Thursday, April 25, 2024

యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో బీజేపీ ఆధిక్యం, పంజాబ్ లో ఆప్

  • ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సగలు తీరుతెన్నులు
  • గోవా, ఉత్తరాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ
  • యూపీలో రెండో  స్థానంలో ఎస్ పి, మిగిలిన రాష్ట్రాలలో కాంగ్రెస్

మొన్న ముగిసిన పోలింగ్ లో ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకీ, పంజాబ్ లో ఆమె ఆద్మీపార్టీకి ఆధిక్యం రావచ్చునని ఎగ్జిట్ పోల్స్ సగటు ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీ ఉత్తర ప్రదేశ్ తో పాటు గోవా, ఉత్తరాఖండ్ లో కూడా అత్యధిక

స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ మంచి ఫలితాలు సాధించినప్పటికీ రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వస్తున్నది. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ లలో మాత్రం రెండో స్థానంలో కాంగ్రెస్ నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలన్న నియమం ఏమీ లేదు. అవి తప్పు అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ లో నాలుగు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సగటు బీజేపీకీ, దాని మిత్రపక్షాలకూ కలిపి 240 స్థానాలు లభిస్తాయి అని అంచనా. సమాజ్ వాదీ పార్టీకి 140 స్థానాలకు పైబడి రావచ్చు. యూపీలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 403. పంజాబ్ లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన అయిదు సంస్థల సగటు చూస్తే ఆప్ కు అఖండ మెజారిటీ లభించే అవకాశాలు ఉన్నాయి. దల్లీలో అధికారంలో 2015 నుంచి ఉన్న  ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) దిల్లీ వెలుపల పంజాబ్ లో పాగా వేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నించింది. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలు ఉండగా ఆప్ కు 68 స్థానాలు లభించవచ్చునని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య నువ్వా-నేనా అన్నట్టు పోటాపోటీగా వ్యవహారం ఉన్నదనీ, కాంగ్రెస్ కంటే బీజేపీకి స్వల్ప ఆధిక్యం ఉన్నదనీ చెబుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన స్వల్ప మెజారిటీతోనే. గోవా అసెంబ్లీలో ఉన్న మొత్తం 40 స్థానాలలో 18 బీజేపీకి రావచ్చుననీ, 15 కాంగ్రెస్ కు రావచ్చుననీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి.

మణిపూర్ లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 60 స్థానాలలోనూ బీజేపీ 30 స్థానాలు గెలుచుకోవచ్చు. అంటే మెజారిటీ స్థానాల కంటే ఒక్క సీటు తక్కువ. కాంగ్రెస్ కు 14 స్థానాలు దక్కవచ్చు.

ఉత్తర ప్రదేశ్ లో ఇవ్వాల (సోమవారం) జరిగిన పోలింగ్ తో దాదాపు నెలరోజులుగా జరుగుతున్న పోలింగ్ ముగిసింది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో ఇదివరకే పోలింగ్ పూర్తయింది. మార్చి పదో తేదీ నాడు, అంటే గురువారంనాడు, నిజమైన ఫలితాలు వెల్లడి అవుతాయి.  ఎగ్జిట్ పోల్స్  ఫలితాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ, పంజాబ్ లో ఆప్, గోవాలో బీజేపీ లేదా కాంగ్రెస్, మణిపూర్ లో బీజేపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ  గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాలుగు రోజుల కిందటే ఇదే మాట చెప్పారు. పంజాబ్ మినహా ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో కొనసాగుతుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు

గోవాలో ఇదివరకు జరిగినట్టు తప్పులు జరగకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పనాజీ పంపింది. ఉత్తరాఖండ్ కూ, మణిపూర్ కూ, పంజాబ్ కు కూడా సీనియర్ నేతలను పంపించింది. గోవాలో లోగడ బీజేపీ కంటే కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చినప్పటికీ దిగ్విజయ్ సింగ్ వైఫల్యం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యూహ నిర్ధారణ సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం పంపిన నాయకులు సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. వారికి అటువంటి అధికారాన్ని రాహుల్ దఖలు పరిచారు. 2017 ఎన్నికలలో గోవాలో కాంగ్రెస్ కు 17 స్థానాలు లభించాయి.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles