Wednesday, April 24, 2024

కేసీఆర్ యాదాద్రి సందర్శన

యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో.. ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు.

సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆల‌య అభివృద్ధి పనులతోపాటు, ప‌రిస‌రాల‌న్నింటినీ ప‌రిశీలించారు. తొలుత మధ్యాహ్నం 12.40 గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, సీఎంవో అధికారి  భూపాల్ రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు సీఎం కేసీఆర్ కు  తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలశ్రీనివాస్ గుప్త, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. 

ఆలయ మర్యాదలతో స్వాగతం

 అనంతరం కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక  అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

యీదాద్రిలో పనులను తనిఖీ చేస్తున్న ముఖ్యమంత్రి కె, చంద్రశేఖరరావు

 అక్కడి నుంచి ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం కేసీఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు.

నీ జన్మ ధన్యం: సునీతతో కేసీఆర్ 

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందిస్తూ.. ‘‘ మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’’ అని  ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయం గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్ర నామాలతో ఇండోర్ లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను సీఎం కేసీఆర్  పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, చిత్రించిన తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న  ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు,  టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు.

ఆలయ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు

ఈ సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరగా, నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాం కనుక, ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయక, అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తరతరాలుగా క్షేత్రాన్ని ఆశ్రయించి బతుకుతున్న వారి బతుకుదెరువుకు ఎటువంటి భంగపాటు రానివ్వద్దని హెచ్చరించారు.

స్వామి పాదాల చెంద ముహూర్త పత్రిక

అనంతరం, చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని.. ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు. ఆలయ ప్రధాన అర్చకులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రిలో పది వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని వివరించారు.

‘‘మీకు పీఆర్సీ వస్తుందా?’’ అని సీఎం కేసీఆర్ ఆలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ వస్తుందని వారు సమాధానమివ్వడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వివిఐపీ గెస్ట్ హౌజ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles