Friday, April 19, 2024

అమూల్య భారత రత్నం అమర్త్య సేన్

భారత దేశం గర్వించదగిన శాస్త్రవేత్తలలో ప్రముఖులు అమర్త్యసేన్. ఆయన భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారత ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణాలు, పొలిటికల్ లిబరలిజంలో చేసిన విశేష కృషికి 1999 లో నోబెల్ బహుమతి లభించింది.

1933 నవంబర్ 3న బెంగాల్‌లోని శాంతినికేతన్ లో జన్మించిన అమర్త్య సేన్ 1941లో ఉన్నత పాఠశాల విద్య ఢాకాలో పూర్తి చేసుకొన్నారు. 1947లో దేశ విభజన తర్వాత భారత దేశానికి తిరిగివచ్చి విశ్వభారతి, ప్రెసిడెన్సీ కళాశాలలలో అభ్యసించారు. కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాలలో 1956 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 1959లో పి.హెచ్.డి పట్టా పుచ్చుకున్నారు.

సేన్ మాతామహుడు క్షితిమోహన్ సేన్ మధ్య యుగ చరిత్రలో పండితుడు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి ఢాకా విశ్వ విద్యాలయంలో రసాయన శాస్త్ర అధ్యాప‌కులు.

1971 లో ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ 1977 వరకు బోధించాడు. 1977 నుండి 1988 వరకూ ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయంలో బోధించారు.  అక్కడ  మొదట ఎకనామిక్స్ ప్రొఫెసర్, నఫిల్డ్ కాలేజీ ఫెలో ,  తరువాత పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్,  ఫెలో ఆల్ సోల్స్ కళాశాల, ఆక్స్ఫర్డ్ 1980 నుండి 1987 లో, సేన్ థామస్ డబ్ల్యూ. లామోంట్ యూనివర్శిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా హార్వర్డ్‌లో చేరారు. 1998 లో కేంబ్రిడ్జ్లోని మాస్టర్ ఆఫ్ ట్రినిటీ కాలేజీగా నియమితుల‌య్యారు. ఆక్స్బ్రిడ్జ్ కళాశాల మొదటి ఆసియా వాసిగా అధిపతి అయ్యారు . జనవరి 2004 లో, సేన్ హార్వర్డ్‌కు తిరిగి వచ్చారు.

అర్థ శాస్త్రానికి కొత్త రూపం

సంక్షేమ ఆర్థిక శాస్త్రం, సామాజిక ఎంపిక సిద్ధాంతం , ఆర్థిక, సామాజిక న్యాయం, కరవుకు సంబంధించిన‌ ఆర్థిక సిద్ధాంతాలు , నిర్ణయ సిద్ధాంతం, అభివృద్ధి ఆర్థిక శాస్త్రం, ప్రజారోగ్యం, దేశాల శ్రేయస్సుకు సేన్ కృషి చేశారు. సంక్షేమం వైపు, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్య సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడా అంతే ముఖ్యమని ఉద్ఘాటించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పలికారు. పేదరిక స్థాయిని నిర్థారించడానికి అమర్త్య సేన్ సోషల్ ఛాయిస్ అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టారు. పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేక పోవడంతో ప్రజలకు కొనుగోలు శక్తి లేక పోవడమే ప్రధాన కారణమని తమ అధ్యయనాల ద్వారా నిరూపించారు. ప్ర్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలో నైనా కీలక పాత్ర వహిస్తాయని ఉద్ఘాటించారు. నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్త రూపం చేర్చారు.1943లో బెంగాల్ లో కరవు సంభవించినప్పుడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిషన్… సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబటి కాకపోవడం వంటి కారణాలను చూపించగా, అమర్త్యసేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను అర్థశాస్త్ర పరంగా విశ్లేషించారు. కరవుకు కార‌ణం ఆహారం లేకపోవడమే కాదు, ఆహారాన్ని పంపిణీ చేసే యంత్రాంగాల్లో నిర్మించిన అసమానతలూ అని వాదించారు. ఆహార ధరలను పెంచిన పట్టణ ఆర్థిక వృద్ధి కారణంగా బెంగాల్ కరవు ఏర్పడిందని, తద్వారా వేతనాలు అందనపుడు లక్షలాది మంది గ్రామీణ కార్మికులు ఆకలితో చనిపోతారని సేన్ వాదించారు.

సంక్షేమ అర్థ శాస్త్రానికి కొత్త రూపు

సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇచ్చారు. కరవు కారణాలపై ఆయన చేసిన ముఖ్యమైన పనితో పాటు, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన ” మానవ అభివృద్ధి నివేదిక ” ను రూపొందించడంలో అభివృద్ధి ఆర్థిక శాస్త్రంలో సేన్ చేసిన కృషి గణనీయమైన ప్రభావాన్ని చూపింది. పౌరులకు ఓటు వేసే సామర్థ్యం క‌ల‌గాలంటే వారికి మొదట “విధులు” కలిగి ఉండాలని, ఈ “విధులు” విద్య లభ్యత వంటి చాలా విస్తృతమైనవని, ఎన్నికలకు రవాణా వంటి ప్రత్యేకమైనవి ఉండాలని, అలాంటి అడ్డంకులు తొలగినప్పుడు మాత్రమే పౌరుడు స్వేచ్చా వాతావరణంలో మనగలరని వివరించారు. జిడిపి లేదా తలసరి ఆదాయం వంటి కొలమానాలపై దృష్టి పెట్టడం కంటే, వ్యక్తులు అనుభవించే నిజమైన స్వేచ్ఛను అభివృద్ధి చేసే ప్రయత్నంగా అభివృద్ధిని చూడాలని సేన్ వాదించారు. రాజకీయ స్వేచ్ఛలు, ఆర్థిక సౌకర్యాలు, సామాజిక అవకాశాలు, పారదర్శకత హామీలు,  రక్షణ భద్రత అనే ఐదు నిర్దిష్ట రకాల స్వేచ్ఛలను సేన్ వివరించారు. అశోకుడు బుద్ధిస్టు సూత్రాలపై ఏర్పరచిన రాజ్యంలో ‘ప్రజాసంక్షేమం బలంగా అంతర్లీనమై ఉంటుందని, అక్బర్‌ సెక్యులర్‌ న్యాయ పునాదులు వేసిన చక్రవర్తి అని,  సర్వమత సమానత్వ సూత్రీకరణను రూపొందించిన తాత్వికుడని, ఇటలీలో 1600 సంవత్సరంలో  బ్రూనోను మత విశ్వాసాలను ధిక్కరిస్తూ హేతుబద్ద ఆలోచనలను ప్రకటించినందుకు సజీవంగా కాల్చి చంపుతున్న కాలంలోనే… అక్బరు అద్భుత లౌకిక జాతీయ వాదానికి పునాదులు వేసాడని, భగవద్గీత లోని కృష్ణుని యుద్ధ నీతి పాజిటివ్‌ న్యాయ సిద్ధాంతం కాగా. గాంధీ అహింసలోనే హింసావాదం దాగి ఉందని అమర్త్య సేన్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

నోబ్‌ల్ నుంచి భార‌త రత్న వ‌ర‌కూ…

1998లో అత్యున్నతమైన నోబెల్ బహుమతి స్వీకరించారు. 1999లో భారత ప్రభుత్వపు భారత రత్న అవార్డుకు ఎంపికైనారు. 2000లో లియోంటీప్ ప్రైజ్, 2000లో అమెరికా దేశపు ఐసెన్ హోవర్ మెడల్ పొందారు.

(నవంబర్ 3న అమర్త్య సేన్ జన్మదినం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles