులందరినీ ఓడించగల మహాపరాక్రమశాలివి నీవే కదా అంటూ శ్రీకృష్ణుడి సింహాసనం కిందకు చేరారు ఆ రాజులంతా. రాజ్యాలు అహంకారాలు వదులుకుని వచ్చిన రాజులు మళ్లీ తమకు ఏ హీనమైన పదవులు అంటగడతారో అనే వైరాగ్యంతో నీ శ్రీ చరణాలను ఆశ్రయిస్తున్నారు. మీ రాజ్యాలను మీరు సక్రమంగా పాలిస్తూ ఉండండి అని చెప్పినా నిరాకరించి భగవంతుని సన్నిధానంలోనే గుంపులు గుంపులుగా పడిఉన్నారట. స్వామీ వారి వలెనేమేము కూడా మా స్త్రీత్వాభిమానాన్ని బంధువులను భోగభోగ్యాలను వదులుకని నీ వాకిట నిలిచి ఉన్నాము. వారంతా మీ బాణాలకు గాయపడి ఓడిపోతే మేముం నీ సద్గుణాల ఓడిపోయి ఉన్నాం. మాకు ఏ జ్ఞాని మార్గదర్శకత్వమూ లేదు. జ్ఞానుల ఆచార్యత్వంలో కూడా పొందడం అసాధ్యమైన సర్వోన్నత పదవిని అజ్ఞానులమైన మా గొల్లపిల్లలకు మాకు మీ సన్నిధి లభించడమంటే మాటలా అని వారు ఆశ్చర్య చకితులవుతున్నారు. గోపికలు శత్రువులతో పోలిక తెచ్చుకుని వారి వలె మేమూ నీ శరణు కోరామని అంటే శ్రీ కృష్ణుడు వీరి హృదయాంతరాళములలో ఇంకా ఏముందోనని పరీక్షించాలనుకుంటాడట. అప్పుడు గోపికలు మరోసారి స్వామీ మాకు అన్యథా శరణం నాస్తి. (ప్రత్యామ్నాయం లేదు) ఇది అనన్య గతిత్వం. విభీషణుడు భార్యా పుత్రులను రాజ్యసంపదలను వదిలి ముగ్గురు మిత్రులతో కలిసి ఆకాశాన నిలిచి శ్రీరాముని శరణు వేడుతూ, నీవు రక్షించకపోయినా లంకకు మళ్లీ వెళ్లలేను అన్నట్టుగా మేము కూడా నీవేగతి అని వచ్చాము ప్రభూ అని నివేదిస్తున్నారీ పాశురంలో. విభీషణ శరణాగతి అనన్యగతిత్వానికి ఉదాహరణగా చెప్పుకుంటారు. సీతను రాముడికి అప్పగించమని హితవు చెప్పినందుకు తమ్ముడిని కాలితో తన్ని వెళ్లగొడతాడు రావణుడు. అక్కడినుంచే నేరుగా సముద్రతీరాన విడిసి యున్న రాముని సన్నిధానానికి వెళ్లి నేలమీద దిగడానికి అనుమతి కోరుతూ శరణు వేడుతున్న సందర్భం.


సిరిమువ్వల వలె, అరవిరిసిన తామెర వలె నీ అర్థ నిమీలిత నేత్రాలను విప్పార్చి మమ్ము మీ నేత్రసౌందర్యం చూడనీయవా అని గోపికల ప్రార్థన. ‘‘చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా’’ అని అన్నమయ్య పాడినట్టు గోపికలు శ్రీకృష్ణుని కన్నులు తెరవమంటున్నారు. కవులు అందమైన కన్నులను తామెరలతో పోల్చుతూ ఉంటారు. కాని గోదాదేవి మాత్రం కొద్దిగా మాత్రమే తెరుచుకుంటున్నట్టున్న సిరిమువ్వ తో శ్రీ కృష్ణుని అరమోడ్పు కన్నులతో పోల్చడం ప్రత్యేకమైన అంశం. గోవుల మెడకు కట్టిన మువ్వలు ఆమెకు స్వామి కన్నుల వలె కనిపించాయి. స్వామి ఒకేసారి కన్నులు పూర్తిగా తెరుచుకుంటే అంత కాంతిని, అంత కరుణారసాన్ని భరించగలమో లేదో అనే భయంతో మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవయ్యా అంటున్నారు. అయ్యో కఠినమైన లోహపు మువ్వతో స్వామి కన్నులు పోల్చడమా అని బాధపడతూ, సూర్యచంద్రులే నీ నయనాలు అని మరో పోలిక తెస్తారు. చంద్రుని చూడగానే ముకుళించి, సూర్యుడు రాగానే వికసించే తామర ఇరువురూ ఒకేసారి ఉదయిస్తే సగం వికసించి సగం ముకుళించవలసి ఉంటుంది. కనుక స్వామి తామెర కన్నులు సగం తెరిచి సగం మూసి ఉన్నాయట.


తీక్షణత్వం ఆహ్లాదము అనే రెండు లక్షణాలు స్వామి నేత్రాలకు ఉన్నాయి. పరులకు వేడిగానూ స్వజనులకు చల్లగానూ ఉంటాయి. మమ్మల్ని నీతో చేరనీయని వారికి సూర్యుడి వలె, మాకు ప్రసన్నమైన చంద్రుని వలె నీవు కనిపించాలి. కాని ఒకే సారి ఇది సాధ్యమా? అయినా శ్రీ కృష్ణుడికి అసాధ్యం ఉంటుందా? అయినా ఏటేటా గ్రహణాలతో క్షీణించే సూర్య చంద్ర గ్రహాలతో స్వామి సుందర నయనాలను పోల్చడం సమంజసమా? అని గోదాదేవి మళ్లీ ఆలోచనలో పడుతుంది. చివరకు శ్రీకృష్ణుని నేత్రాలు పోల్చదగినదేదీ లేదని ఆయన కన్నులే ఆయనకు సాటి అంటారు.


నా కటాక్షవీక్షణాలు మీమీద ప్రసరింపచేస్తే మాకేమి లాభం అని శ్రీ కృష్ణుడు అడిగితే గోపికలు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. నీవు కన్నులు తెరిచి మమ్మల్ని చూస్తే నీ వియోగం వలన కలిగే దుఃఖం తీరిపోతుంది. అనుభవించకతప్పని వియోగమే శాపం అని గోపికలు అంటున్నారు.


అభిమానాలు వదులుకొని అహంకారాలు వదిలించుకుని నీ పాదపద్మములు తప్పఇతరములెఱుగమని శ్రీమన్నారాయణుని శరణు వేడితే ఉజ్జీవులమవుతామని వివరిస్తున్నారు గోదాదేవి. ముందు దేహాత్మాభిమానము పోగొట్టి తరువాత అనన్యశేషత్వమునుపయోగించి, ఆ పిమ్మట స్వస్వాతంత్ర్యమును తొలగించి, కరుణించి కైంకర్యము కలుగజేసి పరజ్ఞానము ఇచ్చి కర్మను నశింపజేసి పాపములు పోగొట్టమని గోపికలు ఈ పాశురంలో అనన్యార్హ శేషత్వమును ధృవీకరిస్తున్నారు. వీటితో పాటు 1. దేహమే ఆత్మ, 2. నేనే స్వతంత్రుడిని, 3. నా రక్షణ నేను చేసుకోగలను, 4. నేనే ఇతరులకు శేష భూతుడను, 5. ఆభాస బంధువుల పట్ల బంధుబుధ్ది, 6. విషయములందు భోగబుధ్ది అనే ఆరు భ్రాంతులు తొలగిపోవాలి. ఇది పరమాత్మ కరుణ తో మాత్రమే సాధ్యం.

నీవు ‘‘పతిం విశ్వస్య’’ (విశ్వానికంతటకూ నీవే నాథుడివి విశ్వనాథుడివి జగన్నాధుడివి), నేనే అన్నీ ‘‘ఈశ్వరోహమహంభోగీ’’ అనే దురహంకారం వదులుకుని ‘‘దాసోహం కోసలేంద్రస్య’’ అంటూ మీశరణుజొచ్చాం. కనులు తెరిచి కరుణించవా ప్రభూ అని గోపికలు పాడే ఈ 22వ పాశురం మరో భగవద్విభూతిని వివరించే గొప్ప గోదాగీత.

Also read: నాయకులకెల్ల నాయకుడు నందగోపుని భవ్యభవన

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles