Friday, April 19, 2024

వేదగుహలలో ప్రకాశించే పరమాత్ముడే శ్రీకృష్ణ సింహము

  • 23. గోదా గోవింద గీతం

నేపథ్యం:

నిన్నటి దాకా గోపికలు తన కటాక్ష వీక్షణాలను కోరుకున్నారు. మెల్లమెల్లగా కన్నులు విచ్చి చూడమన్నారు. నీళాదేవి పురుషకారంతో వచ్చిన వీరిని ఇంతకాలం ఉపేక్షించామే అని శ్రీ కృష్ణుడు కొంత బాధపడ్డాడు. ఏం కావాలో చెప్పమన్నాడు. అప్పుడు గోపికలు శ్రీ కృష్ణుడు గంభీరంగా కదలివస్తుంటే చూడాలనే ప్రగాఢ వాంఛతో సింహాసనం వైపు కదలి రమ్మని కోరుకున్నారు.

మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్
శీరియ శిఙ్గం అణివిట్రు త్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ ఎప్పాడుమ్ పేర్ న్దుదఱి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవై ప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాసనత్తిరున్దు యామ్ వన్ద
కారియ మారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి సిరినోము తెలుగు పద్యం ఇది

వాన కారున గుహలోన సింహిని కౌగ

          లించి వెచ్చగ శయనించి యున్న

గండు సింగమ్ము మేల్కాంచి ఠీవిగ చూచి

          నెరి సువాసన జూలు నిక్క పొడువ

ఒడలు విదిలిచి నల్గడలను దృష్టి సా

          రించి గాండ్రుమని గర్జింపు వెలు

పలికి వచ్చెడి లీల స్వామి: నీ కోవెల

          వదలి ఈ కొలువు సావడికి వచ్చి

సిరులకు నెలవైన సింహానమ్ముపై

          వేంచేసి నీవారి విన్నపమ్ము

లాలింపగా వలె: అరసి తత్ కామ్యముల్

          తీర్పగా వలె – ఇంక లేచి రమ్ము:

అర్థం: వర్షాకాలంలో (మారి) కొండగుహలో (మలైముఝంగిల్) ఆడసింహాన్ని కౌగిలించుకుని పడుకొని ఉన్న (మన్నికిడందు) నిదురిస్తున్న (ఉఱంగుమ్) శౌర్యోపేతమైన సింహం (శీరియ శింగమ్) మేలుకుని లేచి (అఱివిట్రు) నిప్పులు కురుస్తూన్నకనులు తెరిచి (తీవిఝుత్తు) పరిమళించే జూలును (వేరిమయిర్) నిక్కబొడిచి (నిగిడ్చి) (పొంగ) అన్నిదిశలలో( ఎప్పాడుమ్) కదలి (పేర్ న్దు) ఒడలు విరచి (ఉదఱి) శరీరాన్ని సాగదీసి (మూరి నిమిర్ న్దు) గర్జించి (ముఝంగి) వెలుపలకు (పురప్పట్టు)వస్తున్నట్టుగా (పోదరుమాపోలే) కానుగ పూవు వంటి మేను ఛాయగలవాడా (నీ పూవైప్పూవణ్ణా) నీ నివాసభవనం నుంచి (ఉన్ కోయిల్ నిన్ఱు) ఇక్కడికి వేంచేసి (ఇంగనే పోందరుళి) మనోహరమైన (కోప్పుడైయ) శ్రేష్ఠమైన (శీరియ) సింహానంపైన ఆసీనుడవై (శింగాసనత్తిరిందు) మేము వచ్చిన (యామ్ వంద) పనిని (కారియమ్) పరిశీలించి అనుగ్రహించు (ఆరాయ్ న్దు అరుళు).

‘‘వర్షాకాలంలో కొండగుహలో తన జత యైన ఆడసింహాన్ని ఆలింగనం చేసుకుని నిద్రిస్తున్నశౌర్యసింహమా మేలుకో,  మేలుకుని నిప్పులు కురిసే కన్నులు తెరిచి, పరిమళం వెదజల్లే జూలును నిగిడ్చి ఒడలు విరిచి అన్నివైపులా ఒక్కసారి కదిల్చి గర్జించి వెలుపలికి నడచిన రీతి, అవిసె పూవువన్నెగల శ్రీకృష్ణా నీ అంతఃపురం నుంచి ఇక్కడికి వచ్చి ఈ లోకోత్తరమైన సింహాసనాన్ని అధిరోహించు, మేము వచ్చిన పని విచారించి మమ్ము అనుగ్రహించు’’ అని గోపికలు కోరుతున్నారు ఈ పాశురంలో. నీళాదేవిని ఆలింగనం చేసుకుని నిద్రించిన యదు సింహుడైన శ్రీకృష్ణసింహం మేలుకుంటున్న రీతిని వర్ణించడం ఇది. సింహం పర్వత గుహలో శయనించినట్టు నీళాదేవి ఉత్తుంగ స్తనగిరిలో శ్రీకృష్ణుడు సేద దీరుతున్నాడట.

శ్రీరామ శ్రీకృష్ణులు శౌర్యసింహాలు

శ్రీరాముడు సీతా వియోగంలో బాధపడుతూ కూడా, సుగ్రీవునికి సాయంచేసేందుకు వాలిని సంహరించి వర్షాకాలం ముగిసేదాకా ఎదురుచూస్తూ మాల్యవత్పర్వత గుహలో నివసిస్తాడు. సుగ్రీవుని కర్తవ్యోన్మఖుడు కావాలని ఆదేశించడానికి బయటకు వస్తాడు. యాదవసింహుడు, రాఘవ సింహుడు ఎవరికీ భయపడని పరాక్రమవంతులు. నిదురలో ఉన్నపుడుకూడా శత్రువులను తపింపజేసే శౌర్యసింహాలు రామకృష్ణులు. ఇక్కడ శ్రీ కృష్ణుడు యశోదా సింహ కిశోరం. ఆశ్రితుల ఆర్తనాదం వింటే వెంటనే లేచే వాడు. తాను నిద్రలేవవలసిన సమయం ముందే తెలియదు. కాని తనకు తానుగా సమయానికి మెలకువ తెచ్చుకుంటాడు. అయోధ్యా మందిరంలో రాముడు నిద్రిస్తుంటే చూసిన కౌసల్య, ఆతరువాత అడవిలో నిద్రించిన రాముని చూసిన విశ్వామిత్రుడు ఆ సౌందర్యానికి ముగ్ధుడవుతారట.

Also Read : చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకోనవేలయ్యా?

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవ మాహ్నికమ్

అని వాల్మీకి విశ్వామిత్రుడి ద్వారా సుప్రభాతం పాడతాడు. నరశార్దూలమ్ అని సంభోదిస్తాడు రాముడిని. గిరి గుహ ముఖమునుండి నిర్గమిస్తున్న సింహమువలె సుమంత్రునితో కలిసి రాముడు వచ్చినాడట. అట్లా రమ్మంటున్నారు గోదమ్మ కృష్ణుడిని. యశోద కూడ నిద్రిస్తున్న కృష్ణుణి సౌందర్యాన్ని చూసి మైమరచిపోతుంది.

సామజ వరగమనా కృష్ణా

త్యాగరాజు సామజవరగమన అని కీర్తించిన రీతిలో మదగజం నడిచినట్టు నిద్రమేల్కొంటున్న యదుసింహుడు మేల్కొని గంభీరంగా నడిస్తే చూడాలని గోపికలు కోరుకుంటున్నారు. నిద్రిస్తున్న కృష్ణుని సౌందర్యం చూసారు. కనులు తెరచి కనికరించే విశాల నేత్రుని వైభవాన్ని చూసారు. గంభీరంగా నడిచి వచ్చి ఆసీనులయ్యే సన్నివేశాన్ని చూడాలని గోపికలు ఆశిస్తున్నారు.

గుహలో ఉన్న సింహం కారణ తత్త్వము. సూక్ష్మావస్థలో ఉన్న ప్రకృతితోనూ జీవులతోనూ కలిసి ఉన్న పరమాత్మ శ్రీమన్నారాయణుడు. గుహదాటిబయటకు వచ్చిన సింహము కార్య తత్త్వము. స్థూలావస్థను పొంది ఉన్న ప్రకృతితో, జీవులతో, పరిణామాలతో కలిసి ఉన్న పరతత్త్వంకూడా శ్రీమన్నారాయణుడే.  కారణతత్త్వము కార్యతత్వమై జగద్రూపం దాల్చుతుంది. అంతర్యామిగా హృదయంలో ఉపాసించి, మూలాధారస్థానంలో శయనించి ఉన్న తత్త్వమును మేల్కొల్పి, వేం చేసినట్టు భావిస్తారని శ్రీభాష్యం  అప్పలాచార్య స్వామి వారు వివరించారు. పరతత్వము, విభవావతారము, అర్చామూర్తి, అంతర్యామి గా ఉపాసన కొనసాగుతున్నది.

కృష్ణ సింహ చైతన్య విజృంభణ

నిన్నటి దాకా తామరపూవులనుకున్న భగవానుడి కళ్ళు ఈ వేళ నిప్పులు కురిపిస్తున్నాయి. ఆశ్రితుల శత్రువులపై పరమాత్ముడు కన్నెఱ్ఱ చేయడం కూడా గోపికలకు ఇష్టమే. ఆ నరసింహుని ఉగ్ర నేత్రాలను కూడా చూడగలగాలంటే ఇంకే కోరిక లేని వారైతేనే సాధ్యమవుతుంది. మెలకువ రాగానే కళ్లు తెరిచి, ఒళ్లు విరిచి, జూలు విదిలించి, శత్రు హృదయాల్ని భేదించే మేఘం వలె గర్జించి, గుహనుంచి బయటకు వచ్చే సింహం వలె రావయ్యా యాదవసింహమా వీర నరసింహమా అంటున్నారు గోపికలు.

సహస్రనామాల్లో చతుర్గతి

శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలో చెప్పినట్టు చతురాత్మాశ్చతుర్వ్యూహ చతుర్భావ చతుర్గతి అని శ్రీ మహావిష్ణువునడకలు (గతులు) నాలుగు. మదగజపు గాంభీర్యం, వృషభపు ఔధ్ధత్యం, శార్దూలపు వేగం, సింహపు శౌర్యము తలపించే నడక ఆ ఉత్తిష్టమైన నరశార్దూలానిది. రామ కృష్ణ నారసింహులను గోదాదేవి ఈ పాశురంలో సంస్మరించారని వ్యాఖ్యాతలు వివరించారు. జనకుడు విశ్వామిత్రుని అడిగాడట.. గజసింహశార్దూల వృషభ గతులతో మీవెనక నడిచి వస్తున్నఈ కుమారులెవరు అని. రామలక్ష్మణులనుచూసి,  వృషభంలో రాజస గర్వం, గజంలో పుష్టివలన వచ్చిన గౌరవం, శార్దూలములో కోపము చేత కలిగిన దూకుడు, సింహములో శరీర దార్ఢ్యత వలన పరాభిభవము ఉన్నాయట. శ్రీరంగంలో ఈ నాలుగు గతులలో వాహన సేవలను నిర్వహించడం పరిపాటి. అక్కడి పల్లకీ వాహకులకే ఈ ప్రతిభ ఉంది.

సింహాసనానికి ప్రత్యేకత వస్తుంది.  విక్రమార్కుని సింహాసనం భూమిలో ఉండిపోయిందంటారు. భోజరాజు ఆ ప్రాంతంలో వెళ్తుండగా ఒక రైతు రాజుగారిని అత్యంత గౌరవంగా పిలుస్తాడట, అతను మంచెదిగి రాజుకు ఎదురేగిన తరువాత మరో రకంగా మాట్లాడతాడట. రాజుకు అనుమానం వచ్చి రైతును అక్కడినుంచి మాట్లాడమనడం. పదేపదే ఇదేవిధంగా జరిగితే అక్కడ తవ్వి చూడమంటాడు. అప్పుడు బయపడుతుంది విక్రమార్కుని సింహాసనం. దాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తే సాలభంజికలు అడ్డుకోవడం అదోకథ.

Also Read : ఎన్నాళ్లు ‘నేను నాది’ అంటారు, ఇకనైనా ‘మేము మనమూ’ అనండి

వేదగుహలలో పరమాత్మ ప్రకాశం

దేహానికి ఆత్మకు భేదములు తెలియకుండా ఉంచే అజ్ఞానమే మేఘము. మేఘమువల్ల చీకటి పడుతుంది. జీవుడికి దిక్కు ఎటో తెలియదు. అవివేక మేఘము దుఃఖమనే వర్షాన్ని ఎడతెగక కురిపిస్తుంది. పగలు కూడా వర్షాకాలపు చీకటి కమ్మడమే సంసారం. దిక్కుతోచని జీవికి దారి చూపమని ప్రార్థన అని యామునా చార్యులు వర్ణించారు. ప్రళయకాలమున ప్రకృతినిజీవరాశిని ప్రపంచాన్నంతా తనలో నిముడ్చుకుని పరమాత్మ శయనిస్తాడు.అపుడు ఆ పరమాత్మ వేదగుహలలో ప్రకాశిస్తాడట. ఉన్నదితానొక్కడే. తనకన్న వేరుగల వస్తువులేదు. స్థూలనామరూపకమైన ప్రపంచమై వెలికి రాకముందు వేదగుహలో పండుకుంటాడట. గుహ అంటే గ్రహించడానికి శక్యం కానిదని అర్థం. ధర్మతత్వం గుహ యందు నిక్షిప్తమై ఉన్నది. భరద్వాజునకు వేదములు పర్వతములై కనిపిస్తాయి. అన్నమయ్యకు తిరుమల ‘వేదములే శిలలై వెలసిన కొండ’వలె కనిపిస్తుంది. వర్షకాలంలో అసలు కదలికే లేనట్టు సింహం నిద్రిస్తుంది. వేదము కూడా ఉన్నదా లేదా అన్నట్టు ఉంటుంది. పరమాత్మ సృష్టికి ముందు ప్రళయ కాలంలో సర్వజగత్తును తానే భక్షిస్తాడు. హింసిస్తాడు కనుక సింహం.

శ్రీరామ సింహం

పనిలేకపోతే సింహం ఎవ్వరు పొడిచినా నిద్రలేవదు. ఇతరత్రా ఏ మృగాలకూ సింహం భయపడదు. నిద్రించే శౌర్యం కలిగినది. సింహం నిద్రిస్తున్నాసరే శౌర్యం వీడదు. అందుకంటే నిద్రిస్తున్న సింహాన్ని చూసి కూడా భయపడతారు. నిద్రిస్తున్నా సరే సింహం క్షుద్ర జంతువులు రావు. చూచిన వెంటనే అవి ధ్వంసములయ్యే వీర్యాతిశయము కలిగింది సింహము. మృగరాజు ఎవరూ పట్టాభిషేకం చేయనవసరం లేని సహజమైన రాజు. జన్మతః రాజు, నిరంకుశ సహజస్వభావము కలిగిన వాడు. రాముడికి రాజ్యపట్టాభిషేకం అయినా కాకపోయినా రాజసింహమే.

Also Read : గోవిందునితో సాన్నిహిత్యభావనే గోద కోరేది.. అద్దం చూసుకున్న ప్రతిసారీ అహంకారం వస్తుంది

సుఖ సుప్తం పరంతపః అంటే పరంతపుడైన రాముడు సుఖంగా నిద్రిస్తాడు. శత్రుభయం లేని పరాక్రమవంతుడికి నిద్ర సుఖంగా పడుతుంది. సుఖసుప్తః పరంతపః అంటే సుఖంగా నిద్రిస్తున్నా పరులను తపింపచేసే వాడు అని సీత సంభావిస్తుంది. శీరియసింగం అంటే నిద్రిస్తున్నా శౌర్యం తరగని సింహం అనీ లక్ష్మీ సహితుడనీ అర్థం. సింహం నిద్రలేవగానే పరమాత్మ ఇక నేను బహువిధముల రూపములను సంతరించుకోవలసిందేనని సంకల్పిస్తాడట. ఆ సంకల్పంలోంచి తేజస్సు, దాని నుంచి జలము, జలమునుంచి పృథ్వి ఆవిర్భవిస్తుంది. తీ అంటే తేజస్సు. వేరి అంటే గంధము. గంధము పృథ్వీకి సంకేతం. ఈ పంచభూత తత్వాలన్నీ కలిసి మహాభూతములై అండము ఏర్పడుతుంది. బ్రహ్మ ఆవిర్భవిస్తాడు. బ్రహ్మయే చేయిస్తున్నట్టుగా అంతర్యామియై సృష్టిక్రమాన్ని సాగిస్తాడు. లేచి చూచి, వడలు విరిచి, సాగదీసి, ముందునకు సాగి రావడమంతా సృష్టి కార్యసంకేతమే. శరీరము ముడుచుకుని ఉన్నపుడు సృష్టి కనిపించదు. సృష్టి తరువాత ప్రకృతి కనిపిస్తుంది. బ్రహ్మకు వేదములివ్వడమే గర్జన. నీశౌర్యప్రతాపములుగుర్తుకు వచ్చి సింహము అన్నామే గాని నీవు సింహమువై రావాలని అనలేదు. మేల్కొనే మగ సింహాన్ని చూసి ఆడసింహాలు కూడా భయపడతాయి. నీవు నీగురించి కూడా తెలుసుకోవాలి కదా స్వామీ, అందుకే పూవు వంటి రంగు కలిగిన, నీ పూవై ప్పూవణ్ణా, అతసీ పుష్ప సంకాశుడై అర్చావతారంలో భాసిస్తున్న పరమాత్మవలె దివ్యమంగళ రూపుడవై రమ్మంటున్నాం అంటారు గోపాల బాల గోపికా బాలికలు.

సింహాసనప్పాట్టు

శయ్యాగారంలో పాన్పుపై పడుకుని మాతో మాట్లాడడం కాదు. కదలివచ్చి సభామందిరంలో ఈ మహత్తర సింహాసనారూఢుడవై మాకు కనిపించు. మామాట విను దయదలచు అని వేడుకుంటున్న ఈ పాశురాన్ని సింహాసనప్పాట్టు అంటారు. బాలికలారా నన్ను సింహము వలె రమ్మంటున్నారు. రాఘవ సింహముగా రమ్మంటారా లేక నారసింహుని వలెనా? అని అడుగుతున్నాడు.

తాతప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుమ్ స్వపాదమూలే పతితం త మర్భకం

విలోక్య దేవః కృపయా పరిప్లుతః తాప్యతచ్చీర్ణ దదాత్ కరామ్బుజం

Also Read : శ్రుతి, స్మృతి, ఇతిహాస పురాణ ఆగమములే ఆ అయిదు దీపాలు

రాముడిది ప్రశాంత గంభీర గజగమన రూపం. శ్రీకృష్ణుడు దయార్ద్ర హృదయుడు.  కాని నారసింహరూపం భరించడం కష్టం. ప్రహ్లాదుడు, తండ్రి అడిగితే నారాయణుడు ఇందుగలడందులేడని సందేహము వలదు అని హరి అంతటా ఉన్నాడని, ఎక్కడైనా చూడవచ్చునని చెప్పేసాడు. అయిపోయింది. స్వామి అంతర్యామిత్వానికి మచ్చ రాదుకదా అని ప్రహ్లాదుడు భయపడుతున్నాడు. భక్తుని మాట అసత్యమనే ఆపద రాకూడదు కదా అని విష్ణువు భయపడుతున్నాడట. అందుకని నారసింహుడై హిరణ్యకశ్యపుని మంటపంలోను పరిసరాల్లోనూ ప్రతివస్తువులో వచ్చి కూచున్నాడట. ఎందులోంచి రమ్మంటాడో తెలియదు కదా? అన్ని పదార్థాల్లో అంతర్యామిత్వాన్ని నిర్ధారణ చేస్తూ తల్లితండ్రులు లేకుండా స్తంభం వంటి ఒక జడ పదార్థంద్వారా భక్తులు కోరిన వెంటనే శీఘ్రముగా అవతరించడం, అత్యంత పరాక్రమము చూపడం, ఏ అవతారములోనూ లేని మహోగ్రప్రదర్శన చేయడం, ఎవరూ ఊహించలేని అద్భుత (ఇదివరకు లేని) రూపం ధరించడం వెంటనే దుష్ఠశిక్షణ శిష్ట రక్షణ పరిపాలనా కర్తృత్వం నిర్వహించడం అఘటన ఘటన సామర్థ్యాన్ని ప్రదర్శించడం నారసింహుని అద్భుత విశేష లక్షణాలు.

దేవతలు కూడా నారసింహ రూపునుచూసి భయపడుతున్నారు. బ్రహ్మ, లక్ష్మి కూడా దరిచేరడానికి భయపడ్డారు. నీకోసమే పుట్టాడు కనుక నీవే శాంత పరచాలని పెద్దలంతా పిల్లవాడైన ప్రహ్లాదుడిని ముందుకు తోస్తారు. స్వామిముందు ధైర్యంగా సాష్ఠాంగపడిన ప్రహ్మాదుడిని చూసి శాంతించిన నారసింహుడు ఆ బాలుడిని చేతులతో ఎత్తుకుని దగ్గరకు తీసుకుని తలపై తన అభయహస్తాన్ని ఉంచుతాడట. ఈ దృశ్యాన్ని బాపు ఎంత గొప్పగా చిత్రించారో గమనించండి. భయంకరమైన సింహం నవ్వడాన్ని ఊహించిన బాపు, బాపురే కదా.

goda govinda geetham tiruppavai 23


ఆయన నిదుర లేచిన నరశార్దూలము. సభామందిరంలో ఆసీనుడైనాడు.  రామానుజసంబంధీకులైన గోపికలను నిరాదరించరాదని వారిని కరుణించాలని పరమాత్ముడు అనుకున్నాడు. కనుక వారిని లోనికి రమ్మన్నాడు. అంత:పురంలోని అంతరంగ వాక్యాలకన్న సింహాసనంమీద కూర్చున్నప్పుడు పలికే బహిరంగ వాక్యాలే సాధికారికమైనవనీ, శ్రేష్ఠమైనవని గోపికలు అనుకున్నారు. హిరణ్య కశిపుని చూసి నిప్పులుకురిపించిన నరసింహుడు ప్రహ్లాదుని పట్ల దయార్ద్ర దృక్కులను ప్రసరిస్తాడు. పూవువలె మెత్తగానూ, అగ్నికణంవలె తీవ్రంగానూ ఒకేసారి ఉండడం నరసింహునికే సాధ్యమవుతుంది. ఈ రెండు పరస్పరవిరుధ్ధ భావాలను దర్శించారు గోదాదేవి. అందుకే సూర్య చంద్రుల వంటి కన్నులు మెల్లమెల్లగా తెరువ మని అడుగుతున్నారు గోదా గోపికలు.

Also Read : ఆమె జీవుడికి దేవుడికి మధ్యవర్తి, వాత్సల్య గుణోజ్వల – అలువేలు మంగమ్మ

అనోరణీయాన్ మహతో మహీయాన్ …అణువులో పరమాణువుగానూ, చాలా పెద్దవాటిలోఅత్యంత భారీస్థాయిలోనూ ఉండగలవాడు అని పరమాత్ముని కీర్తిస్తారు. ఆత్మాగుహాయాన్నిహితోస్యజంతో… ఆత్మ అనే గుహలో నిహితుడై ఉన్న పరమాత్ముని అర్చామూర్తిలోకి ఆవాహన చేసి ఆరాధించాలని ఆగమశాస్త్రాలు వివరిస్తాయి.

విలక్షణమైన ఆత్మ, విశిష్ఠమైన పరబ్రహ్మ మధ్య సంబంధ అనుభవాలను ఈ పాశురంలో కనిపింపజేస్తారు గోదాదేవి. సర్వశ్రేష్ఠుడైన నరసింహము వంటి పరబ్రహ్మము ఆదిశేషావతారమైన రామాజుని ప్రతీక ఆ సింహాసనము, మేము రామానుజ గురువర్యుని ఆశ్రయించి ఉన్నామని చెప్పడానికే సింహాసనం మీదకు రమ్మని శ్రీకృష్ణుని పిలుస్తున్నారు. రామానుజుని ఆశ్రయిస్తేనే పరమాత్మ అనుగ్రహం అని గోపికలు చెప్పకనే చెబుతున్నారు ఈ పాశురంలో. సింహాసన స్వరూపులగు ఆచార్యుల యందు అధిష్టించిన పరబ్రహ్మను ఆశ్రయించిన గోపికలు ఆచార్యసంబంధము వలన శ్రీ కృష్ణునికి అత్యంత ప్రీతిగలవారవుతున్నారు. కోయిల్ అంటే ప్రణవము, అదే పరమాత్మకు, జీవాత్మ అనే ఆచార్యునికి నివాసం. విభూతే పరమాత్మసింహాసనం అని కందాడై రామానుజాచార్య వివరిస్తున్నారు.

Also Read : మానవత్వపు సుగంధాలు విరజిమ్మే కావ్యం తిరుప్పావై

తిరుప్పావైలో మొదటి అయిదుపాశురములలో తిరునోము పద్ధతులు నియమాలు తెలిపి, తరువాత భాగవతోత్తముల కటాక్షము పొందే విధానాన్ని 6 నుంచి 15 వరకు గోదమ్మ బోధిస్తున్నది. మంత్ర మంత్రార్థాలను తెలుసుకొన్నది 17లో, పురుషకార భూతురాలైన లక్ష్మీదేవి కటాక్షమునుపొందడం 18లో, అనన్యశేషత్వము కలవారమని 19లో వివరిస్తారు. దేహాత్మాభిమానం నశించినవారమని తెలుసుకున్నామని 20 విన్నవిస్తారు. భగవత్ కటాక్షము పొందడానికి అర్హులమయినామని 21లో, ఇన్ని అర్హతలను సంపాదించి వచ్చిన మమ్ము సరియైన రీతిలోసంభావించాలని 22లో ప్రకటించారు.

goda govinda geetham tiruppavai 23
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles