Thursday, March 28, 2024

నవ్యాంధ్ర నిండుగా వెలగాలి

  • విభేదాలు విస్మరించి నాయకులు కలసికట్టుగా పని చేయాలి
  • తెలంగాణతో, కేంద్రప్రభుత్వం సంఖ్యతగా మెలిగి సమస్యలు పరిష్కరించుకోవాలి

మరి రెండు రోజుల్లో ‘ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం’ జరుపుకోనున్నాం. విభిన్న రంగాల ప్రముఖులకు, విశిష్ట సేవలు చేసిన సంస్థలకు ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు ప్రదానం చేయనుంది. రాష్ట్ర అవతరణ జరిగిన నవంబర్ 1వ తేదీకి ప్రత్యేక గుర్తింపు ఎప్పటికీ ఉండిపోయేలా విశేష కార్యక్రమాలను రూపొందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇది ఒకప్పుడు                   పర్వదినం.ఇప్పుడు  సమరోత్సాహంతో పునర్నిర్మాణం జరగాలనే స్ఫూర్తిని నింపుకొని, బాధ్యతను గుర్తుచేసుకొనే ప్రత్యేకమైన రోజు. ‘ఆంధ్ర’ శబ్దం జాతి పరంగానూ, భాషా పరంగాను ఏర్పడింది. ఆంధ్రం, తెలుగు, తెనుగు మొదలైనవన్నీ ఒకే శబ్దాలు. అక్షరరూపాలలో మాత్రమే తేడాగా కనిపిస్తాయి. తెలుగు మాట్లాడే ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఆచార్య డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నట్లుగా… తెలుగుజాతి మనది-రెండుగ వెలుగుజాతి మనది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడినా ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా వెలుగులబాటలో నడవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కే ఉంది. హైదరాబాద్ అనే మహానగరం తెలంగాణలో ఉండడం వల్ల,  ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ సంపన్నమైన రాష్ట్రంగా విరాజిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కొత్త రాష్ట్రం. “స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి, సంబరపడగానే సరిపోదోయి” అని శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. సాధించిన దానికి సంతృప్తి పొంది,అదే విజయమనుకొనే పరిస్థితులు తెలంగాణలో ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో అస్సలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మహానిర్మాణం జరిగినప్పుడే నవ్యాంధ్ర అవతరించినట్లుగా భావించాలి. అప్పుడే నిజమైన పండుగరోజు.

Also read: కాంగ్రెస్ ఖడ్గధారి ఖడ్గే

70 ఏళ్ళ కిందట ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు

మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రాంతం విడిపోయిన సందర్భంలో, మద్రాస్ నుంచి వెళ్లగొట్టబడ్డారు. తెలంగాణ విడిపోయినప్పుడు,  హైదరాబాద్ ను పోగొట్టుకున్నారు. నీరు- నిధులు-నియామకాలు అనే సమస్యలు రావణకాష్టంగా కాలుతూనే ఉన్నాయి.  గతంలో కంటే, 2014 నుంచీ ఆంధ్రప్రదేశ్ లో అంతర్గత కలహాలు  పెరిగిపోతున్నాయి. 1953లో తొలిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పడినప్పుడు టంగుటూరు ప్రకాశంపంతులు వంటి త్యాగధనుడు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత వచ్చిన బెజవాడ గోపాలరెడ్డికూడా భాషా సంస్కృతులకు గౌరవమిచ్చిన పెద్దమనిషి. 1953నుంచి 1956వరకూ, మూడేళ్లు మాత్రమే ఈ ఇద్దరు మహనీయులు ముఖ్యమంత్రులుగా పదవిలో ఉన్నారు. 1956లో తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఆన్నీ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేకమంది నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇది గడచిన చరిత్ర. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. రెండు తెలుగు  రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ కు కష్టాలు ప్రారంభమవ్వడమేకాక, మరింత ఎక్కువయ్యాయి.        శ్రీబాగ్ ఒప్పందం, పెద్దమనుషుల ఒప్పందం మొదలైన అంశాలన్నీ చర్విత చర్వణాలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కావాల్సింది న్యాయం, అభివృద్ధి, నిర్మాణం, సామాజిక శాంతి,ఆర్ధిక ప్రగతి. ఇవ్వన్నీ సాధించాలంటే  కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్నేహహస్తం అందించాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది. విభజన చట్టంలో ఉన్న హక్కులన్నీ నెరవేరకపోతే, దిల్లీ పెద్దలు చేసిన హామీలన్నీ తీర్చకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంత సులభం కానే కాదు.రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు వ్యవసాయ పరంగా సస్యశ్యామలంగా ఉన్నా, చాలా జిల్లాలు,ప్రాంతాలు వెనుకబడే ఉన్నాయి.రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలా? మూడు రాజధానులు ఉండాలా? అన్నదొక్కటే అంశం కాదు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. అదే ముఖ్యం. ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయన్నది కూడా పెద్ద విషయం కాదు. అన్ని  జిల్లాలు, అన్ని ప్రాంతాలు ప్రగతి పథంలో నడవడం ముఖ్యం. అన్ని కులాలకు, మతాలకు, వయసులవారికి అభివృద్ధి ఫలాలు అందాలి.

Also read: జాతిని వెలిగించే వేడుక  

అందరికీ ప్రగతి ఫలాలు అందాలి

స్వేచ్ఛ,స్వాతంత్య్రాలు ఉండాలి. డబ్బు,అధికారంలో ఉన్న వారికి మాత్రమే హక్కులు సొంతం కాకూడదు. ఓట్ల శాతం ఎక్కువ ఉన్నవారికే అన్ని మేళ్లు  జరగడం కాదు, జనాభా పరంగా, ఆర్ధికంగా వెనుకబడి, మైనారిటీగా ఉన్నవారందరికీ వాక్ స్వాతంత్ర్యం, రాజకీయ అధికారం, సంక్షేమం, ఉద్యోగ, ఉపాధిల్లో న్యాయమైన భాగస్వామ్యం అందాలి. ఒక్క విశాఖపట్నం తప్ప, మిగిలిన ఉత్తరాంధ్ర ప్రాంతమంతా మొదటి నుంచీ అనాథగానే ఉంది. అభివృద్ధికి నోచుకోవడం లేదు. వెనుకబాటుతనం నుంచి బయటపడ లేదు. విశాఖపట్నం వంటి మహానగరాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేలా కార్యాచరణ చేపట్టాలి. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పం చేసుకున్న ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ నిర్మాణం జరగాలి.కోస్తాలో ప్రకాశం జిల్లాది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇటు కోస్తా-అటు రాయలసీమ సంగమ స్వరూపంగా ఉండే ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి. పేరులో తప్ప, ‘వెలుగులేని ప్రకాశం’ జిల్లా ఇది. గుంటూరు నుంచి విడిపోయిన ప్రాంతాలు తప్ప, మిగిలిన ప్రాంతాలన్నీ అభివృద్ధికి ఆమడదూరంగానే ఉన్నాయి. సాంస్కృతిక వైభవం పుష్కలంగా ఉంది కానీ, ఆర్ధిక, సామాజిక ప్రగతిని అందుకోలేకపోయింది. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా పరిస్థితి కూడా, చాలా వరకూ ప్రకాశం జిల్లా వంటిదే. ఉత్తరాంధ్రలో విజయనగరం, కోస్తాలో ప్రకాశం, రాయలసీమలో అనంతపురం ప్రాంతాలు అన్ని రకాలుగా అభివృద్ధి జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ప్రగతి ప్రయాణం ప్రారంభమైనట్లు భావించాలి. రాష్ట్రంలో సుదీర్ఘమైన తీరం వుంది. ఈ తీర ప్రాంతపు అభివృద్ధి ఇంకా మొదలవ్వలేదు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తవ్వాలి. వంశధార, గాలేరు-నగరి, పెన్నా డెల్టా ఆధునీకరణ మొదలైన ప్రాజెక్టులన్నీ సంపూర్ణమవ్వాలి. రాష్ట్రంలో చాలా రోడ్లు అధ్వాన్నంగా మారాయి. అభివృద్ధి, పాలనలో వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించాలి. అక్కడ వ్యవసాయం,పరిశ్రమల ఏర్పాటు చేపట్టాలి. ప్రతి రంగంలో అభివృద్ధి జరగాలి. ప్రతి ఒక్కరికీ ఫలాలు అందాలి. తమిళనాడులో ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు కొట్టుకుంటాయి. మిగిలిన కాలమంతా, అన్ని పార్టీలూ ఏకమై, ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాయి. నాయకులందరూ ఒక్కటై,  కేంద్రం నుంచి రావాల్సిన వాటన్నింటినీ ముక్కుపిండి వసూలు చేసుకుంటారు.

Also read: కలవరం కలిగిస్తున్న కరోనా వేరియంట్

అలవికాని అనైక్యత

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత అనైక్యత  ఏ రాష్ట్రంలోనూ  లేదు. అందుకే, ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఒక నాయకుడు ఒకడుగు ముందుకు వేస్తే, ఇంకొక నాయకుడు అతన్ని పది అడుగులు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకే పార్టీలోనూ అంతర్గత పోరు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, ఉన్నత విద్యావంతుడు. జాతీయ స్థాయిలో బిజెపి పార్టీతో కానీ,ఎన్ డి ఏ ప్రభుత్వంతో కానీ పెద్దగా విభేదాలు కూడా ఏమీ లేవు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అస్సలు లేవు. 2019ఎన్నికల్లో, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవాలని బలంగా కోరుకున్నవాళ్ళల్లో నరేంద్రమోదీ కూడా ఉన్నారన్న విషయం లోక విదితం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి- విభజన చట్టంలో ఉన్న హక్కులు, కేంద్ర పెద్దలు ఇచ్చిన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అలుపెరుగని ప్రయత్నం చేయవలసిందే. అధికారికంగానే కాక, వ్యక్తిగత స్థాయిలోనూ నరేంద్రమోదీ, మిగిలిన పెద్ద నాయకులతో తనకున్న సత్ సంబంధాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులను ఆహ్వానించడంలో రాష్ట్రాలు తమవంతు పాత్ర సంపూర్ణంగా, సమగ్రంగా పోషించాలని, ప్రధానమంత్రి అనేకసార్లు వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని గుర్తెరిగి ముందుకు సాగాలి. నీరు- నిధులు-నియామకాలకు సంబంధించిన అంశాలు ఇంకా చాలా వరకూ అపరిష్కృతంగానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంతో  ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మధ్య సంబంధాలు కొంచెం తగ్గినట్లు కనిపించినా వ్యక్తిగత విభేదాలు పెద్దగా లేవనేది ఎక్కువమంది అభిప్రాయం. 2019 లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్నవారిలో కెసిఆర్ కూడా ప్రధానమైన వ్యక్తి. ఈ విషయాలు రాజకీయ పరిశీలకులకు తెలిసినవే. జలాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాల్లోనూ,మరికొన్ని అంశాల్లోనూ ఈ మధ్య కొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. ఇవి విభేదాలే కానీ వివాదాలు కాదని భావించాలి. ఏ ముఖ్యమంత్రికైనా తన రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి,కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. దిల్లీలు, ట్రిబ్యునల్స్ మనకు అవసరం లేదు, మన ఉభయుల సమస్యలు మనమే తీర్చుకుందాం, కాలయాపన కాకుండా చూసుకుందామని గతంలో కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక ప్రాంతం. విభిన్న రంగాల్లో ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి. దేశమాత ముద్దుబిడ్డలను అందించిన ధన్యభూమి. అటువంటి ఆంధ్రప్రదేశ్ కు త్వరలో మంచిరోజులు రావాలని ఆకాంక్షిద్దాం.

Also read: వీరవిధేయుడు విజేత కాగలరా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

  1. మన ముఖ్య మంత్రి కాలం లో సంక్షేమం పెరిగి,సంక్షోభం మదిరి,ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదలి,విభజన హామి ల
    నెరవేర్చుకోవడం లో వైఫల్యం చెందింది !
    అభివృద్ది అందని కుసుమ మై , రాజధాని కాగితాల కై పరమితమై,నిర్మాణాత్మకమైన పాత్ర లేని ప్రతి పక్ష సమూహమై
    విడి పోయి ఓడి పోయిన ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు తుఫాను వెళ్ళిన తర్వాత మిగిలిన ఇల్లు !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles