Friday, April 19, 2024

భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

పిగ్గీబ్యాంక్ లో దాచుకున్న డబ్బును పేదలకు ఇచ్చివేస్తున్న బాలిక

మనం ఉన్నది గురుత్వాకర్షణశక్తి ఉన్న గ్రహం మీద! పైకి వెళ్ళిన ప్రతిదీ తప్పక కిందపడాల్సిందే!! తప్పదు – వస్తువులైనా, మనుషులైనా. కింద అందరినీ కలిపేది మానవత్వం. కింద ఉన్న వారిని, పైకి లేచినవారినీ – పైకి లేచి కిందపడినవారినీ- అందరినీ! ప్రపంచంలోని అన్యాయాన్ని చూస్తూ ఉండకూడదు. అది మన వెలుగుల్ని స్వాహా చేయడాన్ని అసలే ఒప్పుకోకూడదు, సహించకూడదు. ఆ లక్షణమే మనం బతికి ఉన్నామని చెప్పుకోవడానికి ఒక సాక్ష్యం. అదే మానవత్వ ఆకర్షణ శక్తి!

Also read: మనువాదుల ఇటీవలి పరిశోధనలు

మనిషిని మనిషీ, దేశాన్ని ఇంకో దేశం దోచే  విధానం అంతం కావాలి. సామ్రాజ్యవాదం పేర చలాయిస్తున్న పెత్తనాన్ని అంతం చేయనిదే…మానవ జాతి అనుభవిస్తున్న బాధలు, దోపిడీ నివారించబడవు. దాన్ని అంతం చేయకుండా యుద్ధాలు వద్దని శాంతి కావాలని చెప్పే కబుర్లు ఒట్టి నయవంచనే – అని అన్నాడు షహీద్ భగత్ సింగ్. ధనవంతుడు సముద్రం లాంటివాడు. సముద్రంలో ఎన్ని నీళ్ళున్నా ఒక్కడి దాహం కూడా తీరదు. ధనవంతుడు కూడా తీర్చలేడు. సంస్కారవంతుడు బావిలాంటివాడు. బావి తన దగ్గరున్న కొద్ది నీళ్ళతో అందరి దాహం తీరుస్తుంది. అదే మానవత్వం! మా‘నవ’వాదానికి మరో నిర్వచనం అక్కరలేదు. జాతి, మత, ప్రాంతీయ, వర్గ, వర్ణ విభజనలు చూడకుండా బావి అందరి దాహం తీరుస్తుంది. ఇది మా బావి అనీ, అది మీ బావి అనీ మానవత్వం లేనివాళ్ళు బావుల్ని, చెరువుల్ని విభజించుకున్నారు. అది మళ్ళీ వేరే విషయం. సరే-అక్క పెండ్లికి మంచి బహుమతి ఇద్దామని ఇద్దరు చెల్లెళ్ళు కష్టపడి, అతికష్టంమీద ఐదువేలు దాచిపెట్టుకున్నారు. ఇంతలో ఫేస్ బుక్ ద్వారా కరీంనగర్ లోని న్యూఎస్టీ కాలనీలోని బత్తిని అంజవ్వ గురించి తెలుసుకున్నారు. ఆమె భర్త చనిపోయాడు. చిన్న పాప ఉంది. ఆమెకు కాలేయ వ్యాధి – విషయం తెలుసుకున్న ఆ ఆడపిల్లలు వారు దాచిపెట్టుకున్న డబ్బు వెంటనే అంజవ్వకు పంపారు. స్వార్థాన్ని వదులుకొని ఇతరులకు సహాయపడడమే మావనత్వం. ఇలాంటి సంఘటనలు అరుదుగా అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి. బొంబాయివాసి అమన్ రాహదారిపై నాలుగు రోజుల పాప ఏడుపు విన్నాడు. నిర్మానుష్యమైన ప్రదేశం. ఏం చేయాలో తోచక పాపను తనతో తీసుకెళ్ళాడు. అయితే ఆ పసిగుడ్డును పెంచేది ఎలాగో అతనికి తెలియదు. వెంటనే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో పోలీసులు తనను ఆదుకోవాలని అభ్యర్థించాడు. విషయం పోలీసులకు చేరింది. వాళ్ళు వెంటనే స్పందించి, వచ్చి – పాపను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. తర్వాత బాలల అనాథాశ్రమంలో చేర్పించారు. అబద్ధాలతో సోషల్ మీడియాను కలుషితం చేస్తున్నవారి సంఖ్య చాలా పెద్దది. అయినా, నిజాల్ని నిజంగా బయటికి తెచ్చే వారి సంఖ్యను మనం పెంచుకుని, ఒక ఉద్యమంగా చేసుకోవాలి.

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

ఇటీవల కరోనా కాలంలో ఒక సంఘటన జరిగింది. అది మా‘నవ’వాదానికి బలాన్నిచ్చింది. అనంతపురంలో ఒక బ్రాహ్మణుడు కరోనాతో చనిపోయాడు. చూడడానికి కానీ, అంత్యక్రియలు జరిపించడానికి కానీ అతని బంధుమిత్రులూ, స్నేహితులు ఎవరూ రాలేదు. రంజాన్ ఉపవాసంలో ఉన్న కొందరు ముస్లింలు అక్కడికి వచ్చారు. ఎవరి నుండీ ఏ స్పందనా రాకపోవడంతో వారే పాడె ఏర్పాటు చేశారు. పాడె మోశారు.  అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం ముందు మతం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుందని ప్రకటించకనే ప్రకటించారు. కొన్ని జీవన సత్యాల్ని మనం పిల్లలకు, యువకులకు అందిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి తెలుసుకోవడానికి మన తరంలో సగం జీతితం అయిపోయింది కదా?తర్వాత తరాలకు అంత సమయం ఎందుకు పట్టాలి? మన తరం వారు చాలా ఆలస్యంగా నేర్చుకున్నవి, రాబోయే తరాలు సత్వరం నేర్చుకోవాలి. దాని వల్ల సమాజ పురోగతి సత్వరం సాధ్యమవుతుంది. మానవత్వానికి సంబంధించిన విషయాలు ఊరికే మూర్ఖులతో వాదిస్తూ సమయం వృధా చేసుకోగూడదు. వాళ్ళకు వాళ్ళ మత విశ్వాసాలు, భ్రమలే ముఖ్యం. వాటిని నిలబెట్టుకోవడానికి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు. మనోభావాలు దెబ్బదిన్నాయని బూతులు మాట్లాడుతుంటారు – తప్పించి, నిజాలేమిటో, వాస్తవాలేమిటో అన్నది అన్నది వారెంత మాత్రమూ పట్టించుకోరు.

Also read: మనుస్మృతిలో మాంసభక్షణ గూర్చి ఏముంది?

2014 అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పాసయి జ్యోతి అనే అమ్మాయి అసిస్టెంట్ ఇన్ కం టాక్స్ కమిషనర్ ఉద్యోగం సంపాదించింది. ఆ అమ్మాయి 2013లో కంప్యూటర్ సైన్సులో డిగ్రీ తీసుకుని, పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరిక్షలు రాసింది. కూతురు ఉద్యోగం సంపాదించిన విషయం తెలుసుకుని ఆమె తండ్రి సోబెరన్ ఆనందంలో కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక జీవిని, ఒక జీవితాన్ని నిలబెట్టిన మానవత్వపు విజయరేఖ అతని కళ్ళలో కనిపించింది. అతి సామాన్యుడే అయినా, ఎంతో మంది గొప్పవాళ్ళకంటే గొప్పవాడు – సోబెరన్! అతను తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకునే చిన్నపాటి వ్యాపారి. అతి కష్టంమీద కూతుర్ని చదివించి పెద్దచేశాడు. అతను గతాన్ని గుర్తు చేసుకుని ఓ మాట చెప్పాడు. ‘‘నాకు చెత్తకుండీలో అమ్మాయి దొరకలేదు. బొగ్గు గనిలో ఒక వజ్రం దొరికింది’’- అని! ఆమె ఎవరి బిడ్డో అతనికి తెలియదు. కానీ, తల్లీదండ్రీ అన్నీ తానై ఒక ప్రాణిని బతికించాడు. ఒక జీవితాన్ని నిలబెట్టాడు.. అదుకు, అందరూ అతణ్ణి అభినందించాల్సిందే! కొన్నేళ్ళ క్రితం బండి తోపుకుంటూ వెళుతున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశంలో చెత్తకుప్పమీద ఏడుస్తూ ఒక ఆడశిశువు కనిపించింది. వెనకా, ముందూ ఏమీ ఆలోచించకుండా పరుగెత్తి ఆ శిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే! భారతీయ సమాజంలో ఆదరణ లేక, అవకాశాల్లేక… అవకాశాలివ్వక – ఎన్నో జాతులు శాతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాలి! మానవత్వాన్ని మేల్కొల్పాలి!! ఒక కూరలమ్ముకుని బతికేవాడికి ఉన్న ఔదార్యం ప్రభుత్వాలకూ, కార్పొరేట్లకూ లేకపోతే ఎలా?

Also read: మనల్ని మనం ఖాళీ కప్పులుగా చేసుకుంటే?

చాలామంది సీతాసాహూ అనే మహిళ పేరు విని  ఉండకపోవచ్చు. ఒకప్పుడు విన్నా, మరిచిపోయి ఉండొచ్చు. మన మీడియా ఇలాంటి వారిని పట్టించుకోదు కదా? సీతాసాహూ ఈ దేశానికి రెండు ప్రత్యేక ఒలంపిక్ మెడల్స్ తెచ్చిన మహిళ. జీవికకోసం ప్రస్తుతం పానీపురి అమ్ముకుని బతుకుతూ ఉంది. కొందరికి అప్పనంగా ప్రజల సొమ్ము కోట్లకు కోట్లు కట్టబెట్టే మన ప్రభుత్వాలకు కళ్ళూ, చెవులూ రెండూ లేనట్టేనా? ఉత్తపుణ్యానికి భారతరత్న పొంది కోట్లకు కోట్లు సంపాదించిన క్రికెట్ ఆటగాడు సచిన్ పేరు చెబితే – దేశం యావత్తూ గుర్తుపడుతుంది. అతనేమో ఉచితంగా వచ్చిన తన ఫరారీ కారుకు రాయితీ కావాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాడు. అలాంటి వారిని నెత్తిన మోసే ప్రభుత్వాలు సేతుసాహూ లాంటి వారిని ఎందుకు పట్టించుకోవూ? ఇలాంటి అంశాలు ఎత్తి చూపడం ఎందుకంటే దేశంలో అసమానతలు, వివక్షలు ఉండకూడదని! దీనికి జస్టిస్ చంద్రచూడ్ 30 ఆగస్టు 2018న ఒక మంచి వివరణ ఇచ్చారు – ‘‘ప్రజాస్వామ్యానికి అసమ్మతి అనేది ఒక ‘సేఫ్టీవాల్వ్’ లాంటిది. దాన్నిఅనుమతించకపోతే, ఏకంగా ప్రజాస్వామ్య ప్రెజర్ కుక్కర్ పేలిపోతుంది!’’- అని.

Also read: ఫేక్ వర్సెస్ రియల్

కేవలం మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా జరగని చిత్ర, విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. కరోనా వ్యాక్సిన్ లు అందరితో కలిపి కాకుండా, తమ ‘అగ్రవర్ణం’ వారికి విడిగా వేయాలని కొందరు డిమాండ్ చేస్తారు. ఆసుపత్రిలోని పేషంట్లు కొందరు, తమ ‘కులపోడి’ రక్తమే కవాలని డిమాండ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ 1.24 లక్షల మంది విద్యార్థులకు కులం లేదు. కేరళ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చేరే విద్యార్థులకు తాము ఏ కులానికీ, మతానికీ చెందమని స్పష్టం చేశారు. ‘‘ప్రతి సంవత్సరం ఇలాంటి చిన్నారుల సంఖ్య తమ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూ ఉంది’’ అని అసెంబ్లీలో కేరళ విద్యామంత్రి సి. రవీంద్రనాథ్ ప్రకటించారు. దేశంలో ఈ మార్పు ఎంతో ఆశాజనకంగా కనిపిస్తోంది.  ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు స్ఫూర్తినిస్తోంది. కులం-మతం కాలమ్స్ వదిలేసి విద్యార్థులు ఇస్తున్న డిక్లరేషన్ సంచలనం సృష్టిస్తోంది. ముందు ముందు ఆ కాలమ్స్ – అప్లికేషన్లలో ప్రింట్ చేయకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం!

Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

నార్వేలో ఒక మంచి పద్ధతి వాడుకలో ఉంది. ఉదాహరణకు ఒక మహిళ మరో ఇద్దరిని తీసుకుని రెస్టారెంట్ కు వెళ్ళిందనుకుందాం. ముగ్గురికి మూడు మీల్స్ అని డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఆమె ఇతర నిస్సహాయులకు సహాయపడాలనుకుంటే – మరో రెండు భోజనాలకు అదనంగా డబ్బు చెల్లిస్తుంది. ‘‘ఫైవ్ మీల్స్, టూ సస్పెండెడ్’’ – అని అంటుంది. ఎవరైనా అతిదీన స్థితిలో ఉండి, డబ్బు చెల్లించి భోజనం చేయలేని వాళ్ళు వచ్చి అడిగితే – రెస్టారెంట్ వాళ్ళు వారికి భోజనం పెడతారు! ‘ఎనీ సస్పెండెడ్ మీల్స్’- అని అడిగినవారికి ‘ఎనీ సస్పెండెడ్ కాఫీ’’ అని అగిడిన వారికి రెస్టారెంట్ సహకరిస్తుంది. అదేదో దానం చేస్తున్నట్టు కాక, కస్టమర్స్ గౌరవభావంతో డొనేట్ చేస్తారు. అంతే గౌరవభావంతో రెస్టారెంట్ వాళ్ళు పేదలకు అందిస్తారు. మానవీయ విలువలు గల హుందాతనంతో – అలా ముక్కూమొహం తెలియకుండా కూడా గౌరవభావంతో చేసే ఆ సహాయం ఎంత గొప్పది? ‘డబ్బులు అదనంగా వస్తున్నాయి కదా వెనకేసుకుందాం’’- అనే వ్యాపార ధోరణీ – కక్కుర్తీ ప్రదర్శించకుండా నిజాయితీగా ప్రజలకు సేవచేసే మంచి మనసు కూడా రెస్టారెంట్ యాజమాన్యానికి ఉంటుంది. విషమ పరిస్థితులు ఎదురై ఆర్థికంగా దిగజారిన వారు కూడా మానసికంగా కృంగిపోక – హుందాగా ‘ఎనీ సస్పెండెడ్ మీల్స్’ అని అడగడమే కాదు, తాము కూడా ప్రయోజకులై – సస్పెండెడ్ కాఫీ, టిఫిన్, మీల్స్ కు – డబ్బు చెల్లించాలని ఉబలాటపడతారు కూడా!  అందుకే తెలుగు కవి ఆలూరి బైరాగి అంటారు – ‘‘కత్తిరించిన ఒత్తులే/వెలుగుతాయి దివ్యంగా – బాధా దగ్థకంఠాలే పలుకుతాయి శ్రావ్యంగా’’- అని!  అందుకే మనకిప్పుడు ఎవరి అవసరం ఉందో తెలుసా?

Also read: మాల్గుడి సృష్టికర్త ఆర్. కె. నారాయణ్

ఈ సమాజంలో ఆర్థికక, సాంఘిక, ప్రాంతీయ అసమానతలు ఉండకూడదని మానవజాతి అంతా ఒకటే అని నినదిస్తూ రచనలు చేసే రచయితలు కావాలి. గళమెత్తే గాయకులు కావాలి. ఆ  భావాన్ని ప్రతిబింబించే చిత్రకారులూ, శిల్పులూ కావాలి. ఆచరణలో పెట్టగల కార్యకర్తలు, సమాజసేవకులూ కావాలి! ‘సేవ’ – అనే ముసుగు ధరించి రాజకీయాలు చేసే ముసుగు వీరులు వృథా! వృథా!! సమాజాన్ని పాతరాతి యుగంలోకి ఈడ్చుకుపోయే ప్రభుత్వాలు అంతకన్నా వృథా.

Also read: శాస్త్రవేత్తల్లో మతవిశ్వాసాలు

(రచయిత సుప్రసిద్ధసాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles