Friday, March 29, 2024

విద్యార్థుల బలిదానానికి 80 ఏళ్ళు

విద్యార్థుల పోరాటానికి, వారి బలిదానానికి గుర్తుగా నవంబర్ 17వ తేదీని అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవంగా జరుపుకుంటారు. 1939లో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో నాజీలను పొరుగు దేశాలతో యుద్దానికి తరలించాడు హిట్లర్. ఈ క్రమంలో జకోస్లోవేకియాలోని ప్రాగ్ నగరములోని విశ్వవిద్యాలయం లోనికి నాజీ సేనల ప్రవేశాన్ని విద్యార్ధులు అడ్డుకున్నారు. తమ ప్రవేశాన్ని నిలవరించిన విశ్వ విద్యాలయ విద్యార్ధులపై పాశవికంగా కాల్పులు జరిపి పదిమంది విద్యార్ధి నాయకులను సంహరించి మరో 1200 మందిని నాజీలు సృష్టించిన కాంసంట్రేషన్‌ క్యాంప్ అనే నరకం లోనికి తరలించారు. ఆ సంఘటన జరిగింది 1939 నవంబర్ 17 న. ఆ తర్వాత రెండేళ్ళకు లండన్‌ లో సమావేశమైన అంతర్జాతీయ విద్యార్ధుల సమైక్య మండలి నాటి వీరోచిత విద్యార్ధి పోరాటానికి, వారి బలిదానానికి గుర్తుగా నవంబర్ 17 ను ” అంతర్జాతీయ విద్యార్ధి దినోత్సవం” గా ప్రకటించింది. అయితే  పోరాటాలు మాత్రమే  విద్యార్ధి జీవితంలో ముఖ్యమైనవి కావు. ప్రతి విద్యార్థికి లక్ష్య నిర్దేశం అత్యవసరం, అనివార్యం.  భారత దేశంలో 2004లో ముంబైలో ప్రపంచ సామాజిక సదస్సు నవంబర్‌ 17న జరిగింది. అంతర్జాతీయ విద్యార్థి సంఘాలు, జాతీయ సంఘాలు, ఇటాలియన్‌ సంఘాలు హాజరయ్యాయి.

విద్యార్థుల అభ్యున్నతి కోసం చర్యలు

విద్య “కొరకై” అర్ధించువాడు ‘విద్యార్ధి.’ కాని నేడు విద్యార్ధి అనే పదానికి పరిమితి కుదించి స్కూలు, కాలేజీ , విశ్వవిద్యాలయాలలో చదివేవారినే విద్యార్ధులుగా భావిస్తున్నారు . కాలంతో పాటే అన్నీ మారాయి. అంతే వేగంగా చదువుకునే విద్యార్ధుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఐదేళ్లు నిండితే కాని అక్షరాభ్యాసం చేసి పాఠశాలల్లో చేర్చే వారు కాదు. అది మారి రెండేళ్ల  ప్రాయానికే పూర్వ ప్రాథమిక పాఠశాలలు, నర్సరీ విద్యలు,  కాన్సెప్ట్‌ పాఠశాలలు అంటూ ఏమీ తెలియని, అడుగులు సరిగా  వేయలేని వయస్సులో బడిబాట పట్టి పసి వయసులోనే విద్యార్ధిగా మారుతున్నాడు. పలక బలపం పట్టి అఆఇఈలు దిద్దే చేతులు పెన్ను పేపరు పట్టి ఎబిసిడిలు రాస్తున్నాయి. ఒకప్పుడు ఐదవ తరగతి దాటితే ఆరులో ఇంగ్లీష్‌ విద్య అందుబాటు లోకి వచ్చేది. అమ్మా… ఆవు అంటూ పలికే నాలుకలు ఎ ఫర్‌ ఆపిల్‌.. బి ఫర్‌ బాల్‌ అనే శబ్దాలను ఉచ్చరిస్తున్నాయి. పలకా బలపం మాయమై పెన్ను పేపరుతోనే చదువులు మొదలవుతున్నాయి.  పరిసరాల విజ్ఞానం అంటూ అంతో ఇంతో చదివే వయసులోనే కంప్యూటర్‌ ముందు కూర్చొని చేతిలో మౌస్‌ తీసుకొని ప్రపంచ పరిజ్ఞానాన్ని, అంతరిక్ష రహస్యాలు తెలుసుకునే స్థాయికి ఎదిగ చూస్తున్నారు విద్యార్ధులు.

ఆటలకు తగ్గిన ప్రాధాన్యం

ఐదేళ్లు నిండిన తర్వాత బడి డుమ్మాలు కొట్టే దశ నుండి ఎప్పుడు బడివేళ అవుతుందా అని ఎదురు చూసే విధంగా తయారయ్యారు నేటి విద్యార్ధులు. పాఠశాల సమయంలోనే ఆటలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులు పోయి పుస్తకాల్లో మునిగే స్థితికి మారాయి. బాల భానుని లేలేత కిరణాలు పడీ పడడంతో కాలంతో పరుగులు తీస్తూ చకచకా తయరై డ్రెస్సులు, మోయలేనంత బరువున్న పుస్తకాల బ్యాగులతో స్కూలు బస్సుల్లో కాన్వెంట్‌ చదువులంటూ పరుగులు. వచ్చి రాగానే ట్యూషన్‌లు, ఆలోపు స్పెషల్‌ క్లాసులు ఇలా నిద్రించే సమయం తప్ప ఆడిపాడే వయస్సంతా అక్షరాలతో కుస్తీ పడుతూనే కాలం వెళ్లదీస్తున్నారు విద్యార్ధులు.  ఒకప్పుడు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ విద్యలు చదవాలంటే మహా నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. మారిన కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రొఫెషనల్‌ విద్యలు అందుబాటులోకి రావడంతో విద్యార్ధులు సదరు విద్యాభ్యాసంపై ఆసక్తి కనబరుస్తున్నారు.

జీవితంలో కీలక దశ

జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమైనది,  మరువలేనిది. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతిక రంగాలలో కూడా రాణించాలి . ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించు కోవడం ద్వారానే ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుంటుంది. విద్యార్థులు విద్యార్ధి దశను వృధా చేయకుండా జీవితానికి పూలబాట వేసుకునేందుకు వినియోగించు కోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలి.

విజ్ఞానంకోసం తపించేవారే విద్యార్థులు

డిగ్రీ కోసం కాక విజ్ఞానము కోసం తపించే వారంతా నిజమైన విద్యార్ధులని ప్రపంచము నేడు అంగీకరింస్తుంది. మన దేశములో పురాతన శాసనాల గురించి,  ప్రాచీన గ్రంధాల గురించి , చరిత్ర , ఆర్కియాలజీ, వివిధ శాస్త్రాలలో,  అంశాలలో కృషి చేసి పేరెన్నికగన్న చాలా మందికి డిగ్రీలు లేవు. అయినప్పటికీ ఆయా అంశాలలో నిష్ణాతులు వారు. నిత్య విద్యార్ధులుగా శ్రమిస్తారు. విద్యను ఆర్జించడానికి వయసుతో సంబంధం లేదు. ప్రతిఒక్కరూ జీవించి ఉన్నంత  కాలము ఏదో ఒక కొత్త విద్యను నేర్చుకుంటూనే ఉంటారు. కనుక ప్రతి ఒక్కరిని విద్యార్ధిగానే భావించాల్సి వుంటుంది. వయసుతో సంబంధం లేనిది విద్య అని అర్ధము చేసుకున్నందునే వయోజన విద్య పధకము మొదలైనవి అమలు చేశారు. గృహిణి, ఉద్యోగి, ఏస్థాయిలో, ఏ వయసులో ఉన్నవారైనా విద్యార్ధిగా ఆలోచించ వచ్చన్నది నేటి భావన.

సమాజం పట్ల అవగాహన అవసరం

విజ్ఞానము సంపాదించడం, అదికూడా సక్రమ మార్గంలో ఉండడం , కృషి , పట్టుదల , క్రమశిక్షణ మున్నగునవి విద్యార్ధికి ఉండాల్సిన లక్షణాలు. పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల అవగాహన విద్యార్ధికి అదనపు లక్షణాలు. తాను ఆర్జించిన విద్యను సక్రమ మార్గములో వినియోగిస్తూ విద్యార్జనకు అంతం లేనన్నది గ్రహించిన వాడే నిజమైన విద్యార్ధి. వారే సమాజానికి ఉపయోగ పడతారు. అలాగే విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. సామాజిక బాధ్యతతో కూడిన నైతిక విలువలను పెంపొందించు  కోవాలి. నవసమాజ నిర్మాణ స్థాపకులుగా ఎదగాలి. అదే అంతర్జాతీయ విద్యార్ధి దినోత్సవ సందేశము.

(నవంబర్ 17 అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles