Thursday, March 28, 2024

గోదాగోవిందుల ప్రణవ ప్రణయ ప్రబంధం-తిరుప్పావై

  • 30 తిరుప్పావై
  • గోదా గోవింద గీతం

నేపథ్యం

పూమాలతో రంగనాధుని తాను వరించి, పామాల (పాశురాల మాల)తో మనకు భగవంతుని చేరే మార్గాలు ప్రబోధించారు గోద. చివరి రోజు 30 వ పాశురంలో గోదమ్మ సన్మార్గంలోని మళ్లడం అనే సంక్రాంతి గురించి వివరిస్తున్నారు. గోద ఒక గోపిక. ఆమె ఆరాధించిన కృష్ణుడు శ్రీరంగనాథుడు. దానికి మార్గం శ్రీవిల్లిపుత్తూరు లో వటపత్రశాయి. తన ఊరే వ్రేపల్లె. రంగనాథుడి పాదారవిందాలను చేరడమే వ్రత లక్ష్యం. వ్రతఫలం ఏమంటే రంగనాథుడే స్వయంగా పల్లకీ పంపి గోదమ్మను పిలిపించుకుని, విగ్రహరూపంలోనే వివాహమాడి భోగరంగడుగా మారిపోవడం. విగ్రహం లోహపు బొమ్మకాదు సాక్షాత్తూ పరమాత్ముడే అని నిరూపించిన కథ, వ్రతం, తపస్సు, ప్రమాణం తిరుప్పావై. వ్రతపునీత అయిన గోదామాత పరమాత్మతో చేరి భోగించి, రంగనికి భోగముగా మారిని ఈ రోజు భోగి. రేపడినుంచి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. దక్షిణాయనాన్ని నెలరోజుల రంగనాథార్చనతో తాను ముగించడమే గాక ఇన్ని వందల సంవత్సరాల తరువాత మనందరిచేత సత్కార్యం చేయించి సన్మార్గంలోకి సంక్రమణ చేయిస్తూ సంక్రాంతిని నిజమైన పండుగగా ప్రతిఏడూ మారుస్తున్నమాతాదేవి ఆండాళమ్మ. చంద్రాయణ గుట్టలో చెన్నకేశవస్వామికి గోదాదేవి వలె నిత్యపూజలు చేసిన మా పెద్దమ్మగారి పేరు ఆండాళమ్మ. మాకు ఆమే గోదాదేవి. చిన్నప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చి రెండునెలలు పడకమీదే ఉండవలసి వస్తే రోజూ రామాయణం ఉపదేశించిన అమ్మవారు మా పెద్దమ్మ. టీవీలు సీరియళ్లూ లేని రోజుల్లో చదివే శక్తి వయసూ లేని కాలంలో ఆమె నాకు గురువై మార్గంచూపినారు.  ప్రతిఇంటా శ్రీకృష్ణుడు ఉంటాడు, గోదమ్మ ఉంటుంది. వ్రతాలూ ఉంటాయి, పండుగలూ వస్తాయి, మనం గుర్తించడమే ఆలస్యం. అంతే. తిరుప్పావై అక్షరాల్లో నశ్వరమైన జ్ఞానాన్ని కూర్చి మనకు అందించారు. ఎందరో వివరిస్తున్నారు. మనల్ని సన్మార్గాల్లో నడిపే వ్యక్తి వికాస కావ్యం తిరుప్పావై. తెల్లవారుఝామున లేవడం దగ్గరనుంచి భగవంతుడిని చేరే లక్షణాలు ఏ విధంగా సమకూర్చుకోవాలో చెప్పే పాఠాలు ఈ పాటలు. సంక్రాంతి లక్షణాలన్నీ ఈ తిరుప్పావైతో స్థిరీకరించినారు. గోపికల కాలం నాటి గొబ్బిళ్లు, రంగనాథుడితో కూడిన భోగి, భాగవత లీలల అధ్యయనం,అవగాహన, మననం, గానం ప్రసంగ ప్రవచనాలతో తిరుప్పావై సాగిపోతూ ఉంటుంది. భగవంతుడిని సాధించే గోపీ ప్రవృత్తిని బోధించే అందమైన పండుగ సంక్రాంతి తో ముగిసే తిరుప్పావై పండుగ. వ్యాసుని భాగవతం ప్రకారం ద్వాపరయుగంలో గోపికలు కాత్యాయనీ వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడినే సాధించారు. కలియుగంలో గోదాదేవి, మనమంతా విగ్రహం అనుకుంటున్న మూలమూర్తిలో పరమాత్ముడిని సంభావించి సంబోధించి, సాధించిన గాధ ఈ అద్భుతమైన ప్రణయ ప్రణవ గీతం.

Also Read : ఏడు జన్మలెత్తినా సరే నీ సేవచేసే భాగ్యం ఇవ్వవయ్యా క్రిష్ణయ్యా

నిన్నటి దాకా ఎన్నో మాట్లాడుకున్నారు గోదా గోవిందులు. గోదా గోపికా గోవిందులు. ద్వాపరయుగంలో గోపికా వల్లభుడైన గోవిందుడు కలియుగంలో గోదా వల్లభుడైన గోవిందుడవుతాడు. గోవిందుడు ఈ భక్తుల ఆంతర్యం తెలుసుకునేందుకు వేసిన మరో ప్రశ్న  ‘‘మీరు కోరినట్టు అంతరంగ కైంకర్యాన్ని నేను స్వీకరిస్తాను. మీరు పొందిన ఈ మహాభాగ్యం ఇతరులు కూడా పొందాలని మీకు ఉందా దానికి మార్గం ఏమిటి’’. అని శ్రీ కృష్ణుడు అంటే ‘‘మేం పాడి మిమ్ము సాధించిన ఈ గోదాగీతాన్ని పాడుతూ సిరినోము చేసిన వారికి శ్రీమన్నారాయణానుగ్రహం కలిగి రేపల్లెలో గోపికల వలె, శ్రీవిల్లిపుత్తూరులో మా వలె ఆనంద సాగరంలో ఓలలాడుతారు కదా’’ అని గోపికలు అంటారు. ఎంత అద్భుత భావన, సార్వజనీనత. తరతరాల ప్రాణుల పట్ల ఎంత దయ? దూడను కోల్పోయిన ఆవు, గడ్డితో చేసిన దూడ బొమ్మను చూసినా కూడా ఆ వాత్సల్యంతో సేపులు వస్తాయి. ఆ గోమాత ఆవిధంగా ఉప్పొంగి పాలధారలను స్రవించినట్టు ఈ గోదావ్రతామృతం తరువాత పరమాత్ముడు బదులుగా తన అనుగ్రహామృతాన్ని కురిపిస్తాడు.

ఆ అనుగ్రహమే ఈ గోదా పాశురాలు, ఆ అనుగ్రహం కోసమే గోదా గోవింద గీతం. దానికి అర్థాలు వివరించడానికి నెలరోజులు ప్రతి ప్రబోధకుడు చెప్పే ప్రవచనాలు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యకర్తలు, విన్నవారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసిన వారు ఉండడం కూడా  ఈ లోకపు తండ్రి అనుగ్రహమే వారందరికీ తండ్రి అనుగ్రహమే, అదంతా అమ్మ అనురాగమే.

goda govinda geetham tiruppavai 30

వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైంజి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిర్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువరుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్

Also Read : గోదమ్మ పాటకు అన్నమయ్య పదం.. పరమపురుషుడట పశుల గాచెనట

ఓడలున్న పాలకడలి (వంగమ్ కడల్) దేవతలకోసం చిలికిన (కడైంద) లక్ష్మీపతిని (మాదవనై) శ్రీకృష్ణుని (కేశవనై) చందమామవంటి అందమైన ముఖాన్ని (తింగళ్ తిరుముగత్తు) సుందరాభరణాలు ధరించిన గోపికలు (చేయిజైయార్) చేరి (శెన్ఱు) నమస్కరించి (ఇఱైంజి), ఆ రేపల్లెలో (అంగు), ప్రసిద్ధమైన (అప్పరైకొండ వాట్రై) పురుషార్థాన్ని పొందిన వృత్తాంతాన్ని (తమ) అందమైన శ్రీ విల్లి పుత్తూరులో (అణి పుదువై) బంగారు కాంతులీనుతున్న తామర పూవులతో చేసిన అందమైన మాలలు గలిగిన పెరియాళ్వారుల కుమార్తె గోదాదేవి (ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై) చెప్పిన (శొన్న) ఆపాత మధురమైన ముఫ్పై తమిళ గీతాల మాల (శంగ త్తమిర్ మాలై ముప్పదుం) తప్పనిసరిగా (తప్పామే) ఈ భూమిలో (ఇంగు) ఈ విధంగా (ఇప్పరిశు) అనుసంధానం చేసే వారు (ఉరైప్పార్) కొండంత భుజాలు నాలుగు కలిగిన వాడు (ఈరిరండు మాల్ వరైత్తోళ్) ఎరుపైన అందమైన ముఖం కలిగిన వాడును (శెంగణ్ తిరుముగత్తు) ఐశ్వర్య (చెల్వమ్) శ్రీమంతుడైన శ్రీమన్నారాయణుని చే (త్తిరుమాలాల్) అన్ని చోట్ల (ఎంగుం) అతని కరుణా కటాక్షాలను పొంది (తిరువగుళ్ పెట్రు) ఆనంద మగ్నులవుతారు (ఇన్భుఱువర్)

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారి తెలుగు సిరినోము చివరి పద్యం

ఓడలు తిరుగు క్షీరోదధి త్రచ్చిన

          మాధవు కేశవు మధు నిహంత

నలనాడు చంద్రానన లనర్ఘ భూషలు

          గోపికల్ కూర్మిమై కొలిచి, పిలిచి

ఆ ‘డక్కి’ వాద్యమ్ము నందిన విధమును

          విల్లిపుత్తూరులో వెలసి మెడను

తామర పూసల దండ దాల్చిన గోద

          పాడెను ముప్పది పాశురముల

ఈ బృంద గీతాల నెవ్వరనుసంధింత్రు

          కొండలు వోని నాల్గు భుజములను

చెంగలును కలుగు ఆ శ్రీపతి కరుణకు

          పాత్రులై సుఖియింత్రు వారు నిజము.

goda govinda geetham tiruppavai 30

“వంగ క్కడల్ – అలలతో కూడిన ఆ పాల సముద్రాన్ని, కడైంద చిలికినప్పుడు “మాదవనై” ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు, ఆయనే “క్కేశవనై కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు. దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ పామును తాడుగా కట్టి దేవతలు అసురులు కలిసి పరస్పర మైత్రితో చిలికారు. ఆనాడు భగవానుడు వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి మరో రూపం, ఇటు దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేవిధంగా మరో రెండు రూపాలుకూడా పరమాత్ముడు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి సాయంచేస్తాడనే దానికి ఇది నిదర్శనం. మంచి పనులను మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి సత్ ఫలితం తప్పక ఇస్తాడు. కూడారై అంటే కలిసి పనిచేయడం. క్షీరసాగర మథనానికి అంతగా శ్రమించినందుకు అమృతానికే అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ “మాదవనై” అనే పద ప్రయోగం ద్వారా మనకు నారాయణ రహస్యం వివరించినారా ఏమిటి? ఆయనకు అమృత వర్షిణి అయిన అమ్మ దొరికింది.  చిలికే సమయంలో పుట్టిన శ్రీదేవి అందరూచూస్తుండగా శ్రీమహావిష్ణువును వరించి వక్షస్థలాన్ని చేరుకున్నది. అప్పుడాయన మాధవుడైనాడు. మా అంటేలక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త అయిన నారాయణుడు.  మధనంలో ఉపయోగపడే వస్తువులు ఎన్నో బయటకు వచ్చాయి. అసలు సాగరమధనమే అమ్మను తన దరికి చేర్చుకోవడమని గోదాదేవి వివరిస్తున్నారు. అదే మాదవనై మాటలో రహస్యం. క+అ+ఈశ+వ = అనే నాలుగు అక్షరాల సమ్మేళనమే కేశవ నామము, “క” అంటే “బ్రహ్మ”  “అ” అంటే “విష్ణువు” “ఈశ” అంటే “శివుడు” ఈ ముగ్గురి “వ” అంటే స్వరూపం కలవాడు ౼ కేశవుడు. సౌలభ్య సౌశీల్య వాత్సల్య స్వామిత్వ గుణాలు నిండిన వాడు అని నారాయణుడు అని శబ్దార్థం.

Also Read : పరమాత్ముడితో పరమాన్నమే పరమానందం

“శేయిరైయార్” భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల “శెన్ఱిఱైంజ్ఞి” ఆ గోపికలు “అంగప్పఱై కొండవాత్తై” చంద్రుడివలె ప్రకాశించే “తింగళ్ తిరుముగత్తు” ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు. “అణి పుదువై” భూమికి అలంకారమైన శ్రీవిల్లిపుత్తూర్ లో “ప్పైంగమల త్తణ్ తెరియల్” చల్లటి తులసి మాలను ధరించి ఉన్న “పట్టర్బిరాన్” విష్ణుచిత్తుల వారి కూతురైన “కోదై” గోదాదేవి”శొన్న” చెప్పిన “శంగ త్తమిళ్ మాలై” తీపైన ఈ పాటల మాలను, “ముప్పదుం తప్పామే” ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి. ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేదా చివరి రెండు (29, 30వ) పాశురాలనయినా తప్పని సరి గా అనుసంధానం చేయాలి.  వైకుంఠానికి 30 మెట్లు ఇవి. వాటిల్లో ఒక్క మెట్టు తప్పినా పైకి వెళ్లలేరు కదా. అందుకే ముప్పదుం తప్పామే అన్నారామె.

తిరుప్పావై పామాల, అంటే పాశురాల మాలిక, మాలికలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం తొలగి పోతుంది. “శెంగణ్ తిరుముగత్తు” వాత్సల్యమైన ఆ ముఖంతో “చ్చెల్వ త్తిరుమాలాల్” ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు,”ఇంగిప్పరిశురైప్పర్” ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి.”ఈరిరండు మాల్ వరైత్తోళ్” రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. “ఎంగుం తిరువగుళ్ పెత్త్” అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది “ఇన్బుఱువర్” ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు అని గోదాదేవి పాశుర అంతరార్థాన్ని జీయర్ స్వామి మనకు సులువుగా తెలిసేట్టు వివరించారు.

చివరి పాశురంలో గోదమ్మ క్షీరసాగర మథనాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఈ మథనం తరువాతనే పిరాట్టి మాధవుడికి లభించింది. తనకు ఈ వేద శాస్త్ర మథనం వంటి తిరుప్పావైతో రంగడు దొరకాలి. మరొక అర్థం, సంసార సాగరాన్ని దాటించే పడవ విష్ణువే అని చెప్పడం. నారాయణుడికి మనం సులువుగా ఆశ్రయించే సౌలభ్యం, మనను రక్షించే పరత్వం, మనం ఒకసారి దగ్గరికి వెళితే మళ్లీ తిరిగిరాలేనంత సౌందర్యం ఉన్నాయట.

Also Read : జ్ఞానమనే ఆరని దీపం అమ్మనే వ్రతఫలంగా ఇచ్చిన శ్రీకృష్ణుడు

దూడ చనిపోతే ఆవు ముందు దూడ బొమ్మను పెడతారట. ఆ గోమాత అది తన కూతురని భావించి సేపులు తెచ్చుకుని పాలు వర్షిస్తుందట. ఆ విధంగా మొత్తం తిరుప్పావు కాకపోయినా దాని ఛాయ అయిన 30 వ పాశురాన్ని అనుసంధిస్తే, కొన్ని పాశురాలలో చెప్పిన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వ్రతఫలం లభిస్తుందని  పెద్దలు చెప్పారు.

పాలసముద్రం చిలికితే ఒక చంద్రుడే ఉదయిస్తే, బృందావనంలో గోపికలు, శ్రీవిల్లిపుత్తూరులో గోదా చెలికత్తెలు అయిదు లక్షల చంద్రుల వలె భాసిస్తున్నారు. ఈ పాశురం మాదవన్ తో మొదలై తిరుమాల్ తో ముగియడం ద్వయంలోని రెండు పాదాల అర్థాన్నిసూచిస్తున్నాయని పెద్దలు వ్యాఖ్యానించారు. సఖ్య పశ్యత కృష్ణస్య ముఖమత్యరుణేక్షణం శ్రీమహాలక్ష్మి సంబంధం వల్ల గోపికలు ఆనందం వల్ల, దివ్యవిభూతి ఐశ్యర్యం వల్ల స్వామి కనులు ఎర్రబారినవని అర్థం. లక్ష్మీ, లక్ష్మీపతీ అనుగ్రహించిన పరమానందం ఈ పాశుర సారాంశం.

జనజీవనాన్ని ఆధ్యాత్మికతేజస్సుతో పరంధాముడి కాంతివైపు నడిపించి ఉజ్జీవింపజేసే తిరుప్పావై ఒక దివ్య ప్రబంధం. ప్రేమభక్తి కావ్యం. ఈ అత్యద్భుత ప్రబంధ  విశేష ఫలాలను ప్రాధాన్యాలను వివరాలను ప్రస్తావిస్తూ ఫలశృతిని వినిపిస్తూ శుభం పలికేది ఈ చివరిపాశురం.

విశేషార్థం

మనకు కావలసిన మోక్షమే అమృతం. అందుకు శాస్త్రమనే మహాసముద్రాన్ని మథించాలి. బుద్ధి మంధరం. అనుకూల ప్రతికూల శక్తులు దేవతలు రాక్షసులు. మంధరాన్ని తెచ్చి సముద్రంలో వేయాలని గరుడుని స్వామి ఆదేశిస్తాడు. బుద్ధిని భగవంతుడే ఇస్తాడు. బుధ్ది ఆచార్యుడి ద్వారా లభిస్తుంది. ఇక్కడ గరుడుడంటే ఆచార్యుడు.

సంసారం మహాసముద్రం. శరీరం నావ, భగవత్సంకల్పమే మంధరం, భగవంతుడి కృప తాడు. ఆయన కటాక్షమే చేతులు. లక్ష్మి (అమ్మ, పిరాట్టి) ఆత్మవస్తువు. తన సంకల్పమనే మంధరానికి కృప అనే తాడు గట్టి కటాక్షమనే చేతులతో సాగరమును మధించి, ప్రియమైన ఆత్మను పొందుతాడు దేవుడు. చేతనులు పరమాత్మకు కౌస్తుభమణి వంటివారు. వారి పాపపుణ్యాల వలన సంసారం సముద్రంలో పడిపోయారు. వారికి మార్గం లేక అలమటిస్తూ ఉంటే భగవంతుని అకారణంగా కరుణిస్తాడు, అదే నిర్హేతుక కటాక్షము పడుతుంది. సత్వగుణం పెరిగి ఆ ఆత్మ భగవంతుడిని ప్రగాఢంగా కోరుతూ ఉంటుంది. అదే సముద్ర ఘోష. ఈ ఘోషతో పరమాత్మ కృప పెరుగుతుంది. ఆయన సంకల్పాన్ని మార్చుతుంది. భక్తియోగాన్ని ప్రసాదిస్తాడు. భక్తిలో అజ్ఞానం పోవడం జ్ఞానం రావడం జరుగుతుంది (జరగాలి అదే సంక్రమణం). అమృతమధనం అది. దాంతో లభించే అమృతం భగవత్ప్రాప్తి. అదేమోక్షం. ఈవిధంగా మోక్షం ప్రసాదించమని ప్రార్థించడం తిరుప్పావు వ్రతం. అమృతం లభిస్తుందని చెప్పడమే ఫలశృతి, అదే ఈ పాశురం. వేదం సముద్రజలం వంటిది. కాని తాగడానికి పనికిరాదు. తిరుప్పావై గోదాదేవి ముఖారవిందంనుంచి వెలువడింది కనుక అది మేఘం వంటిది. సముద్రంనించి ఉప్పునీటిని త్రావి, మధురమైన జలాన్ని కురిపించే మేఘం తిరుప్పావై. ఉపనిషత్తుల సారం. అమృతం.

తిరు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి. ప్పావై అంటే వ్రతం అనే అర్థం తోపాటు ఆమె దయ అనీ కరుణ అనీ అర్థం. బ్రతుకు అర్థం తెలియక అట్టడుగున పడి కొట్టుమిట్టాడుతున్న పిల్లలమైన మనందరినీ పైకి చేదుకోవడానికి ఆండాళ్ గా ఆ మహాతల్లి అవతరించి మనను మన జగన్నాధుడు, తండ్రి, పరమాత్ముడిని చేర్చడానికి చూపిన మార్గం తిరుప్పావై.

ఓడలున్న లేదా పెద్ద అలలున్న సముద్రం, అంటే చాలా పెద్ద సముద్రం అని భావం. దాన్నే మథించినారు. అప్పుడు అమృతమయి శ్రీ లక్ష్మీని స్వీకరించి మాధవుడైనాడు. వేదోపనిషద్ శాస్త్ర సాగరాన్ని మధించి గోదాదేవి తిరుప్పావైలోంచి శ్రీరంగడు ఆమెకు లభించాడు.

గోదాదేవి పదకొండో ఆళ్వార్. శ్రీవైష్ణవ మతంలో మొత్తం పన్నెండు మంది ఆళ్వార్ పరమభక్తులు, అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకుని మంగళం పాడిన వారు ఉన్నారు. వారిలో తండ్రీ కూతుళ్లిద్దరూ ఆళ్వార్ లు ఉన్నారు. వారే విష్ణుచిత్తులు, గోదాదేవి.  ఈ పన్నెండు మంది తనను తాము స్త్రీగా సంభావించుకుని పరమాత్మను పతిగా ప్రేమించి మధురభక్తి ఉప్పొంగి పోయి ఆయనను సాధించిన పరమ భక్తులు.  భగవంతుని భక్తులను భాగవతులు అంటారు. ఆ భాగవతులలో ఉత్తముడిని భాగవతోత్తములని అంటారు. వీరు భాగవతోత్తములు. 1. పోయ్ గై ఆళ్వార్…  వీరిని సరోయోగి అంటారు. 2.పూదత్తాళ్వార్ … వీరిని భూతయోగి అంటారు.3. పేయాళ్వార్ …. వీరిని మహాయోగి అంటారు. 4.తిరుమళిశైయాళ్వార్ … భక్తిసారులని మరోపేరు.5.నమ్మాళ్వార్…వీరినే శఠగోపముని అంటారు. 6.కులశేఖరాళ్వార్ –తిరుమల స్వామిముందుకడపగా మారిన వారు, 7.పెరియాళ్వార్ లేదా విష్ణుచిత్తులు, గోదమ్మ తండ్రి, 8. తొండరడిప్పొడి యాళ్వార్ – భక్తాంఘ్రి రేణువు విప్రనారాయణుడు, 9. తిరుప్పాణి ఆళ్వార్…వీరినే యోగివాహనులు అంటారు, 10. తిరుమంగై ఆళ్వార్ ..పరకాల ముని అంటారు. 11, ఆండాళమ్మ ‌- గోదాదేవి, తిరుప్పావు పాడి ఆళ్వారుగా ఎదిగారు. 12. మధురకవి ఆళ్వార్.

ప్రణవ గీతం గోదా గోవిందుల ప్రణయ ప్రబంధం వలె కనిపించే తిరుప్పావై అంతరాంతరాలలో ప్రణవ కావ్యం అని అర్థం చేసుకోవాలి.  ‘గోవిందా నీకు’ అను మాట ప్రయోగించి జగత్తుకు కారణం, జగత్తుకు రక్షణం పరమాత్మ అని ‘అ’ కారము చెప్పినారు గోదమ్మ. నీకే అనే ఏ కారములో ‘‘ఓం’ లోని ‘ఉ’ కార అర్థం తెలుపుతున్నారు. ‘మేము’ అనడంతో జీవసముదాయానికి చిహ్నమయిన ‘మ’ కారార్థము వివరిస్తున్నది. ఇది ‘ఓం కారం’ అంటే ప్రణవం, ప్రణవార్థం. నీతో సర్వ విధ బంధుత్వం మాకు ఉంది అనడంతో నారాయణ శబ్దార్థము చెప్పారు. ఆ అనుబంధం ఏఢేడు జన్మలదాకా అని చెప్పడం (ఆయ) అనే చతుర్థీ విభక్తి అర్థమును తెలుపుతున్నది. ఈ విధంగా అష్టాక్షరీ మూల మంత్రాన్ని 29వ పాశురంలో ప్రతిపాదించి, ప్రతిష్టించి, గోదాదేవి నారాయణునితో పత్నీ బంధుత్వాన్ని స్థాపించి జగన్నాథుడే తన నాథుడని నిరూపించి, 30వ పాశురంలో మీరూ ఈ మెట్లెక్కితే నారాయణ సాన్నిధ్యమే ఫలంగా లభిస్తుందని ఫలశృతిని వివరించినది గోదమ్మ. మనమంతా ఆ మెట్లు ఎక్కుదాం. పామాల పాడుకుందాం. పరమాత్ముని చేరుకుందాం.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles