Friday, March 29, 2024

గ్రేటర్ ఎన్నికలు, ఎస్ఈసీ మార్గదర్శకాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ న ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. నామినేషన్స్ వేయడానికి చివరి తేదీని నవంబర్ 20,2020 గా నిర్ణయించారు. మొన్నటి వరకూ కరోనా తెలంగాణ తో సహా చాలా రాష్ట్రాలను.. యావత్ దేశాన్నీ గడ గడలాడించింది. అంతే కాదు ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతున్న వేళ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను జరపాలని సూచించింది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ లు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది.

హడావిడి నిర్ణయం

మరో వైపు ప్రతి పక్షాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకునే వీలును, సమయాన్ని ఇవ్వలేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ప్రతి పక్షాలు కాస్త గందరగోళానికి గురి అవుతారని.. తెలంగాణ ఎన్నికల కమిషన్ హఢావుడి నిర్ణయం తీసుకున్నదని మరో ఆరోపణ కూడా ఉంది.

Also Read: గ్రేటర్ లో పాగా కోసం టీఆర్ఎస్, బీజేపీ కుస్తీ

ప్రచారానికి సమయం లేక ప్రతిపక్షాల విలవిల

ఏది ఏమైనప్పటికీ నామినేషన్లకు పెద్ద సమయం లేకపోవడంతో.. విపక్షాలకు ఇక నుంచి ప్రతి క్షణం విలువైందే. అలాగే ప్రచారానికి కూడా పెద్దగా టైం లేకపోవడం కూడా టీఆర్ఎస్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారు. 2018లో అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు కూడా మెరుపు వేగంతో ప్రతిపక్షాలకు షాకిచ్చారనీ, గ్రేటర్ ఎన్నికల్లోనూ 2018 ఎన్నికల మ్యాజిక్ రిపీట్ అవుతుందనీ టీఆర్ఎస్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఎన్నికల విషయంలో అధికార పార్టీగా తనకుండే అనుకూలతను టీఆర్ఎస్ పూర్తిగా వాడుకుందనే చెప్పొచ్చు.

దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన ఉత్సాహం మీదున్న బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆరాటపడుతుండగా.. గత బల్దియా ఎన్నికల్లో చేసిన మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఎన్నికలకు సన్నద్ధమయ్యే వ్యవధి లేకుండానే టీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చేలా ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని బీజేపీ ఆరోపిస్తోంది.

విధివిధానాలు

ఇక ఎన్నికల నిర్వహణకు విశాలమైన గదులను ఉపయోగించుకోవాలని.. విధిగా ఎన్నికల కార్యకలాపాల్లో ఉన్న అందరి వద్ద ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని ఎస్ఈసీ సూచించింది.

* ఎన్నికల సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనబడితే వారికి బదులుగా ఉపయోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారులు, కమిషనర్ ప్రత్యామ్నాయ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి.

* నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉండనుంది. కాన్వాయ్ ఉన్న సందర్భాల్లో వాహనాల సంఖ్య రెండుకు మాత్రమే పరిమితం.

* ప్రచారానికి వాడే కాన్వాయ్‌లో రెండు వాహనాల మధ్య కనీసం 100 మీటర్ల దూరం పాటించాలి.

* ఇంటింటి ప్రచారం విషయంలో భద్రతా సిబ్బంది కాకుండా ఐదుగురు కలిసి మాత్రమే చేసుకోవచ్చు.

* రెండు పార్టీలు లేదా అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అరగంట గ్యాప్ ఉండాలి.

* కరోనా నిబంధనలకు లోబడి ఎన్నికల ప్రచారాలు లేదా సభలు నిర్వహించాలి.

* దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, గుర్తించిన అత్యవసర సేవల్లో ఉన్న వారు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం వాడుకోవచ్చు.

* ఎన్నికలు జరిగే ముందు పోలింగ్ కేంద్రాన్ని తప్పకుండా శానిటైజ్‌ చేయాలి.

* ఒక కౌంటింగ్ హాల్‌లో 10 కౌంటింగ్ టేబుళ్లకు మించి ఉండకూడదు. కౌంటింగ్ ముందు బ్యాలెట్ బాక్సులను శానిటైజ్ చేయాలి.

* కౌంటింగ్‌కు ముందు, తర్వాత కౌంటింగ్ సెంటర్లను డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. అవసరమైతే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌ ప్రత్యేక హాల్స్‌లో చేపట్టాలి.

సుమారు 80 మంది కార్పొరేటర్లు మళ్ళీ రంగంలోకి

జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌కు 99 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో కనీసం 80 మందికి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంటుందని అంచనా. మరోవైపు మజ్లిస్‌తో పొత్తు ఎలాగో ఉంటుంది. కాబట్టి గులాబీ పార్టీకి అభ్యర్థుల ఎంపిక పెద్ద కష్టమేం కాబోదు. కరోనా కష్టకాలంలో ఎన్నికలు జరపడం ఒకింత విమర్మలు వెల్లువెత్తుతున్నా.. మరో పక్క రాజకీయంగా రోజురోజుకూ వేడి రాజుకుంటూనే ఉంది. డిసెంబర్ మొదటి వారం నుంచీ ఈ వేడి మరింత పెరగనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles