Saturday, April 20, 2024

విశ్వసించలేని విశ్వాసం – ఆత్మద్రోహమే

– డాక్టర్ దేవరాజు మహారాజు

మనుషులను చంపే శక్తి మంత్రాలకు ఉంటే, దేశ రక్షణ కొరకు వేలకోట్ల రూపాయలు వెచ్చించి సైన్యాన్ని, ఆయుధాల్ని, ఫైటర్ విమానాల్ని సమకూర్చుకోవడం ఎందుకూ? మంత్రాలు చదివేవాళ్ళను ఓ నలుగుర్ని పంపితే పని అయిపోతుంది కదా? నలుగురు కాకపోతే నలభైమందో, నాలుగు వందలమందో – అయినా సరే మనకు వేలకోట్లు మిగులుతాయి. పైగా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. శ్రీ వేంకటేశ్వర సామ్రాజ్యమైన తిరుమల తిరుపతి నగరాన్ని ఇటీవల వరదలు ముచెత్తడం విడ్డూరం! వాస్తు ప్రకారం కట్టిన ఇండ్లు కూడా వరుసబెట్టి కూలిపోవడం విషాదం. ప్రభుత్వ యంత్రాంగమంతా కదిలివెళ్ళ వరదల్ని అదుపు చేయడం, జనాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడం జరిగింది.  మరి ఆ ఆపత్కాల బాంధవుడేడీ రాలేదేమీ? దేవుడి మహిమల గూర్చి పిచ్చిమాటలు కట్టిపెట్టి, నోరు మూసుకొని ఉంటే కనీసం వారి గౌరవం దక్కేది కదా? వాస్తు పండితులు, జ్యోతిషులు అంతా ఎక్కడికి పోయారూ? ఒక్కరూ నోరు మెదపలేదేమీ? రాగల ప్రమాదం గూర్చి ముందే చెప్పి, జనాన్ని అప్రమత్తం చేయలేదేమీ చెప్మా? వాతావరణ శాఖకు, ప్రభుత్వ యంత్రాంగానికీ పని భారం తగ్గేది కదా? ఆ దేవదేవుడి మహత్మ్యాన్ని ప్రదర్శనకు పెట్టాల్సింది కదా? ఆయనతో ఒక మాయాజాలం చేయించి ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చూడాల్సింది.

Also read: అంధవిశ్వాసాలను త్యజిస్తూ, విజ్ఞానపథంలోకి పయనిస్తూ…

ఎంత పిలిచిన పలకని ఏడుకొండలవాడు

వరదలప్పుడు భక్తులంతా ‘‘ఏడు కొండలవాడా! వెంకట రమణా!! గోవిందా-గోవిందా’’ అని ఎంత పిలిచినా ఆయన గారు రాలేదు. జనాన్ని కాపాడలేదు. ‘‘నన్నూ, నా భక్తులనూ కాపాడేవారే లేరా?’’ అని ఏడుకొండల ఎంకట్రమణుడే వాపొయ్యాడుట! ‘‘భక్తులైనా, దేవుడైనా ఎవరూ భయపపడాల్సిన పనిలేదు. వరదల్లోంచి మిమ్మల్ని కాపాడి బయటపడేయడానికి మేమున్నాం’’- అంటూ ఆర్మీ రంగప్రవేశం చేసింది. పోలీసు శాఖ నడుం బిగించింది.  ఇంతకూ మనుషుల్ని మనుషులు రక్షించుకోవడమే గానీ, ఏదో శక్తి వచ్చి ఎవరినీ రక్షించింది లేదు. అసలు దేవుడి ఆభరణాలను దొంగలెత్తుకుపోతేనే ఆయనేం చేయలేక మిన్నకున్నాడు కదా? అంతా ప్రచారాల మహిమ. దేవుడి మహిమ కాదు. మహిమల ప్రచారం ఎంత ఎక్కువ జరిగితే అంత ఆదాయం ఉంటుంది. ప్రేయర్ ఇండస్ట్రీ – భక్తి వ్యాపారంలో అది కీలకం.

Also read: దైవశక్తి లేదు, ఉన్నదంతా మానవశక్తే

అంబులెన్స్ గుడికి పోవచ్చుకదా

ఒక్క విషయం నిజాయతీగా ఆలోచిద్దాం. ప్రార్థనలు గనక నిజంగా పని చేస్తే అంబులెన్స్ లు రోగుల్ని, బాధితుల్ని చర్చ్ లకు, మసీదులకు, దేవాలయాలకు తీసుకెళ్ళాలి. అనవసరంగా ఆసుపత్రులకు తీసుకుపోతున్నాయెందుకూ? ప్రార్థనలకు శక్తి లేదా? వైద్యశాస్త్రం చదువుకున్నవారే ఎందుకు కావాల్సివస్తోంది? ఇక, అంతా దైవేచ్ఛ అయితే సహజంగా ముంచుకొచ్చే తుపానులు, వరదలు, కరువులు, కాటకాలు, రోడ్డు ప్రమాదాలు వంటివన్నీ కేవలం హేతువాదుల్ని, నిరీశ్వరవాదుల్ని, చార్వాకుల్ని చంపేయాలి. ప్రార్థనలు, భజనలు, పూజలు చేసే భక్తజనాన్ని బతికించాలి. కానీ అలా జరగడం లేదెందుకూ? ప్రార్థనలకు, పూజలకు ఫలితం ఉండదా? సహజ ప్రమాదాల్ని తెలివిగా తప్పించుకోగలవారు, లేదా ఎదుర్కుని ధైర్యంగా నిలడడగలిగినవారు మాత్రమే నెగ్గుకొస్తున్నారు. పోనీ లాటరీలు చూద్దాం. కేవలం దేవుణ్ణి నమ్ముకున్నవారికే – ఆయన కరుణాకటాక్షం వల్ల బహుమతులు రావాలి. అదృష్టం పట్టాలి. దేవుణ్ణి నమ్మనివారంతా దురదృష్టంతో సతమతమవుతూ ఉండాలి. అంతా ఆ పైవాడే చూసుకుంటాడు. అంతా మంచే చేస్తాడు అని అనుకునే విశ్వాసకులకు ఎల్లప్పుడూ మంచే జరగడం లేదు. అందరిలాగే మంచీచెడూ రెండూ జరుగుతున్నాయి. దైవ విశ్వాసకులు చదువు పరీక్షలో, జీవిత పరీక్షలో అన్నింటా విజేయులు అవుతూనే ఉండాలి. మరి అలా కావడం లేదు కదా? దేవుణ్ణి నమ్మినా, నమ్మకపోయినా ప్రతిభగలవారు, ఇంగితజ్ఞానం గలవారు మాత్రమే ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తున్నారు. అదేం విచిత్రమో – దేవుడి మహిమ ఎక్కడా కనబడడం లేదు. ఎందుకు చెప్మా?

Also read: వైద్యం వేరు, మత విశ్వాసాలు వేరు కదా నాయనా?

ఈ పురోహితుడు మాకొద్దు

‘‘కేవలం రమణ మహర్షి మాత్రమే చనిపోయిన తర్వాత తిరిగి వచ్చారు. ప్రపంచంలో ఇది మరెవరికీ సాధ్యం కాలేదు’’- అని సంగీత దర్శకుడు  ఇళయరాజా ప్రకటించారు. ఆయన నమ్మకం ఆయనది. కానీ దానితో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి.  ఇళయరాజా తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తమిళనాడులో క్రైస్తవులు డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరికైనా, ఏవైనా ఉండొచ్చు. కాని వాటిని బయటపెట్టేప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. ప్రశ్నను తట్టుకొని నిలబడతాయా లేదా అని విశ్లేషించుకోవాలి. ప్రశ్నను ఎదుర్కోలేని విశ్వాసం వృథా! ప్రగతిశీల భావాలు గలవారంతా సంతోషించే సంఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది.  నారాయణరావుపేట మండలం, బంజేరుపల్లి గ్రామంలో ‘‘ఈ పురోహితుడు మాకొద్దు’’- అని దేశంలోనే మొదటిసారి ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామస్థులంతా 2021 డిసెంబర్ ఒకటి, బుధవారం రోజున ఊళ్ళో ఒక చోట గుమిగూడి ఆ నిర్ణయం తీసుకున్నారు. పురోహితుడి దోపిడీ సహించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్ళికి ఇరువైపులా 25 వేలు,  తులం బంగారం తీసుకుంటున్నాడనీ, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు జరిగినా సంభావన పేరుతో దోపిడి నిరాఘాటంగా కొనసాగుతూ ఉందని వాపొయ్యారు. దేవుడొక విశ్వాసం ఎలాగో పురోహితుడి అవసరం కూడా విశ్వాసమే. అంధవిశ్వాసాలు వదులుకుంటే, మనుషుల ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ‘‘ఈ పురోహితుడు మాకొద్దు’’- నిర్ణయంతో సమాజం కొతవరకు ముందుకొచ్చినట్లే- ఈ పురోహితుడే కాదు, ఏ పురోహితుడూ వద్దు . ఏ మత పెద్దా మాకు అవసరం లేదు – అని గ్రామస్థులు నిర్ణయించుకునే రోజు రావాలి! అలాంటి ఆశాభావాన్ని నిజం చేసుకోవడానికి ఈ తరం యువతీయువకులు అన్ని విధాలా కృషి చేస్తూనే ఉండాలి!

Also read: రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక రియాల్టీ షో!

తలలో మూడు సుడులు

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలొ బ్రహ్మపురి, కండాడ గ్రామంలో సునీల్ బన్ కర్ , ప్రమోద్ బన్ కర్ అనే ఇద్దరు మూర్ఖులున్నారు. వారి దృష్టి ఆడుకునే పిల్లలపై పడింది. అందులో ఒక పిల్లవాడి తలలో మూడు సుడులు కనిపించాయి. అంతే- వాళ్ళు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయారు. పిల్లవాడి పేరు యుగ్ మేశ్రామ్. రెండేళ్ళ పసివాడు. ఆడుకుని చీకటిపడ్డా ఇంట్లోకి రాలేదేమని పిల్లవాడి తండ్రి అశోక్ మేశ్రామ్ ఊరంతా వెతికాడు. కనబడకపపోయే సరికి, పోలీసులకు తెలియజేశాడు. పోలీసుల అన్వేషణలో సునీల్, ప్రమోద్ లు దొరికారు. విచారణలో తేలిందేమంటే- వాళ్ళే పిల్లవాణ్ణి చంపారని! ఎందుకూ అంటే – తలలో మూడు సుడులు ఉన్న పిల్లవాణ్ణి బలి ఇచ్చి, క్షుద్రపూజలు చేస్తే గుప్తనిధులు దొరుకుతాయని – ఒక మూఢ విశ్వాసం! పోలీసుల ట్రీట్ మెంట్ తర్వాత, చంపింది తామేనని నేరం ఒప్పుకున్నారు. గుప్తనిధులకు ఒక అనామకుడి తలలోని సుడులకూ సంబంధం ఎలా ఉంటుంది?

Also read: నిత్య జీవితంలో వైజ్ఞానిక స్పృహ

ఓర్వలేని భర్త

ఆడది స్వేచ్చగా బతకకూడదని, కట్టుబాట్లన్నింటినీ తమతమ మత గ్రంథాలలో రాసుకున్నప్పుడే మతాలు చచ్చిపోయాయి. ఆ  చచ్చిన మతాలను ఇప్పుడు ఈ బతికున్న మనుషులు గుడ్డిగా నమ్ముతున్నారు. చిత్రంవిచిత్రం! ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తి మండలంలో షేక్ బషీర్, అతని భార్య సదిక సంజారి ఉంటున్నారు. భార్య సదిక సంజారికి పాటలు పాడటం, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ఇష్టం. ఆమె అక్కడ జరిగే ఉగాది ఉత్సవాల్లో పాల్గొనగూడదని భర్త భార్యకు మందే ఆర్డర్ వేశాడు. అయినా, ఆమె తన ఉత్సుకతను, ఉత్సాహాన్నీ ఆపుకోలేక – వెళ్ళి, అన్ని కార్యక్రమాలలో పాల్గొంది, అంతేకాక, ఇతర గాయనీగాయకులతో కలసి ఖవ్వాలీ కూడా పాడింది. ప్రేక్షకుల్లో ఉండి గమనించిన భర్త షేక్ బషీర్ ఉక్రోషం ఆపుకోలేకపోయాడు. తన ఆడది తన మాట వినకుండా అవమానించిందని…తన మీద తానే కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. వేదిక మీద భార్య ఖవ్వాలీ పాడుతుండగా వేదిక కింద ఓర్వలేని భర్త ఆ పని చేశాడు. చుట్టూ ఉన్నవారు ఇసుక చల్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే అతని శరీరం 70 శాతం కాలిపోయింది. ఇవి గుత్తి పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ వెల్లడించిన వివరాలు. భార్యల్ని ప్రోత్సహించకపోయినా ఫరవాలేదు. మూర్ఖంగా అడ్డుకోవడం, బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఏం సబబూ? భార్యను ఒక వ్యక్తిగా గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటారూ? ఆమె అభిరుచులను అర్థం చేసుకునే పని లేదా? ఇలాంటి పనులు మతపిచిగాళ్ళే చేస్తారు.

Also read: భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు?

కుక్క మనిషిగా, మనిషి కుక్కగా…

ఇక్కడ ఒక చిన్న సంఘటన గూర్చి చెబుతాను. ఒక రోజు రాత్రి దుకాణదారుడు దుకాణం కట్టేసి వెళ్ళిపోదామనుకునే సమయానికి ఒక కుక్క, ఒక సంచి నోట కరుచుకుని వచ్చి నిలబడింది. సామానుకోసం వచ్చినట్లుంది అనుకొని, దాని నోటి నుండి సంచి తీసి తెరిచి చూశాడు. అందులో పామాను చీటి, డబ్బులు ఉన్నాయి. తనలో తానే నవ్వుకుంటూ దుకాణదారు సామాన్లు సంచీలో వేసి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాల్సిన చిల్లర సంచిలొ వేశాడు. సంచి కుక్క నోటికి అందించాడు. అది వెనుదిరిగింది. షట్టరు మూసి దుకాణదారు కూడా కుక్కను వెంబడించాడు. కుక్క ఎక్కడికి వెళుతుంది? దాని యజమాని ఎవరూ? చూడాలన్న ఉత్సుకత అతనిలో పెరిగింది. కుక్క బస్ స్టాండ్ లో నిలబడి ఎదురు చూసింది. బస్సు రాగానే ఎక్కింది. దుకాణదారుడూ ఎక్కాడు. కుక్క కండక్టర్ దగ్గర నిలబడి మెడ వంచింది. దాని మెడమీద నెక్ బెల్ట్ కింద డబ్బులున్నాయి. దిగాల్సిన స్టేజీ ఏదో చిన్న చీటీమీద రాసి ఉంది. కండక్టర్ డబ్బులు తీసుకొని, టికెట్ చింపి మళ్లీ దాని నెక్ బెల్ట్ కింద పెట్టాడు. స్టేజీ రాగానే కుక్క ముందుకు  వెళ్ళి నిలబడింది. తోకాడించింది. తల ఊపింది. డ్రైవర్ బస్ ఆపాడు. కుక్క సంచిని  జాగ్రత్తగా పట్టుకుని బస్సు దిగింది. దుకాణదారుడు కూడా బస్సు దిగి, దాన్ని అనుసరించాడు. కుక్క ఒక వీధిలో చివరిదాకా వెళ్ళి సంచి అరుగుమీద పెట్టింది. ముందుకాళ్ళతో తులపు తట్టింది. మళ్ళీమళ్ళీ తట్టిన తర్వాత ఒకతను తలుపు తెరిచాడు. కోపంతో కుక్కును విపరీతంగా బాదడం ప్రారంభించాడు. కొద్ది దూరంలో నిలబడి గమనిస్తున్న  దుకాణదారు అది భరించలేకపొయ్యాడు. ‘‘ఆగవయ్యా! ఆగు- ఎందుకు దాన్ని కొడుతున్నావ్,’’ అని అరిచాడు. కుక్క యజమాని విసుగ్గా చూసి ‘‘వెధవ కుక్క. దీనికి బుద్ధిలేదు. తాళం చెవులు తీసుకుపోవచ్చుకదా? అనవసరంగా నా నిద్ర పాడు చేసింది!’’ అని కోపం వెళ్ళగక్కాడు. బుద్ధి ఎవరికి లేదో దుకాణదారుడికి బాగా అర్థమయ్యింది. ఇక్కడ కుక్క మనిషిలా మారుతుంటే, మనిషే కుక్కలా ప్రవర్తించాడు.

Also read: మకరజ్యోతి మనిషి మహత్మ్యం

దేవుడు అన్నీ చేస్తాడన్న విశ్వాసం ఎంత తప్పో…కుక్క కూడా అన్ని పనులు చేయాలనుకోవడం అంతే తప్పు. మనిషికైనా, జంతువుకైనా కొన్ని పరిమితులుంటాయి. లేని దేవుడికే  పరిమితులండవు. భ్రమలో ఏదైనా సాధ్యమే! విశ్వాసాలుడడం అవసరమే. కానీ, అవి విశ్వసించదగ్గవిగా ఉండాలి.

(రచయిత కేంద్ర  సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles