Friday, April 19, 2024

నిబందనలకు విరుద్దంగా ఏసీడీ కరెంటు చార్జీల వసూళ్లు…

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ

అడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ (ఏసీడీ) పేరుతో వినియోగదారుల నుండి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వసూలు చేస్తున్న అదనపు బిల్లులు జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వందల రూపాయలలో బిల్లులు కట్టే వినియోగదారులకు, అదనంగా వేల రూపాయలలో వస్తున్న ఈ బిల్లులు ఎందుకు వేస్తున్నారో, ఎలా లెక్కలు కడుతున్నారో… ఎవరికీ అర్దం కావడం లేదు. ఏసీడీపై అవగాహన కల్పించడంలో విద్యుత్ సంస్థలు పూర్తి వైఫల్యం చెందాయి. ఏ నిబంధనల మేరకు  డిస్కంలు ఈ వసూళ్లను చేస్తున్నాయో ఇంతవరకూ విద్యుత్ సంస్థల నుండి వివరణ లేదని తెలంగాణ జాయంట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ఒక ప్రకటనలో తెలియజేసింది. 

అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ (ఏసీడీ) అంటే…?

మొదటగా అసలు ఏ‌సి‌డి అనే పదం మొత్తం విద్యుత్ చట్టంలో కానీ, తెలంగాణ విద్యుత్ వ్యవస్థను నియంత్రించే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టి‌ఎస్‌ఈ‌ఆర్‌సి)  నిబంధనలలో గానీ  ఎక్కడా కనబడదు. టి‌ఎస్‌ఈ‌ఆర్‌సి ఇచ్చిన నిబంధనలలో కేవలం అడిషనల్ సేకురిటీ డిపాజిట్ (ఏ‌ఎస్‌డి) అనే పదం కనబడుతుంది.

అడిషనల్ సేకురిటీ డిపాజిట్ (ఏ‌ఎస్‌డి)  అంటే…?  రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన రెగ్యులేషన్ 6, 2004 ప్రకారం, డిస్కంలు  వినియోగదారులకు కొత్తగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఏ‌ఎస్‌డి వసూలుచేయవచ్చు. ఈ ఏ‌ఎస్‌డి మూడు దశలలో వసూలు చేస్తారు. 1. గృహవినియోగదారులకు కొత్తగా కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఏ‌ఎస్‌డి క్రింద కిలోవాట్ కు సుమారు రూ 80/- నుండి రూ 300/- వరకు వసూలు చేస్తారు.  పరిశ్రమలకు, వ్యాపార వర్గాలకు ఈ ఛార్జీలు వేరుగా ఉన్నాయి. 2. ఒకసారి కనెక్షన్ ఇచ్చిన తరువాత ఒక ఏడాది పాటు వినియోగదారుడు వాడిన సగటు విద్యుత్తు వినియోగం లెక్కగట్టి, 2 లేదా 3 నెలల సగటు వినియోగం మొత్తాన్ని ASD రూపంలో మరోసారి వసూలు చేస్తారు. 3. ఆ పై ప్రతీ ఏటా ఆ ఏడాది సగటు వినియోగాన్ని, అంతకు ముందు ఏడాది సగటుతో పోల్చి చూసి, అదనంగా జరిగిన సగటు వినియోగానికి అదనంగా ఏ‌ఎస్‌డి వసూలు చేస్తారు. ఒకవేళ వినియోగం తగ్గితే ఆ మేరకు ఏ‌ఎస్‌డిని వినియోగదారులకు బిల్లులలో అడ్జస్ట్ చేసి తగ్గిస్తారు. ఈ ఏ‌ఎస్‌డి కేవలం డిపాజిట్ మాత్రమే. ఈ మొత్తం వినియోగదారుడి పేరుమీదనే విద్యుత్ సంస్థల వద్ద ఉంటుంది.

అసలు ఏ‌ఎస్‌డి ఎందుకు?

వాడిన విద్యుత్తుకు బిల్లులను వినియోగదారుడు చెల్లించక పోతే, విద్యుత్ సంస్థలు కనెక్షన్ కట్ చేసి, ఈ ఏ‌ఎస్‌డి నుండి ఆ బిల్లు మొత్తాన్ని మినహాయించుకోవాలి. ఈ ఏ‌ఎస్‌డి లేకపోతే ఆ మొత్తాన్ని విద్యుత్ సంస్థలు నష్టపోతాయి. నిజానికి ఈ నిబంధన ఇప్పటివరకూ వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకు వర్తింపచేసేవారు. ఎందుకంటే, ఈ వర్గాలు వాడే వినియోగం అధికంగా ఉంటుంది. ఏదన్నా కారణం చేత వీరు వ్యాపారాన్ని మూసివేస్తే విద్యుత్ సంస్థలకు మళ్ళీ ఆ బిల్లులను వసూలు చేసే అవకాశం లేదు.

సాధారణంగా గృహ వినియోగదారులతో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే విద్యుత్ కనెక్షన్ లేకుండా మనం ఒక్కరోజు కూడా గడపలేము. కాబట్టి కొంత ఆలస్యమైనా బిల్లులు వినియోగదారులు కట్టేస్తారు. కాబట్టి నిబంధనలలో ఉన్నా ఎప్పుడూ విద్యుత్ సంస్థలు వీటిపై దృష్టి పెట్టలేదు.

వేలల్లో బిల్లులతో గందరగోళం…!

చిన్న, చిన్న మొత్తాలు బిల్లులలో వస్తే సమస్య ఉండేది కాదు. కానీ వేలల్లో బిల్లులు వస్తున్న కారణంగా ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. నిజానికి రెండు నెలల సగటు బిల్లో… మూడు నెలల సగటు బిల్లో వేస్తే, వేలల్లో బిల్లులు రాకూడదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడి ఒక ఏడాది సగటు వినియోగం ఈ సంవత్సరం 110 యూనిట్లు… అంతకు ముందు ఏడాది సగటు వినియోగం 80 యూనిట్లు ఉంటే, అదనంగా 30 యూనిట్ల మీద, రెండు లేదా మూడు నెలల పాటు అంటే అధికంగా 90 యూనిట్లకు ఏ‌ఎస్‌డి వసూలు చేయాలి. ఈ లెక్కన మొత్తం ఏ‌ఎస్‌డి రూ 400/- దాటకూడదు. కానీ ఏ‌సి‌డి పేరుతో సుమారు రూ 3500/- అదనంగా చూపిస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

విద్యుత్ వినియోగదారుల నుండి ఏ‌ఎస్‌డి వసూలు చేయాలంటే, టి‌ఎస్‌ఈ‌ఆర్‌సి రెగ్యులేషన్ 6, 2004  క్లాస్ 6(2)(C ),   ప్రకారం ఆ మొత్తం ఎలా వచ్చిందో పూర్తి లెక్కలతో 30 రోజుల ముందు ప్రత్యేక నోటీసు ఇవ్వాలి.

జరుగుతున్నదేమిటి?

ప్రస్తుతం విద్యుత్ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి వివరాలు ఇవ్వకుండా, బిల్లులలో ఈ మొత్తాన్ని ఒక చోట ఏ‌సి‌డి పేరుతో చూపించి వసూలు చేస్తున్నారు. ఇలా ఎలాంటి లెక్కలు లేకుండా కేవలం బిల్లులో మొత్తం చూపించి ఏ‌సి‌డి పేరుతో వసూలు చేయడం నిబంధనలకు విరుద్దం.

వేలల్లో బిల్లులకి కారణం ఏమై ఉండొచ్చు?

పైన చెప్పినట్టు అడిషనల్ సెక్యూరిటీ డిపాసిట్ రూపంలో వేల రూపాయలలో బిల్లులు, అదీ తక్కువ విద్యుత్ వినియోగించే పేద, మధ్య తరగతి వినియోగదారులకు, వచ్చే అవకాశం లేదు. మరి కారణం ఏమై ఉండొచ్చు?

విద్యుత్ సంస్థలు “ఏ‌ఎస్‌డి” కి “డెవలప్ మెంట్” చార్జీలను కూడా కలిపి “ఏ‌సి‌డి” పేరుతో బిల్లులు తయారుచేయడం కారణం కావచ్చు.

డెవలప్ మెంట్ చార్జీలంటే…

వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే విద్యుత్ సంస్థలు లైన్లు, సబ్-స్టేషన్లు మొదలైనవి నిర్మించాల్సి ఉంటుంది. వీటికయ్యే ఖర్చులను వినియోగదారులనుండి డెవెలప్ మెంట్ చార్జీలుగా వసూలు చేయడానికి చట్టం అనుమతిస్తుంది. మీ ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాల సామర్ధ్యాన్ని లోడ్ అని పిలవవచ్చు. కనెక్షన్ తీసుకునేటప్పుడు అర కిలోవాట్ లోడ్ వరకూ 600 రూపాయలు, అర కిలోవాట్ నుండి ఒక కిలోవాట్ వరకూ 1200 రూపాయలు, ఒక కిలోవాట్ ఏ మాత్రం దాటినా ఆ పై మొత్తానికి ప్రతీ కిలోవాట్ వరకూ అదనంగా 1200 రూపాయలు చొప్పున వసూలు చేయవచ్చు.

కొత్తగా వచ్చిన మీటర్లు కిలో వాట్ లను కొలుస్తాయి…

సాధారణంగా చిన్న వినియోగదారులు కనెక్షన్ తీసుకునేటప్పుడు అర కిలోవాట్ వరకు లోడ్ ఉంటుందని చెప్పి 600 రూపాయలు చెల్లించి కనెక్షన్ తీసుకుంటారు. సాధారణంగా 4 బల్బులు, 3 ఫ్యానులు ఉన్నా 500 వాట్లు దాటదు. గతంలో పాత మీటర్లు ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పరికరాల సామర్ధ్యం ఎంతో ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పెట్టిన ఎలక్ట్రానిక్ మీటర్లు మీ విద్యుత్ వినియోగాన్ని యూనిట్లలో చూపెట్టడమే కాకుండా, మీ ఇంట్లో ఉన్న మొత్తం విద్యుత్ పరికరాల సామర్ధ్యాన్ని కిలో వాట్లలో లెక్క గట్టి చూపెడుతున్నాయి. దీంతో విద్యుత్ సంస్థలు మీటరులో నమోదైన కిలోవాట్ ల ప్రకారం అదనంగా కిలోవాట్ కు 1200 రూపాయలు, 18% GST కలిపి 1416 రూపాయలు వసూలు చేస్తున్నాయి.

ఉదాహరణకు మీ ఇంట్లో ఎండా కాలంలో అదనంగా రెండు కూలర్లు పెట్టుకుంటే, ఒక్కో కూలర్ సామర్ధ్యం 300 వాట్ల వరకూ ఉంటుంది. ఈ లెక్కన కూలర్ల మొత్తం సామర్ధ్యం 600 వాట్లు. కాబట్టి  మొదట ఉన్న 500 వాట్ లోడ్ కు అదనంగా 600 వాట్లు కలిస్తే మొత్తం లోడ్ 1100 వాట్లు, అంటే 1.1 కిలోవాట్ అయింది. ఈ లెక్క ప్రకారం మొదటి కిలోవాట్ కు 1416 రూపాయలు, కిలో వాట్ దాటాక 0.1 కిలో వాట్ కు అదనంగా మోరో 1416 రూపాయలు  వేస్తారు. అంటే కేవలం రెండు కూలర్లు పెట్టుకుంటే మీపై పడే అదనపు డెవెలప్ మెంట్ ఛార్జీ 2 x 1416 = 2832 రూపాయలు.

చాలామంది బకెట్లలో హీటర్ వేసి నీళ్ళను వేడిచేస్తుంటారు. ఇలాంటి హీటరు సామర్ధ్యం ఒకటి నుండి ఒకటిన్నర కిలోవాట్ ఉంటుంది. అంటే అదనంగా మరో 2832 రూపాయల వరకు డెవెలప్ మెంట్ ఛార్జీలు పడే అవకాశం ఉంది.

పై విధంగా డెవెలప్ మెంట్ ఛార్జీ వసూలు చేయాలన్నా “జనరల్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సప్ప్లై” నిబంధనల ప్రకారం వినియోగదారునికి పూర్తి లెక్కలతో  నోటీసునివ్వాలి. ఒక వేళ నోటీసు తరువాత వినియోగదారుడు అదనపు పరికరాలను తొలగిస్తే, అతని నుండి డెవెలప్ మెంట్ ఛార్జీ వసూలు చేయకూడదు. కానీ విద్యుత్ సంస్థలు వినియోగదారునికి లోడ్ తగ్గించుకునే అవకాశం ఇవ్వకుండా వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్దం. 

విద్యుత్ సంస్థలు నిబంధనలను పాటించాలి 

ఇప్పటికే చార్జీల పెంపు భారాలు మోయలేక సతమతమౌతున్న చిన్న వినియోగదారులను, నిబంధనలకు విరుద్దంగా వేల రూపాయలు వసూలు చేయడం సమంజసం కాదు. చిన్న హీటర్ ఒక్క నిమిషం వాడినా అదనంగా మూడువేల రూపాయల బిల్లు పడుతుందంటే ఎవరు హీటర్ వాడతారు. నిబంధనల మేరకు వినియోగదారునికి ఈ లోడును తొలగించుకునే అవకాశం విద్యుత్ సంస్థలు ఇవ్వాలి.

గతంలో లేని విధంగా ఇప్పుడు గృహావినియోగదారులకు ఈ సమస్య ఎందుకొచ్చింది?

ప్రస్తుతం విద్యుత్ సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. మొత్తం నష్టాలు 50,000 కోట్ల రూపాయలను దాటాయి. రోజుగడవడం కష్టంగా ఉంది. కాబట్టి విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ మార్గాన్ని కూడా వదులుకోవడం లేదు. అయితే నిబంధనలకు విరుద్దంగా వసూళ్లు చేయడం ఏమాత్రం సమంజసం కాదు.

విద్యుత్ సంస్థలు నష్టాలను సమీక్షించుకోవాలి…

నిబంధనలకు విరుద్దంగా పేదా, గొప్పా అని చూడకుండా వేల కోట్ల రూపాయలను వసూలు చేసే పరిస్తితి ఎందుకు వచ్చిందో విద్యుత్ సంస్థలు సమీక్షించుకోవాలి. ప్రభుత్వ సంస్థల విద్యుత్ బకాయిలు ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు దాటాయి. ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బకాయిలు వసూలు చేయగలిగితే చాలా మేరకు ఉపశమనం లభిస్తుంది. విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గించుకోవడం, విద్యుత్ వినియోగంలో సామర్ధ్యాన్ని పెంచడం, సరఫరా పంపిణీ నష్టాలను నియంత్రించడంపై విద్యుత్ సంస్థలు దృష్టి పెడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. అప్పటిదాకా అనవసర భారాలు వేయకుండా ఉంటే ప్రజలు హర్షిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles