Friday, March 29, 2024

మహాత్ముడైన మామూలు మనిషి!

గాంధీయే మార్గం-2కి ముందుమాట

కొండుభట్ల రామచంద్రమూర్తి

‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు’ అని తెలుగు సినిమా గీతంలో చెప్పిన వాక్కు అక్షర సత్యం. క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉంటే మామూలు మనిషి మహాత్ముడు అవుతాడని మహాత్మాగాంధీ జీవితం అధ్యయనం చేసిన వారికి బోధపడుతుంది. గాంధీ పుట్టింది జైన పరంపర పాటించే సాధారణ వైశ్య కుటుంబంలో. చదువులో గొప్ప ప్రతిభ ఉన్నవాడు కాదు. అందగాడు కాదు. సగటు మానవులకు ఉండే సకల బలహీనతలూ ఉన్నవాడు. అటువంటి సాధారణ వ్యక్తి మహాత్ముడు కావడానికి దోహదం చేసిన లక్షణాలు ఏమిటి? సందర్భాలు ఏమిటి? సత్యనిష్ఠ అన్నది గాంధీజీ లక్షణాలలో అత్యంత మౌలికమైనది. చిత్తశుద్ధి, తప్పు తెలుసుకున్న వెంటనే దిద్దుకునే స్వభావం, ఆత్మవిశ్వాసం. సత్యాగ్రహం, సత్యప్రయోగాలు ఆయన జీవితాన్ని నడిపించాయి. తాను చెప్పేది ఆచరించాలనే పట్టుదల ఇతర నాయకులకంటే భిన్నంగా గాంధీని నిలబెట్టింది. గాంధీలో క్రమంగా వచ్చిన పరివర్తన స్పష్టంగా కనిపిస్తుంది.  అతి మామూలు మనిషి మహర్షిగా పరిణామం చెందడాన్ని ఎవరికి వారు గమనించవచ్చు. తన శరీరాన్నీ, మనస్సునూ, హృదయాన్నీ ప్రయోగశాలగా మార్చుకొని నిరంతరం ప్రయోగాలు చేస్తూ జీవించిన కర్మయోగి ఆయన.

గాంధీజీది బుద్ధుడి కంటే ఉన్నతమైన వ్యక్తిత్వం అని రాహుల్ సాంకృత్యాన్ చేసిన వ్యాఖ్యతో కొంతమంది విభేదించవచ్చు. కానీ గాంధీజీని గాడ్సే కాల్చి చంపినప్పుడు అమెరికాలో ఒక వ్యవసాయదారుడు ‘ఎందుకు చంపారు సత్యం,అహింస అని పట్టుకొని వేళ్ళాడే గాంధీని?’ అని అడుగుతాడు. ‘జీసస్ క్రైస్తును ఎందుకు చంపి ఉంటారో అటువంటి కారణమే కావచ్చు’ అంటూ మరో రైతు నిట్టూర్చాడు. సప్తసముద్రాల అవతల లోకజ్ఞానం పరిమితంగా ఉన్న అమెరికా రైతుకు కూడా గాంధీజీ వ్యక్తిత్వ మహాత్మ్యం అవగతమయింది.

లక్ష్యం కంటే మార్గం ప్రధానం : గాంధీ

లక్ష్యం ప్రధానం, మార్గం కాదు  అని కార్ల్ మార్క్స్  అంటే  లక్ష్యం కంటే మార్గం ప్రధానం అన్నాడు గాంధీజీ.  ‘గాంధీజీ గొప్పదనం ఆయన పడిన కష్టాలలో లేదు. ఆయన జరిపిన పోరాటాలలో లేదు. ఆయన సాధించిన విజయాలలో లేదు. ఆయన జీవించిన పవిత్ర జీవితంలో ఉంది,’ అన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ అంచనా నూటికి నూరు శాతం నిజం. గాంధీని ‘రాజకీయాలలోచేరి పతనమైన మహర్షి’ అంటూ ఒక సమకాలీన రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానిస్తే, ‘‘కాదు. నేను రాజకీయవేత్తను. మహర్షిని కావడానికి కృషి చేస్తున్నాను,’’ అంటూ సవరించారు గాంధీ.

గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినప్పుడు దేశం ఎట్లా ఉంది? ‘‘మానం లేదు. అభిమానం లేదు. తృష్ణ లేదు. ఆత్మవిశ్వాసం లేదు. తన నీడ తన్నే తరుముతున్నట్టు తల్లడిల్లిపోయేవారు ప్రజలు. అటువంటి భారతరంగంలోకి గాంధీ అడుగుపెట్టాడు’’ అటారు ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. టన్నులకొద్దీ ఆలోచనల కన్నా ఒక్క ఔన్సు ఆచరణ మిన్నఅనేవారు గాంధీ అని పీవీ నరసింహారావు గుర్తు చేశారు.

అందరిలాగానే లండన్ ప్రయాణం

గాంధీజీ ఇతర గుజరాతీ యువకుల వలెనే 04 సెప్టెంబర్ 1888న లండన్ వెళ్ళారు.  బారిస్టర్ చదువు చదివారు. 10 జూన్ 1891న బారిస్టర్ గా పట్టా పొందారు. ఇంగ్లండ్ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని మరునాడే ఇండియాకు ప్రయాణమైనారు. ఇండియాలో న్యాయవాదిగా పెద్దగా రాణించలేదు. ఒక ముస్లిం వ్యాపారవేత్త సహాయకబృందంతో పని చేయడానికి 1893లో దక్షిణాఫ్రికా వెళ్లారు. మహాత్ముడు కావడానికి అక్కడే బీజం పడింది. అక్కడే సత్యాన్వేషణ ప్రారంభించారు. అక్కడే ప్రజాసేవ ఆరంభించారు. అక్కడే రైలులో నుంచి బ్రిటిష్ అధికారులు గాంధీని ప్లాట్ ఫాంపైకి విసిరి వేశారు.  అక్కడే భార్యను ఇంటి నుంచి నిర్దయగా గెంటి వేసి, తప్పు తెలుసుకొని, ఆమెను గౌరవించడం ప్రారంభించారు. అక్కడే బ్రహ్మచర్యం పాటించాలన్న కఠోర నిర్ణయం తీసుకున్నారు. 1906లో తన 36వ ఏట బ్రహ్మచర్యం పాటించడం ప్రారంభించారు. అక్కడే సత్యాగ్రహం, సహాయనిరాకరణ అనే రెండు ఆయుధాలను ఆవిష్కరించారు.  ‘అక్కడ అంతరంగంలో ధార్మిక ప్రోద్బలం జీవన ప్రోద్బలంగా మారింది. నేను నా జీవన యాత్ర కోసం దక్షిణాఫ్రికా వెళ్ళాను. కానీ భగవదన్వేషణలో నన్ను నేను గుర్తించుకున్నాను. స్వీయ ఆవిష్కరణలో పెనుగులాడాను’’ అని రాసుకున్నారు గాంధీ. హిందూ, జైన మతగ్రంధాలు క్షుణ్ణంగా చదివారు. జాన్ రస్కిన్, లియో టాల్ స్టాయ్ రచనలు చదివాడు. జాన్ రస్కిన్ ‘అన్ టు ద లాస్ట్’ను రైలు ఎక్కుతుండగా హెన్రీ పాలెన్ అనే మిత్రుడు ఇవ్వగా ప్రయాణం పూర్తి చేసి దిగే లోపున ఏకబిగిన పుస్తకం అంతా చదివేశారు. గాంధీకి శ్రమగౌరవం అంటే ఏమిటో నేర్పింది రస్కిన్ రచనే. ‘‘ఏ పని చేసే సమయంలోనైనా సందేహం కలిగినప్పుడు లేదా స్వార్థ చింతన అడ్డుతగిలినప్పుడు నీకు తెలిసిన అతిపేదవాడి, అతి బలహీనుడి మొహాన్ని గుర్తు తెచ్చుకో’’ అని తనకు తాను చెప్పుకున్నారు.  వకీలు పని మంగలి పని రెండూ సమానమైన గౌవరం కలిగినవేనని గ్రహించారు. ప్రేమ, కరుణ ద్వారా మనిషి జీవితాన్ని ఎట్లా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలో టాల్ స్టాయ్ రచనలు చెప్పాయి. జాన్ రస్కిన్, టాల్ స్టాయ్, థోరో రచనలు గాంధీ లాగానే చాలామంది చదివి ఉంటారు. కానీ గాంధీ వాటి సారం గ్రహించి తనకు అన్వయించుకొని తన జీవనమార్గాన్ని నిర్దేశించుకున్నారు. ఇతరులు కేవలం చదివి వదిలేశారు. ఆ లక్షణమే గాంధీని మహాత్ముడిని చేసింది. ఏ పని చేసినా నైతికత విషయంలో రాజీపడకూడదని దక్షిణాఫ్రికాలో పోరాటాలు చేస్తున్న సమయంలోనే గాంధీ సంకల్పం చెప్పుకున్నారు. వ్యక్తి స్వేచ్ఛకూ, సమష్టి స్వేచ్ఛకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. దక్షిణాఫ్రికాలో భారత సంతతి ప్రజల హక్కుల కోసం సాగించిన పోరాటంలో అణచివేతను ఎదుర్కోగల శక్తిమంతమైన ఆయుధంగా సత్యాగ్రహం రూపొందింది. సత్యబద్ధమైన పోరాటంలో విజేతలూ, పరాజితులూ అంటూ ఉండరని గ్రహించారు. ప్రత్యర్థిని ద్వేషించకుండా పోరాటం చేయడం నేర్చుకున్నారు. సహచరులకు నేర్పారు.  దక్షిణాఫ్రికాలో గాంధీ పోరాటం చేసినంతకాలం ఆయనను ఎదిరించిన ప్రతిద్వంది స్మిట్స్. గాంధీ భారత దేశానికి బయలు దేరిన సందర్భంలో ‘‘ఒక మహర్షి మన తీరాలను దాటి వెడుతున్నారు’’ అంటూ స్మిట్స్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల గౌరవం పొందే లక్షణం సత్యాగ్రహంలో ఉంది. ‘‘అప్పటి నుంచి గాంధీజీ దృక్పథం, అహింసావారసత్వం మమ్మల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి’’ అని దక్షిణాఫ్రికా విమోచనకు గాంధీ మార్గంలో సుదీర్ఘ పోరాటం చేస్తూ రాబెన్ ద్వీపం, పోల్స్ మోర్, విక్టర్ వెర్ స్టెర్ జైళ్ళలో 27 సంవత్సరాలు గడిపి విడుదలైన వెంటనే 1990లో ఇండియా సందర్శించినప్పుడు నెల్సన్ మండేలా అన్నారు.

న్యాయవాదిగా 19 ఏళ్ళు

దక్షిణాప్రికాలో 1893 నుంచి 1912 వరకూ న్యాయవాదిగా పని చేశారు. న్యాయం ఉంటేనే వాదించేవారు. తన క్లయింట్ పక్షాన న్యాయం లేదని నిర్ధారించుకున్న తర్వాత వాదించేవారు కాదు. పూర్తి సమయాన్ని సత్యాగ్రహోద్యమానికి కేటాయించాలన్న తలంపుతో 1912లో న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగారు. దక్షిణాఫ్రికాలో ఉండగానే ఒక సారి లండన్ వెళ్ళి పాతమిత్రులతో సమాలోచనలు జరిపారు. భారత దేశంలో పరిస్థితులు తెలుసుకున్నారు. స్వరాజ్యం అంటే ప్రవాస భారతీయులకు పెద్దగా అవగాహన లేదని గ్రహించారు. స్వరాజ్యం అంటే తన అభిప్రాయంలో ఏమిటో వివరించాలని అనుకున్నారు. ఇంగ్లండ్ నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాకి ఓడలో చేరుకునే సమయానికి ‘హింద్ స్వరాజ్’ అనే గ్రంధం రాశారు. దానిని అక్కడే తాను నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఓపీనియన్’ అనే పత్రికలో ధారావాహికగా ప్రచురించారు. భారత దేశ స్వాతంత్ర్య సాధనకు అనుసరించివలసిన విధానాలను అందులో పొందుపరిచారు. ‘హింద్ స్వరాజ్’ను దక్షిణాఫ్రికాలోనే ప్రచురించి బొంబాయికి పంపుతే పోలీసులు పుస్తకాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. గాంధీ ఈ పుస్తకన్ని గుజరాతీలో రాశారు. దాన్ని ఇంగ్లీషులోకి ఆయనే అనువదించారు. ఇంగ్లీషు అనువాదం ప్రచురించిన తర్వాత ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మేధావులు ప్రశంసించారు. ‘ఈ పుస్తకం ద్వేషానికి బదులుగా ప్రేమను బోధిస్తుంది. హింసావాదం స్థానంలో స్వీయత్యాగాన్ని ప్రతిష్ఠిస్తుంది. పశుబలానికి వ్యతిరేకంగా ఆత్మబలాన్ని నిలబెడుతుంది,’’ అన్నారు గాంధీ తన పుస్తకంపైన వచ్చిన విమర్శలకు సమాధానంగా. ‘హింద్ స్వరాజ్’ ను తొలి గాంధేయ మేనిఫెస్టోగా ప్రశంసించారు.  అనైక్యతే పరాధీనతకు ప్రదాన కారణమని గాంధీ విశ్వసించారు.

దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాలకుపైగా పోరాటం

ఇరవై ఒక్క  సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో జీవించి, పోరాడి 09 జనవరి 1915నాడు భారతదేశానికి గాంధీజీ చేరుకున్నారు. గోపాలకృష్ణ గోఖలే సలహాను అనుసరించి భారత దేశం అంతటా విస్తృతంగా రైలు ప్రయాణం చేశారు. అక్కడి నుంచి గాంధీ తీసుకున్న ప్రతి నిర్ణయం,చేపట్టిన ప్రతికార్యక్రమం వెనుకా ఒక వివేచన, దూరదృష్టి, వ్యూహం కనిపిస్తాయి. భారత పర్యటనలో పల్లెలను పరిశీలించారు. పేదప్రజల బడుగుబతుకులను కళ్ళారా చూశారు. కులం, మతం, ప్రాంతం దేశ ప్రజల జీవితాలను అతలాకుతలం చేయడం గమనించారు. నిరక్షరాస్యులూ, కటికపేదలూ, లోకం పోకడ తెలియనివారూ, స్పర్థలతో, సంకుచిత భావాలతో సతమతం అవుతున్నవారిని ఎట్లా ఏకతాటిమీదికి తీసుకొని రావాలో, నిరుపేదల ప్రతినిధిగా వారి విశ్వాసం పొందాలంటే ఏమి చేయాలో ఆలోచించారు.

శబర్మతి ఆశ్రమం

భారత్ కు వచ్చిన నాలుగు నెలలోనే 25 మే 1915న శబర్మతి నదీతీరంలో ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. తమిళనాడు పర్యటనలో ఉండగా 22 సెప్టెంబర్ 1921న కొల్లాయి  కట్టడం ప్రారంభించారు. ‘నగ్నబైరాగి (నేకెడ్ ఫకీర్)’ అంటూ బ్రిటీష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ లాంటి వారు అవహేళన చేసినా సరే తన దేశ ప్రజలకు నిజమైన ప్రతినిధిగా కొల్లాయితో నిలిచారు. వైస్రాయ్ ని కొల్లాయి కట్టిన గాంధీ కలుసుకున్నాడంటే భారద దేశంలోని పేద ప్రజలంతా తాము స్వయంగా  వైస్రాయ్ ని కలిసినట్టే భావించేవారు. గాంధీ దేశం అంతటా అనేక సార్లు పర్యటించారు. దారిద్ర్య నిర్మూలన, మహిళలకు స్వేచ్ఛ, అధికారాలు, అంటరానితనం నిర్మూలన, మతసామరస్యం, స్వరాజ్య సాధన గురించి అదే పనిగా ప్రచారం చేశారు. ఆశ్రమంలోనే ఒక దళిత కుటుంబంతో కలసి ఉండేవారు. భార్య,భర్త, ఒక కుమార్తె ఉండేవారు. ఆ కూతురునే గాంధీ దత్తత తీసుకున్నారు.

చంపారన్ ఉద్యమం నాంది

గాంధీ తిరిగి భారత దేశానికి వచ్చినప్పుడు దేశజనాభా 40 కోట్లు. 75 శాతం మంది గ్రామాలలో నివశించేవారు. కాంగ్రెస్ ఉద్యమంలో రెండు శిబిరాలు ఉండేవి. బ్రిటిష్ వలస వ్యవస్థలోనే కొన్ని అధికారాలు సంపాదించుకొని ప్రశాంతంగా జీవించాలని ఒక వర్గం వాదించగా సాయుధపోరాటం ద్వారానైనా సరే స్వాంతంత్ర్యం సంపాదించుకోవాలని బెంగాల్ కు చెందిన తీవ్రవాదులు వాదించేవారు. ఈ దశలో గాంధీ భారత్ లో తొట్టతొలుత సత్యాగ్రహ పోరాటం బీహార్ లోని చంపారన్ లో నిర్వహించి దేశయువతకు మార్గదర్శనం చేశారు. స్వాతంత్ర్య పోరాటం ఏ విధంగా సాగాలని తాను అనుకుంటున్నారో రేఖామాత్రంగా చూపించారు. చంపారన్ లో నీలిమందు పండించిన కౌలు రైతులను దోచుకుంటున్న భూస్వాములనూ, వారి వెనుక ఉన్న బ్రిటిష్ పాలకులనూ దారికి తెచ్చేందుకు సత్యాగ్రహాస్త్రాన్ని గాంధీజీ దేశంలో మొదటిసారి ప్రయోగించారు. 10 డిసెంబర్ 1917న చంపారన్ సందర్శించిన గాందీ సమస్య పరిష్కారమయ్యేవరకూ అక్కడే ఉన్నారు. నీలిమందు పండిస్తున్న ప్రాంతాలలోసర్వేచేయించడానికీ, కౌలురైతులతో మాట్లాడటానికి బాబూ రాజేంద్రప్రసాద్, మరికొంతమంది ప్రతిభావంతులైన న్యాయవాదులను గాందీ రంగంలోకి దింపారు. సత్యాగ్రహం జయప్రదమైంది. భూస్వాములు దిగివచ్చారు. కౌలు రైతుల పరిహారం పెంచారు.  హెచ్చించిన పన్ను తగ్గించారు. గాంధీజీ చెప్పిన నిబంధనలన్నీ అంగీకరించి బ్రిటిష్ ప్రభుత్వం చంపారన్ చట్టం తీసుకొని వచ్చింది. ఈ పోరాటం సందర్బంలో ఆచార్య కృపలానీని గాంధీ కలుసుకున్నారు. ప్రప్రథమంగా గాంధీని బాపూ (తండ్రీ) అని పిలిచింది  సంత్ రౌత్ అనే కార్యకర్త. ఆయనే మహాత్మా అని కూడా సంబోధించారు. కానీ గాంధీకి మహాత్ముడని  పిలిపించుకోవడం సమ్మతంగా ఉండేది కాదు.

తడవకు ఒక అంశంపై ఏకాగ్రత

గాంధీ ఉద్యమంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఒకే ఒక అంశాన్ని తెరపైకి తెచ్చేవారు. దానిపైనే దృష్టిని కేంద్రీకరించేవారు. ఉద్యమం అహింసాయుతంగానే జరగాలనే నిబంధన తు.చ. తప్పకుండా పాటించాలని కోరుకునేవారు. 13 ఏప్రిల్  1919లో జలియన్ వాలాబాగ్ లో నరమేథం జరిగింది. అదే సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టం తీసుకువచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 04 సెప్టెంబర్ 1920న సహాయనిరాకరణోద్యమం మొదలు పెట్టారు. గాంధీజీ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ ప్రయోగం చేసిన మొదటి సందర్భం ఇది. సత్యాగ్రహం అహింసాత్మకంగా జరగాలని ఆయన స్పష్టం చేశారు. కానీ 04 ఫిబ్రవరి 1922న యునైటెడ్ ప్రావిన్స్ (నేటి ఉత్రరప్రదేశ్) లోని గోరఖ్ పూర్ జిల్లాలో చౌరీచౌరాలో శాంతియుతంగా సహాయనిరాకరణ ఉద్యమం చేస్తున్న జనసమూహాన్ని పోలీసులు రెచ్చగొట్టారు. అకస్మాత్తుగా హింస చెలరేగింది. జనం పోలీసు స్టేషన్ ను ముట్టడించి దానికి నిప్పుపెట్టారు. ముగ్గురు పౌరులూ, 23మంది పోలీసు ఉద్యోగులూ మరణించారు.  ఇది గాంధీని కలచివేసింది. ప్రజలలో సత్యాగ్రహోద్యమం నిర్వహించే పరిపక్వత రాలేదని భావించి సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. నెహ్రూ, పటేల్ వంటి అగ్రనాయకులకు  ఈ నిర్ణయం మింగుడుపడలేదు. కానీ గాంధీకి ఎదురు చెప్పే సాహసం లేదు.

చారిత్రక ఘటన ఉప్పు సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహం మరో చారిత్రక ఘటన. 12 మార్చి 1930న సుశిక్షితులైన 78 మంది అనుచరులతో కలసి గాంధీ శబర్మతి ఆశ్రమం నుంచి దండివైపు నడవడం ప్రారంభించారు. మూడున్నర వారాల తర్వాత 05 ఏప్రిల్ న కార్యక్షేత్రానికి చేరుకున్నారు. ఉప్పు తయారు చేయరాదనీ, ప్రభుత్వం విక్రయించే ఉప్పు మాత్రమే కొనాలనీ శాసించే బ్రిటిష్ వలస ప్రభుత్వం ఉత్తర్వులను ధిక్కిరిస్తూ పడికెడు ఉప్పు తయారు చేశారు గాంధీ. ఆ తర్వాత సరోజీనీ నాయుడు బొంబాయి సమీపంలో, రాజగోపాలాచారి మద్రాసు సమీపంలో ఉప్పు తయారు చేశారు. ఇండియాకు దూరంగా ఉంటూ పరిపాలిస్తున్న బ్రిటిష్ వారికి ఇది నైతిక పరాజయం అని రవీంద్రనాథ్ టాగూర్ వ్యాఖ్యానించారు. కానీ అనంతరం ఇర్విన్ తో గాంధీ కుదుర్చుకున్న ఒప్పందం జవహర్ లాల్ నెహ్రూ వంటి గాంధీ విధేయుడికి కూడా నచ్చలేదు. అంతా శూన్యం అంటూ నెహ్రూ వ్యాఖ్యానించారు. 1963లో గాంధీ మానసపుత్రుడు మార్టిన్ లూదర్ కింగ్ (జూనియర్) బర్మింగ్ హామ్ లో చేసిన ఉద్యమం ఉప్పుసత్యాగ్రహం నుంచి ప్రేరణ పొందినదే. ఉప్పు సత్యాగ్రహం సాంకేతికమైనది. ఈ సత్యాగ్రహం వల్ల స్వాతంత్ర్య సమరంలో అడుగు ముందుకు పడిందే కానీ నష్టం జరగలేదు.

క్విట్ ఇండియా ఉద్యమం

బొంబాయి ఏఐసీసీ మహాసభలలో 08 ఆగస్టు 1942న గాంధీజీ ప్రారంభించిన ‘క్విట్ ఇండియా మూవ్ మెంట్’ స్వాతంత్ర్యోద్యమానికి పరాకాష్ఠ. రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ మద్దతు సమీకరించడానికి వచ్చిన క్రిప్స్ మిషన్ విఫలం చెందిన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం మొదలయింది. భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించాలంటూ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఇచ్చిన సలహాను పట్టించుకోకుండా బ్రిటిష్ ప్రధాని చర్చిల్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేశాడు. ముస్లింలీగ్, హిందూ మహాసభ, వ్యాపారవర్గాలు బ్రిటిష్ ప్రభుత్వానికి అండగా నిలిచాయి. అప్పటికే జర్మనీ,జపాన్ చేరుకున్నసుభాష్ చంద్రబోస్ నాయకత్వం పట్ల దేశంలోని యువతకు గురి కుదురుతోంది. గాంధీ మార్గం విఫలమైతే సుభాష్ చంద్రబోసు మార్గమే శరణ్యమయ్యేది. కానీ గాంధీ విఫలం కాలేదు. క్విట్ ఇండియా ఉద్యమం ఫలితంగా ఇండియాను పరిపాలించడం అసాధ్యమనే నిర్ణయానికి బ్రిటిష్ పాలకులు వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే బ్రిటన్ లో జరిగిన ఎన్నికలలో చర్చిల్ ఓడిపోయాడు. అట్లీ వచ్చాడు. స్వాతంత్ర్యం ఇచ్చాడు.  

చంపారన్ నుంచి బిర్లామందిరం దాకా

చంపారన్ లో 1920లో ప్రారంభించిన సత్యాగ్రహం నుంచి 15 ఆగస్టు 1947 వరకూ సాగిన స్వాతంత్ర్య సమరానికి సేనానీ, ప్రేరకుడూ, చోదకుడూ అన్నీ గాంధీయే. చంపారన్ నుంచి బిర్లామందిరంలో తుదిశ్వాస విడిచే వరకూ సాధారణ మనిషి మహాత్ముడిగా ఎట్లా మారాడో ఆయన ప్రయాణం తెలుపుతుంది.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాంధీకి వ్యతరేకంగా ప్రచారం చేసేవారి సంఖ్య పెరిగింది. గాడ్సే గాంధీని కాల్చి చంపిన వార్త విని దేశం శోకసముద్రంలో మునిగిపోయింది. మిఠాయిలు పంచుకొని సంతోషం ప్రకటించినవారూ ఉన్నారు.

ఈ అంశాలన్నీ ‘గాంధీయే మార్గం- రెండో భాగం’ లో ఉన్నవే. ఇందులోని వ్యాసాలను ఒక పద్ధతి  ప్రకారం, అర్థవంతంగా ఏరికూర్చిన మిత్రులు నాగసూరి వేణుగోపాల్ అభినందనీయులు. ఈ పుస్తకం చదివితే గాంధీ జీవితం, గాంధీ మార్గం అర్థం అవుతాయి. మహామహులు రాసిన అన్ని వ్యాసాలనూ తరచి చూస్తే ఒక సామాన్య బాలుడైన మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ అసామాన్యుడిగా ఎదిగిన క్రమం,మహాత్ముడిగా ప్రపంచ ప్రజల గుండెల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్న తీరు సాక్షాత్మరిస్తుంది.

కుటుంబరావు తీర్మానం

‘నేను గాంధీ వారసుణ్ణి’ అని చెప్పుకోవడానికి ఒక రాజకీయవాది కానీ, ఒక రాజకీయ సంస్థ కానీ దేశంలో లేదు.’ ఈ మాట అంటున్నది నేను కాదు. అన్నది ఇప్పుడు కాదు. గాంధీ నిర్యాణం తర్వాత ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు ‘ఆంధ్రమహిళ’ అనే పత్రిక 1948 ఫిబ్రవరి సంచికలో రాసిన వాక్యాలు అవి. అప్పుడు కుటుంబరావు విద్యార్థి దశలో ఉన్నారు. నెహ్రూ, జయప్రకాశ్ నారాయణ్, సరిహద్దుగాంధీ, రాజగోపాలాచారి ఇత్యాదులు బతికి ఉండగానే గాంధీ వారసులు లేరంటూ కుటుంబరావు ప్రకటించారు. ఇప్పుడు గాంధీ పేరు గల రాజకీయ నాయకులు మహాత్మాగాంధీ వారసులు కాదు. గాంధీ స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు జరిగిపోయాయి. ఆ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఎప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. గాంధీ స్ఫూర్తి దేశప్రజలకు ఈ రోజు అత్యవసరం. ఇందుకు గాంధీ మార్గమే శరణ్యం.  

Related Articles

3 COMMENTS

  1. గాంధీజీ గొప్పతనం గురించి ఎడిటర్ రామచంద్రమూర్తి గారు అందించిన పరిచయ వాక్యాలు అద్భుతం. మంచి విశ్లేషణ. సూక్ష్మంలో మోక్షం వలె ఎంతో గొప్పగా వుంది. ఎంత సరళతరమో అంత చిక్కదనం. ప్రతి ఒక్కరూ తప్పక చదువ వలసిన రచన.
    – దోర్బల బాలశేఖరశర్మ

    • గాంధి గురించి స్వతంత్రం తెచ్చిన రాజకీయ నాయకుడిగా మాత్రమే తెలిసిన చాలామందికి గాంధి గురించే కాక భారత స్వతంత్ర పోరాటం గురించి తెలియజేసే ఈ వ్యాసం ప్రతి భారతీయుడు చదవదగింది. సరళమైన భాషలో ఆసక్తి కలిగించే విధంగా విషయాలను అందించిన మూర్తి గారు అభినందనీయులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles