Wednesday, April 24, 2024

క్లిష్ట పరిస్థితుల్లో కీలక బడ్జెట్ :ఆర్థిక మంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి   నిర్మలా సీతారామన్  2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు.  ఆర్థిక మంత్రిగా  ఆమె  బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడవసారి. పార్లమెంట్  చరిత్రలో మొదటిసారిగా `కాగిత రహిత (పేపర్ బడ్జెట్) ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన  `యాప్` ని చూసి ఆమె బడ్జెట్ పత్రాలను చదవారు.` “ఎన్నడూ కనీవినీ ఎరుగని  తీవ్ర  పరిస్థితుల మధ్య  బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాను. నష్టపోయిన రంగాలకు చేయూనిచ్చేందుకు నరేంద్ర  మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు  వాటికి కొనసాగింపుగా ఉంటాయి. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పరిస్థితుల్లో ఆత్మ నిర్భర భారత్ కింద తయారైన  `మేడిన్ ఇండియా` ట్యాబ్ లో  ఈ బడ్జెట్ ను తీసుకు వచ్చాను` అంటూ    ప్రసంగాన్ని మొదలు పెట్టారు. కోవిడ్ నేపథ్యలో కుదేలైన  దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడేందుకు  20121-22 ఆర్థిక వ్యవస్థ దోహదపడగలతదని విశ్వాసం వ్యక్తం చేశారు.`నెవర్ బిఫోర్ బడ్జెట్` అంటూ  గంట 49 నిమిషాల పాటు సాగిన  నిర్మలా సీతరామన్ బడ్జెట్ ప్రసంగంలోని  ముఖ్యాంశాలు.

కోవిడ్:

` కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల కోట్లు కేటాయింపు.కరోనా వ్యాక్సిన్ ను త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకువస్తాం   త్వరలో మరో రెండు  వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి. వందదేశాలకు కరోనా వాక్సిన్ సరపరా చేస్తున్నాం. గతంలో ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ పథకం కరోనా కాలంలో ఎంతగానో ఆదుకుంది` అని ఆర్థిక మంత్రి వివరించారు.

ఇది చదవండి: కరోనా బడ్జెట్ మధ్యతరగతిని కనికరిస్తుందా?

ఆరోగ్యానికి ప్రాధాన్యం:

 
 ఈ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి  ప్రాధాన్యం లభించింది.` ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్`  అనే కొత్త పథకం కింద ఆరేళ్ళకు గాను    64వేల 180 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రతిపాదించారు.  జాతీయ వ్యాధుల నియంత్రణ వ్యవస్థ (నేషనల్‌  డిసీజ్‌ కంట్రోల్‌ సిస్టం) ను రింటత పటిష్ఠ  పరుస్తామని  చెప్పారు.  కరోనా కేసులను కట్టడి చేయడం ద్వారా  ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగామని చెప్పారు.

రైల్వేలకు భారీ కేటాయింపులు:

రైల్వేకు  రికార్డు స్థాయిలో లక్షా 10 వేల 055 కోట్లు కేటాయించారు.  ఆ మొత్తంలో  మూలధనం కోసం  లక్షా 7వేల 100 కోట్లు ఖర్చు చేస్తారు. సరకుల రవాణా వ్యయం తగ్గించే ప్రధాన  ఉద్దేశంతో   రైల్వే శాఖ జాతీయ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింద‌ని  చెప్పారు. దేశ‌వ్యాప్తంగా మెట్రో సేవ‌ల విస్త‌ర‌ణ‌కు అధిక  ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు,  మెట్రో లైట్‌, మెట్రో నియోల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. సుమారు 18 వేల కోట్ల‌తో ప‌బ్లిక్ బ‌స్ ట్రాన్స్  పోర్ట్ స‌ర్వీస్ స్కీమ్‌ను  ప్రారంభిస్తామని   మంత్రి చెప్పారు.

ఇది చదవండి: లోక్ సభలో నిర్మలమ్మ చిట్టా పద్దులు

పర్యావరణం…పాత వాహనాలు:

వాహన కాలుష్యాన్ని తగ్గించి  పర్యావరణ పరిరక్షనకు వావానాల జీవితకాలంపై  కీలక నిర్ణయం తీసుకున్నారు.  కాలం చెల్లిన వాహనాలను `తుక్కు` (స్ర్కాప్) కిందికి తెచ్చేలా ప్రతిపాదించారు. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలను  25 ఏళ్లు, వాణిజ్య వాహనాలు 15 ఏళ్లు దాటిన త‌ర్వాత‌  `తుక్కు`కిందికి వచ్చేలా ప్రతిపాదించారు. పాత వాహనాలను స్క్రాప్ కు అమ్ముకుంటే కొత్తవి  కొనుగోళ్లకు రాయితీ కలిగించేలా పథకం రూపొందించారు. ప్రస్తుతం దేశంలో మూడు నుంచి నాలుగు ధశాబ్దాల పాటు నడిచే వాహనాలు కూడా  ఉన్నాయి. నూతన విధానంతో అవన్నీ `తుక్కు`లోకి వెళ్లనున్నాయి.

వయోవృద్ద పింఛనర్లకు ఊరట:

 75 ఏళ్లు పైబడిన  వయోవృద్ధ పింఛన్ దారులు ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేయవలసిన అవసరం లేకుండా  మినహాయింపు కల్పిస్తున్నట్టు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.  చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలకు డబుల్ పన్ను విధింపునుంచి మినహాయింపు కల్పించారు.

వారి లబ్ధికోసమే:

రేషన్ లబ్ధిదారుల కోసమ `ఒక దేశం-ఒక రేషన్ `(వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్) పథకాన్ని అమ‌ల్లోకి తెచ్చామ‌ని ఆర్థిక మంత్రి చెప్పారు.దీని వల్ల  ల‌బ్ధిదారులు  ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇతర   ప్రాంతం లేదా ఇతర  రాష్ట్రం నుంచైనా  నిత్యావసర స‌రకులు తీసుకునే వీలుకలిగిందని  తెలిపారు. ముఖ్యంగా పొట్టకూటి కోసం వ‌ల‌స కార్మికుల‌కు ఈ ప‌థ‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోందని  బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో  పథకం అందుబాటులో ఉందని  వెల్ల‌డించారు.  

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles