Wednesday, April 24, 2024

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో శనివారంనాడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పలు అంశాలను చర్చించి ఆమోదించింది.

2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ గా, మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.

రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం 17 సెప్టెంబర్, 2022 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ మూడు రోజులపాటు (16, 17, 18 సెప్టెంబర్, 2022) రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

 ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది.

సెప్టెంబర్ 16వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలి.

సెప్టెంబర్ 17వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటి, పంచాయతీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలి.

అదే రోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం, హైదరాబాద్ లోని బంజారా భవన్, ఆదివాసీ భవన్ ల ను ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరా పార్కు వద్దగల ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ గోండు లంబాడీ తదితర కళారూపాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు.

సెప్టెంబర్ 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ’ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.

పోడు భూములు

పోడు భూముల విషయంపై క్యాబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల వ్యాప్తంగా రెవిన్యూ, ఫారెస్టు, ట్రైబల్ వెల్పేర్ శాఖల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో, ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని కేబినెట్ సూచించింది.

దళిత బంధు

రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రస్థుతం అందచేస్తున్న 100 మందితో పాటు ప్రతి నియోజకవర్గానికి మరో 500 మందికి దళిత బంధు పథకాన్ని విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న నేపథ్యంలో, మిగిలిన 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

• జీహెచ్ఎంసీ మరియు మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ మెంబర్ల సంఖ్యను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో 5 నుండి 15 వరకు ఇతర కార్పొరేషన్లలో 5 నుండి 10 వరకు, కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానించింది.

• రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్టు యూనివర్సిటీకి కొత్త పోస్టులను మంజూరు చేయాలని కేబినెట్ తీర్మానించింది.

• సుంకిశాల నుంచి హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరచాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా అదనంగా 33 టిఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు నిర్ణయించింది. అందుకు గాను రూ. 2214.79 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.

• రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకై 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు జరపాలని కేబినెట్ తీర్మానించింది.

• భధ్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించి ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.

‣ సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు, కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా తెలంగాణ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles