Thursday, March 28, 2024

పోలవరంపై ప్రధానికి జగన్ లేఖ: అనీల్

  • నాడు చంద్రబాబు తప్పిదాల వల్లే నేడు పోలవరంపై కేంద్రం కొర్రీలు
  • కేంద్రం ప్యాకేజీని చంద్రబాబు ఆమోదించడమే పోలవరానికి శాపం
  • విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించి ఇవ్వాలి
  • పోలవరం ఇరిగేషన్ కాంపోనెంట్ కు అంగీకరించడం టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం
  • టిడిపి కేంద్ర మంత్రులు డిసెంట్(అసమ్మతి) చెప్పలేదు
  • పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానిది కేవలం ఫెసిలిటేటర్ (సమన్వయకర్త) పాత్రే
  • పోలవరంపై కేంద్రం ప్రకటించిన అంచనా వ్యయాలను వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అంగీకరించదు

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ వ్యయంపై తాజాగా కేంద్రం వేస్తున్న కొర్రీలకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2016లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని చంద్రబాబు ఆమోదించడం వల్లే నేడు పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయంను వివాదంలోకి నెట్టిందని అన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తిగా పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సి వుండగా, దానిని ప్యాకేజీ పరిధిలోకి కేంద్రం తెచ్చిన సందర్భంలో టిడిపి ప్రభుత్వం స్వాగతించడం పోలవరం పాలిట శాపంగా మారిందని అన్నారు. ఈ పరిస్థితిని వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అన్నారు. పోలవరంపై సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రధానికి లేఖ రాస్తున్నారని ఇరిగేషన్ మంత్రి వెల్లడించారు.

‘‘రాష్ట్ర విభజన సందర్బంగా పోలవరం ప్రాజెక్ట్ ను అప్పటి ప్రధాని స్వయంగా జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు. కేంద్రమే పోలవరం నిర్మాణాన్ని చేపడుతుందని, ప్రతిపైసా కేంద్రమే భరిస్తుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే కేంద్రం ఈ ప్రాజెక్ట్‌ను చేపడితే తనకు కమీషన్లు రావనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు తామే పోలవరం నిర్మిస్తామంటూ ముందుకు వచ్చారు. 2014 నుంచి 2016 వరకు టిడిపి హయాంలో పోలవరంపై చేసిన వ్యయం కేవలం రూ.265 కోట్లు మాత్రమే. అప్పటి వరకు పోలవరంపై మొద్దు నిద్ర పోయిన టిడిపి ప్రభుత్వం 2016 సెప్టెంబర్ లో అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జెట్లీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిప్పుడు అర్థరాత్రి సంబంరాలు చేసుకుంది. దానిని సమర్థిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. దానిలో భాగంగా జరిగిన గూడుపుఠాని ప్రజలకు తెలియచేస్తున్నాం.

‘‘అసలు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి, పోలవరం నిర్మాణానికి ఎటువంటి సంబంధం లేదు. ప్యాకేజీ పరిధిలోకి పోలవరం ప్రాజెక్టును తీసుకురావడానికి వీలు లేదు. కానీ నాటి టిడిపి ప్రభుత్వం, తమ కమీషన్ల కోసం ప్యాకేజీకి అంగీకరించారు. 30.0.2016లో కేంద్రంలో తెలుగుదేశం భాగస్వామ్యంగా వుంది. ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేసిన మెమోలో 2013-14 వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ కాంపోనెంట్ కు ఎంత వ్యయం అవుతుందో, దానిని మాత్రమే ఇస్తామని ప్రకటించింది. దీనిని చంద్రబాబు సీఎంగా ఉండి అంగీకరించడం చారిత్రక తప్పిదం. ఇది తప్పు అని అటు అసెంబ్లీలోనూ జగన్ గారు చెప్పారు, బయట కూడా అదే విషయాన్ని మేం చెప్పాం, అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.

‘‘దేశంలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు చేపట్టినప్పుడు దశాబ్దాల సమయం పడుతుంది. ప్రారంభించిన తరువాత అంచనా వ్యయాలు కాలక్రమంలో పెరుగడం సహజం. పోలవరం విషయంలో కూడా అదే జరిగింది. రూ.20 వేల కోట్ల నుంచి టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ ఇచ్చిన అంచనాల ప్రకారం వ్యయం రూ.55 వేల కోట్లకు వ్యయం పెరిగింది. ఈ రూ. 55 వేల కోట్ల లెక్కను తేల్చింది మూడు కేంద్ర ప్రభుత్వ విభాగాలే. కేంద్ర ప్రభుత్వమే సహాయ, పునరావాస కార్యక్రమాలకు, భూమి పరిహారానికి సంబంధించిన లెక్కలు తన అధీనంలోని మూడు సంస్థలతో నిర్వహించింది. ఆ మూడు సంస్థలు చెప్పిన ప్రకారం అయినా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్ర  ప్రభుత్వమే ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం ఫెసిలిటేటర్(సమన్వయకర్త) పాత్ర మాత్రమే పోషిస్తోంది. కాబట్టి నిర్మాణం ఖర్చు తగ్గినా, పెరిగినా అదంతా చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. ఇందులో స్టేట్ కాంపొనెంట్, సెంట్రల్ కాంపొనెంట్ అంటూ ఉండవు. మొత్తంగా భరింంచాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ విషయం మీద మరో అభిప్రాయానికి అవకాశమే లేదు.

‘‘అయితే, 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌లో 2014 నాటి సవరించిన అంచనాల ప్రకారమే ఇరిగేషన్ కాంపోనెంట్‌ వ్యయంను కేంద్రం ఇస్తుందని తీర్మానం చేశారు. అప్పుడు కేంద్రమంత్రులుగా అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి వున్నారు. అంటే దీని అర్థం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందనే కదా’’ అంటూ అనీల్ కుమార్ విమర్శించారు.

‘‘కేంద్ర కేబినెట్‌లో 2014 తరువాత జరిగే అంచనా వ్యయాల పెరుగుదలను కేంద్రం భరించదని చాలా స్పష్టంగా నిర్ణయం చేశారు. చివరికి 2010-14 వరకు భూసేకరణ కోసం ఇచ్చిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని చెప్పారు. దానికన్నా వయ్యం పెరిగితే కేంద్రంకు సంబంధం లేదని అన్నారు. దీనికి ఆనాడు సీఎంగా వున్న చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇంతకుమించిన దుర్మార్గం ఉంటుందా..? కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి సంబరాలు చేసుకుని, రాష్ట్రమే పోలవరం కట్టేస్తుంది అంటూ అర్థరాత్రి చంద్రబాబు ప్రకటనలు చేశారు. దీనిపైన 2018లో ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖలో 30.9.2016 మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రిలేజ్ చేసిన మెమో ప్రకారం పోలవరానికి తొందరగా డబ్బులు ఇవ్వాలని కోరడం వాస్తవం కాదా? ఆనాడు ఇరిగేషన్ కాంపోనెంట్ కోసం కేంద్రం ప్రతిపాదించింది రూ.20వేల కోట్లు. దానిని చంద్రబాబు సమర్థించారు.

‘‘దీర్ఘకాలం పనులు జరిగే భారీ ప్రాజెక్ట్ ల అంచనా వ్యయాలు పెరుగుతుంటాయి. సిడబ్ల్యుసీ సవరించిన అంచనాల ప్రకారం 48వేల కోట్ల రూపాయలు అంచనా వ్యయం. దీనిలో రూ.29వేల కోట్లు ఆర్‌అండ్‌ఆర్‌ కే ఖర్చు చేయాల్సి వుంది. ఇవ్వన్నీ కాదని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన రూ.20వేల కోట్లకు ఎలా అంగీకరించింది? చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఈ రోజు కేంద్రం దానిని ముందుకు తెచ్చింది.

పోలవరంపై కేంద్రం ప్రకటించిన అంచనా వ్యయాలను వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అంగీకరించదు. దీనిపై సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ప్రధానమంత్రిగారికి లేఖ రాయబోతున్నారు. మేం కూడా ప్రధానిని కలిసి అన్ని వివరాలను అందించబోతున్నాం,’’ అని అనీల్ అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles