Friday, March 29, 2024

విజ్ఞానమా? మతవిశ్వాసమా? ఏది కావాలి?

మనిషికి విశ్వాసమే బలం. తన మీద తనకు విశ్వాసం ఉన్నవాడు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాడు. పరిశీలిస్తాడు. ప్రయోగాలు చేస్తాడు. అవి విఫలమైతే, అవగాహన పెంచుకుంటాడు. రోజురోజుకూ పెంచుకుంటున్న జ్ఞాన సముపార్జనతో కొత్త దారులు వెతుకుతాడు. కొత్త అన్వేషణకు ద్వారాలు తెరుస్తాడు. తను చేసిన ప్రయత్నాలకు, ప్రయోగాలకు ఫలితాలు సాధిస్తాడు. పలితాలు విజయవంతమౌతే మళ్ళీ అవి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయా? ఉన్నాయా?- అని పరీక్షించుకుంటూ ఉంటాడు. సంతృప్తి చెందితేనే తన కృషి ఫలితాన్ని మొత్తానికి మొత్తంగా మానవాళికి ధారపోస్తాడు. ప్రతి శాస్త్రవేత్తా చేసే పని ఇదే! వీరు ప్రతిదానికి రుజువులూ, నిరూపణలూ కావాలంటారు. వీరంతా మానవవాదులే!

Also read: ‘జ్ఞానం’- సంపాదించినవారంతా బౌద్ధులే!

మరో మనిషి కూడా తన ప్రయాణాన్ని విశ్వాసంలోంచే ప్రారంభిస్తాడు. ఏదో ఒక శక్తిని, దేవుణ్ణి, దేవతను, దేవదూతన, చివరకు ఎదురుగా కనిపించే మఠాధిపతినో, సన్యాసినో, బాబానో, గురూనో, మాతాజీనో నమ్ముకుంటాడు. వీళ్ళల్లో ఫాదర్ లు, ముల్లాలు కూడా ఉండొచ్చు – తన మీద తనకు ఉన్న నమ్మకాన్ని వదిలేసి, తోటివాడి తోడును వదిలేసి, జీవిస్తున్న సమాజాన్ని వదిలేసి, అనుభవిస్తున్న ఆధునిక సౌకర్యాలను గుర్తించకుండా…ఎక్కడా, ఎప్పుడూ, ఎవరికీ కనపడని ఒక శక్తిని గూర్చి మాట్లాడుతూ ఉంటాడు. దానితో అంటుకోవాల్సిన జాడ్యాలన్నీ అంటుకుంటాయి. జన్మలు, పునర్జన్మలు, పాపపుణ్యాలు,జాతకాలు, వాస్తు, బల్లిశాస్త్రం వగైరా వగైరా…అభూత కల్పనల్లో, భ్రమల్లో, రూపుదిద్దుకున్న అనేకానేక అంశాలమీద దృష్టి పెట్టి భక్తిపారవశ్యంలో తేలిపోతాడు.

మనం పైన చెప్పుకున్న ఇద్దరు మనుషులు ‘విశ్వాసం’లోంచి బయలుదేరినవారే. మొదటి వ్యక్తి విశ్వాసం అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది.  రెండో అతనిది మూఢవిశ్వాసంగా మారి వాస్తవాల్ని గ్రహించలేని మానసిక వైకల్య దశకు చేరుకుంది. మొదటి వ్యక్తి నిజంగానే గ్రహాంతరయానం చేస్తున్నాడు. రెండో  అతను గ్రహాలు లెక్కబెట్టుకుంటున్నాడు. మొదటివ్యక్తి జ్ఞానంతో విశ్వరహస్యాల్ని ఛేదిస్తుంటే, రెండో అతను తనకు ఆత్మజ్ఞానం కలిగిందని, లోకాలన్నిటినీ తనలోనే చూసుకుంటున్నానని చెపుతున్నాడు. లేదా తను నమ్ముతున్న దేవుడిలో చూసుకుంటున్నాని అంటున్నాడు. మొదటి వ్యక్తి కృషి బహిరంగంగా మొత్తం సమాజానికి అనుభవంలోకి వస్తుంది. ఈ రెండో వ్యక్తి చెప్పే అనుభూతి కేవలం అతనికి మాత్రమే పరిమితమౌతుంది.

Also read: ప్రపంచంలోని తొలి భౌతికవాదులు మన చార్వాకులు

‘‘ఇదేమిటీ? నీకు కలిగిన అనుభూతి నాకు ఎందుకు కలగడం లేదూ?- అని ఎవరైనా అడిగితే- బాబూ! నువ్వు కూడా ఆత్మదర్శనం చేసుకో-సమాధిలోకి పో-  ఈ బంధాలన్నీ తెంపేసుకో –  ఆ దేవదేవుణ్ణి నిరంతరం ధ్యానించు – అప్పుడు నీకు కూడా ఆ అనుభూతి కలుగుతుంది’’- అని అంటాడు. జనానికి మాయమాటలు చెప్పి, ఈ రెండో మనిషి ఏం చేస్తున్నాడూ? కడుపులో చల్ల కదలకుండా ఏ.సీ. రూమ్ లో కూర్చుని వ్యపారం చేసుకుంటూ ఉన్నాడు. వీలయితే సెక్స్ లో రాకెట్ అవుతున్నాడు. జనాన్ని మానసికంగా దెబ్బ తీస్తూ అతను బలవంతుడవుతున్నాడు. సమకాలీన సమాజంలో చీకటి రాజ్యమేలుతున్న ఏ బాబానైనా, సన్యాసినైనా, మాతాజీనైనా, పీఠాధిపతినైనా తీసుకోండి. జరుగుతున్నది ఇదే కదా? వీరికి బలం చూకూరుస్తున్నది రాజకీయ నాయకులు, అధికారులు, కొన్ని సంస్థలేకదా? వివాదాస్పదమైపోయి అంతా బహిరంగంగా వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నా, కొంతమందికి మాత్రం జ్ఞానోదయం కావడం లేదు. మూఢత్వంలో మునిగిపోయి జనం అలాంటివారిని ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. ఈ రెండో మనిషి సంగీతాన్ని, సాహిత్యాన్ని, నాట్యాన్ని అన్ని కళల్ని తెలివిగా వాడుకుని, అందులో దైవభావనను ప్రతిష్టిస్తూ వస్తున్నాడు. అది అసంబద్ధమని మొదటి మనిషి చెపుతూనే ఉన్నాడు. అతను-ఒంటిరివాడు కాదు. అతని వెనక చార్వాకులు, నిరీశ్వరవాదులు, హేతువాదులు, శాస్త్రజ్ఞులు, మానవవాదులు ఎందరో ఉన్నారు. వారంతా ప్రశ్నలు గుప్పిస్తూనే ఉన్నారు. దేవుళ్ళను, దయ్యాలను పక్కకు పెట్టి తమ కృషి తాము చేస్తూనే వచ్చారు. ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా!

ఈ రెండో రకం మనుషులు అప్పనంగా అందుతున్న వైజ్ఞానిక సౌకర్యాలు తమకు ఏ అర్హత ఉందని వాడుకుంటున్నారూ? మనిషిని, మనిషి మేధస్సును అభినందించకుండా మనిషి సాధించిన విజయాల్ని ఎందుకు అనుభవిస్తున్నారూ? ఒళ్ళు రుద్దుకునే సబ్బు దగ్గర్నుండి, కుక్కర్, గ్యాస్ స్టౌ, కరెంటు, ఏసీ, కారు, విమానం, ఓడవంటివి ఏవీ వాడకూడదు గదా? వారి దేవుడు, వారి మాతాజీ, వారి పీఠాధిపతి, వారి అల్లా, వారి తండ్రీ ఏదైనా ఇస్తే వారు వాటిని మాత్రమే వాడుకోవాలి కదా? శాస్త్రవైజ్ఞానిక అంశాలను కూడా వక్రీకరించి తమ ప్రవచనాలకు, బోధనలకు అనువుగా వాడుకుంటున్నారు కదా? అదంతా ఆత్మద్రోహం, వంచన, మోసం, దగా కాదా? కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించేవారి విషయం దానంతట అదే అర్థమౌతుంది.

Also read: భారత్ విశ్వగురువు ఎలా అయ్యింది?

జీవ పరిణామంపై కనీసమైన అవగాహన లేకుండా భూమి గురించి, గ్రహాల గురించి, కనీసం పరిజ్ఞానం లేకుండా పర్యావరణం పట్ల, పంటలపట్ల, ఎరువులు, సాగు విధానాలు, నూతన వంగడాలు, మానవ సమస్యల పట్ల ఏ మాత్రమూ కనీస జ్ఞానం లేని ఈ మతగురువులంతా ఏం చెపుతారూ? ఆత్మశుద్ధి గురించి మాట్లాడుతారా? సర్వేశ్వరుడి గురించి మాట్లాడుతారా? ఏదీ ఇన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఎవరూ ఎవరి ఆత్మల్ని చేసిన దాఖలాలు లేవే? ఆ సర్వేశ్వరుడెవరో ఆ మతమౌఢ్యాన్ని బద్దలు కొట్టుకుని మరి బయటికి రాడేమీ? గుండుసూది దగ్గర్నుండి, రాకెట్ ప్రయోగం దాకా మనిషి తన మేధస్సుతో సాధించుకుంటూ వస్తూ ఉంటే…ఏ ఒక్కడూ ఏ ఒక్కనాడూ వాటి గురించి మాట్లాడడు కదా? ఎక్కడ ఉందండీ పాలసముద్రం? ఎక్కడండీ ఆదిశేషువూ? స్వర్గం, నరకం ఎక్కడ? అగ్నిదేవుడు, వాయుదేవుడూ ఎక్కడ? అన్నీ సింబాలిక్ గా మనిషి అందంగా రాసుకున్న కథలు కావూ? భ్రమలు, ఊహలు, కల్పితాలు, అబద్ధాలు అన్నీ అందంగా ఉండొచ్చు. జనాన్ని కొంతకాలం నమ్మించొచ్చు, కానీ ఎల్లకాలమూ అవి ఆ పని చేయలేవు. మనిషి నాగరివకత సాధించకముందు, విజ్ఞానశాస్త్రాన్ని అభివృద్ధి చేసుకోకముందు అన్ని మతాలవారు, అన్ని భాషల్లో తమ తమ కల్పనల్ని రాసుకున్నారు.  ఆయా కాలాల్లో  ఉన్న జనాన్ని నమ్మించారు. సత్ప్రవర్తనతో మెలగడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతవరకు మనం ఒప్పుకోవాల్సిందే! ఇక అదే భావజాలం ఆగామి కాలంలో కడా కొనసాగాలనుకుంటే  పోరపాటు.

బాలశిక్షతో చదువు ప్రారంభించిన బాలుడు పెరిగి పెద్దవాడయి, ఒక వ్యోమగామి అయ్యాడనుకుందాం. అతను తను సాధించిన రాకెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలా? లేక ఇంకా బాలశిక్ష దగ్గరే ఉండిపోవాలా? విషమేమంటే, అనని మతాల మతతత్వవాదులూ మనల్ని బాలశిక్ష దగ్గరే ఆగిపొమ్మని చెపుతున్నారు. వింటూ కూచుందామా?పనికి రాని మాటల్నిపక్కన పెడదామా? విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే! ‘‘సైన్సూ- మతం: రెండూ సత్యాన్వేషణకు దారి తీసేవే కాబట్టి, రెండూ ఒకటే. సైన్సు కూడా ఒక మతం లాంటిదే’’-అని కూడా కొందరు తీర్మానించారు. అవి ఒకటేనా? కాదా?- అని కొద్దిపాటి మెదడు ఉపయోగించి ఆలోచించినా తెలుస్తుంది.

Also read: ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?

రిచర్డ్ డాకిన్స్ జీవపరిణామం గురించి రాస్తే, లిసా రాండాల్ భౌతికశాస్త్రం గురించి రాస్తే కోట్లాది జనం విశ్వసనీయంగా చదువుతున్నారు. విశ్వసిస్తున్నారు. ఎందుకంటే, వారు చిత్తశుద్ధితో కృషి చేసి, విషయ పరిజ్ఞానం సంపాదించి, వారి వారి విశ్లేషణలు జోడించి సామాన్యుడి కోసం సరళంగా చెపుతున్నారు కాబట్టి! విశ్వాసమే – నిరూపణ అయితే మానవజాతికి అదొక బలంగా మారుతుంది. నిరూపణ కాని విశ్వాసానికి విలువ ఉండకపోగా, అది మూఢనమ్మకంగా మిగిలిపోతుంది.

ఒక పూజారి తనకు తన ‘స్వామి’ ప్రత్యక్షమయ్యడని చెపితే, అది అతని ‘‘వ్యక్తిగత అభిప్రాయం’’- అని అనుకోవాలి! అతను చదువుకున్నది లేదు, ప్రపంచ జ్ఞానం సంపాదించి లేదు. తాత తండ్రులునేర్పిన నాలుగు పురాణ కథలు, పది సంస్కృత శ్లోకాలతో పూట గడుపుకునేవాడు. నిరూపణల దాకా రాలేదు కదా? నిజానికి తప్పు అలాంటివారిది కాదు – జనానిదే! తమ శక్తి యుక్తులను, పనికిరాని పరిజ్ఞానానికి పరిమితం చేస్తున్నవారి మోసాన్ని గ్రహించలేకపోతున్నారు. కోడి కూతలను, బాతు అరుపులను, బల్లి అరుపులను, ‘దైవవాక్యం’గా భావించాలని చెపితే నమ్మేస్తున్నారు. మాయను వాస్తవం అనుకుంటున్నారు. తమతమ మెదడ్లను ఏ మాత్రం ఉపయోగించకుండా ఉంటున్నారు – ఇక చాలు!

అమాయక జనం ఇక ఆలోచించడం మొదలుపెట్టాలి. మతబోధలు చేసేవారిని, ప్రవచనాలు చెప్పేవారిని ప్రశ్నించాల్సిన రోజులు వచ్చేశాయి – ‘‘అయ్యా! వేల సంవత్సరాలుగా మీ ఊకదంపుడు వింటూనే ఉన్నాం. ఇక చాలు – ఆధునిక వైజ్ఞానిక విశేషాలేమైనా తెలిస్తే చెప్పండి –’’ అని నిర్భయంగా నిలదీయాల్సిన రోజులు వచ్చేశాయి. నికొలస్ కొపర్నికస్, గియార్డనో బ్రూనో, గెలీలియో, ఫ్రాన్సిస్ బేకన్ లాంటివారు మతాల్ని, అంధవిశ్వాసాలన్ని వీరోచితంగా ఎదరించి, సత్యాన్వేషణకు కట్టుబడినవారు. వారు శాస్త్రవేత్తలే కాదు, మానవవాదులు కూడా! ఆధునిక భౌతికవాదానికి పునాదులు వేసింది వీరు మాత్రమే కాదు. ఇంకా ఎంతోమంది అలాంటి మహనీయులు ఉన్నారు – చేతనైతే, వారి గురించి చెప్పండని అడగాలి!

Also read: ఏ మనిషినీ సున్నా కింద తీసిపారవేయలేం!

అసలు తొలిసారి ప్రపంచానికి భౌతికవాదం గురించి బోధించింది ఈ భారతదేశమే- అన్నది మరవకూడదు. చార్వాకులు చెప్పింది, బుద్ధుడు బోధించింది ఎందుకు నాశనం చేసుకున్నాం? నాశనం చేసి ఏం సాధించాం? విశ్లేషించుకోవాలి! ఇప్పుడు వాటిని పునరుద్ధరించుకోవడమే కాదా, వాటిని వైజ్ఞానిక దృష్టికోణంలో మళ్ళీ రాసుకోవాలి! కొన్ని శతాబ్దాలుగా మనువాదుల కుట్రలకు అన్యాయంగా బలైపోయి నాశనమైపొయ్యాం. సమాజాన్ని మూఢ విశ్వాసాల్లో పూర్తిగా ముంచేశాం. ఇప్పటికైనా తేరుకుని, బయటపడాలి. మనిషి స్థాయిని తగ్గించే అహుతుకమైన అంశాలను త్యజించాలి. సహేతుకమైన వాటినే స్వీకరించాలి. మావనవాద కోణంలో విశాల దృక్పథాన్ని అలవరచుకుంటూ ప్రత్యామ్నాయ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవాలి.  లైటు వేస్తే చీకట్లు పగిలినట్లు, వైజ్ఞానిక స్పృహతోనే మతమౌఢ్యం పగిలిపోవాలి! సామాన్యజనం మేలుకుంటే, వైజ్ఞానిక మా‘నవ’వాద ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కళ్ళు మూసుకుని దైవశక్తికి దాసోహమనకుండా, కళ్ళు తెరచి మానవశక్తిని ఎలుగెత్తి చాటే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి! నవీన మానవ ఆవిర్భావానికి దారులు వేయాలి!!

Also read: భౌతికవాదాన్ని తవ్వితీసిన దేవీప్రసాద్ ఛట్టోపాధ్యాయ

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles