Tuesday, April 16, 2024

గోవింద గోదా గీతం తిరుప్పావై -3

  • దేశ సమృద్ధికోసం గోదా భగవన్నామవ్రతం

శరీరమనే క్షేత్రంలో జీవుడనే విత్తనాన్ని పరమాత్ముడు నాటుతాడు. ఆత్మసస్యం ఫలించాలంటే ఈతి బాధలు ఉండరాదు. నెలమూడు వానలు కురియాలి.

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

ఓంగి =సమున్నతంగా పెరిగి, ఉలగు = మూడులోకాలను, అళంద = కొలిచిన, ఉత్తమన్ =పురుషోత్తముడైన పరంధాముని, పేర్ = తిరునామాలను, నాంగళ్ =మేము, పాడి= స్తుతిస్తూ, నం పావైక్కు చ్చాత్తి = వ్రతం నెపంమీద, నీర్ ఆడినాల్ =స్నానం చేస్తే, తీంగిన్ఱి = ఈతిబాధలేవీ లేకుండా, నాడేల్లాం = దేశమంతటా, తింగళ్ =నెలకు, ముమ్మారి పెయ్దు=మూడు వానలు కురుస్తాయి, ఓంగు పెఱుం జెన్నెలూడు =బాగాపెరిగి ఎరుపు రంగులో ఉన్నధాన్యపు గింజలు వేలాడే వరిపొలాల మధ్యలో, కయల్ ఉగళ= చేపలు తుళ్లిపడుతూ ఉంటే, పూంగువళై ప్పోదిల్ = సుందరమైన కలువ పూవులలో, పోఱివండు = అందమైన తుమ్మెదలు, కణ్-పడుప్ప= నిద్రిస్తూ ఉంటే, తేంగాదే = సంకోచం లేకుండా, పుక్కు = పాలుపిండడానికి, ప్రవేశించి, ఇరుందు= స్థిరంగా ఉండి, శీర్ త్త ములై = నిండిన పొదుగులను, పత్తి(ట్రి) =పట్టుకుని, వాంగ= పిండగా, క్కుడం నిఱైక్కుం= కుండలునిండిపోతున్నాయి, వళ్ళల్ = ఉదారంగా, పెరుం పశుక్కళ్= పెద్దగా పెరిగిన పశువులను, నీంగాద శెల్వం =ఈ విధమైన అక్షయమైన సంపద నిఱైందు = నిండి ఉంటుంది.

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి అనువాదం సిరినోము

పెరిగి ముల్లోకాల విరివి కొలిచినట్టి

            ఘను నున్నతుని త్రివిక్రముని పాడి

వ్రత మూని నీరాడ వెత లెల్ల తొలగును

            నెల నెల మూడు వానలు కురియును

నిలువెత్తు పెరుగు పైరుల మీనము లెగురు

            తెలి కల్వ విరుల నిద్రించు నళులు

పశువుల కొట్టాల పరమ దయామతుల్

            మొదవులు చేపిన పొదుగు పట్టి

పిదికి నంతన కుంభ వృష్టిగ పాలిచ్చు

            లేమికే మన వీట లేమి కలుగు

సర్వసంపదలతో జగతి విరాజిల్లు

            తరుణులారా 1 ఈ వ్రతమ్ము సేయ1

ఆయన త్రివిక్రముడు. మూడులోకాలను రెండడుగుల్లో కొలిచిన వాడు. స్నానంచేసి వ్రతం పేరుతో ఆ వామనుడిని స్తుతించితే ఈతిబాధలు ఉండవు. నెలకు మూడు వానలుకురుస్తాయి. వరిపంటలు బాగా పెరిగి ఎర్రని గింజలు చూడవచ్చు. ఆ వరిచేలల్లో నిండిన జలాల్లో చేపలు తుళ్లిపడుతాయి. కలువపూల మకరందాలను గ్రోలుతూ అందమైన తుమ్మెదలు మైమరచి నిద్రిస్తాయి. పశుసంపద కూడా తక్కువేమీ కాదు. బాగా బలిసిన పశువులు గోపాలకులు పాలు పితకడానికి సంశయించకుండా దగ్గరికివచ్చి పొదుగులు పట్టుకోగానేపాలు కురిసి కుండలు నిండిపోతున్నాయి. అక్షయమైన సంపద వెల్లివిరుస్తుంది.

Also Read : నారాయణచరణాలే శరణు

పొట్టివాని రూపం ఎవరైనా ధరించడానికి ఇష్టపడతారా? యాచకుడిగా జన్మిస్తాడా? ఏ వికారాలు లేని వాడు, అప్రాకృత శరీరి అయిన స్వామి భక్తులను ఆదుకోవడానికి, బలి అన్యాయంగా ఆక్రమించిన దేవతల రాజ్యాన్ని ఇప్పించడానికి వామనుడై వచ్చాడు. మూడడుగుల నేల ఇస్తానంటే పొంగిపోయి పెరిగిపోయినాడు. రెండుడుగులతోనే లోకాలు కొలిచినాడు. పురుషోత్తముడు. భక్తులకోసం వామనుడైన పరంధాముడెంత ఉత్తముడని గోపికలు పరవశిస్తున్నారు. లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు ఉన్నారు. ఇతరులను సొంతలాభం కోసం హింసించే వారు అధములు, ఇతరులతో పాటుమనమూ బాగుండాలనుకునే వాడు మధ్యముడు. తన ప్రాణాలను లెక్కించకుండా పరోపకారం చేసేవాడు ఉత్తముడు. దీనమైన హీనమైన రూపునైనా సరే ధరించి భక్తులను కాపాడే హరి ఉత్తముడు, పురుషోత్తముడు.

రాముడి ప్రతిన

ప్రాణాలనూ, నిన్నూ, లక్ష్మణుడినైనా వదులుకుంటాను గాని, (మునులను రాక్షసపీడనుంచి విముక్తం చేస్తానని) చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చకుండా వదలను అని శ్రీ రాముడు సీతతో అంటాడు. ఉత్తమలక్షణం అది.

భగవంతునికన్న అతని నామం మిన్న

క్షత్రియవంశంలో జన్మించినా గొల్లవాడిగా పెరగడానికి జంకని వాడు శ్రీకృష్ణుడు. జాతిని వదులుకున్నాడు. శ్రీ కృష్ణుడెంత ఉత్తముడు. ఆ పురుషోత్తముని నామాలను కీర్తిస్తూ వ్రతం మొదలు పెట్టారు. గోవింద నామం జపిస్తే ద్రౌపదికి వస్త్రధార లభించింది. రామనామంతో హనుమ సులభంగా సముద్రాన్ని దాటాడు. అదే రాముడు వంతెన నిర్మిస్తే తప్ప దాటలేకపోయాడు. ఉత్తముని నామాలను కీర్తించామన్నారే గాని ఉత్తముని కీర్తించామనలేదు. నామాలకు ఆ నామపు భగవానునికన్న మహిమాతిశయం ఉంటుంది. భగవన్నామాన్ని కీర్తించడానికి ఏ యోగ్యతలూ లేవు. గంగాస్నానం చేయడానికి ముందు చిన్న చెరువులో స్నానం చేయాలంటారా ఎవరైనా? తిరునామ కీర్తన చేత అన్ని యోగ్యతలూ లభిస్తున్నాయి. భగవత్తత్వము బంగారుముద్ద అయితే, భగవన్నామము ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న స్వర్ణాభరణము.

వ్రతం పేర మార్గశీర్షమాసంలో ఉదయాన స్నానం చేస్తే చాలు దేశం సుభిక్షంగా ఉంటుందంటున్నారు గోపికలు. శ్రీ కృష్ణుడే వారికి ఫలము. మరే ఫలమూ ఆశించడం లేదు. శ్రీకృష్ణ విరహతాపాన్ని తరించడానికి స్నానం చేస్తారు. స్వామి నామాలు చెప్పడానికి ఇదివరకున్న ఆంక్షలు లేవు. పురుషోత్తముని నామకీర్తన చేస్తే, ఇక ఈతి బాధలుండవు. వ్యాధులు దుర్భిక్షాలు రావు. అమంగళాలు తొలగిపోతాయి. పరమాత్మ అనుగ్రహిస్తాడు. అప్పుడు అపరిమితమైన ఫలితాలు ఫలాలు లభిస్తాయి. ముల్లోకాలను నిండా ఆక్రమించిన త్రివిక్రముడివలె వరిపైరు పొలమంతా విస్తరించితే చోటులోక చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి.

మారీచుడికి ప్రతి వృక్షంలో రాముడే కనిపిస్తాడట

ఆళవందార్ భట్టర్ వంటి పరమభక్తులకు పద్మాలను చూస్తే భగవానుని చరణాలు గుర్తుకొస్తాయట. కనుక ఆ పద్మాలకు ప్రణమిల్లుతూ ఉంటాడు. మరో కోణంలో మారీచుడికి ప్రతి వృక్షంలో రాముడే కనిపిస్తాడట. పొలాల్లో నీరు సమృద్ధిగా ఉంటే కలువలు నిండా పూస్తాయి. కలువల్లో తుమ్మెదలు చేరుతాయి. మకరందం తాగుతాయి, మత్తుతో తూగుతాయి. పుష్పమే శయ్య. రాకుమారులు తూగుటుయ్యాలలో ఊగినట్టు తుమ్మెదలు కలువల ఉయ్యాలలో ఊగుతున్నాయి. నిద్రిస్తున్నాయి. పాడిపంటలే సంపద. క్షేత్రం, గ్రామం సమృద్ధిచెందుతాయి. పశువులు ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్నాయి. పొదుగులునిండుగా ఉన్నాయి. సమృద్ధిగా పాలొస్తాయి. సమర్థులకు మాత్రమే ఆ పొదుగులు పిండడం సాధ్యం. భయపడరాదు. పాలు వస్తూనే ఉంటాయి కనుక చాలాసేపవుతుంది. నిండైన పొదుగులుకనుక రెండు చేతులతో పట్టుకోవాలి. గోకులంలో పశువులు బలంగా ఉన్నాయి కనుక గోపాలకులు కూడా బలంగా ఉండాల్సిందే. ఒక్కసారి పిండకపోయినా పాలు ఉప్పొంగుతాయి.అడగకుండానే పాలు కురుస్తాయి, కడవలు నిండుతాయి. అడగని వారిదే లోపం. శ్రీకృష్ణుని హస్తం తాకి ఆతని వేణుగానామృతం చెవులతో తాగి పెరిగిన పశువులు అవి. ఆ కృష్ణుని ఔదార్యం ఆవులకూ వచ్చింది. చిన్న పిల్లలనుకూడా దరిచేర్చుకుంటాయి. ఆదరిస్తాయి. తరగని సంపద, పాలూ పెరుగూ, పొలమూ పంటా, అంతులేనివి. సర్వేశ్వరుని అనుగ్రహంతో లభించిన ఆ సంపద అక్షీణమైనది.

govinda goda geetham tiruppavai 3

అర్థిస్తే కాదనడు నారాయణుడు. రాముడైనా, వామనుడైనా, కృష్ణుడైనా ఔదార్యంతో రక్షిస్తాడనే నిర్భరహృదయంతో గోపాల గోపికలు నిశ్చింతగా ఉన్నారు.

దిగివచ్చిన వామనమూర్తి

మొదటి పాశురంలో భగవంతుడి పరత్వం, రెండో పాశురంలో వ్యూహం, మూడో పాశురంలో విభవాన్ని గోదమ్మ ప్రస్తావించింది. మొదటి పాశురం లో నారాయణతత్వం అనే స్థానం, రెండో పాశురంలో రెండో స్థానం పాల కడలి, ఇక్కడ భగవంతుడి మూడో స్థానం అయిన విభవం (అవతారాలు) గురించి సవిస్తరంగా వివరించింది. దిగివచ్చిన వామన మూర్తిని కొలిచింది.  అందమైన సుసంపన్నమైన పల్లె వైభవాన్ని మనకోసం చిత్రించిందీ పాశురంలో.

Also Read : హరిగుణ గానమే స్నానమట

“ఓంగి” పెరిగెను, “ఉలగళంద” కొలిచెను, “ఉత్తమన్ పేర్ పాడి” పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, ఆయన నామానికి ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్ధకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం అంటూ సౌందర్యం, సౌశీల్యం, సౌలభ్యం అనే గుణాలు కల్గిన వామన మూర్తిని గోదమ్మఊహించిందని జీయర్ స్వామి వివరించారు. ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా బలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరిగాడు! ఆయన పెరగలేదు. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసేవి, మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇవి మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమతో మన భక్తి కోసం చేస్తాడు. మూడో కాలు బలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలాన్ని ఆ బలికి ఇచ్చివేసినాడు.

ఉత్తముడు గురువే

ఈతి బాధలు లేని, ప్రకృతి సహజవైభవంతో అలరారి, నెలకు మూడు వానలు కురిసి, ఏర్లు పొంగి, వరిపొలాలు నిండి, వరిపండి, చేపలు ఎగిరి, పశువులు బలిసి, పాలు కురిసే సంపద అక్షయమైందనీ, అటువంటి సంపద లభిస్తుందని వ్రతఫలాన్ని గోదమ్మ వివరించింది.

ఉత్తముడు గురువే. మూడడుగుల నేల ఇవ్వడానికి సిధ్దం కాగానే వామనుడు త్రివిక్రముడైనట్టు, మూడు రహస్యములు తెలుసుకోవడానికి శిష్యుడు అంగీకరించగానే గురువు విజృంభించి సందేహాలను నివృత్తి చేయడానికి యథార్థ రూపాన్ని చూపుతాడట. జీవుడనే విత్తనమును శరీరమనే క్షేత్రమున పరమాత్మ నాటుతాడు. ఆత్మసస్యము ఫలించుటకు ఈతి బాధలు ఉండకూడదు.

Also Read : శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి

ఈతి బాధలు ఆరు: అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, దుష్టులైన రాజులు. ఆత్మవిషయంలో కూడా ఈతిబాధలు ఆరు. 1. దేహాత్మబుధ్ధి, 2. నేను స్వతంత్రుడనే బుద్ధి, 3. పరమాత్మ కాక ఇతరులకు చెందినవాడననే బుద్ధి, 4. తన్నుతానే రక్షించుకోగలననే బుద్ధి, 5. శరీరబంధువులే బంధువులనే బుద్ధి, 6. శబ్దాది విషయములను అనుభవించాలనే బుద్ధి. నెలమూడు వానలంటే 1. పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాడను గాను అనే బుధ్ధి, 2. పరమాత్మయే తప్ప ఇతరము ఉపాయమే కాదనే బుద్ధి. 3. పరమాత్మానుభవము తప్పఇతరమగునది నాకు రుచింపదనే బుద్ధి.

శరీరమే క్షేత్రము, దాని అడుగున జలమే పరమాత్మ, చేపలంటే భగవద్ధ్యానముతో మాత్రమే జీవించగలిగే భక్తులు. ఈ నీటిలో కలువపూలంటే జీవుల హృదయాలు, అందులో తుమ్మదలంటే లక్ష్మీనారాయణులు, జీవుల పరిపాలన విషయంలోనే వారికి కలహాలు అని కందాడై రామానుజాచార్యులు చాలా అందంగా ఈ పాశురాన్ని వివరించారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles