Friday, March 29, 2024

16న తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకున్నది.

రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు :

• రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది.

• ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.దీంతో కొత్తవి, పాతవి కలిపి మొత్తంగా 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.

• స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

• కోఠి ఈ.ఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయించింది.

• కోఠి ఈ.ఎన్.టి. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈ.ఎన్.టి టవర్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.

• అదేవిధంగా సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని వైద్య ఆరోగ్యశాఖను కేబినెట్ ఆదేశించింది.

• కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

• రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

• స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, మరియు స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది.

• ఈనెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల, పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.

• స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని కేబినెట్ నిర్ణయించింది.

• రాష్ట్రంలో జీవో 58, 59 కింద పేదలకు స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారిని కేబినెట్ ఆదేశించడం జరిగింది.

• గ్రామకంఠం స్థలాల్లో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న నిర్ణయం జరిగింది.

• వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

• తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.

• షాబాద్ లో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి స్థలాల కేటాయింపు కోసం 45 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

• రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ లో సమగ్రమైన చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క ఆదాయంలో 15.3శాతం వృద్ధిరేటు నమోదైనట్లు అధికారులు కేబినెట్ కు తెలిపారు.

• అయితే, కేంద్రం ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్ -12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హమని సీఎం కేసీఆర్ గారు అన్నారు.

• ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో S.N.A. అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. అంతేకాక ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడంతోపాటు, పరిమితుల్లో కూడా కోతలు విధించడం జరిగింది. ఎఫ్.ఆర్.బి.ఎం లో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్రం యొక్క ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేది.

• సీ.ఎస్.ఎస్. పథకాలలో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రు. 47,312 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.

• అయితే, గత 4 ఏండ్లలో ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు రూ. 58 వేల 24 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందని వారు తెలియజేశారు.

• గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 84 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అందులో సీఎస్ఎస్ పథకాల కింద అందింది కేవలం రూ. 5,200 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రాష్ట్రం పెట్టిన ఖర్చులో 3శాతం కంటే తక్కువ మాత్రమే కేంద్ర పథకాల కింద నిధులు అందాయి.

• కేంద్రం అవలంభిస్తున్న విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతుందని, రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, రాష్ట్ర జీఎస్డీపీ మరో 3 లక్షల కోట్ల రూపాయలు పెరిగి, 14.50 లక్షల కోట్ల రూపాయలకు చేరుకునేదని అభిప్రాయపడ్డారు.

• దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండున్నర శాతం అయినప్పటికీ, దేశ ఆదాయానికి 5 శాతం మనం కంట్రిబ్యూట్ చేయడం జరిగింది.

• రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని తెలపడం జరిగింది.

• తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్రం యొక్క ఆదాయం రూ. 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఆర్థికశాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.

• ఐటీ రంగంలో గత సంవత్సరం 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించిన తెలంగాణ రాష్ట్రం, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు.

• ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు నగరంలో 1 లక్షా 48 వేల ఉద్యోగాలను కల్పించగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది.

• ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్ లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతి భద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మానవ వనుల లభ్యత వల్ల ఇది సాధ్యమైంది.

• రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ ను, ఇతర అధికారులను సీఎం కేసీఆర్ ప్రశంసించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles