Friday, April 19, 2024

బీజేపీ ప్రజావ్యతిరేక, విచ్ఛిన్నకర విధానాలపట్ల నిరసనగా ఆనందభాస్కర్ రాజీనామా

  • ఆనందభాస్కర్ రాజీనామా, జేపీ నడ్డాకు లేఖ
  • టీఆర్ఎస్ లో ఆనంద్ భాస్కర్

రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ పాత్రికేయుడు రాపోలు ఆనందభాస్కర్ బీజేపీ నుంచి రాజీనామా చేశారు. ఇటీవల రాపోలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ ఆయ్యారు. టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. దరిమిలా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా లేఖ పంపారు. దాన్ని పూర్తి పాఠం దిగువన ఇస్తున్నాం.

రాపోలు ఆనంద భాస్కర్‌

అక్టోబర్‌ 26, 2022

ప్రియమైన శ్రీ జగత్‌ ప్రకాశ్‌ నడ్డా గారికి,

స్వర్గీయులు అరుణ్‌జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్‌ 4న మీ పార్టీలో చేరా. ఇంతకాలం పార్టీలో మీలాంటి మహానుభావులతో కలిసి ఉండే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు. భారతీయ జనతాపార్టీ (బీజేపీ)నుంచి నేను ఈ క్షణం నుంచి దూరమవుతున్నాను.

పార్టీలో చేరే సమయంలో నేను ఒక ప్రకటన చేశాను. వాటిలో కొన్నింటిని కింద పొందుపరుస్తున్నా:

“ఆధునిక యాంత్రిక సమాజం కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్నది. ఇలాంటి సమయంలో భారతీయుల్లో దేశభక్తి, జాతీయవాదం అనేది ఎంతో ముఖ్యం. రాష్ట్రాల్లోని స్థానిక ప్రజల గౌరవాన్ని కాపాడితేనే దేశానికి గుర్తింపు. భారతీయ ఆత్మ, జాతీయత భావన అనేవి ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి. అప్పుడే దేశ సమగ్రత, ప్రాదేశిక భద్రత పరిపుష్టమౌతుంది.”

Ananda Bhaskar Rapolu | Facebook
బీజేపీలో చేరినప్పుడు పార్టీ అధ్యక్షుడు నడ్డాతో ఆనందభాస్కర్

పార్టీ నియమాలను శ్రద్ధగా చదివిన వాడిని.

అందులో బీజేపీ కి “సానుకూల లౌకికవాదం” కచ్చితంగా శిరోధార్యం అని నిర్ధారించారు. అంటే వసుదైవ కుటుంబ భావనకు పార్టీ పెద్దపీట వేస్తుందనుకొన్నా. ఈ సూత్రానికి ఆ పార్టీ నిజంగా కట్టుబడి ఉన్నదా?

గ్రేట్‌ బ్రిటన్‌ జనాభాలో భారత సంతతికి చెందిన వారు 3 శాతమే. అయినప్పటికీ, భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధానిగా నియమితులయ్యారు. మరో అగ్రరాజ్యం అమెరికాకు భారత సంతతికి చెందిన మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఇలా ఉండగా.. మన దేశంలో ఎలాంటి తరహా ఇబ్బందికరమైన విచ్చిన్నకర రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయి?

సమగ్ర మానవతావాదం, అంత్యోదయ భావనలను పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ సూచించారు. ఈ విశిష్ట లక్ష్యాలను చేరడానికి పార్టీలో ఏ కొసైనా నిబద్ధత కనిపిస్తున్నదా? అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల ప్రియతమ నాయకుడు స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయీ రాజధర్మాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. సహకార సమాఖ్యవాదంలో ఆయన పిలుపును ఎప్పుడైనా అనుసరించారా? రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సమాజంలో చీలికలు తీసుకురావడమే పార్టీకి నిత్యకృత్యంగా మారింది.

కరోనా కారణంగా దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అయితే, ఇవేమీ పట్టించుకోని కేంద్రప్రభుత్వం.. ఆక్సిజన్‌ కొరతతో ఎవ్వరూ మరణించలేదని ప్రకటించింది. కరోనా కట్టడిలో విజయం సాధించినట్టు సంబురాలు చేసుకొన్నది. అయితే, ప్రభుత్వ చర్యలను చూసి పెద్దయెత్తున ప్రజలు నవ్వుకుంటున్నారు. పార్టీని వీడే సమయంలో ఇలా తప్పులు ఎత్తిచూపడం నా ఉద్దేశం కాదు. హుందాతనం అనిపించుకోదని తెలుసు. అయితే, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకొంటారనే ఇదంతా చెబుతున్నా.

Rapolu meets KCR, to switch over loyalties
ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆనందభాస్కర్

అందరూ పరిపూర్ణులు కాలేరు. అయితే, పరిపూర్ణత కోసం కష్టపడాలి.

సామాజిక భద్రత, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత అనే వాటిని పార్టీ పట్టించుకోవట్లేదు. జనాభాలో కులగణనకు పార్టీ, కేంద్రప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. అప్పటి నుంచి నాలో భయం మొదలైంది.

ప్రాంతీయత, భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారింది. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహించడం ఎక్కువైంది.

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన అవకాశాలను అందకుండా చేస్తున్నది. మిషన్‌ భగీరథ అనేది పారే నదీజలం తాగునీరుగా అందించే ప్రపంచస్థాయి మిషన్‌. తెలంగాణలో దీన్ని అమలు చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పైకి ఉబికి వచ్చాయి. నదీజలాల నిండు గర్భంగా తెలంగాణ మారింది. దీంతో వాతావరణ పరిరక్షణే కాకుండా నీటి పారుదల వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఇన్ని జరుగుతున్న తెలంగాణను పొగడాలని నేను అడగట్లేదు. అయితే, బీజేపి తెలంగాణ శాఖ అధికారానికి రావాలనే ఆసక్తితో ఉన్న వారిలా బాధ్యతతో వ్యవహరించడం లేదన్నది మీ నాయకత్వం గమనిండం లేదా.

తెలంగాణ ప్రజలు అత్యంత తెలివైనవారు. వారికేమీ గుర్తుండవని అనుకొంటున్నారు. అది మాత్రం నిజంకాదు.

చేనేత సంక్షోభం

ఇప్పుడు నా సామాజిక చేనేత వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తా. కరోనా సంక్షోభంలో చేనేత వృత్తులవారిని అంశాలపైన అప్పటి మంత్రికి 2020 సెప్టెంబర్‌ 20న నేను రాత పూర్వకంగా విన్నవించా. అయితే, దాన్ని పట్టించుకోలేదు.

అందులో ఒక అంశం మచ్చుకు. అంగన్వాడీ వర్కర్లకు ఒక్కొక్కరికి రెండు కాటన్‌ చీరల కోసం రూ. 400 చెల్లిస్తామన్నారు. పత్తి ముడి సరుకు, నేత నేయడానికి ఖర్చు అంతా కలిపి కనీసం రూ. 900 ఖర్చు అవుతుంది. వీటికి అవసరమైన నిధులను విడుదల చేస్తే, చేనేత వర్గం వారు ఎంతో లబ్ధి పొందేవారు. ‘పోషణ్‌ అభియాన్‌’ కింద 53.43 లక్షల యూనిట్ల డ్రెస్ మెటీరియల్‌ సేకరణతో చేనేత వర్గంతో పాటు 13.36 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లకు ప్రయోజనం చేకూరేది.

చేనేత కార్మికుల సమస్యలను నేను ఎప్పుడూ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించా. కొన్నింటిని విన్నారు. మరికొన్నింటిని పట్టించుకోలేదు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపాలన్న నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకొంటూ 2015 నుంచి ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుతున్నారు. దీంతో పార్టీకి ఎంతో గుర్తింపు వచ్చింది. అయినప్పటికీ, దీనికి కారణమైన నేను.. ఎలాంటి గుర్తింపు, గౌరవాన్ని ఆశించలేదు. చేనేత కార్మికులను భూమి లేని కూలీలుగా పరిగణించాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వారికి 100 రోజుల వేతనం ఇవ్వాలని, తద్వారా జీవనాధారం కల్పించాలని అభ్యర్థించా. దీనికి అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అయితే, ఈ పథకాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి.

చేనేత రంగాన్ని రక్షిస్తే దేశ జీవన రేఖను కాపాడినట్టే: 2017లో కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జీఎస్టీని ప్రవేశపెడుతున్నప్పుడు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నేను సత్యాగ్రహ దీక్ష చేపట్టా. చేనేతను నిర్లక్ష్యం చేస్తుండటాన్ని తట్టుకోలేకపోయా.

జీఎస్ టీ దారుణం

పత్తి, పట్టు, ఉన్ని, జనపనార‌ వంటి సహజ దారాలపైన, నూలు పైన సున్నా జీఎస్టీ అనే నా అభ్యర్థనపై  అప్పటి ఆర్థికమంత్రి స్వర్గీయ అరుణ్‌ జైట్లీ సానుకూలంగా స్పందించారు. అయితే, ఇది అమలు కాలేదు. కానీ, బట్టలపైన 18 శాతం విధించాలనుకొన్న జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేశారు. అయితే, మధ్యతరగతి, చిన్న చేనేత కార్మికులకు కాకుండా ‌బహుళజాతి, బడా కార్పొరేట్లకే ఇది లాభదాయకంగా ఉన్నది. బట్టలపై తాజాగా 12 శాతం జీఎస్టీ విధించాలనుకొంటే నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించా. పీఎంవో కూడా జోక్యం చేసుకోవడంతో ఆ నిర్ణయం ఆగిపోయింది. అయితే, చేనేత కార్మికులకు నష్టం కలిగించేలా, నూలు పరిశ్రమ, ఎంఎన్‌సీ, కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకొన్నారు. ‘మినిమమ్‌ గవర్నమెంట్‌ – మ్యాగ్జిమమ్‌ గవర్నెన్స్​‍’ అనేది కేవలం కేంద్రప్రభుత్వ పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే. ఈ సాకుతో కోరలు, వెన్నెముక లేని హ్యాండ్లూమ్‌, హ్యాండిక్రాఫ్ట్‍ బోర్డులను ప్రభుత్వం రద్దు చేసింది. టెక్స్​​‍టైల్స్​‍ మినిస్ట్రీ ఎంతమాత్రం శ్రద్ధచూపలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి.

చివరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ఉచితాల కింద లెక్కగట్టడం నా మనసు లోతులను గాయపర్చింది.

గడిచిన నాలుగేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో నన్ను విస్మరించారు. ఎన్నోసార్లు అవమానించారు. తక్కువ చేసి చూశారు. జాతీయస్థాయిలో ప్రాధాన్యం లేకుండా చేశారు. అయినప్పటికీ, ఆ ఆవేదనను దిగమింగుతూనే వచ్చా. ఇదే నా తలరాతగా భావించా.

ఇప్పుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాథమిక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.

  మీ విశ్వాసపాత్రుడు

ఆనంద భాస్కర్‌ రాపోలు

టూ

శ్రీ జగత్‌ ప్రకాశ్‌ నడ్డా,

గౌరవనీయ జాతీయ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ,

న్యూఢిల్లీ.

(రాపోలు ఆంగ్ల లేఖకు స్వేచ్ఛానువాదం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles