Friday, March 29, 2024

గుర్తిస్తే, మానవవాదులు మన‘లోనే’ ఉన్నారు!

ఫొటో రైటప్: నానా పాటేకర్, సోనూ సూద్

ఈ భూగ్రహానికి గల పెద్ద ప్రమాదం ఏమిటంటే దీన్ని ఎవరో వచ్చి రక్షిస్తారన్న విశ్వాసంతో ఉండడం – ఈ మాట అన్నది రాబర్ట్ ఛార్లెస్ స్వాన్. తొలిసారి ఉత్తర ధృవం(1989)దక్షిణధృవం(1986) వెళ్ళి, అక్కడ గడిపి, పరిశీలించి వచ్చిన బ్రిటిష్ పౌరుడు. ఈ భూమిని, ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతిని, జీవరాసుల్ని, మానవాళిని మొత్తానికి మొత్తంగా అన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని బలంగా చెప్పినవాడు. అలాంటివారి అనుభవాల్ని తెలుసుకుని,అందులోంచి మనం గ్రహించాల్సిన విషయం గ్రహించి, మనల్ని మనం, మన సమాజాన్ని మనం పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ అంటాడు ‘‘ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు.  మార్పు మనతోనే మొదలయితే – ప్రపంచం అదే మారుతుంది!’’ అని!

వృద్థాప్యంలో కన్నబిడ్డలు వదిలేసినా, పూర్వవిద్యార్థులు పూనుకుని, తమ ఉపాధ్యాయురాలిని చేరదీసిన సంఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది. అక్కడ ఒక ప్రయివేటు పాఠశాలలో ఒకప్పుడు ఎంతో తెలివైన ఉపాధ్యాయురాలిగా పేరున్న ఒక టీచరు కాలక్రమంలో వీధిపాలైంది. స్వంత కొడుకులు, కూతుళ్ళు ఆమెను వదిలేశారు. జీవిత చరమాంకంలో ఆమె చాలా కష్టాలపాలైంది. కూడూ, గూడూ లేక వీధుల్లో తిరగాల్సి వచ్చింది. తన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ ఉన్నారో కూడా ఆమెకు తెలియదు. చివరకు బతకడానికి రైల్వే స్టేషన్ ముందు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. ఎందరి ఛీత్కారాలకో గురవుతూ, మొండిగా ఇక్కడక్కడే కాలం గడుపుకోసాగింది. అలాంటి పరిస్థితుల్లో ఒక సారి ఒక పూర్వ విద్యార్థిని గమనించింది. అతికష్టంమీద గుర్తుపట్టింది. దగ్గరికి వచ్చి వివరాలు అడిగింది. అంతే!ఆమె తనకు పాఠాలు చెప్పిన విద్యా టీచర్ అని పూర్తిగా నమ్మింది. తనను దివ్యగా పరిచయం చేసుకుంది. తనది ఏ బ్యాచో, తన బ్యాచిలో ఎవరెవరుఉండేవారో చెప్పుకుంది. సంభాషణలు సంబంధాన్ని మరింత బలపరిచాయి. ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికిన విద్యా టీచర్ జీవితం అలా కావడం ఆ పూర్వ విద్యార్థినికి నచ్చలేదు. ఎంతగానో  బాధపడింది. ఊరికే బాధపడితే లాభమేమిటీ? ఏదో చెయ్యాలని అనుకుంది. ఒకప్పటి ఆ విద్యార్థిని దివ్య-ఇప్పుడు ఐఏఎస్ అధికారి. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్ళి స్నానం చేయించి, వేరే శుభ్రమైన బట్టలిచ్చి, భోజనం పెట్టి, పడుకోబెట్టింది. అధికారంలో  ఉన్న అధికారి గనుక, దగ్గరలో అన్ని వసతులు ఉన్న చిన్న ఇల్లు వెతకండని మనుషుల్ని పంపింది.

Also read: తొలి భారతీయులు ఎవరు?-1

తనతో చదువుకున్న పూర్వ విద్యార్థినీ విద్యార్థులను సంప్రదించింది. విషయం-వారందరికీ తెలియజేసింది. అంతే కాదు. తన సర్కిల్ లో ఉన్న పెద్దపెద్ద వాళ్ళకు చెప్పి, అందరినీ కదిలించింది. తన విద్యా టీచర్ భవిష్యత్తు కోసం కొంత నిధి ఏర్పాటు చేసింది. అలా తమ స్కూలు టీచర్ కు మంచి జీవితం అందించాలన్న పూర్వవిద్యార్థుల సంకల్పం నెరవేరింది. తను చొరవ తీసుకొని, అందరినీ కలుపుకుని సమష్టిగా ఒక ప్రయత్నం చేసి విజయురాలైంది ఐఏఎస్ దివ్య. కన్నవాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆమె ఆస్తి కాజేసి, నిస్సహాయురాలిని చేసి రోడ్డున పడేసినా, ఒక టీచర్, తన విద్యార్థుల సహకారంతో మళ్ళీ గౌరవప్రదమైన జీవితంలోకి రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. విద్యా టీచర్ తను ఉద్యోగంలో ఉన్నప్పుడు బోధించిన పాఠాల సారాంశం, అందించిన సంస్కారం  ఆ పూర్వవిద్యార్థుల్లో పని చేసింది. ఆమె ఎంత నిజాయితీగా నిబద్ధతతో పాఠాలు చెప్పకపోతే, ఆమె తన విద్యార్థినీవిద్యార్థులకు అంత ప్రీతిపాత్రురాలు కాగలదూ? అలా పదేళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఎందుకుతరలి వచ్చారూ? ప్రతివారిలో మానవీయ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి. మానవవాదులు మనలోనే ఉన్నారు అంటే – మన మధ్యే ఉన్నారని అర్థం. అంతేకాదు. మనలో అంటే ప్రతిఒక్కరి మనసుల్లో ఉంటారు. స్వార్థం, కుత్సిత బుద్ధి పక్కన పెడితే, మనుషులంతా మానవవాదులే – కదా? డబ్బూ, అధికారం చాలా మంది దగ్గర ఉంటాయి. అయితే వాటిని మానవత్వ కోణంలోకి మార్చి, తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని బాగు చేయాలనుకోవడం గొప్ప సామాజిక సేవ!

Also read: తొలి భారతీయులు ఎవరు? -2

మన సమాజంలో ఇలాంటి పనులు ఎంతమంది చేస్తున్నారూ? అని నిట్టూర్పులు విడిచి, నిరాశపడకుండా ‘మనమేమైనా చేయగలమా?’ అని ఎవరికి వారు కార్యాచరణకు పూనుకోవాలి. వారి పరిధిలో వారు చేయగలిగింది చేయడానికి సిద్ధపడాలి. మనవాదులంటే ఎవరో ప్రత్యేకంగా ఉండరు. మన‘లోనే’ ఉంటారు. మన ఆలోచనల్లోనే  ఉంటారు. చేయవల్సిందల్లా ‘వారిని’ బయటికి తీయడమే. అంటే ఆ ఆలోచనలతోనే మరో పదిమందికి స్పూర్తినందించడం. జిలుగువెలుగుల సినిమా రంగంలో ఉండి కూడా ప్రజల పక్షాన నిలిచిన నటులు కొందరు మనకు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవాడు నానాపాటేకర్. తన ఆదాయంలో తొంభయ్ శాతం ఛారిటీలకు ఇచ్చారు. గతంలో కార్గిల్ యుద్ధసమయంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. తన ఆదాయంలో ఎక్కువ మొత్తం రైతుల అభ్యున్నతికి ఖర్చుపెట్టారు. కరువుకు గురైనా నాలుగు గ్రామాలను దత్తతకు తీసుకున్నారు. పేద ప్రజల కొరకే తన జీవితం అన్నట్లుగా అన్ని వేళలా వారికి అండగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇక్కడ ఒక్క నానా పాటేకర్ గురించి చెప్పుకున్నాం. కానీ సమాజంలో అక్కడక్కడా ఇలాంటివారుఉన్నారు. ఇలాంటివారి సంఖ్య గణనీయంగాపెరగాల్సిన అవసరంఉంది. ఆ ప్రయత్నం మనలోంచే ప్రారంభం కావాలి! ఇలాగే ఇటీవల కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించి, స్వంత ఖర్చుతో వారిని వారి వారి గమ్యాలకు చేర్చిన ఘనత నటుడు సోనూసూద్ కు చెందుతుంది. వెండితెర మీద విలన్లుగా నటించినా, నిజజీవితంలో గొప్ప హీరోలుగా నిలిచారు.

‘‘ప్రయత్నిస్తూ ఉండేవారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు-’’ అని అన్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్.

‘‘రాత్ కో జీత్ తో పాతా నహీ లేకిన్ యే చరాగ్

కం సే కం రాత్ కా నుక్సాన్ బహుత్ కర్తా హై’’- ఉరుదూ కవి ఇర్ఫాన్ సిద్ధిఖీ. రాత్రి పై విజయం సంగతి తెలియదు కానీ, ఈ దీపం రాత్రికి చాలా నష్టం కలిగిస్తుంది- అని అర్థం. ఇందులో రాత్ అంటే రాత్రి. అమానవీయత-రాత్రిగాక మరేమిటి? ఆశ అనే దీపం – ప్రయత్నమనే దీపం పట్టుకుని పోతూఉంటే చీకట్లు వాటికవే తొలగిపోతాయన్నఆశావాద దృక్పథం  ఈ చరణాలలో ఉంది. సమకాలీనంలో జరుగుతున్న ఘోరాల్ని చూసి బెంబేలెత్తిపోవడం కాదు. ప్రయత్నించి ఎదుర్కుం టూ పోతేనే విజయం వరిస్తుంది.

Also read: అంబేడ్కర్ బాటలో … గుజరాత్ లో బౌద్ధం

కేరళ కోజికోడ్ జిల్లాకు చెందిన శశి తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో  ఉంటున్నాడు. కొన్నేళ్ళ క్రితం బ్యాగుల పరిశ్రమ పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి యాభైవేలు లోన్(అప్పు)తీసుకున్నాడు. అసలూ, వడ్డీ ఏదీ చెల్లించకపోవడంత బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు వెళ్ళారు. శశి నిస్సయాత, కూలిపోయే అతని పాత ఇంటిని చూసి చలించిపోయారు. తొమ్మిది మంది ఉద్యోగులు కలిసికట్టుగా తమ స్వంత డబ్బుతో అతడి ఇల్లు బాగు చేయించి ఇచ్చారు. అంతేకాదు. ఆ బ్యాంకు ఉద్యోగులే తమ స్వంత డబ్బుతో అతడి బ్యాంకు లోన్ చెల్లించారు. దేశంలో ఇలాంటివారు కూడా ఉన్నారు. ప్రతి దేశస్థుడి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తానన్నవాడు రెండు సార్లు ప్రధానిగా వెలిగిపోయాడు గానీ, ఇలాంటి  ఏ చిన్న పాటి సహాయమూ దేశంలో ఎవరికీ చెయ్యలేదు. ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. రైతు తీసుకున్న అప్పు సకాలంలో బ్యాంకుకు తిరగి చెల్లించలేదని ఒక బ్యాంకర్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ను జస్టిస్ చంద్రచూడ్ కొట్టేశారు. ‘‘రైతు అప్పు చెల్లించలేదని అతన్ని కోర్టుకులాగుతారా? ముందు అప్పు ఎగ్గొట్టి పారిపోయిన ‘పెద్ద దొంగలను’- పట్టుకోండి!’’ అంటూ ఆయన తన తీర్పులో సూచించారు.  ప్రకృతి పరిరక్షణ కార్యకర్త డాక్టర్ వందనా శివ అంటారు-‘‘భూమి హక్కులను రక్షించుకోవడమన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇదే మన కాలంలో మనం జరిపే అతిపెద్ద శాంతి ఉద్యమం. సామాజిక న్యాయాన్ని , మానవహక్కులను రక్షించడం అందులో భాగమే!’’ ఒక స్థాయికి ఎదిగి ఆలోచించే వారికి మాత్రమే ఆమె మాటలు అర్థమవుతాయి. భూమితో రైతుకు మాత్రమే కాదు, మనుషులందరికీ ఉన్న సంబంధం గూర్చి అవలోకించగలగాలి. అది మానవవాదులయితే గాని చేయలేరు!

ఇండోనేషియలో ముస్లింలు తొంభయ్ శాతం, హిందువులు రెండు శాతం, మిగతా ఎనిమిది శాతం ఇతర మతస్థులు. అలాగే అమెరికాలో డెబ్బయ్ శాతం క్రైస్తవులు, ముప్పయ్ శాతం ఇతర మతస్థులు. అయినా, ఆయా దేశాల్లో అల్లర్లు లేవు. అక్కడ మతాన్ని అడ్డుపెట్టుకుని ఎవరూ రాజకీయాలు చేయడం లేదు. మెజారిటీలదే రాజ్యం అని కూడా అనడం లేదు. మన భారతదేశంలో అరెస్సెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశం హిందువులదేనని అంటున్నారు. మిగతా మతస్థులపై దాడులు చేస్తున్నారు. ఇక్కడ మరొక విచిత్రం జరగుతూ ఉంది. ఆవు పాటు నేలపాలు చేస్తారు. అవు నెయ్యి నిప్పులో తగలేస్తారు. ఆవు మూత్రం మాత్రం తాగుతారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదు. కొందరికి – ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది. మరికొందరికి – హిందువులు ప్రమాదంలో ఉన్నారని తోస్తుంది. అసలు విషయమేమంటే – దేశమే ప్రమాదంలో ఉందన్నది అందరూ గ్రహించాల్సి ఉంది.  దీనికి ఒక్కటే పరిష్కారం-జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాల్ని పక్కకు నెట్టి కలిసిమెలసి జీవించడమే!

Also read: గాంధీజీ స్థానంలో సావర్కరా? హవ్వ-సిగ్గుచేటు!

మానవవాదులన్నవారు కులమతాల్ని తప్పనిసరిగా త్యజించాలి. ఆర్థిక స్థోమతల్ని పట్టించుకోగూడదు. మనవాభ్యుదయమే ధ్యేయంగా ఆధునిక స్త్రీపురుషులందరూ కలిసికట్టుగా ఒక మానవవాద ప్రపంచాన్ని సృష్టించుకోవాలి! పోయిన తరాల వారికి ఈ అవకాశం లేదు. వాళ్ళంతా ఏదో ఓ మతంలో ఏదో ఓ కులంలో పుట్టారు. ఆ చట్రంలోనే పెరిగారు. వాటికి అతీతంగా ఆలోచించడం ప్రారంభించే సరికి, వారు మధ్య వయస్కులో, వృద్ధులో అయిపోయి ఉంటారు. అప్పటి పరిస్థితులు కూడా వేరుగా ఉండేవి. కానీ, ఇప్పటి ఈ తరం నవయువతీయువకులకు అన్ని బంధాల్ని తెంచుకుని స్వేచ్ఛాలోచనతో ఆ చట్రంలోంచి బయటపడే అవకాశాలు ఎక్కువ!

డెన్మార్క్ వంటి దేశాల్లో విచిత్రమైన గ్రంథాలయాలున్నాయి. అక్కడ మీరు పుస్తకానికి బదులు ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. అతను మీ ఎదురుగాకూర్చుని, మీ బాధలు, వ్యధలు ఓపికగా వింటాడు. మిమ్మల్ని పూర్తిగా చదివేస్తాడు. అంటే ఓపికగా వింటూ, మీ మానసిక ఒత్తిడిని,వేదనను అతను స్వీకరిస్తూ ఉంటాడన్నమాట! అంతేకాదు. దీనివల్ల మీ అహం, కోపం కూడా తగ్గు ముఖం పడతాయి – వీటిని ‘‘మానవ గ్రంథాలయాలు-’’ అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మానవగ్రంథాలయాలు ఎనభై అయిదు దేశాలలో ఉన్నాయి. చురుకుగా పని చేస్తున్నాయి. ఎదుటివాడి బాధలు విని, అర్థం చేసుకుని, గాయపడ్డ అతని/ఆమె మనసు తేలికపడడంలొ సహాయపడడమంటే అది మానవత్వమే కదా? మానవీయ విలువల్ని నిలబెట్టడమే కదా? అలాంటి గ్రంథాలయాల్లో మీకు ఎదురుగా వచ్చి కూర్చునే వ్యక్తులు మానవవాదులు కాకపోతే మీ వేదనను పోగొట్టలేరుకదా?

Also read: హేతుబద్ధత కొరవడిన దేశాల్లో భారత్ ఫస్ట్!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles