Friday, April 19, 2024

అమృత మహోత్సవాలు… “స్వాతంత్ర్య” సాగరమధనం… విషం మింగినదెందరు…?… అమృతం దక్కినదెందరికి…?

కొన్నిరోజుల క్రితమే గౌరవనీయ ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది “భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవం” భారత భాగ్యవిధాతలు చెప్తున్నట్లు ఇది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడచిన సందర్భంలో జరుపుకొంటున్న ఉత్సవం మహోత్సవం ఏంతో ఆనందకరమైన, సంతోషకర సందర్భం…

కానీ, ఒక్కసారి పునరావలోకనం చేసుకుని, ఆత్మపరిశీలన చేసుకుని చూసుకుంటే భారతప్రజలకు, భారత దేశానికీ ఏమున్నది గర్వకారణం ? కేవలం సంవత్సరాలు గడుపుకుంటూ రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు దాటుకొని వజ్రోత్సవాలు, అమృతోత్సవాలు అనుకుంటూ ఆనందించడం తప్ప!

భారత భాగ్యవిధాతలు చెప్తున్నట్లు ఈ స్వాతంత్ర్య ‘అమృత’ఫలాల్ని అనుభవించడంలో భారతీయప్రజల భావనలను అటుంచి, వారికి దక్కిన నిజమైన భాగస్వామ్యమెంత? ప్రతిఫలమెంత! అమరవీరుల త్యాగాల్ని అడ్డంగా వాడుకుని, అన్నిఅధికారాల్నీ, తద్వారా స్వాతంత్ర్య అమృతఫలాల్నీ సంపూర్ణంగా అనుభవిస్తున్న కొందరు అధికారవర్గాలు తప్ప సామాన్య ప్రజలకు దక్కింది, ఒరిగినదేమున్నదన్నదే ఒక ప్రధాన ప్రశ్న?

కోట్లాది ప్రజలు దశాబ్దాలకాలం తమ జీవితాల్నీ, లక్షలాది ప్రజలు తమ ప్రాణాల్నీ, త్యాగం చేసి మరీ సాగించిన “స్వాతంత్ర్య” సాగరమధనం లో నిజంగా అమృతం దక్కినదెంతమందికి?

ఇక మన భారత “స్వాతంత్ర్య” సాగరమధనంలో విషం మింగినదెందరు? లెక్కలేనంతమంది రాసుకుంటూపోతే పేజీలు కూడా సరిపోవు నిజమైన దేశభక్తులు, స్వాతంత్ర పోరాటయోధులు, సేనానులు, నిజంగా తమ సర్వస్వాన్నీ స్వాతంత్ర్య సమరానికి ధారపోసినవారి వారసులు ఈరోజు చాలామంది కనుమరుగైపోగా, మిగిలినవారు దురదృష్టవశాత్తూ అడుక్కుతింటున్నారు.

కాకాలు పట్టీ, చెంచాగిరీలు చేసీ పైకొచ్చిన పైనపేర్కొన్న భజనపరుల భట్రాజు జాతి, వారి వారసులు, మళ్ళీ వాళ్ళ కాకా, చెంచా, భజన, భట్రాజు వారసులు మాత్రం ఇంకా స్వాతంత్ర అమృతఫలాల్ని అనుభవిస్తూనే ఉన్నారు ఇది భారత స్వాతంత్ర్య పోరాటానికే ఒక తీరని అవమానం.

Also Read: గుజరాత్ లో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను ప్రారంభించిన మోదీ

ఈ లబ్ధిదారుల్లో ప్రముఖులు జవహర్ లాల్ నెహ్రూ గారు, వారి వారసులైన ‘గాంధీ’ పేరును తెచ్చిపెట్టుకుని మరీ సంపూర్తిగా వాడుకుంటున్న నెహ్రూ కుటుంబం వారు.

అసలు జవహర్ లాల్ నెహ్రూ గారు భారత తొలి ప్రధాని కావడమే పూర్తిగా అప్రజాస్వామికం, సంపూర్ణ చెంచా-ఆశ్రిత-భజనస్వామ్యానికి పరాకాష్ట, ఒకపెద్ద వింత! దేశంలోని 15 రాష్ట్ర కాంగ్రేస్ కమిటీలలో 12 కమిటీలు ఏకగ్రీవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ని ఏకపక్షంగా భారత తొలి ప్రధానిగా ప్రతిపాదిస్తే, వాటన్నింటినీ తోసిరాజని మహాత్మా గాంధీజీ జీవితంలో తీసుకున్న అతి పెద్దదైన తప్పుడునిర్ణయం పర్యవసానాలు భారత దేశం, భారత జాతి ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాయి.

చరిత్రలో మనం చదువుకున్నట్టు మోతీలాల్ నెహ్రూ గారు ఉన్నదంతా స్వాతంత్ర్య పోరాటానికి దానం చేసిన దాత వారి పుత్రులు, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా ఉన్నదంతా దేశానికే దోచేసిన మహాదాత.

జవహర్లాల్ గారి ప్రియపుత్రిక, “గాంధీ” పేరుని కూడా వాడుకోవడానికి వీలుగా, తెలివిగా పేరులో తగిలించబడ్డ ఇందిరా”గాంధీ” గారు కూడా దేశానికే సర్వస్వం దోచిపెట్టిన వీరదాత.

ఇక ఇందిరమ్మ ప్రియ జేష్ఠపుత్రుడు ఎమర్జెన్సీకే వన్నెతెచ్చిన మోడరన్ మేడ్-గాంధీ ‘సంజయ్ గాంధీ’ కూడా భారతదేశానికి ఇతోధికంగా ఏదో ఒక రకమైన సేవ చేసి తరించినవాడే.

Also Read: పొద్దెరగని నవతరం కొత్త “బిచ్చగాళ్ళు” ఈ నయా, ఆల్ట్రా-మోడరన్, మహా”ముష్టోళ్ళు”

అటుపిమ్మట ఇందిరమ్మ కనిష్టపుత్రుడు రాజీవ్ గాంధీ కూడా గాంధీలు గా మార్చబడ్డ నెహ్రూ కుటుంబంలో ఆఖరి అధికార వారసుడిగా భారతదేశ సేవలో పునీతుడైనవాడే.

విచిత్రమేమిటంటే ఇందరు దాతలు, మహా దాతలు, వీర దాతలు, త్యాగులు, సేవాతత్పరులు తరతరాలుగా ఆస్థులు మొత్తం దానం చేస్తున్నా, త్యాగాలు చేసేస్తున్నా, ఇప్పటికీ ఆ కుటుంబానికి ఎంతో విలువైన అపరిమిత, కోట్లాది ఆస్థులు ఉండటం!!!

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మూడు యుద్ధాల్లో పాకిస్థాన్ పై ఘనవిజయాలు సాధించామని వీర తాళ్ళు తగిలించుకొని, గొప్పలు చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు భారత దేశానికీ, భారత ప్రజలకూ వాటి వల్ల ఎంత లాభం చేకూరిందో చెప్పగలరా?

జమ్ము-కాశ్మీర్లో, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల లో మనం కోల్పోయిన ఒక్క అంగుళం భూమి అయినా మనకి తిరిగి వచ్చిందా, దేశానికీ, ప్రజలకూ ఏమైనా, ఎంతైనా లాభం చేకూరిందా? భారతదేశం కొన్ని వేల చదరపు కిలోమీటర్లు భూమి ఎన్నో రాష్ట్రాల్లో కోల్పోయింది. ఇది ఒక రకమైన ఓటమి చైనాతో ఒక ఘోర పరాజయం ఏన్నో వంచనలు అత్మ వంచనలు ఆ నిజాల్ని ఒప్పుకునే ధైర్యం ఉందా? భారతదేశ ప్రాదేశికతను, దేశాన్ని, దేశసార్వభౌమత్వాన్ని ఇదేనా పరిరక్షించే పద్ధతి?

చరిత్ర పేరుతో మనకు చెప్పిన, మనం చదువుకున్న, ఎన్నో తరాలుగా ఇంకా చదువుకుంటున్న ఎన్నో విషయాలు, పాఠాలు అధికశాతం నిజానికి మనపై బలవంతంగా రుద్దిన అవాస్తవాలు, అబద్ధాలు, అన్యాయాలు, అతిశయాలు మాత్రమే కేవలం అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా, వార్ని హీరోలుగా చూపిస్తూ వారి భజన కోసం నిజాల్ని వక్రీకరించి అసత్యాలను సత్యాలుగా ఇంతకాలంగా భ్రమింపచేస్తూ వస్తున్నారు ఇది ఇంకెంతకాలం?

Also Read: “అగ్నిశిఖలనెవ్వరూ ఆపలేరు…”

ఎవరికోసం ఈ అమృత మహోత్సవాలు? భారత “స్వాతంత్ర్య” సాగరమధనంలో నిజంగా విషం మింగిన మహనీయులెవ్వరు? కానీ, వాస్తవంగా అమృతం దక్కినదెందరి అవకాశవాదులకి?

ఇకనైనా, చరిత్రను సరిదిద్దండి నిజంగానే మీకు ధైర్యముంటే, ప్రజలకు వాస్తవాలు, నిజమైన మరచిన మన మహనీయుల గురించి సత్యాలు, నిజాలు తెలియచేయండి అదే భారత దేశానికీ, ప్రజలకూ నిజమైన అమృతోత్సవం ఈ హంగూ, ఆర్భాటం, పబ్లిసిటీ, ప్రచార పటాటోపాలు కాదు…!

జై హింద్… భారత మాతకు జై…

Ashoka Varma Penmetsa
Ashoka Varma Penmetsa
Mr. Ashoka Varma Penmetsa is a Senior Consultant of Advertising, Branding, Media& Public Relations. He has been in this field for more than 25 Years. He takes care of Corporate Communications Department at a Leading Healthcare Group as HOD. He is also a good writer.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles