Thursday, April 25, 2024

తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది :కేసీఆర్

  • బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై పార్లమెంటులో పోరాడాలె..
  • టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం

‘‘తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది. ఏమైతదో ఏమో అనే అనుమానం అక్కర్లేదు. మన పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మనం పోరాటం చేస్తున్నపుడు ఎందాక పోవాల్నో అందాక పోవాల్సిందే.’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీని ఎండగడుతూ సాగే టీఆర్ఎస్ పోరాటంలో కలిసొచ్చే అన్నిపక్షాలను  సరైన దిశగా ఫ్లోర్ కో-ఆర్డినేషన్ చేసుకుంటూ నిరసనలను చేపట్టాలని, పార్లమెంట్ లోని రాజ్యసభా పక్ష, లోక్ సభా పక్ష నేతలైన కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన  టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సి వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు.  తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల కాలంలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని, కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ఎండగట్టేందుకు కార్యాచరణపై  ఎంపీలతో ముఖ్యమంత్రి చర్చించారు.

కేంద్రం కక్షపూరిత వైఖరిని నిరసించాలి  

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని, తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు.

అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా

పార్లమెంటు సమావేశాల సందర్భంగా అవసరమైతే తాను ఢిల్లీకి వచ్చి బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసివచ్చే విపక్ష పార్టీల అధినాయకులు, ఎంపీలతో చర్చలు జరుపుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు ప్రజా వ్యతిరేక బిల్లులను నిర్ద్వందంగా తిరస్కరించాలని ఎంపీలకు ఆదేశించారు.  

పార్లమెంటు వేదికగా కేంద్రంపై సమరం                                                                     

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోతున్న నేపథ్యంలో, సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని, అందుకు పార్లమెంటు ఉభయ సభలే సరైన వేదికలుగా మలుచుకొని, సమరం చేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం  

ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోడీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణకంటే ఎక్కువగా ఉన్నాయని, కానీ, పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న తీరును ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని సీఎం తెలిపారు. ఆర్.బి.ఐ. ఆధ్వర్యంలో జరిగే బిడ్ల వేలం ప్ర్రక్రియలో పాల్గొనే ఇన్వెస్టర్లు తెలంగాణ బిడ్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్న విషయం వాస్తవం కాదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోడీకి కన్నుకుట్టిందని, నిబంధనల పేరుతో ఆర్ధికంగా తెలంగాణను అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమన్నారు.

సమాచారాన్ని లీక్ చేస్తూ కుట్రలు

తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎట్లా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలని సీఎం అన్నారు. దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం దారుణమని సీఎం అన్నారు. ఇదంతా ఒక పకడ్బందీ పథకం ప్రకారం జరుగుతున్న బీజేపీ రాజకీయ దిగజారుడుతనమని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను ఆశ్రయించడం దురదృష్టకరమని సీఎం అన్నారు.

అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకే విద్యుత్ సంస్కరణలు

విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాలమీద ఒత్తిడి తేవడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ ప్రతిసారీ నీతి ఆయోగ్ ప్రశంసిస్తున్నదని, అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని పలుమార్లు నీతి ఆయోగ్ వంటి సంస్థలను చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలు చేసిందని, దీనిపై కూడా నిలదీయాలని సీఎం అన్నారు.

తెలంగాణ నుంచి కేంద్రం తీసుకున్నదెంత? ఇచ్చిందెంత?  

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ మూలన అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందన్నారు. దేశంలో కేవలం 8 రాష్ట్రాలే ఎక్కువ శాతం దేశ జీడీపీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, అందులో తెలంగాణ ఒకటని సీఎం అన్నారు. తెలంగాణ నుంచి 8 ఏండ్లలో కేంద్రానికి పోయింది ఎంత? కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని? అనే లెక్కలు పరిశీలిస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఏమిటో అర్ధమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

ఆదాయ పన్ను సహా, వ్యాపార, వాణిజ్య, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి అందుతున్న రూపాయలు అక్షరాల 3 లక్షల 65 వేల 737 కోట్లు కాగా, కేంద్రం నుంచి తెలంగాణకు అందుతున్నవి కేవలం 1 లక్ష 96 వేల 449 కోట్లు మాత్రమే అని, ఇదే విషయంపై కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు వివరించారు. ఇందులో అన్నిరాష్ట్రాలకు వచ్చినట్లుగానే  రాజ్యాంగబద్దంగా  తెలంగాణకు కేంద్రం నుంచి వస్తున్న నిధుల్లో సెంట్రల్ డెవల్యూషన్ పద్దు కింద వచ్చినవి రూ.1,17,797 కోట్లు. ఈ నిధులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద వచ్చేవి కావు. అంటే తెలంగాణకు అందుతున్న మొత్తం నిధుల్లోంచి సెంట్రల్ డెవల్యూషన్ పద్దు ద్వారా అందుతున్నవి తీసివేస్తే కేవలం రూ.78 వేల కోట్లు మాత్రమే. అంటే 8 ఏండ్ల నుంచి సగటున కేంద్రం నుంచి తెలంగాణకు అందిన నిధులు ఏటా కేవలం 9 వేల పైచిలుకు కోట్లు మాత్రమే. అంటే కేంద్రం తెలంగాణకు అందిస్తున్న ప్రోత్సాహం ఏపాటిదో గణాంకాలతో సహా వివరిస్తూ, పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రాన్ని నిగ్గదీయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రగతిని కేంద్రం పీక పిసికి చంపివేస్తున్నదని, దీనిద్వారా దేశ ప్రజలకు కూడా అర్ధం కావాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు.

ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులను నడుమ కుదించి, నడ్డి విరిచే కుట్ర  

 ప్రతిఏటా ఎఫ్.ఆర్.బి.ఎం లిమిట్ ను కేంద్రం ప్రకటిస్తుందని, ఆ తర్వాతే రాష్ట్రాలు కేంద్రం ప్రకటనపై ఆధారపడి వారి వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎఫ్.ఆర్.బి.ఎం లిమిట్ రూ.53,000 కోట్లు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా, కక్షపూరితంగా రూ.53 వేల కోట్ల లిమిట్ ను రూ.23,000 కోట్లకు కుదించడం కుట్ర కాదా? అని సీఎం అన్నారు. ఇటువంటి దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీని నిలదీస్తూ, వారి నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు. అందుకు అన్నిరకాల ప్రజాస్వామిక పద్ధతులను అనుసరించాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.

కేంద్రానికి ఒకమాదిరి, రాష్ట్రాలకు మరోమాదిరి నిబంధనలా?  

ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలు కేంద్రానికి ఒకమాదిరి, రాష్ట్రాలకు మరోమాదిరి ఉండటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సీఎం అన్నారు. రాష్ట్రాల జీ.ఎస్.డి.పి.లో ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిని 3శాతంగా పరిమితి విధించి, కేంద్రం మాత్రం 6.4శాతంగా నిబంధనలు సడలించడం ఎక్కడి న్యాయమన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం చట్టం వచ్చిన 19 ఏండ్ల కాలంలో కేవలం ఒక్క ఏడాది తప్పితే మిగిలిన 18 ఏండ్లలో ఒక్కనాడు కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలు పాటించలేదనే సంగతిని పార్లమెంటు దృష్టికి తేవాలన్నారు. మోడీ ప్రభుత్వం ప్రారంభమైన కాలం నుంచి ఈ విధానం మరింత లోపభూయిష్టంగా మారి, ప్రతి ఏటా ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులను తనకుతానే సడలించుకుంటూ తన ఇష్టారాజ్యంగా అప్పులు తెస్తూ, దేశాన్ని దివాళా తీస్తున్నదని సీఎం అన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం సవరణల పేరుతో కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ముఖ్యమంత్రి ఆరోపించారు. దేశాన్ని దివాళా తీసే దిశగా.. ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా విఫలమైందని  సీఎం దుయ్యబట్టారు.

దేశం ఆగమైతే.. రాష్ట్రాలు కూడా ఆగం కావా?  

‘‘ అంటే మిమ్నల్ని అడిగేవారు ఎవరూ లేరని అనుకుంటున్నరా? దేశంలో రాష్ట్రాలు భాగస్వామ్యం కాదా? రాష్ట్రాలను హద్దుల్లో పెడుతున్న కేంద్రం ఇష్టానుసార చర్యల్ని రాష్ట్రాలు ఎందుకు నిలదీయకూడదు? రాష్ట్రాలకు మిమ్నల్ని ప్రశ్నించే హక్కు ఎందుకు ఉండదు? మీ అసంబద్ధ చర్యల వల్ల దేశం ఆగమైతే రాష్ట్రాలు ఆగమైనట్లు కాదా? దేశంలోని రాష్ట్రాలన్నీ ఇదంతా చూస్తూ మౌనంగా ఉండాలా? మీరు కూర్చున్న కొమ్మను నరుక్కునే విధంగా కేంద్రం అనుసరిస్తున్న క్షమించరాని నేరాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని సీఎం కేసీఆర్ నిర్ద్వందంగా ప్రకటించారు. ఇదే విషయంపై పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలు అంటూనే, కరంటు మోటార్లకు మీటర్లు పెట్టాలనే వంకర టింకర నిబంధనలను ఏ విద్యుత్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమో దేశానికంతా తెలుసుననే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలన్నారు. ‘‘ నువ్వు అది చేస్తేనే, నేను ఇదిస్తా.. అంటే ఇదేమన్నా బేరమా? విచిత్రంగా ఉన్నది. ఎక్కువ ధరకు కరెంటు కొనాలని, విధిగా ఎక్కువ ధర చెల్లించి బొగ్గును కొనాలని రాష్ట్రాలను ఒత్తిడి చేయడం హాస్యాస్పదం. పిడికెడు మంది నీ వ్యాపారులకు సాయం చేయడానికి దేశానికి నష్టం చేస్తవా? అని కేంద్రాన్ని నిలదీయాలె. ఈ దుర్మార్గ చర్యల తంతు ఉభయ సభల్లో రికార్డు కావాలె’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

67 ఏండ్లలో దేశం అప్పు రూ.56 లక్షల కోట్లుంటే.. 8 ఏండ్లల్లనే రూ.100 కోట్లా? :

స్వాతంత్ర్యం వచ్చిన 67 ఏండ్లలో దేశం అప్పు రూ. 56 లక్షల కోట్లు ఉంటే కేవలం తన 8 ఏండ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం దుయ్యబట్టారు. ఈ 8 ఏండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏందో చెప్పాలన్నారు. రూపాయి పతనం, విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్ధికమాంద్యం, పాతాళానికి పడిపోయిన జీడీపీ తప్పితే, మోడీలో పాలనలో కనిపించే ప్రగతి శూన్యమన్నారు.

మోడీలాగా ఏ ప్రధానీ ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మలేదు

 ‘‘ తాగునీరు అందించే చేతగాదు. విద్యుత్తు అందించే చేతగాదు. కనీస మౌలిక వసతుల కల్పన ఊసే లేదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లకూ, విద్యుత్ కు కరువు ఉండటం సిగ్గుచేటు. నాటి నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకూ ఈ దేశ ప్రధానులుగా పనిచేసిన వారెవరూ కూడా ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించారే తప్ప,  అమ్మకానికి పెట్టలేదని సీఎం అన్నారు.  పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారు చౌకగా తెగనమ్ముతుండటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రోత్సాహకాలందిస్తూ, ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్న నరేంద్ర  మోడీ అత్యంత అనర్హుడైన ప్రధానిగా సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. తమ స్వార్ధపూరిత రాజకీయాల కోసం రాష్ట్రాలను, దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, అన్నిరకాలుగా బ్రష్టుపట్టిస్తున్న బీజేపీ దిగజారుడు రాజకీయాలను వాస్తవ గణాంకాలతో సహా ప్రకటించి రాజకీయంగానే ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు పిలుపునిచ్చారు.  ఇప్పటివరకూ దేశాన్ని ఏలిన ఏ ప్రధానీ చేయనన్ని తప్పులను మోడీ చేస్తున్నారని సీఎం అన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలను తనకు అనుకూలంగా సడలించుకోవడం, తన ఏలుబడిలోని రాష్ట్రాలకన్నా గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నష్టపరచడం, ఆయా రాష్ట్రాలకు హక్కుగా అందాల్సిన పన్నుల వాటాను సెస్సుల రూపంలో దొడ్డిదారిన దొంగిలించడం, బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ శక్తుల పట్ల మౌనం వహించడం వంటి దుర్మార్గాలను ఎంపీలు ఉభయ సభల సాక్షిగా నిలదీయాలన్నారు.

తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడం దుర్మార్గమే

 తెలంగాణ రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనకుండా కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గ వ్యవహారంపై ఎంపీలతో సీఎం కేసీఆర్ చర్చించారు. వడ్లు పండించుమని ఒకసారి, వద్దని మరోసారి, కొంటామని ఒకసారి, కొనడంలేదని మరోసారి, అటు ఢిల్లీ బీజేపీ, ఇటు గల్లీ బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరిని అవలంభించడం దుర్మార్గమన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతున్నదని, వరిపంట ఎక్కువ పండించాలని నాలుగు రోజులనుంచి మళ్లీ బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తూ, అయోమయానికి గురి చేస్తున్నదన్నారు.  రైతులను మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు, అయోమయానికి గురిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ గోల్ మాల్, రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

బెంగాల్లో లాగా ఉపాధిహామీని ఆపేసేందుకు కేంద్రం కుట్రలు

రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి నేటిదాకా తెలంగాణ అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని (నరేగా) అమలు చేస్తున్నదని ప్రశంసిస్తూ వస్తున్న కేంద్రం నేడు మాట మార్చి కుట్రపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తనిఖీల పేరుతో ఎన్నడూ లేనివిధంగా ఉద్దేశపూర్వకంగా కేంద్రం ఒకేసారి 16 బృందాలను పంపి కోడిగుడ్డు మీద ఈకలు పీకేందుకు కుట్రలు చేస్తున్నదని సీఎం అన్నారు. ఇప్పటికే కేంద్రం పశ్చిమ బెంగాల్లో నరేగా పథకాన్ని   రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిందని, తెలంగాణాలో కూడా ఇలాగే నరేగాను రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాతాళంలోకి దిగజారుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ  

కేంద్రం ఇటీవలి బడ్జెట్లో అన్నిరంగాలకు కోతలు విధించింది, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కట్టింది లేదు.  మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రగతి బాటలో నడవాల్సిన యువత మెదళ్లను కలుషితం చేస్తున్నదని సీఎం అన్నారు. ఇప్పటిదాకా ఈ దేశంలో బ్రెయిన్ డ్రెయిన్ మాత్రమే జరిగిందని, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాపిటల్ డ్రెయిన్ జరుగుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. భారత విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో డాలర్ విలువ 100 రూపాయలకు చేరుకునే పరిస్థితులు దాపురించాయని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారని, అవేమీ పట్టని మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ప్రముఖ విదేశీ కంపెనీలు దేశాన్ని విడిచి ఎందుకు వెళుతున్నాయో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. మేకిన్ ఇండియా పేరుతో ప్రగల్భాలు పలికిన బీజేపీ ప్రభుత్వం తద్విరుద్దంగా వ్యవహరిస్తున్నదన్నారు. పతంగులకు వాడే చిన్న మాంజా దగ్గర నుంచి ప్రతీ వస్తువు చైనా తదితర దేశాల నుంచే దిగుమతి చేసుకోవడం చూస్తుంటే.. బీజేపీ మేకిన్ ఇండియా డొల్లతనం బయటపడుతుందన్నారు.

బీజేపీ మూకస్వామ్యంపై నిరసన గళం వినిపించాలె  

పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం ఫరిఢవిల్లాల్సిన దేశంలో అశాంతి ప్రబలే సూచనలు దాపురించాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు సమాఖ్య స్పూర్తికి, లౌకికవాదానికి  గొడ్డలిపెట్టుగా మారుతున్నాయన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బీజేపీ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా  దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గళం విప్పాలని, టిఆర్ఎస్ ఎంపీలకు సీఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

బీజేపీని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలె

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, పాలనలో పూర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా ఎలుగెత్తి చాటాలన్నారు. వారు కేవలం 30శాతం పైచిలుకు ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన సంగతి మరువద్దని, మిగిలిన 70శాతం మంది దేశ ప్రజానీకం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేయాలని ఎంపీలకు సూచించారు. ప్రజా వ్యతిరేకత ఉధృతమైతే పార్లమెంటు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలను సీఎం ఎంపీలకు గుర్తు చేశారు. అదే పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదన్నారు.  ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు చెందిన డిమాండ్లతోపాటు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని, ఈ జాప్యానికి బీజేపీని దోషిగా నిలబెట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభా పక్ష నేత కె.కేశవరావు, లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్.సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్ధసారధి రెడ్డి, లోక్ సభ సభ్యులు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీ.బీ.పాటిల్, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డిలతోపాటు,  మంత్రులు కే.టీ.రామారావు, హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి  అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు,  ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles