Tuesday, April 16, 2024

విష్ణు సేవలో కులభేదం లేదు

  • సిరినోము 13 గోదా గోవింద గీతమ్

నేపథ్యం

పోదరికణ్ణినాయ్ నేత్రమే జ్ఞానం అని చెప్పే ఈ పాశురంలో తొండరడిప్పొడి యాళ్వార్ ను నిద్రలేపుతున్నారు. పుష్పకైంకర్య పరాయణులైన విప్రనారాయణుడీయన భక్తాంఘ్రిరేణువు లేదా శ్రీపాదరేణువు అని కూడా పిలుస్తారు. పోదరికణ్ణినాయ్ అంటే పూలు సమకూర్చడమే కార్యంగా పెట్టుకున్నవారు అని. అందంగా తులసి మాలలు కట్టి, ఆ మాలలతో నిండిన బుట్టను భుజాన ధరించి శ్రీరంగంకోవెలలో దర్శనమిచ్చే ఆళ్వార్ విప్రనారాయణుడు.గోద ఈ 13వగీతంలో శ్రీరాముడిని శ్రీ కృష్ణుడిని సమంగా కీర్తిస్తారు. తొండరడిప్పొడియాళ్వార్ కూడా తన తిరుమాలై గ్రంధంలో శ్రీ రామ శ్రీ కృష్ణులను సమంగా స్తుతిస్తారు. 

మథురలో పుట్టి బృందావనంలో తిరుగాడే గోపికలు కృష్ణుని కాక రాముని తలవడం ఏమిటి? అయోధ్యలో రాముడు రాముడు అనే తప్ప మరో మాట ఎరుగరు. నందవ్రజంలో కృష్ణుడిని గాక అన్యనామం ఎందుకు తలుస్తారు? ఈ పాశురంలో రాముడా కృష్ణుడా ఎవరుమిన్న అనే వాదం సాగుతుంది. ఆకారాలు వేరుగా ఉన్నా ఇరువురూ పరమాత్మస్వరూపాలే కదా అని నిర్ధారణకు వస్తారు. భద్రుడి తపస్సు మెచ్చి విష్ణువు అవతరిస్తే, ఆయన నువ్వెవరు? నేను నిన్నెరుగను. నాటి రూపుచూప నమ్మగలను అంటాడట. సరే అని శ్రీరాముని ఆకారంలో కనిపిస్తే తప్ప ఆయనకు తృప్తి కలగలేదు. శంఖ చక్రాలు ధనుర్బాణాలతో శ్రీరాముడు ఉండడం సాధారణంగా మనకు తెలియదు. కాని భద్రాచలంలో భద్రుని శిరస్సున నిలిచాడట. తనను నమ్మిన వాడిని నెత్తిమీద పెట్టుకుని కాపాడుకుంటాడట విష్ణువు. భద్రుడుఅడిగితే ఆ గిరి శిఖరాన నిలిచాడట. వైకుంఠ రాముడు చక్రవర్తిగా నిలిచిన ఏకైక ఆలయం భద్రాచలం.  

Also Read : లక్ష్మణుడు యోగి, భరతుడు ముని: ఇద్దరూ రామభక్తులే

పుళ్లిన్ వాయ్ కీండానై పొల్లా అరక్కనై
క్కిళ్లిక్కళైందాననై కీర్తిమై ప్పాడి ప్పోయ్
పిళ్లైగళ్ ఎల్లారుమ్ పావై క్కళం పుక్కార్
వెళ్లి ఎఝుంద్ వియాజమ్ ఉరంగిట్రు
పుళ్లుం శిలంబిన్ కాణ్ పోదరి కణ్ణినాయ్
కుళ్ల క్కుళిర కుడైందు నీరాడాదే
పళ్లికిడత్తియో పావాయ్ నీనన్నాళాల్
కళ్లమ్ తవిర్ న్దు కలందేలో రెంబావాయ్

పదార్థాలు:

పుళ్లిన్ వాయ్= కొంగ (బకాసురుని) నోటిని, కీన్దానై =చీల్చిన శ్రీకృష్ణుని, పొల్లా=దుష్టుడైన: అరక్కనై = రావణాసురుడి తలలను, క్కిల్లి = త్రుంచి, క్కళన్దానై= పారవేసిన శ్రీరాముని,  కీర్తిమై= కీర్తిని, పిళ్లెగళ్ = పిల్లలు
ఎల్లారుమ్= ఎల్లరును, ప్పాడి=గానం చేసి, ప్పోయ్= వెళ్తూ, పావైక్కళం = వ్రతం చేసే ప్రదేశాన్ని, పుక్కార్ =ప్రవేశించారు. వెళ్లి=శుక్రుడు, ఎజుందు=ఉదయించి, వియాజమ్ గురు(వారం) అస్తమించాడు, పుళ్లుమ్ =పక్షులును, శిలంబినకాణ్= కిలకిలరావములు చేస్తున్నాయి, పోదు= తామరపుష్పంలోని, అరి= తుమ్మెదల వంటి, కణ్ణినాయ్=కన్నులున్నదానా, పావాయ్= ఓ సుకుమారి, నీ= నీవు, నన్నాళాళ్= ఈ మంచి రోజున, కుళ్లక్కుళిర = చల్లచల్లగా, కుడైందు= అవగాహనం చేసి, నీరాడాదే= స్నానం చేయకుండా, పళ్లిక్కిడత్తియో=పాన్పుపై పడుకొని ఉన్నావా? కళ్లమ్= కపట స్వభావాన్ని, తవిర్ న్దు= వదిలి, కలన్దు =మా తో చేరు. 

Also Read : దర్శనంతో గోపికలనూ స్పర్శనంతో గోవులనూ అలరించే మేఘవర్ణుడు

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి తెనుగు తిరుప్పావై పద్యం ఇది.

పక్షియై వచ్చిన బకుని వక్త్రము చీల్చె

క్రూరరావణుగూల్చె, కుటిల దనుజ

కులము నిర్మూలించె బలశాలి: ఆ రామ

కథలు పాడుచు పోయి కన్నెలెల్ల

సిరినోము గీమును చేరినా: రుదయించె

నదిగొ శుక్రుడు, గురుడస్తమించె:   

పక్షుల కలకల ధ్వని సాగె విరిగంటి:

బంగరుబొమ్మ: శుభదినమందు

జలజాక్షుకూడగా వలె గాని, మదిని వా

నినె కోరుచు కపట నిద్ర ఏల?

మేనెల్ల జిల్లన కోనేట మునుగ మా

వెంట రావిది ఏమి వింత? కాంత:

భావార్థాలు

కొంగ రాక్షసుడు బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుడు, రావణుని తలలు గిల్లిపారేసిన శ్రీరాముని కీర్తిస్తూ గోపికలందరూ వ్రతస్థలికి చేరుకున్నారు. గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నవేళ, పక్షులు గలగలా ఆహారపు వేటకు వెళ్తున్నాయి. తుమ్మెద దూరిన తామెరపూవు వంటి కన్నుల దానా సుకుమారీ, శ్రీకృష్ణుని గుణానుభవాన్ని నీవొక్కదానివే అనుభవించాలనే కపట స్వభావాన్ని వదిలి మా అందరితో చేరి చల్లని నీటిలో స్నానం చేయకుండా ఇంకా పాన్పుపై పడుకోవడం ఎందుకు?

Also Read: శ్రీకృష్ణానుభవమే స్నానం, ధ్యానం, నిద్ర

అంతరార్థాలు

గోపికలంతా వ్రతం చేయడానికి ఒక స్థలాన్ని ఎంచుకున్నారు. అక్కడికి చేరుకున్నారు. శ్రీకృష్ణావతారం ముగిసిన తరువాత శ్రీ రామావతార వైభవాన్ని వారు పాడుకుంటున్నారు. తమతో కలిసి రమ్మని లోపలున్న గోపికను మేలుకొలుపు పాడుతూ ఉంటే, ఆమె లేవడం లేదు. తననేత్ర సౌందర్యం కోసం క్రిష్ణయ్య తానే వస్తాడని ఆమె ధీమా. వారి సంభాషణ ఈ విధంగా సాగింది.

గోపిక: అప్పుడే తెల్లారిందనడానికి ఏమిటి రుజువులు
బయటి గోపికలు: శుక్రుడు ఉదయిస్తున్నాడు. గురుడు అస్తమిస్తున్నాడు.
గోపిక: వేరే గుర్తులేమీ లేవా?
గోపికలు: పక్షులు కలకలం చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. కలకలం అంటే భాగవతులు కలిసి చెప్పుకునే అనుభవాలు, భగవద్గుణానుభవాలు.వాటిని అందరూ పంచుకుంటూ ఉంటే, నీవేమిటమ్మా ఒంటరిగానే శ్రీకృష్ణ గుణానుభవాలను అనుభవిస్తున్నావు. ఇది న్యాయమా? పోనీ శ్రీకృష్ణవిరహం వల్ల స్నానం చేయాలని ఉందా? అట్లా అయితే సూర్యోదయానికి పూర్వమే నీళ్లు చల్లగా ఉంటాయి. తెల్లవారితే నీళ్లు వేడెక్కుతాయి సుమా. శ్రీరాముని విడిచి ఉండలేక భరతుడు అర్థరాత్రి సరయూనదిలో స్నానం చేసేవాడట. ఇవి మంచిరోజులు. శ్రీకృష్ణుడితో మనను కలవనివ్వని పెద్దలు ఇప్పుడు కలవడానికి అనుమతించారు. నీవొక్కదానివే భగవద్గుణానుభవం చేయడం సరికాదు. దీన్ని కాపట్యం అంటారు. కాకపోతే మాతో కలిసి ఆ అనుభవాలు పొంద వచ్చుకదా అని గోద లోపలి గోపికలతో వాదిస్తున్నారు. ఒక్కరే భగవదారాధన చేయడం కాదు. గోష్టిగా సమిష్టిగా శ్రీకృష్ణుడి గుణగణాలను తలచుకోవాలని గోదమ్మ బోధిస్తున్నారు.

లోని గోపిక అమిత సుందరి. ఆమె కనులు తామరపూలలోవ్రాలిన తుమ్మెదలవలె ఉన్నాయట. నీనేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీ కృష్ణుడు తానే వస్తాడని భ్రమించకు అని బయటినుంచి గోద వివరిస్తున్నారు.

యశోద: రామేనామ బభూవ, కృష్ణ ఊ,

యశోద:  తదబలా సీతేతి,  కృష్ణ ఊ,

యశోద:  తౌ పితుర్వాచా పంచవటీ,  కృష్ణ ఊ,

యశోద:  తామాహర ద్రావణః, కృష్ణ, సౌమిత్రే క్వధనునర్ధనుర్ధను రితి

శ్రీ కృష్ణుడిని ఊయలలో నిద్రబుచ్చుతూ, అనగా అనగా రాముడనే బాలుడుండేవాడు అని యశోద కథ మొదలు పెట్టింది. కిట్టయ్య ఊఊ అన్నాడు. రాముడికి సీత అనే భార్య ఉంది. చిట్టి కిట్టయ్య ఊహూఊ అన్నాడుమళ్లీ. తండ్రి మాట కోసం అడవులకు వెళ్లారు. ఊఊ.. అక్కడ సీతమ్మను రావణుడు అపహరించాడు అని యశద చెప్పగానే ఆవేశంతో లక్ష్మణా ధనుస్సు ధనుస్సు ఏది ధనుస్సు ఎక్కడ అని ఆవేశంతో అరుస్తూ లేచాడట. తల్లికి అర్థం కాలేదు. ఈ సౌమిత్రి ఎవరు? ఉన్నట్టుండు బాలుడు అతన్ని పిలవడం ఏమిటి, ధనువెక్కడ? అని గందరగోళంలోపడిపోయింది. రాముడు కృష్ణుడు ఒక్కరే అనడానికి ఇంకే ప్రమాణం కావాలి? 

కొంగ అంటే దంభము. ఇతరులను హింసించడం అతని ప్రవృత్తి కాని పైకి సజ్జనుడివలెకనిపించే ప్రయత్నం. ఇదే దంభము. రావణుడనే వాడు అహంకారానికి ప్రతీక. ఈ రెండూ తొలగాలంటే ఆచార్యుడి ద్వారా వచ్చిన భగవన్నామకీర్తన ఒక్కటే మార్గం. శుక్రుడు జ్ఞానము, బృహస్పతి అజ్ఞానమునకు సంకేతము. పక్షులంటే ఆచార్యులు. నేత్రమంటే జ్ఞానం. నేత్ర సౌందర్యమంటే భాగవతోత్తముల స్వరూపం తెలుసుకోగలగడం, స్నానమంటే భగవద్గుణానుభవం. భగవంతుని అనుభవం అందరితో కలిసి చేయాలి. ఒంటరిగా చేయడమంటే దంభం.

విశేషార్థాలు: పుండరీకాక్షాయనమః

ఈ పాశురంలో భక్తాంఘ్రిరేణు, శ్రీపాదరేణువు అంటే విప్రనారాయణుని మేల్కొల్పుతున్నారు. ఆయన పూలసేవలో తరించిన వాడు. పావాయ్ అంటే పతివ్రత. ఒక్క భర్తకే వశమై ఉండడం ఆవ్రతం. ఈ ఆళ్వార్ కేవలం రంగనాథుడిని తప్ప మరే దివ్యదేశ పెరుమాళ్ ని కలవని తలవని వాడు. పుండరీకమన్నది వైకుంఠంలో నిత్యసూరుల పేరు. అర్చిరాజ మార్గంలో వెళ్లేవారికి పుణ్డరీక నామమే ముఖ్యం. గురుపరంపరలో శ్రీ పుండరీకాక్షాయనమః అనే నమోవాకాన్ని అనుసంధించుకోవాలి ఈ రోజు.

అరక్కనై అంటే రాక్షసుడు  ఆ మాట అంటే సరిపోయేది. కాని పొల్లా అరక్కనై అని ఎందుకన్నారు గోద.రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా, ఆత్మ శరీరము వంటి దంపతులు వారు. వారిది అద్వైతం. అంటే వారు ఇద్దరు కాదు ఒక్కరే.  క్షణం కూడా విష్ణుని వదిలి ఉండలేని అమ్మవారిని విడదీయడం పరమ దుర్మార్గం అనే అర్థంతో అతడిని దుష్టుడైన రాక్షసుడు అన్నారు రాక్షసులలో విభీషణుడి వంటి మంచివారూ ఉంటారు. కనుక రావణుడని చెప్పడం ఇది. అడవిలో ఏనుగు వంటి వాడు రాముడు నీవు కుందేలు వంటి నీచుడవు అని రావణుడిని సీత సంబోధిస్తుంది.

ఈ జగమంతా ఆ భగవంతుని ఉద్యానవనమైతే, ఇందులో బకుడు, రావణుడు వంటి అధర్మపరులు పురుగు పట్టిన చిగురుల వంటి వారట. వారిని గిల్లి పారేస్తాడట. కిళ్లిక్కళైన్దానై

రావణుడిని చంపడం రామునికి తేలికేనా?

శ్రీరాముడు రావణుడిని చంపడానికి చాలా కష్టపడ్డట్టు ఎందరి సాయమో తీసుకున్నట్టు రామాయణంలో ఉంది. సుగ్రీవుడు, హనుమంతుడు, అగస్త్యుడు చెప్పిన ఆదిత్యహృదయం మంత్రం, సేతుబంధనం వంటి ఎన్నో సహాయాలతో జయించినట్టు ఉంటుంది. ఇదంతా ఒక లీల. విభీషణుడు శరణు కోరినప్పుడు, సుగ్రీవుడు ఆతనికి ఆశ్రయం ఇవ్వరాదంటాడు. శత్రురాజు తమ్ముడిని నమ్మడం మంచిది కాదని ఆయన హితవు. శ్రీరాముడికి యుద్ధంలో హాని కలిగిస్తాడని సుగ్రీవుని భయం. అప్పుడు రాముడేమంటాడంటే .. మొత్తం భూమ్మీద ఉన్న రాక్షసులంతా వచ్చినా నేను సంకల్పిస్తే కొనగోటితో చంపగలను నిశ్చింతగా ఉండు అంటాడు. కాని సంకల్పించడు. మానవుడి వలె మానవ ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయం సాధిస్తాడు. రావణుడి అహంకారాన్ని రాముడు ముందు సంహరిస్తాడు. ఒక సాయంత్రం యుద్ధభూమిలో రావణుడి రథాన్ని, ధనుస్సును విరిచి, సారథిని, గుర్రాల్ని చంపి, పతాకాన్ని పడగొట్టి, కిరీటం కూల్చి ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు రావణుడిని సులువుగా చంపవచ్చు. కాని వదిలేస్తాడు. వెళ్లు, అలసట తీర్చుకుని, కొత్త రథాన్ని ఆయుధాలని సమకూర్చుకుని రేపు రా, నీకు అనుమతిస్తున్నాను. అని గంభీరంగా అందరిలో ప్రకటిస్తాడు. లంకలో అందరూ చూస్తుండగా రావణుడు తన రాజప్రాసాదానికి నడుస్తూ వెళ్తాడు. ఇంకెక్కడి రావణుడు. అతని సర్వస్వమూ అభిమానమే, దాన్ని అంతమొందిన ఘడియ అది. తన రాజ్యంలో  ప్రవేశించి తనను ముట్టడించి, పడగొట్టి తనకు బడలిక తీర్చుకునేందుకు అనుమతిస్తున్నాడు రాముడు. రాముడు అనుమతిస్తే తప్ప విరామం తీసుకోలేని స్థితి. ఇంకేం మిగిలింది. అహంకార సంహారం జరిగిన ఆ సంఘటనలోనే రాముని అంతులేని ఔదార్యం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొంగ దంభాన్ని, రావణుడి అహంకారాన్ని అవలీలగా సంహరిస్తాడు రాముడు. గిల్లి పారేస్తాడు, కొనగోటితో.

చిటికెన వేలు తో మనం సూదిని  ఓ పదినిముషాలు పట్టుకోలేం. ఇంతెందుకు ఓ గంట సేపు చేతిని ఎత్తి కదలకుండా పట్టుకోలేం. శ్రీకృష్ణుడు ఏడురోజులు కృష్ణుడు చిటికెనవేలికొనగోట గోవర్ధనాన్ని ఎత్తి ఏడురోజులు పట్టుకోగలడు, రాముడిగా కొనగోట రావణుని అహంకారాన్ని కొట్టిపారేయగలడు.  దేవతలలో విష్ణువిరోధులూ ఉండవచ్చు. మహావిష్ణువు సేవలో కులభేదం లేదు. ఒంటరిగా కన్న భగవత్సేవలో అందరూ కలిసి ఉండాలని భోదించే మరో పాశురం ఇది.

 

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles