Thursday, April 25, 2024

తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు హెచ్చింపు

  • కనీస విలువ ఎకరం రూ.75 వేలు
  • తక్కువ స్థాయిపైన 50, మధ్యస్థంపైన 40, అత్యధికంపైన 30 శాతం చొప్పున హెచ్చింపు
  • ఓపెన్ ప్లాట్ల గజం రూ. 200లకు పెంపు
  • ఫ్లాట్లు చదరపు అడుగుకు రూ. 1000
  • రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంపుదల
  • కొత్త రేట్లు గురువారం నుంచి అమలు

హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ భూములు, నివేశనస్థలాలూ, అపార్ట్ మెంట్, ఇతర ఆస్తుల మార్కెట్ విలువలను పెంచివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు జీవో జారీ చేసింది. మూడు విధాలుగా రేట్లు పెంచారు. ప్రస్తుతం తక్కువస్థాయి (లోవర్ రేంజి) మార్కెట్ రేట్లు ఉన్న ఆస్తుల మార్కెట్ రేట్లలో 50 శాతం పెంచారు. మధ్యస్థాయి (మిడిల్ రేంజి) మార్కెట్ విలువలు ఉన్న ఆస్తులపైన 40 శాతం, ఎక్కువ స్థాయి (హయ్యర్ రేంజి) మార్కెట్ విలువ ఉన్న ఆస్తులపైన 30 శాతం పెంచారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను, స్టాంప్ డ్యూటీని కూడా పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ ఆస్తుల మార్కెట్ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. ఈ జీవో గురువారం (జులై 22) నుంచి అమలులోకి వస్తుంది.  

భూముల మార్కెట్ రేట్ల పెంపుపైన ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బహిరంగ మార్కెట్ విలువలు విపరీతంగా పెరిగిన కారణంగానే విలువలు పెంచుతున్నామని వివరించింది. కొత్త జిల్లాల ఆవిర్భావం,సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా రాష్ట్రంలో భూముల విలువలు పెరిగాయని చెప్పింది. మారు మూల పల్లెల్లో కూడా వ్యవసాయ భూముల ధరలు మూడు నుంచి ఏడు రెట్లు పెరిగాయి. లోగడ రిజిస్ట్రేషన్ కోసం బుక్ చేసుకున్న స్లాట్టకు కూడా గురువారం నుంచీ కొత్త విలువలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వ్యవసాయ భూముల విలువలు ఇప్పటి వరకూ ఎకరం రూ. 1015 వేలు ఉంటే దానిని రూ. 75 వేలకు పెంచారు. ప్రస్తుతం తక్కువ స్థాయిలో ఉన్న విలువలను 50 శాతం పెంచారు. మండల కేంద్రాలూ, ఇతర మధ్యస్థాయి విలువలు కలిగిన ప్రాంతాలలో భూముల విలువలను 40 శాతం హెచ్చించారు. మునిసిపాలిటీలూ, మున్సిపల్ కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూముల విలువలను 30 శాతం పెంచారు. వ్యవసాయ క్షేత్రాలు కాకుండా నివేశన స్థలాలను మూడు రకాలుగా వర్గీకరించారు. ఖాళీ ప్లాట్ల విలువ చదరపు గజం వంద రూపాయలు ఉన్నదానిని రూ. 200లు చేశారు. వ్యవసాయ భూములకు వర్తించే హెచ్చింపులో ఓపెన్ ప్లాట్లకు కూడా వర్తిస్తాయి.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో చెల్లించే రిజిస్ట్రేషన్ చార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. ఇవి ఇతర రాష్ట్రాలలో ఎక్కువగానే ఉన్నాయి. తమిళనాడులో 11 శాతం,కేరళలో 10 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 7.5 శాతం ఉన్నాయి. ఆర్థికమంత్రి హరీష్ రావు నాయకత్వంలోని కమిటీ ఇరుగుపొరుగు రాష్ట్రాలలో రేట్లను పరిశీలించిన మీదట 7.5 శాతానికి పెంచవలసిందిగా ముఖ్యమంత్రికి సిఫార్సు చేసింది.  దేశంలో మరే నగరంలోనూ లేని విధంగా రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ లో జోరుగా ఉన్న కారణంగా రేట్లను ఇబ్బడిదిబ్బడిగా పెంచకుండా ఆచితూచి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. మార్కెట్ రేట్లను చివరిసారి 2013లో సవరించారు. కరోనా కారణంగా వనరులు తగ్గిపోవడం, ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు పెరగడం, సంక్షేమ కార్యక్రమాలు పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయ వనరుల వేటలో ప్రభుత్వం పడింది.

అపార్ట్ మెంట్ ఫ్లాట్ల విలువలు చదరపు అడుగుకు లక్ష లోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలూ, మునిసిపాలిటీలలో ఇప్పుడు రూ. 800 ఉంటే దాన్ని రూ. 1,000లకు పెంచారు. రూ. 801 నుంచి రూ. 4,000ల వరకూ 20 శాతం, రూ. 4,000ల కంటే ఎక్కువ ఉంటే 30 శాతం హెచ్చించారు. మిగిలిన వర్గీకరణలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న మునిసిపాలిటీలూ, కార్పొరేషన్లలో రూ. 800లు ఉన్న వెలను రూ. 1,200లకు హెచ్చించారు.  జీహెచ్ఎంసీ వెలుపల హెచ్ఎండీసీ పరిధిలో రూ. 1,500లు ఉంటే దానిని రూ. 1,700లకు పెంచారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 1,700 లు ఉంటే దానిని రూ. 2,000లకు పెంచారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles